..లు గారు తన మేలుజాతి శునకము ‘ప్రిన్స్’ తో తన భవనం ముందు…
ఈ కథని దాదాపు పదేళ్ల క్రితం రాసాను. ఇటీవలి కాలంలో ఒకానొక పత్రికా సంపాదకులు, మిత్రులు కథలుంటే ఒకటి పంపండి మా పత్రికలో ప్రచురిస్తాం అని అడిగితే. ఈ కథని పంపాను. ఇదిగో అదిగో అంటూ కొన్ని నెలలు జరిగిన తరువాత తన మిత్రులెవరో నచ్చలేదన్నారని తెలియజేసాడాయన.
అది ఇలా ఈ డిసెంబరు 17, 2023 ఆదివారం నాడు సంచిక లో ప్రచురణకి నోచుకుంది. కథని ఈ లంకె ని క్లిక్ చేసి చదువుకోవచ్చు.
వినూత్న తెలుగు సాహిత్య వాతావరణంలో ఒక కొత్త సంస్కృతి వచ్చి చేరింది. అది మంచిదిలాగే కనపడ్తుంది గానీ దాని వల్ల కల్గే హాని చాప కింద నీరులా విస్తరిస్తూ పోతుంది.
కొత్తగా రాస్తున్న వాళ్ళలో చాలా మంది “కాఫ్కాని చదువు, మాయా ఫలానా రచన చదివావా? మంటో శైలి ఎంత గొప్పదంటే, ఫలానా ఫ్రెంచ్ రచయిత ఏమన్నాడంటే, ఫలానా ఇంగ్లీష్ నవల్లో ఒక చోట రచయిత ఇలా అంటాడు” అని ఉటంకిస్తుంటారు. ఇందులో తప్పేమీ లేదు. అయితే వీళ్ళలో తొంబైశాతం మందికి మన సొంతింటి సుగంధాలు బహుదూరం. వాళ్ళేమన్నారో, రాశారో తెలీదు. పక్కా లోకల్ చాసోనో, కుటుంబరావో, రావిశాస్త్రో తెలుస్తారని, వాళ్ళ పుస్తకాలు వీళ్ళు చదివారని మనం అనుకోకూడదు. చాలామంది కొత్త రచయితలకి వీళ్ల పుస్తకాలు గ్రీకూ లాటినూ.
ఆనాటి పాత సాహిత్యాన్ని ఇష్టపడి చదివే పాఠకులకు అపురూపంగా దొరికిన కొత్త పుస్తకం అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు (కొత్త ముద్రణ).
అనేక సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టబడిన ఈ పుస్తకాన్ని పిచ్చేశ్వరరావుగారి కుమారుడు, రచయిత అనిల్ అట్లూరి ఎట్టకేలకు ఇటీవల తీసుకు వచ్చారు. ఈ పుస్తకంలో పిచ్చేశ్వరరావుగారివి 26 కథలు, నాలుగు పుస్తక సమీక్షలు, అనిల్ రాసుకున్న కొన్ని మాటలూ, జ్ఞాపకాలూ ఉన్నాయి. పుస్తకం పేపర్ క్వాలిటీ అంత గొప్పగా లేకపోవడం కొంత నిరాశపరిచే విషయం. తర్వాతి ముద్రణలో ఈ విషయమై ప్రకాశకులు జాగ్రత్త పడాల్సి ఉంది. అలానే పిచ్చేశ్వరరావు కథలకే ఈ పుస్తకాన్ని పరిమితం చేసుంటే బాగుండేదేమో. కాని ఇవి పట్టించుకోవలసిన అభ్యంతరాలు కావు. ఈ పుస్తకంలో కథలు అలాంటివి.అట్లూరి పిచ్చేశ్వరరావుగారి పేరు తెలిసినవారికి ఆయన కథకుడిగా కంటే అనువాదకుడిగా ఎక్కువగా తెలుసు. ముఖ్యంగా కిషన్ చందర్ అనువాదకుడిగా. ఆయన సినిమా రచయితగా కూడా పని చేశారు. ముఖ్యంగా ‘వెండితెర నవల’ కాన్సెప్ట్ పిచ్చేశ్వరరావుగారితోనే మొదలైందని కోతి కొమ్మచ్చిలో ముళ్ళపూడి కూడా రాస్తారు. తొలి వెండితెర నవల గౌతమ బుద్ధ. అది రాసింది పిచ్చేశ్వరరావుగారు.
పూర్తి సమీక్ష చదవడానికి ఈ లంకె మీద క్లిక్ చెయ్యండి.
ఆయన యుద్ధకాలాన్ని చూశారు. స్వయంగా నేవీలో పనిచేశారు.
ఈ పుస్తకం చదివాక, రచయితగా ఆయనేమిటో తెలిశాక, ఆయన ఇంకా ఏమి రాశారనే ఆలోచన పాఠకుడి మెదడులో తప్పక మొలకెత్తుతుంది. అటువంటి ప్రభావశీలమైన కథలు ఇందులో ఉన్నాయి.
రచయిత విప్లవ వాది కావడంతో దాదాపు అన్ని కథల్లోనూ ఈ ధోరణి కనిపిస్తుంది. దాదాపు ప్రతి కథా ఒక విముక్తిని సూచిస్తూ ముగుస్తుంది. సుబ్బమ్మ కథ ‘సంఘానికీ జై’ అని ముగిస్తే, నెత్తురు కథ ఆసాంతం ఎర్రెర్రగా సెగలు కక్కుతుంది.
చిరంజీవి కథ ఒక విప్లవ తరంగమే. ఆయన కథలన్నిటిలోకీ ది బెస్ట్గా ఈ కథను విమర్శకులు ఎన్నిక చేస్తారు.
‘ఇదిప్పుడు మన దేశమే’, ‘బ్రతకటం తెలియని మనిషి’, ‘జీవచ్ఛవాలు’ ఇత్యాది కథలన్నీ సామాజిక అంశాలు, నిరసన, తిరుగుబాటు తత్వాలతోనే నిండి ఉంటాయి. అమెరికా నుంచి వచ్చిన నావికుడి కథ జీవచ్చవాలు. యుద్ధం ప్రజల జీవితంలోనే కాదు, యుద్ధంలో పనిచేయాల్సి వచ్చినవారి జీవితంలోనూ ఎంతటి అశాంతిని మనిషి జీవితంలో నింపుతుందో. అందుకే ఆ కథలో చివర్లో “మళ్ళీ టోవెడో (నౌక)ఎప్పుడొస్తుందిరా?” అని రచయిత స్నేహితుడు అడుగుతాడు. “ఎందుకురా?” అని కథకుడు అడిగితే అతడంటాడు. “ఆ మృతజీవిని చూడాలిరా.”
ప్రతి కథలోనూ మానవతాకోణం అంతర్భాగమై అల్లుకుపోయి ఉంటుంది. మనుషులన్నా, స్వేచ్చ అన్నా, స్వాభిమానమన్నా, పోరాటమన్నా, ముఖ్యంగా చిక్కని ఎరుపన్నా రచయితకు మహా ప్రేమ. మనుషుల కోసం, మానవకల్యాణం కోసం ప్రతి కథలో రచయిత తపిస్తాడు. జీవితంలో దుఃఖానికి కారణాలు అన్వేషిస్తాడు.
కథాకాలాన్ని అనుసరించి ఈ కథల్లో యుద్ధ వాతావరణమూ, యుద్ధం మీద చర్చా ఉన్నాయి. రచయితకు ఉన్న అపార విజ్ఞానం ఈ కథల్లో చోటు చేసుకున్న సంఘటనల మీద, అంతర్జాతీయ పరిణామాల మీద ఆయన వ్యాఖ్యానం తేటతెల్లం చేస్తుంది. స్వయంగా నేవీలో కొంతకాలం పనిచేసిన రచయిత రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటులో పాల్గొని ఉండటం ఆయన నేవీ కథలకు నేపథ్యం అని స్పష్టమవుతుంది.
చిరంజీవి కథ ఈ నేపథ్యంలోంచి పుట్టిందే. ప్రతి పాఠకుడినీ కదిలించే ఈ కథ తెలుగు కథాసాహిత్యంలో నిజంగా ఎప్పటికీ నిల్చిపోయేదే.
చిరంజీవి ఒక ప్రత్యేక వ్యక్తి ప్రత్యేక వ్యక్తిత్వపు కథ. ఎవరికీ లొంగని, ఎన్నడూ జంకని చిరంజీవి మిలటరీ హాస్పటల్లో పడి చివరి క్షణాల్లో మూలుగుతున్నపుడు కథకుడు అతని కథ మనకి చెపుతూ పోతాడు. అధికారులను ఎక్కడికక్కడ ఎదిరిస్తూ, ప్రశ్నిస్తూ, తిరగబడుతూ, తోటి సైనికుల్ని తన మాటలతో, ఉపన్యాసాలతో ఉర్రూతలూగించి, రక్తాన్ని పరుగులు పెట్టించి విప్లవ జ్వాలలు రేపిన చిరంజీవి చచ్చిపోతాడేమో అని గుండె దడ పుట్టిస్తాడు రచయిత. చివరికి డాక్టరు లోపల నుంచి వచ్చి కళ్ళు తుడుచుకుని “చిరంజీవి చనిపోలేదు, అట్లా చూస్తావేం? వీళ్ళంతా చిరంజీవులే, ఈ జనం చిరంజీవులే” అని పాఠకులకు చిరంజీవితో ఎనలేని బంధాన్ని క్షణంలో కట్టేస్తాడు.
మసకబారిన చూపు మధ్య నుంచి ఆ తర్వాతి వాక్యం “ఎస్. బీ. ఏ. చేతుల్లోంచి తుపాకీ లాక్కున్నా నేను” అని కనపడి అని చిరంజీవిని నిజంగా చిరంజీవిని చేస్తుంది.
‘కథకుడికిగా పిచ్చేశ్వరరావు’ అని కొడవటిగంటి కుటుంబరావు 1967లో రాసిన వ్యాసంలో “ఒక మనిషి చావు అవాస్తవం అనిపించడానికి కారణం ఏమిటని నేను ఆలోచించాను. ఆ మనిషి మీది ప్రేమాభిమానాలు మాత్రమే అందుకు కారణం కావు. మనిషితో పాటు పోకుండా సజీవంగా మిగిలిపోయేదేదో ఉంటుంది. అదే మనిషి చావుని నమ్మశక్యం కాకుండా చేస్తుంది” అంటారు. డాక్టరు వచ్చి “చిరంజీవి చనిపోలేదు, ఈ జనమంతా చిరంజీవులే” అన్నపుడు, చప్పున ఈ వాక్యం గుర్తొస్తుంది.
ఈ కథలు చదివి, పుస్తకం అలా గూట్లో పడేసి పక్కకి పోలేం. అలా అని పుస్తకం ఎదురుగా ఉంటే అది వేసే ప్రశ్నల్ని మనం తట్టుకోలేం. వెంటాడి ప్రశ్నించి వేధించే పుస్తకం ఇది.
మనం బజారుకి పోతే, ఏ ఆస్పత్రి సందు చివరో చిరంజీవి కనపడి పలకరిస్తాడేమో, ఏ సుబ్బమ్మో కనపడి నినదిస్తుందో, వసుంధర గురించి తనకేం తెలుసో ఆ రోడ్డు చెప్తుందేమో, శాస్త్రి పలకరిస్తాడా, విమలాదేవి ఎదురై విషాదంగా నవ్వుతుందా అన్నంతగా జీవం నింపుకున్న ఆ పాత్రలన్నీ మన వెంట పడతాయి.
పుస్తకం మొదలు కావడమే నెత్తురు కథతో మొదలవుతుంది. అది నెత్తురా, మనిషా, ఆత్మా, రక్తమాంసాలు నిండినా మనిషా?
‘రంగేసిన గుడ్డ కాదది, నెత్తురు పులుముకున్న గుడ్డ, నీలా నాలా బతికిన మనిషి నెత్తురు’ అని స్పష్టత ఇస్తాడు రచయిత. ఆ నెత్తురులో తెల్ల రక్తకణాలూ ఈదినై, ఎర్ర రక్తకణాలూ ఈదినై అంటాడు.
ఈ కథల నిండా గట్టి గుండె, స్థిరమైన ఆలోచనలు, మొండి తిరుగుబాటు స్వభావమూ ఉన్న మనుషులు పలకరిస్తుంటారు. నేవీలో ఆవిరి మెషిన్ లీకేజ్ నుంచి అందరినీ కాపాడిన చిరుద్యోగికి పెన్షన్ ఇవ్వ నిరాకరించి “గేటు దగ్గర కూచునే ఉజ్జోగం చేస్తావా పోనీ” అన్న ఆఫీసరు మొహాన్న పేణ్ణీళ్ళు కొడతాడతను.
తన పెన్షన్ గవర్నమెంట్కి వృథా ఖర్చు అన్న ఆ అధికారికి, ఆనాడు జరిగిన సంఘటన మొత్తం చెప్పి నేవీ ఆఫీసర్ల జీతాలెంత వృథానో వివరించి, “గేటు కీపర్ ఉజ్జోగం చెయ్యను” అంటాడు. ఇలాంటి వ్యక్తులే కాదు, జీవం నిండిన వాక్యాలు, చదవగానే ఎప్పటికీ గుర్తుండిపోతాయేమో అన్నట్టుండే మెరుపు వాక్యాలు, కథకు నిండుతనాన్ని తెచ్చిపెట్టే వాక్యాలు ఈ కథల నిండా పరుచుకుని ఉంటాయి.
– నేటి నుంచీ నేను స్వతంత్రుణ్ణట. ఔను, కాదనేందుకు నాకు స్వాతంత్ర్యం లేదు (ఆగస్టు 15 న).
– మారే పరిస్థితుల్లో చావు బతుకులు చోట్లు మార్చుకుంటాయి. వీళ్ళందరూ చావంటే ఉన్న భయంతో బతుకుతున్నారు గానీ, బతుకంటే ఉన్న మమతతో కాదు ( బ్రతకటం తెలియని వాడు).
– చేతిలో ఉన్న చావుని చూసి భయపడటానికి ఒప్పుకోక పోతే గతంలో బతకండి (వెర్రి కాదు వేదాంతం).
అభ్యుదయపు మేలిముసుగుల మీద ఛెళ్ళున తగిలే సన్నని చర్నాకోల దెబ్బలున్నాయి ఈ కథల్లో.
‘మనవాళ్ళమ్మాయే’ కదాని పనిలో పెట్టుకున్న సుబ్బమ్మని ‘సుబ్బి’ అని పిలిచే రమణయ్య లాటి మనుషుల మీద చెణుకు: “మనవాళ్ళ పిల్లే కదా, మరి సుబ్బీ అని పిలుస్తావేమిరా?” అని అడగబోయిన కథకుడు “ఒకవేళ మన వాళ్ల పిల్ల కాకపోతే వాడు సుబ్బీ అని పిలిస్తే నేనేమి అభ్యంతరం చెప్పే వాడినో” అంటాడు.
పాపారావు తండ్రి, మాల వాళ్ల సరసన కూచుని భోజనాలు చేసిన మనిషి. కొడుకు మాత్రం వెట్టి వెంకడి కొడుకుతో గోళీలాడ్డం అతనికి సుతరామూ నచ్చదు. వెంకడొచ్చి వీడిని “చిన్న దొరగారూ” అంటుంటే, వెంకడి కొడుకొచ్చి “పాపారావూ, రావోయ్ గోళీలాడుకుందాం” అని పిలుస్తుంటే ఆయనకు మండుతుంది. “మాలవాళ్ల చేత నీళ్ళెందుకు పోయించుకుంటున్నావంటే, వాళ్లంటే ప్రేమ ఉండీ కాదు,అంటంటే పెడమొగం ఉండీ కాదు, పడమర చెరువు మీ ఇంటికి అరమైలు దూరంలో ఉంది. ఇంట్లోకి కావల్సిన పది కావిళ్ళూ మోస్తే పెద్దలు గుర్తొస్తారని చేస్తున్నావు ఈ సంస్కరణంతా. మీ పాలేరుకు పది సోలలు వడ్లెక్కువ కొల్చావా? పది రోజులు సెలవులిచ్చావా?” అని పక్కింటి వాడు అడుగుతాడేమో అని పాపారావు భయపడుతున్న మాటలు తాను అనేస్తాడు రచయిత.
కొన్ని కథలు ఆలోచనల ప్రవాహంతో చైతన్యస్రవంతి శైలిలో సాగుతాయి. వెర్రి కాదు వేదాంతం, ఒక అనుభవం, కోరిన వరం ఈ కోవలోవే. అబ్స్ట్రాక్ట్ చిత్రణ పిచ్చేశ్వరరావుగారికి అతి సులభమైన ప్రక్రియగా తోస్తుంది కొన్ని కథలు చదువుతుంటే. ఓల్గా అన్నట్టు ఆయన చిన్న వయసులోనే కాలం చేయకుండా ఉండి ఉంటే, తన మార్మికతతో తెలుగు సాహిత్యపు మార్కెజ్గా మిగిలేవారే.
వసుంధర కథ తెలుగు కథా సాహిత్యంలో ఎన్నడూ చూడని, ఎవరూ చేయని ఒక వినూత్న ప్రయోగం. వసుంధర గురించి ఆమె చదువుకున్న కాలేజీ, ఆమె నడిచిన రోడ్డూ, గడ్డీ అన్నీ వివరంగా చెపుతుంటాయి. మధ్యలో కాలం, వ్యక్తులు వచ్చి మార్పులు అనివార్యమంటుంటాయి. కథ వసుంధర చుట్టూనే తిరిగినా, ఆమె ఎక్కడా మాట్లాడదు. ప్రజాకంటకుడైన భర్త నుంచి సమాజాన్ని కాపాడటానికి వసుంధర చేసిన పనిని కూడా వసుంధర చెప్పదు. ఇటువంటి కథ బహుశా ఇంతకు ముందెన్నడూ చదివి ఉండం. ఈ సంకలనంలో ఇదొక ఆణిముత్యం లాంటి కథ. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర ఈ వసుంధర. ఒక బలమైన వ్యక్తి ఆమె, రాజీ పడిని నిక్కచ్చి మనిషి.
వేదన, హింస అనుభవిస్తూ కూడా, రేపటిలో వెలుగు చూసి సర్దుకుపోయే ఇద్దరు స్త్రీల కథలు ఇందులో ఉన్నాయి. గడిచిన దినాలు కథని ఉత్తమ పురుషలో నడుపుతూ రచయిత, తల్లి పాత్రని వర్ణించిన విధానం చదువుతుంటే గుండె చెమరుస్తుంది.
పని మనిషి మరో కథ. ఇందులో కథ మొత్తం కథలోని భార్యా భర్తల మధ్య నడుస్తుంది గానీ రచయిత వారింట్లో పని చేసే పని మనిషిని శీర్షికగా ఎంచారు. తన వెగటు అలవాట్లు మార్చుకోలేక, భార్య అందాన్ని, పరిశుభ్రతను సహించలేక, తాను స్వయంగా ఆత్మన్యూనత పాలవుతూ, ఆమెపై గెలవటానికి ఆమె పుట్టింటిని ఎద్దేవా చేసే విమలా దేవి భర్త, చివరికి ఆత్మన్యూనత ఉక్రోషంగా మారి భార్యను ఇనపచువ్వతో చితకబాదుతాడు. పర్యవసానం పైడితల్లి నెత్తిన పడుతుంది. ఇటువంటి భర్తలు కూడా చిరంజీవులే, కాలాతీత వ్యక్తులే ఒక విధంగా. ప్రతి సమాజంలోనూ, ప్రతి వీధిలోనూ ఉంటారు.
తీరని కోరిక కథలో ‘కోరికలలో తెగలూ తరగతులూ తప్పించుకోలేని వాళ్లం, తరగతులూ తెగలూ లేని సమాజాన్ని సృష్టించుకోగలమా?’ అనే వాక్యం రేకెత్తించే ఆలోచనలు అసంఖ్యాకం. శాస్త్రి, కథకుడు, వింత మరణం, గడవని నిన్న – దేనికదే సరి కొత్త ఇతివృత్తం, అబ్బురపరిచే శైలి, దొరికినట్టే దొరికి జారిపోయే వాక్యం.
గొప్ప రచయితలు నిశ్శబ్దంగా రచనలు చేస్తారు. తమంతట తాము మన దగ్గరికి రారు. మనమే వెదికి పట్టుకోవాలి. తెలుగు రాయడం తెలియడమే అర్హతగా కథారచన సాగుతున్న ఈ రోజుల్లో, అట్లూరి పిచ్చేశ్వరరావుగారి రచనలు చదవడం ఒక అవసరం. ఒక పాఠం.
ఇన్ని రోజుల తర్వాత ఈ పుస్తకం తెలుగు పాఠకుడి చేతిలోకి రావడం తెలుగు సాహిత్య వాతావరణంలో ఒక మేలి మలుపు. కొత్తగా రాస్తున్న వాళ్ళూ, ఎప్పటి నుంచో రాస్తున్న వాళ్ళే కాక, పాత కొత్త పాఠకులు, సాహితీ ప్రేమికులూ తప్పక చదవవలసినవి అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు.
ఇవి పాఠకులని నిరాశ పరచవు సరికదా, పాత సాహిత్యం ఎంత గొప్పదో తెలిసి మరి కొన్ని పాత పుస్తకాలూ తిరగేసేలా చేస్తుంది.
అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు పుటలు: 280 ప్రచురణ: CLS Publishers, Hyderabad. పుస్తకం ధర: 250రూ.
ప్రతుల కోసం ఈ లంకెని క్లిక్ చెయ్యండి: లభ్యం: నవోదయా బుక్హౌస్ (హైదరాబాద్), పల్లవి పబ్లికేషన్స్ (విజయవాడ), అనల్ప ప్రచురణలు, అమెజాన్, లోగిలి (గుంటూరు), బుక్ సెంటర్, వాగ్దేవి (విశాఖపట్నం).
అట్లూరి పిచ్చేశ్వరరావు కథల పుస్తకం ఈ క్రింది విక్రేతల దగ్గిర లభిస్తుంది. అమెరికాలో పాఠకులకి కూడా ఆ దేశంలో అందుబాటులో వుంది. ఇంకేమన్నా వివరాలు కావాలంటే కింద కామెంట్ లో తెలియజేయండి. జవాబిస్తాను. పుస్తకం వివరాలు కింద ఇచ్చాను చూడండి.
Sole Distributors: Navodaya Book House, Opp: Metro Pillar 14, Kachiguda Cross Roads, Hyderabad 500 027, Telangana, India Mobile: +91 – 90004 13413 వీరిదే ఆన్లైన్ బుక్స్టోర్లో ఇక్కడ కూడా తీసుకోవచ్చు. https://bit.ly/APRinNavodayaOnLine
విజయవాడలో Pallavi Publications, 29-28-27, Dasari Vari St, Moghalrajpuram, Suryaraopeta, Vijayawada – 520 010, Andhra Pradesh, India Mob: 98661 15655
మీకు అమెజాన్లో కావాలనుకుంటే Analpa Booksద్వారా ఇక్కడ తీసుకోవచ్చు: 35-69/1 2nd Floor GK COLONY (bus stop) near Neredmet Cross Road, Saptagiri Colony, Sainikpuri, Secunderabad – 500 094 Telangana, India Mob: +91 70938 00678 https://amzn.to/3mnKBKN https://bit.ly/APRonAnalpa
అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు ప్రచురణకర్తలు: CLS Publishers Hyderabad పుస్తకం ధర: 250.00 రూపాయలు పుటలు : 280 బరువు : 220 గ్రాములు
Logili Book House, Guntur – 522 007 Andhra Pradesh, India Mobile: +91 95501 46514 వారి ఆన్లైన్ బుక్స్టోర్లో ఇక్కడ తీసుకోవచ్చు: https://bit.ly/APRonLogili
విశాఖలో Book Center Gur Banga Complex, Shop No.47-15-4, Diamond Park Rd, Dwaraka Nagar, Visakhapatnam, 530 016 Andhra Pradesh, India Landline: 0891 2562684 Mob: 98851 42894
విశాఖలో Vagdevi Gur Banga Complex, Door No.47-15-4, Diamond Park Rd, Dondaparthy, Dwaraka Nagar, Visakhapatnam, 530 016 Mob : 93473 20588 Ph: +91 0891 2505785
అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు నాలుగవ ముద్రణ వెలువడక ముందే విశాలాంధ్ర దినపత్రిక లో వెలువడిన వ్యాసం.
సాధారణ రచయితల రచనలు గాలివాటంగా బతికి, మరుపున పడిపోతుంటాయి. బాతాఖానీరాయుళ్ళ రచనలు వేడివేడి పల్లీ బఠానీల్లా కాలక్షేపానికి బాగానే పనికి రావచ్చుకానీ, ముందుపేజీలో ఏం చదివామో వక్కపేజీకి వచ్చేసరికే మర్చిపోతుంటాం మనం! కానీ గొప్ప రచయితల రచనలు అలాకాదు; అవి నిద్రలోనూ మెలకువలోనూ కూడా మనల్ని వెంటాడతాయి! అలాంటి రచనలు మాత్రమే నాలుగు కాలాల పాటు నిలుస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే కనక, విస్తృతంగా వివరించుకోనవసరం లేదుగానీ రెండు ముక్కల్లో ప్రస్తావించుకుని పక్కనపెడదాం! మామూలు రచయితల రచనల్లో ప్రాణంలేని పాత్రలుంటాయి; మంచి రచయితల రచనలలో మాత్రమే రక్తమాంసాలున్న మనుషులుంటారు! సాదాసీదా రచయితల రచనల్లో నాటునాటకీయత వుంటుంది – మంచి రచయితల రచనల్లో మాత్రమే జీవితవాస్తవం వుంటుంది! సాహిత్య విద్యార్థులందరికీ తెలిసిన సామాన్యమైన విషయాలే ఇవి!! నాలుగు కాలలపాటు నిలబడివుండి, చదువరులకు దారిదీపాలుగా వుపయోగవడిన ఏ రచనని చూసినా ఈ విషయం బోధపడుతుంది. మీకు ఇంకా సులువయిన మార్గమొకటి చెప్తాను- అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు ఒక్క సారి చదివిచూడండి! కనీసం, చిరంజీవి అనే ఉదాత్తమయిన వ్యక్తిత్వం కలిగిన నావికుడి గురించి రాసిన “బ్రతకడం తెలియనివాడు” అనే ఒక్క కథానిక చదవండిచాలు! ఇది, ఒకరకం, అత్మకథాత్మక కథనం! ఈమాట నేనన్నది కాదు- పిచ్చేశ్వరరావును క్షుణ్ణంగా తెలిసిన కొడవటిగంటి కుటుంబరావు చెప్పినమాట! “మనిషి తోపాటు పోకుండా సజీవంగా మిగిలిపోయేదేదో వుంటుంది. అదే, ఆ మనిషి చావును నమ్మశక్యం కాకుండా చేస్తుం” దన్నారు. కుటుంబరావు. పిచ్చేశ్వరావు కన్ను మూసిన తర్వాత సంవత్సరానికి, “పిచ్చేశ్వరావు కథలు” పుస్తకానికి రాసిన ముందుమాటలో అన్న మాటలివి! ఇన్నేళ్ళ తర్వాత ఇప్పటికీ, పిచ్చేశ్వరరావులో “అదేదో” మిగిలేవుందింకా – ఆయన రచనల్లో దాన్ని మనం చూడొచ్చు!!
పందొమ్మిదివందల ఇరవై దశకంలో పుట్టిన రచయితల తరంలో కనిపించే విశిష్టతలన్నీ అట్లూరి పిచ్చేశ్వరరావులోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నిజానికి అవే పిచ్చేశ్వరరావుకు అమృతత్వం ఆపాదించాయనిపిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంలో ఈతరం విశిష్టమైన స్వరాన్ని సమకూర్చుకుంది. ఎక్కడో, అమెరికాలో వయె జనులందరికీ సార్వజనీనమైన వోటుహక్కు కల్పించడాన్ని- మొదటి ప్రపంచయుద్ధంలో చావుతప్పి, కన్నులొట్టబోయిన బ్రిటిష్ వలసవాదం ఒక్కొక్కటి గా ఆఫ్రో- అసియా దేశాలకు స్వాతంత్ర్యం ప్రకటిస్తూ రావడాన్ని- జపాన్ భూకంపాన్ని- డార్విన్ చెప్పిన పరిణామ సిద్ధాంతాన్ని పాఠశాల విద్యార్థులకు బోధించిన ‘నేరానికి’ జాన్ స్కోప్స్ అనే బ్రిటిష్ టీచర్ కి శిక్షపడడాన్ని- చాలా దేశాల్లో స్టాలిన్, ముసోలినీ, హిట్లర్, చర్చిల్ తదితర కండబలం కలిగిన నేతలు రంగం మీదికి రావడాన్ని- ఆర్థిక మాంద్యాన్ని- చర్చిల్ తెచ్చి పెట్టిన బెంగాల్ కరువునూ – పర్ల్ హార్బర్పై జపాన్ దాడిని- రెండో ప్రపంచయుద్ధం ముగిసిపోతున్న దశలో అమెరికా హిరోషిమాపై చేసిన పరమాణుబాంబు దాడిని – భారతదేశంతో పాటుగా అనేక మూడో ప్రపంచ దేశాలు వరసగా స్వతంత్రం కావడాన్ని- ఈతరానికి చెందిన రచయితలు తమ పెరుగుదలలో భాగంగా గమనిస్తూ, అనుభవిస్తూ వచ్చారు. అవి వాళ్ళకు రక్తగతమైపోయాయి! తెలుగు విషయానికి వస్తే కందుకూరి – గురజాడ- గిడుగు అందించిన అధునిక స్ఫూర్తి అభ్యుదయ దృక్పథానికి మూడో కన్నులా ఉపయోగపడింది!!
ముఖ్యంగా – బ్రిటిష్ వలస పాలకులకు తమ మాన సంరక్షణార్థం – భారతదేశ స్వాతంత్ర్య ప్రకటనను తక్షణ అవసరంగా మార్చిన రాయల్ ఇండియన్ నేవీ (ఆర్ ఐ ఆన్) పితూరీ అనే చరిత్రాత్మక తిరుగుబాటు అభ్యుదయ రచయితల, ప్రగతిశీల కళాకారుల నెత్తురును వేడెక్కించింది. 1945-53 మధ్యకాలంలో నేవీలో పనిచేసిన పిచ్చేశ్వరరావు అయిదు రోజులు సాగిన ఆ తిరుగుబాటులో స్వయంగా పాల్గొన్నవారు! అంచేత, పిచ్చేశ్వరరావుపై దాని ప్రభావం మరింతగా వుండడం సహజమే! కుటుంబరావు ముందుమాటలో ప్రస్తావించిన కథానిక ఈ తిరుగుబాటు గురించినదే. ఈ సంఘటనను చిత్రిస్తూ చిత్తప్రసాద్ వేసిన చిత్రం సుప్రసిద్ధం – అలాగే, ఇదే సందర్భంగా సలిల్ చౌదరీ రాసి, స్వరబద్ధంచేసిన గీతం కూడా ప్రసిద్ధమే! చిత్రమేమిటంటే కరాచీ నుంచి కోల్కతా వరకూ జరిగిన ఈ తిరుగుబాటు- ఒక్క కమ్యూనిస్టు పార్టీ తప్ప- దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఖండించాయి; తిరగబడ్డ నావికులు మాత్రం తమ అధీనంలోకి వచ్చిన 78 నౌకలపై కాంగ్రెస్, ముస్లింలీగ్, కమ్యూనిస్ట్ పార్టీల జెండాలు ఎగరేశారు!! అంతేకాదు, తిరుగుబాటుదార్ల తొలి డిమాండే, దేశంలోని రాజకీయ ఖైదీలనందరినీ తక్షణమే విడుదల చెయ్యాలని! రెండో డిమాండ్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులందరినీ వెంటనే విడుదల చెయ్యాలని! సంకుచిత, తక్షణ రాజకీయ ప్రయోజనాలకు అతీతమయిన చైతన్యం ప్రదర్శించిన నావికులనుచూసి, ఆనాటి బ్రిటన్ ప్రధాని క్లెమెన్ట్ అట్లీ దిగొచ్చాడంటే వింతేముంది? ఈ తిరుగుబాటులో ప్రత్యక్షంగా పాల్గొన్న పిచ్చేశ్వరరావు ఎందరో ‘చిరంజీవుల్ని’ కళ్ళారా చూసే వుంటారు! 1948 వరకూ స్వతంత్ర భారత్ -పాక్ దేశాల్లోని బ్రిటిష్ సేనలన్నింటికీ సుప్రీం కమాండర్గా పనిచేసిన – ఒకనాటి కమాండర్-ఇన్-చీఫ్ అచిన్లెక్ ప్రసంగించనున్న వేదిక పైనే ‘క్విట్ ఇండియా!’, ‘రివోల్ట్ నౌ!’ స్టికర్లు అతికించిన 22ఏళ్ళ సాహసి బీ.సీ. దత్ లాంటి వ్యక్తుల కథల ప్రాతిపదికపైనే “బ్రతకడం తెలియనివాడు” కథానిక పుట్టివుంటుంది . చిరంజీవి మాదిరిగా దత్తును ఎవరూ కాల్చిచంపకపోయినా, ఆయన నోటికాడ కూడు పడగొట్టి అంతపనీ చేశారు మన జాతీయ నాయకమ్మన్యులు!! పిచ్చేశ్వరరావులాంటి అభ్యుదయ రచయితలు ఇలాంటి పోకడలను – నిర్లిప్తంగా చూస్తూవుండలేరు మరి!
కృష్ణా జిల్లాలోని సాదాసీదా పల్లెటూళ్ళోని సామాన్య రైతుకుటుంబంలో పుట్టి, ఇంటర్మీడియట్ చదివి, హిందీ భాషలో విశారద పట్టం పొందిన పిచ్చేశ్వరావు నేవీలో ఏడెనిమిదేళ్ళు పనిచేశారు. ఆ తర్వాత విశాలాంధ్ర దినపత్రి కలో దాదాపు దశాబ్ద కాలం పనిచేశారు. అదే సమయంలో ఆయన ఎన్నో ప్రసిద్ధ రచనలను హిందీ నుంచి తెలుగు లోకి అనువాదం చేశారు. ప్రేమ్ చంద్ సుప్రసిద్ధ నవల గోదాన్ను, కిషన్ చందర్ రాసిన అద్భుత వ్యంగ్య నవల “ఒకానొక గాడిద ఆత్మకథ”నూ ఇల్యా ఎహ్రెన్బర్గ్ రచన “పారిస్ పతనం” తదితర రచనలనూ ఆయన అదే కాలంలో తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. మరెన్నో రచనలనూ, మరెందరో రచయితలనూ పిచ్చేశ్వరావు తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. 1955 మధ్యంతర ఎన్నికల తర్వాత మద్రాసు బాట పట్టిన అనేకమంది అభ్యదయ రచయితల దారిలోనే, 1960కి అటూఇటూగా పిచ్చేశ్వరావు సినీరంగప్రవేశం చేశారు. ‘ఇల్లరికం‘, ‘నమ్మినబంటు‘, ‘చివరకు మిగిలేది‘, ‘భార్యాభర్తలు‘, ‘వాగ్దానం‘, ‘బాటసారి‘, ‘ఆత్మబంధువు‘, ‘వివాహ బంధం‘ తదితర చిత్రాలకు రచన చేశారు. సినిమా రంగంలో అభ్యుదయ రచయితలకు ఆత్మతృప్తి కలిగే సందర్భాలు అరుదుగానే వుంటాయి. అది ఫక్తు వాణిజ్యరంగం! అక్కడ వాణిజ్య విలువలు తప్ప మరే విలువలూ చెలామణీ కావు!! పిచ్చేశ్వరావు లాంటి వ్యక్తులు అలాంటి చోట కూడా తమకు ఆత్మతృప్తినిచ్చే రచనలు చేసేందుకు యత్నిస్తారు. “గౌతమ బుద్ధ“, “కందుకూరి వీరేశలింగం” లఘు చిత్రాలకు స్క్రిప్ట్ సమకూర్చడం అందులో భాగమే!
కథకుడిగానూ, అనువాదకుడిగానూ, స్క్రిప్టు రచయితగానూ పిచ్చేశ్వరరావు చేసిన కృషి చూస్తే ఆయన శక్తిసామర్థ్యాల గురించి అంచనా వేసుకోవడం కష్టం కాదు. ముఖ్యంగా, సినిమా స్క్రిప్టు అధారంగా రూపొందించే ‘వెండితెర నవల‘ అనే ప్రక్రియను – బహుశా తొలిసారి జయప్రదంగా నిర్వహించిన పిచ్చేశ్వరరావు తర్వాతి రోజులలో ఈ రంగంలో వచ్చిన అనేక ప్రయోగాలను కూడా సుసంపన్నం చేసివుండేవారు. 1950 దశకంలోనే అకిర కురసవా రూపొందించుకున్న “సెవెన్ సమురాయ్ – షూట్ రెడీ స్క్రిప్ట్’ ను యథాతథంగా అచ్చువేస్తే, కొత్తతరం పాఠకులు దాన్ని నవల చదువుకున్నట్టు చదువుకున్నారట! దాదాపు నలభయ్యేళ్ళ తర్వాత తెలుగులోకూడా అలాంటి ప్రయోగాలు జరిగాయి. “అత్యధిక సర్క్యులేషన్’ గల వ్యాపార పత్రికలే వాటిని అచ్చువేసుకున్నాయి కూడా. సాహిత్య ప్రక్రియ రూపాలను దేశకాల పరిస్థితులు ప్రభావితం చేస్తాయనే ప్రాథమిక సత్యం తెలియనివాళ్ళు వెండితెర నవల లాంటి ప్రయోగాలు జయప్రదంగా చెయ్యలేరు! పిచ్చేశ్వరరావుకు అలాంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుననడానికి ఆయన రాసిన వెండితెర నవలలే నిదర్శనం. అన్నిటికీమించి పిచ్చేశ్వరరావు జీవితానుభవం ఆయన చేత మరెన్నో మంచి రచనలు చేయించివుండేదని అనిపించడం ఖాయం. కానీ, అలాంటి అరుదయిన రచయిత నుంచి తెలుగు భాషకు జరగాల్సినంత సేవ జరగక ముందే పిచ్చేశ్వరరావు కన్నుమూయడం ఓ విషాదం! ఆయన పోవడానికి నాలుగేళ్ళు ముందు పుట్టిన ప్రముఖ రచయిత ఛుక్ పలాఖ్నుయిక్ అన్నట్టుగా, “మనమందరం పోయేవాళ్ళమే; జీవితానికి లక్ష్యం కలకాలం బతకడం కాదు – అలా బతికే దాన్ని సృష్టించడమే మన లక్ష్యం!” పిచ్చేశ్వరావు ఆ పని చేయగలిగారనడంలో సందేహం లేదు. నలభైయేళ్ళ నడిప్రాయంలో, గుండె జబ్బుతో ఆయన కన్నుమూసి నిన్నటికి యాభయ్యయిదేళ్ళు పూర్తయింది!
మందలపర్తి కిషోర్
వ్యాస రచయిత సెల్: 81796 91822
అట్లూరి పిచ్చేశ్వరావు కథలు
Published by CLS Publishers LLP, Hyderabad
పుస్తకం ధర: 250.00 రూపాయలు పుటలు : 280 బరువు : 220 గ్రాములు ఈ క్రింది పుస్తకాల దుకాణాలలో కూడా లభిస్తుంది.
ఈ పుస్తకానికి: Sole Distributors: Navodaya Book House, Opp: Metro Pillar 14, Kachiguda Cross Roads, Hyderabad – 500 027, Mobile: +91 – 90004 13413 వీరిదే ఆన్లైన్ బుక్స్టోర్లో ఇక్కడ కూడా తీసుకోవచ్చు. https://bit.ly/APRinNavodayaOnLine
మెదడుకు పదును పెట్టే మంచి కథలను కోరుకునే పాఠకులు పిచ్చేశ్వరరావును మరిచిపోలేరనుకుంటాను. తెలుగు కథ ఏపుగా ఎదిగి మంచి పువ్వులు పూస్తున్న తొలిరోజులలో ఎర్రటి మందార మాలను అందంగా గుదిగుచ్చిన జాతి కథకుడు పిచ్చేశ్వరరావు. అతని సమకాలీన కథలను చాలామంది పోల్చి చూస్తే పిచ్చేశ్వరరావు వ్రాసిన కథలు బహుకొద్ది మాత్రమే. కానీ కాల ప్రవాహానికి నిలబడి అతనిని ‘చిరంజీవి’గా చేసే కథలవి. ‘‘అతను కథలు రాయాలని కనిపెట్టుకుని ఏ కథా వ్రాయలేదు. సద్యః ప్రయోజనాన్ని మటుకే మనసులో పెట్టుకుని కథలు వ్రాశాడు’’ అంటూ కొడవటిగంటి కుటుంబరావు గారు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని చదివితే రచయితగా అతడిలోని నిజాయితీ అర్థం అవుతుంది.
పిచ్చేశ్వరరావు కథా ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధం నాటి వాతావరణం, స్వాతంత్ర్య సమరం, తెలంగాణ పోరాటం, స్వాతంత్ర్యానంతరం ఉపన్యాసాల విన్యాసాలలో నేతి బీరకాయలా మిగిలిపోయిన ప్రగతి, సామ్రాజ్యవాదం చెప్పిన పాఠాలను అవగతం చేసుకుని – కొత్త వేషాలతో, మార్చుకున్న రంగులతో జనాన్ని పీక్కు తింటున్న పర పీడనా ప్రకృతి – ఇవన్నీ బహుముఖంగా దర్శనమిస్తాయి. పిచ్చేశ్వరరావు నావికులు, రైతులు, స్త్రీలు, బర్మా కాందిశీకులు, ఎవరి గురించి చెప్పినా సరే వాళ్ళకు జరిగిన అన్యాయానికి ఆక్రందిస్తాడు. ఆవేశంతో ఊగిపోతాడు. ‘‘కలాన్ని ఇంకు బుడ్డిలో ముంచినప్పుడల్లా తన శరీరంలోని ఒక్కో మాంసం ముక్కను అందులో వదిలిపెట్టగలిగినప్పుడు మాత్రమే రచన చేసేందుకు ఉపక్రమించాలి’’ అనే లియో టాల్స్టాయ్ పలుకులు జ్ఞాపకం వస్తున్నాయి ఇది వ్రాస్తుంటే. పిచ్చేశ్వరరావు కథలు చదువుతున్నప్పుడు ఒకనాటి చరిత్ర అంతా కళ్ల ముందు కదులుతుంది. లేకుంటే కుటుంబరావు గారు ‘నెత్తురు కథ’ గురించి చెబుతూ ‘‘అయిదు పేజీలు పూర్తిగా లేని ఈ కథలో ఒక జీవితమే కాదు ఎంతో చరిత్ర ఉన్నది’’ అని అంటారా?
ఈ కథలోని ఎర్రజెండా మామూలు రాజకీయ జెండా కాదని నెత్తురు జెండా అని ఆ కథ పాఠకులకు జ్ఞాపకం వుందనే అనుకుంటాను. ఒక నల్లవాడు శాంతి, భద్రతలను కాపాడడం కోసం కాల్చిన తుపాకీ చిందించిన రక్తం వెనుక ఎంతో కథ ఉంది. గాంధీజీని కొలిచి స్వాతంత్ర్యం కోసం భర్తను తెల్లవాడి తుపాకీకి బలి ఇచ్చిన వీరపత్ని కథ వున్నది. స్వాతంత్ర్యం వస్తుంది, రామరాజ్యం వస్తుంది అని పెట్టుకున్న కలలు, కట్టుకున్న ఆశలు వున్నాయి. స్వాతంత్ర్యం వచ్చినా ఆకలి తీరక, ఆవేదనతో అలమటించిన దయనీయ గాథ వున్నది. ‘‘ప్రేమతో పొంగి, దుఃఖంతో కరిగి, క్షోభతో కుమిలి, కోపంతో కమిలిని నెత్తురు’’ కథ ఇది.
ఈ కారణం చేతనే పిచ్చేశ్వరరావు ఓ ‘ఆగస్టు 15న‘ కొట్ల మీద, కాఫీ హోటళ్ల మీద మూడు రంగుల జెండాలు ముచ్చటగా రెపరెపలాడుతూ వుంటే… ‘‘పొట్ట కదిలింది. పొట్ట మీద ఇనుప చువ్వల మొనలు మొలిచాయి. మొనల మధ్య నడిబొడ్డు ద్వారం విచ్చుకుంది. చీకటి వెనుక కారుచీకట్లు తారట్లాడుతున్నవి. టోపీలు, లాఠీలు, బాయ్ నెట్ లు, తుపాకులు…’’ అంటూ సర్రియలిస్టు ధోరణిలో కథలు వ్రాశాడు. (ఆగస్టు 15న కథలో)
పిచ్చేశ్వరరావు ఆకలి దారిద్ర్యాలతో నిండిన ‘నేడు’ ను ‘నిన్న’గా మార్చాలని వున్న తపన – అతను రాసిన నా ‘గడవని నిన్న’ కథ చదివితే తెలుస్తుంది. ఈ కథలో ‘విన్నీ’ ఒక వ్యభిచారిణి కావచ్చు.(పోర్చుగీసు వాళ్లు ‘సినోరిటా’ అని, అమెరికన్లు ‘జానీ’ అని, మరికొంతమంది ‘హసీనా’ అని పిలవ వచ్చు. అది వేరే విషయం) కాని – అమెకీ ఓ మనసుంది. అయినా, మార్స్ చాక్లెట్ నములుతూ హాయిగా కూర్చోక అతనికి ‘విన్నీ’ గొడవ ఎందుకు? విమానాల మీద వెళ్ళే వాళ్ళని బాంబులు వెయ్యొద్దని, సింహాసనం మీద కూర్చున్న వాళ్ళను ఉపన్యాసాలు దంచొద్దని చెప్పడం పిచ్చి కాదూ? ఇవన్నీ మారిన నాడు నేను కనిపించను అంటుంది ‘విన్నీ’. అలా మారిన దేశాలకు అదంతా ‘నిన్న’ – మరి మనకు ‘నిన్న’ గడిచేదెప్పుడు?
ఈ ‘గడవని నిన్న’ గురించిన తాపత్రయం పిచ్చేశ్వరరావు నావికుల జీవితాలను నేపథ్యంగా తీసుకుని వ్రాసిన ‘చిరంజీవి’ వంటి కథల్లో కూడా కనబడుతుంది. తెలుగులో నేవి వాతావరణంతో వచ్చిన కొద్ది కథల్లో పిచ్చేశ్వరరావు కథలు ముఖ్యంగా పేర్కొనదగ్గవి. ‘చిరంజీవి’ కథలోని చిరంజీవి రంగూన్ నుంచి పారిపోయి వచ్చేటప్పుడు చాలా కష్టాలు పడ్డాడు. మంటల్లో బూడిద అయిపోతున్న ఇంటినీ, చచ్చిపోయిన చెల్లెల్నీ, విడిచిపెట్టి జపాన్ విమానాన్ని తప్పించుకుంటూ పరిగెత్తాడు. జపాన్ వాళ్ళమీద కసితో ఇండియాలో ‘నేవీ’లో చేరాడు. కానీ, సామ్రాజ్యవాదుల కథ ఎక్కడైనా ఒకటే. చిరంజీవిలో ఉన్న అన్యాయాన్ని ఎదిరించే మనస్తత్వాన్ని అధికారులు అణగదొక్కుదామని విశ్వప్రయత్నం చేశారు. పాకీ పని చేయించారు. చివరికి తుపాకీ గుండుతో పొట్టన పెట్టుకున్నారు. కానీ కథ చివర్లో ఉప్పెనలాగా గోడలు దూకి వస్తున్న జనసమూహాన్ని చూస్తూ డాక్టర్ అన్నట్టు ‘‘చిరంజీవి చనిపోలేదు. వీళ్లంతా చిరంజీవులు కాదూ? ఈ జనమంతా చిరంజీవులే’’.
పిచ్చేశ్వరరావు కథల్లో కనపడే మరొక ముఖ్యమైన విషయం ‘వ్యక్తి వాదం’ పట్ల సెటైరు. ‘‘నాకు కావలసింది నేనే. చచ్చినా నేనే బ్రతికినా నేనే’’ అనే ఒక అపోహే – ‘‘నా ముందు మీరెత్తగలిగిన మాట వ్యక్తి స్వాతంత్ర్యం. ఈ వ్యక్తి స్వాతంత్ర్యం ముందు మీరంతా గడ్డిపరకలు. ఈ విశాల విశ్వం అంతా ఆ వ్యక్తి స్వాతంత్ర్యం పుక్కిలించి వూసే వెలుగులో ఓ పెద్ద ‘నీడ’’’ అని అంటాడు పిచ్చేశ్వరరావు వ్రాసిన ఓ కథలో. (‘వెర్రి కాదు వేదాంతం’ అనే కథలో) ‘వ్యక్తి స్వాతంత్ర్యం’ ముసుగులో సమసమాజాన్ని అవరోధించే పెద్దమనుషుల కుహనా విలువల పట్ల వైముఖ్యమే పిచ్చేశ్వరరావు చేత ఇలా వ్రాయించింది. అమెరికన్ బ్రాండ్ ‘వ్యక్తి స్వాతంత్ర్యా’న్నే కాదు… అమెరికా స్వేచ్ఛాదేవతను కూడా పిచ్చేశ్వరరావు హేళన చేశాడు.
‘జీవచ్చవాలు’ కథ జ్ఞాపకం ఉందా? ఈ కథకు నేపథ్యంలో అమెరికా దేశ సంస్కృతి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దర్శనమిస్తాయి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పేరు చెప్పేసరికి న్యూయార్క్ ఓడరేవులో బానిసత్వపు చీకట్లను చీలుస్తూ, స్వేచ్ఛా స్వాతంత్ర్యాల ఊపిరిని వెదజల్లుతున్నట్లుగా దర్శనమిచ్చే ఓ అపురూపమయిన దేవతా శిల్పం స్మృతి పథంలో మొదలుతుంది. అంతో ఇంతో చారిత్రక జ్ఞానం ఉన్న వాళ్లకు ఆ శిల్పాన్ని తీర్చిదిద్దిన ఫ్రెంచ్ శిల్పకారుడు ఆగస్టు బార్డోల్టీ, ఆ శిల్పం మీద చెక్కబడిన ‘ఎమ్మా లాజరస్’ వాక్యాలు కూడా జ్ఞాపకానికి రావచ్చు. అది వేరే విషయం. పిచ్చేశ్వరరావు కథకూ ఈ బాపతు ‘వ్యవహారానికి’ సంబంధం లేదు.
ఒకానొక రేవు పట్టణంలో ‘టొవెడో’ అనే ఒక అపురూపమైన ఓడ వచ్చిందని విని ఇద్దరు మిత్రులు చూడడానికి వెడదామనుకుంటారు. ఓడను చూడటం అవకపోయినా, ఆ ఓడ నావికుడు ‘డిక్’ పరిచయం అయింది. అదీ ఓ వే సైడ్ ఇన్ లో బుడ్డీ మీద బుడ్డీ బీరు పట్టిస్తుండగా. ‘మీ స్వాతంత్ర్య దేవతను చూడాలని వుందండీ’ అంటాడు ‘అమెరికా పిచ్చి’ ఉన్న సుబ్రహ్మణ్యం. అదిగో అక్కడ నుంచి అసలు కథ ప్రారంభం అయింది. స్వాతంత్ర్య దేవతను తలుచుకుంటూ అమెరికన్ జీవన విధానం కోసం లొట్టలు వేసే సుబ్రహ్మణ్యం ‘‘దివ్య మాతృ విగ్రహం… మీ దేశంలోని తల్లులందరిలోనూ…’’ అంటే సెయిలర్ డిక్ అంటాడు కదా…‘‘నాకు తల్లి ప్రేమ అంటే ఏమిటో తెలియదు. పక్షిలా పెరిగాను. నేను డబ్బు సంపాయిస్తేనే గొప్పవాణ్ణట. లేకపోతే కొడుకునే కాదు పొమ్మంది. డాలరు తెస్తే ముద్దు, లేకుంటే మొట్టు’’ అని. ఆగస్ట్ బర్థోల్డి తన కన్నతల్లిని నమూనాగా తీసుకొని స్వేచ్ఛా దేవత శిల్పాన్ని చెక్కాడంటారు. ఇంతకూ ఆ తల్లి అమెరికన్ తల్లి అయినా, బర్థోల్డి కన్నతల్లి మాత్రం ‘తల్లి’కుండవల్సిన లక్షణాలు కానీ, స్వేచ్ఛా దేవత శిల్పంలో మనం ఊహించుకునే ఉదాత్త లక్షణాలు కానీ లేవు అని, కేవలం కొడుకుకు తల్లి హోదాగల ‘లిబిడివల్ ఎటాచ్ మెంట్’ వల్ల మాత్రమే ఆమెను నమూనాగా తీసుకోవడం జరిగిందని అంటారు కొందరు)
అమెరికాలో మాతృత్వమే డబ్బుతో కొలిచే వస్తువు అయినప్పుడు ఇక, స్నేహితుల సంగతి చెప్పాలా? ‘‘మా దేశంలో స్నేహం లేదు. వున్నా స్నేహంలో లోతు లేదు. ఎవరూ ఎవరికీ స్నేహితులు కారు’’ అంటూ ఉస్సూరంటాడతడు. ఇక, ఓడ పనిలో ఎందుకు చేరావంటే ‘చావడానికి’ అని అంటాడు. ‘‘నాకు చావాలని ఉంది. చచ్చిపోలేను. ఎవరయినా చంపుతారేమోనని అనుకుంటాను… యుద్ధంలో చేరితే ఎవళ్ళో ఒకళ్ళు చంపుతారు’’ అనే మాటలు చదివితే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. రాత్రిళ్ళు రోడ్డమ్మట తిరిగేటప్పుడు ‘‘ఎంతమంది పెళ్ళాల మెడల్లో చేతులు వేసుకుని నిద్ర పోతున్నారో అని ఆలోచిస్తా – అప్పుడు బార్ లో దూరతా’’ అనే మాటల్లో ‘ఎనక్లిటిక్ డిప్రెషన్’ కనబడుతుంది. ‘డిక్’ అనబడే ఈ సెయిలర్ కథ కల్పితమే కావచ్చు. అమెరికన్ల కుహనా విలువల పట్లగల వైముఖ్యంతోనే పిచ్చేశ్వరరావు ఈ కథను వ్రాసి ఉండవచ్చు. కానీ, మెటీరియలిస్ట్ ధోరణలు పెచ్చు పెరిగిపోతున్న దేశాలలో ప్రతిదానినీ డబ్బుతో మాత్రమే కొలిచే సంస్కృతిలో – అది అమెరికా కానివ్వండి, మరొక దేశం కానివ్వండి, ఒక సగటు మనిషి హృదయ ఆవేదన ఎలా వుంటుందో ఈ కథ చెబుతుంది.
‘డెమొక్రసీ అండ్ సైంటిఫిక్ టెక్నిక్’ అనే రచనలో బెట్రాండ్ రస్సెల్ ‘‘పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఆకలి భయం మనిషికి ‘ఇన్సెంటివ్’గా పనిచేస్తుంది. కమ్యూనిస్టు వ్యవస్థలో పోలీసులు విధించిన శిక్షలు ఇన్సెంటివ్ గా పని చేస్తాయి’’ అని చెబుతూ… ఈ రెండు తరహాల ఇన్సెంటివ్ లు మనిషిని యంత్రంలోని మరలాగా మర్చేస్తాయి అని అంటాడు. ఈ కథలోని ‘డిక్’ యంత్రంలోని మరలాగా మారిపోయానని గగ్గోలు పడడం పోటీ ఆర్థిక వ్యవస్థ ఇచ్చిన విష ఫలితమే.
మనిషిని ఒక బోల్టుగానో, స్క్రూగానో చూడక అతనినొక సజీవ పదార్థంగా చూడగలగాలంటే మన విలువల్లో, నమ్మకాల్లో మార్పు రావడం ఎంతైనా అవసరం. ఆ విలువలు భారతీయమైనవా, రష్యన్లవా, అమెరికన్లవా అనేది కాదు ప్రశ్న. మనిషికి అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయన్నది మాత్రమే ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు దొరికితే ‘జీవచ్ఛవాలు’ ఉండవు. ప్రాణంతో మనుషులు కళకళలాడుతూ కనబడతారు. పిచ్చేశ్వరరావు కోరుకున్న స్వర్గం ఇదే అనుకుంటాను.
* ఆంధ్రజ్యోతి దినపత్రిక , మార్చి 16, 1987 సోమవారం సంచికలో కోడూరి శ్రీరామమూర్తి రాసిన సమీక్ష ఇది.
* దీన్ని నాకు అందించిన వారు మిత్రుడు సతీష్. తన విశ్రాంత సమయంలో మనసు ఫౌండేషన్ వారి కోసం చేకూరి రామారావు సాహిత్యం సేకరణలో మరొక సాహితి మిత్రుడు జి ఎస్ చలం తో కలిసి పనిచేస్తున్నాడు.
అట్లూరి పిచ్చేశ్వర రావు కథలు
ఈ క్రింది పుస్తకాల దుకాణాలలో కూడా లభిస్తుంది.
పుస్తకం ధర: 250.00 రూపాయలు పుటలు : 280 బరువు : 220 గ్రాములు
ఈ పుస్తకానికి: Sole Distributors: Navodaya Book House, Opp: Metro Pillar 14, Kachiguda Cross Roads, Hyderabad – 500 027, Mobile: +91 – 90004 13413 వీరిదే ఆన్లైన్ బుక్స్టోర్లో ఇక్కడ కూడా తీసుకోవచ్చు. https://bit.ly/APRinNavodayaOnLine
కాస్త సిగ్గేసింది… మూడుదశాబ్దాల జీవితంలో చాలా చదివా అనే గర్వం లాంటిది ఏ మూలనైనా ఉంటే అది సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది. అట్లూరి పిచ్చేశ్వరరావు అనే పేరు కేవలం అనువాద రచయితగా మాత్రమే తెలుసు నాకు. అదీ… కిషన్ చందర్ రచనలవరకే…అయితే…! ఇదిగో ఈ పుస్తకం చూశాక ఈ కథలు చదివాక, ఒకానొక ఉద్విగ్న, దుఃఖ సమయాలని అనుభవించాక.. మా తరంమీద జాలేసింది. కొత్త కొత్త పుస్తకాలని తెస్తున్నాం, చూస్తున్నాం ఆధునిక సాహిత్యాన్ని మళ్లీ వెలుగులతో చూస్తున్నాం. కానీ, ఒకానొక కాలపు వెతలని ఇంత హృద్యంగా మళ్లీ చదవటం ఒక అనుభవం. భాష, కథనం రెండూ కలిసిన ఒక ఫ్లో… అద్భుతం కదా ఈ అనుభవం.
ఈ కథల్ని ఇప్పటికైనా చదవగలిగాను.. చదువుతూ గుండె చప్పుడు పైకే విన్నాను, కంటినుంచి అప్రయత్నంగా వచ్చిన కన్నీటి చుక్కని తుడుచుకుంటూ పుస్తకాన్ని చేతిలో ఆప్యాయంగా పట్టుకున్నాను… అట్లూరి పిచ్చేశ్వరరావుని అభిమానించుకున్నాను…
నెత్తురు కథలో… ఒక కాలాన్ని, ఒక పోరాటాన్ని అనుభవిస్తూనే ఆనాటి కాలాన్ని దర్శించుకున్నాను. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాంశాలని. పోరాట జీవితకాలాలని ఇంత హృద్యంగా టచ్ చేయటం, దాన్ని ఇంత అందంగా రాయటం. ఎలా పట్టుబడుతుందీ కళ!? “ఆ.. అదే ఎర్రజండా. సుత్తీలేదు,కొడవలీ లేదు. నిజమే! ఆ రంగు గూడానూ.. రంగేసిన గుడ్డ కాదది. నెత్తురుపులుముకున్న గుడ్డ. నీలా నాలా బతికిన మనిషి నెత్తురు…” (నెత్తురు కథ) పాఠకుడా! ఎట్లా భరించగలవీ వలపోతని? నిజంగా రాయటానికి ముందు ఆ రచయిత మామూలు మనిషిగా ఎలా భరించాడీ వ్యధని?? కథ సమకాలీన పరిస్థితులకి కూడా అచ్చంగా సరిపోయేదే మన దేశపు ముఖ చిత్రమైన నెత్తుటి బతుకు చిత్రణ ఈ కథ.
“చిరంజీవి చనిపోలేదు. అట్లా చూస్తావేం! వీళ్లంతా చిరంజీవులు కాదూ! ఆ (తిరగబడే) జనమంతా చిరంజీవులే!!” అంటున్నాడు డాక్టరు. ఎస్.బీ.ఏ. చేతిలోంచి తుపాకీ లాక్కున్నాను నేను… ఇక్కడితో “చిరంజీవి” కథ ముగుస్తుంది. కానీ ఆ చిరంజీవి ఇచ్చిన ఆలోచన మనలోనూ మొలకెత్తిపోయి ఉంటుంది. ఆ ఫీల్ నుంచి బయటకు రావడం అంత ఈజీ కాదు. అది ముద్ర రచయిత వేసిన ముద్ర.
“తెలివిగల నాలుక పనిచేయదోయ్ పిచ్చి! నవ్వే మొఖం పని చేస్తుంది” అంటుంది విన్నీ. (గడవని నిన్న) ఎన్నెన్ని ముఖాల, మరెన్ని మనుషుల్ని చూసిన అనుభవం ఇది. ముఖ్యంగా ఆ కథల్లో కనిపించే వాతావరణం. అచ్చంగా మనం ఆ పరిసరాలని ఊహించుకుంటూ చదవగలిగేంత స్పష్టంగా ఉంటుంది. అసలు దాదాపుగా వందేళ్ల కిందట రాసిన కథ… ఇప్పుడు ఈ కాలాన బతుకుతున్న కుర్రాడికి కూడా అదే అనుభవం ఇవ్వటం… వ్యవస్థ వైఫల్యమా? రచయిత భవిష్యద్దర్శనమా?? (ఆగస్టు 15న) ఒక ఆలోచన, అబ్స్ట్రాక్ట్ చిత్రణ. ఎన్నెన్ని ఆలోచనలకు మొలకలు వేసిన కథ ఇది. “నేటినుండీ నేను స్వతంత్రున్నట. ఔను! కాదనేందుకు నాకు స్వాతంత్రం లేదు.” ఎప్పటికాలపు వ్యాఖ్య ఇది!!? నిన్నా మొన్నా కూడా ఇదే వినపడిందే…!!!
నిజానికి తెలుగులో కథలో చాలా మార్పు వచ్చింది. కానీ ఇప్పుడు కూడా అద్భుతం అనిపించే థాట్, కొత్త రకపు ప్రజంటేషన్ మనల్ని చకితుల్ని చేస్తుంది. “వసుంధర” కథ రాసిన తీరు. ఇలాంటి ఫార్మాట్ లో కథ రాయొచ్చనే ఆలోచనే ఒక తిరుగుబాటు. స్టిల్ ఎ ఫ్రెష్ ఫీల్ ఇన్ ఇట్. అంత వైవిధ్యంలోనూ…. చెప్పాలనుకున్న విషయం సూటిగా పాఠకుడి మెదడుకు చేరుతూనే ఉంటుంది. చదవడంలో ఏమాత్రం అడ్డంకి ఉండదు. ఖచ్చితంగా ఇవి ఈనాటి కొత్త రచయితలకు అందాల్సిన కథలు, రాబోయే తెలుగు పాఠకులకు చేరాల్సిన విషయాలు. బహుశా ఇలాంటి శైలిలో తెలుగు కథ నావరకూ నేను గమనించింది “త్రిపుర”లో. పిచ్చేశ్వరరావుని అందుకోవటంలో కాస్త ఆలస్యమే జరిగింది. ఆనాటి కాలానికి ఇంత రాజకీయ చైతన్యంతో కూడిన రచనలు చాలా వచ్చి ఉండవచ్చును కానీ కచ్చితంగా ఇలాంటి ఫ్రేమింగ్ మాత్రం లేదు. ఇది పారడాక్స్ అనొచ్చునో లేదో కానీ ఒక విధపు “క్లిష్టమైన సరళత” కనిపించింది.
మంటో కథల్లో కనిపించే హృద్యమైన చిత్రణ, తగలి శివశంకరన్ పిళ్ళై తరహా సూటిదనం… పిచ్చేశ్వరరావులో కనిపించాక నిజ్జంగా మొదటిగా చెప్పుకున్నట్టు సిగ్గుగానే అనిపించింది. వేరు వేరు భాషల కథలని, కథకులని తెలుసుకున్న నేనూ… ఈయనని ఇంత ఆలస్యంగానా తెలుసుకోవటం?? నేవీ నేపథ్యంలో ఉన్న కథలు… ఆ కథల్లో కనిపించే వాతావరణం, కొత్త కొత్త పదాలు, ఆనాటి వస్తువులు… ఆఖరికి వారి వస్త్రధారణ కూడా మనకు కనిపిస్తుంది. ఇక ఆ పాత్రల ప్రవర్తన మనలో కూడా కొన్నిసార్లు ప్రవేశిస్తుంది. ఇది ఒక సినిమాకి పనికి వచ్చే స్టైల్, ప్రతీ కథని అలాగే నేరుగా స్క్రిప్టు కింద తీసుకోవచ్చు. అంత చక్కటి స్క్రీన్ ప్లే తరహా కథనం కనిపిస్తుంది.
శాస్త్రి కథ ఒకసారి చదివాక జీవితంలో మర్చిపోగలమా? అలాగని అందులో ఏముంది?? నరాల్ని పొంగించే ఇతివృత్తంకాదు, మరీ హత్తుకునే విషయమూ లేదు.. కానీ, ఆ సున్నితమైన వ్యంగ్యంతో కూడిన రచనా శైలి, ఆ స్మూత్ సర్కాజం. అవునూ..!ఈ శాస్త్రి కథ రాసినాయనేనా ఆ “నెత్తురు కథ”రాసిందీ!!?? “ఇదుగో, నిన్నే, ఎవరో చూడు. అడుక్కుతినేవాళ్ళు లాగుంది.” (అన్నాడు కవి) “మనకంటేనా” అంటూ నడవాలోకెళ్లింది.(కవిగారి భార్య). అచ్చంగా కాదుగానీ ఇలాంటి కవి/రచయిత కథతో ఈమధ్యే టాలీవుడ్లో ఒక సినిమా కూడా వచ్చింది. రాయలేని తనాన్ని “కొత్తదనం అని, పాఠకులు తనంత ఎదగలేదని” కవర్ చేసుకునే రచయితలు ఉంటారుంటారు.. అప్పుడూ ఇప్పుడూనూ…
నన్ను అమితంగా ఆకట్టుకున్న కథ “విముక్తి” ఎన్నెన్ని తెలంగాణా పల్లెల జీవితాల చిత్రణ ఇది. ఆనాటి కాలపు పెను మార్పును డాక్యుమెంటేషన్ చేస్తూనే.. ఒక గుండెను పట్టుకునే ముగింపుతో మనసులోకి కథ ఇంకిపోతుంది. “సంఘానికీ జై” అన్న సుబ్బమ్మతో పాటుగా మనసులో జై… జై… అని అరవాలనిపిస్తుంది.
“అమ్మా ఆ పరుపుల పెట్టెలో మనం ఎందుకు ఎక్కలేదు?” అంటూ మొదలైన పసివాడి ప్రశ్నలు నిజంగా మనం ఎంతమందిమి వేసుకున్నాం? (కథకుడు) పిల్లలు.. అల్లరి చేసే పిల్లలు.. అమాయకప్పిల్లలు.. ఎన్ని ప్రశ్నలేస్తారు.. ఎంత ఆలోచనని తెప్పిస్తారు.. ఇవే ప్రశ్నలు మనం ఎందుకని ఎవర్నీ అడగటం లేదు? ప్రశ్నించటం మర్చిపోయామా?? ఇన్ని ప్రశ్నలని లేవనెత్తిన కథ “కథకుడు” ఆ పెట్టెలో ఎక్కితే డబ్బులు ఎక్కువ ఖర్చు కదా మరి వాళ్లేందుకు ఆపెట్టెలో ఎక్కారు? మనమెందుకు ఇంకా ఈ పెట్టెలో ఎక్కుతున్నాం అణా ప్రశ్న ఎంతటి తిరుగుబాటుని నిద్రలేపగలదూ… Leopoled Staff “మూడూళ్ళు” కవితలో అన్నట్టు.. “ప్రశ్నలడగని వాడు ఎంత దరిద్రుడైఉండాలి” అనే వాక్యం గుర్తొచ్చింది.
మొత్తంగా అట్లూరి పిచ్చేశ్వరరావు రాసిన ఈ కథలు ఇప్పుడు మళ్లీ చదవటం ఒక అవసరం. పాఠకుడికే కాదు… కొత్తగా రాస్తున్న రచయితలకు చాలా చాలా అవసరం. ఆనాటి తనాన్నే అందుకోలేక పోయిన వాళ్ళు ఇప్పుడు ఇంకా ఏమి కొత్తదనాన్ని వెతుకుతారు?
అద్భుతమైన అనుభవాన్నిచ్చిన కథలు… ఈ రకంగా నాకు అందటం చాలా హ్యాపీ. ఎంతో నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను. With సూఫీ 27 Dec 2021 11.06pm
అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు పుస్తకం ధర: 250.00 రూపాయలు పుటలు : 280 బరువు : 220 గ్రాములు ఈ పుస్తకానికి Sole Distributors: Navodaya Book House, Opp: Metro Pillar 14, Kachiguda Cross Roads, Hyderabad 500 027, Mobile: +91 – 90004 13413 వీరిదే ఆన్లైన్ బుక్స్టోర్లో ఇక్కడ కూడా తీసుకోవచ్చు.
మీకు అమెజాన్లో కావాలనుకుంటే Analpa Books ద్వారా ఇక్కడ తీసుకోవచ్చు:
పుస్తకం లోగిలిలోకూడా లభ్యం: Logili Book House, Guntur – 522007 Mobile: +91 95501 46514 వారి ఆన్లైన్ బుక్స్టోర్లో ఇక్కడ తీసుకోవచ్చు: https://bit.ly/APRonLogili
విజయవాడ పుస్తకాల పండుగ (Vijayawasda Book Festival) లో జనవరి 1 వ తారీఖు నుంచి 11 వరకు ఈ క్రింది స్టాల్స్ లో అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు అందుబాటులో వుంటాయి.
నవచేతన బుక్ హౌస్: 8 -10 పల్లవి పబ్లికేేషన్స్: 25 – 27 సాహితీ మిత్రులు: 29 – 31 శ్రీ హర్ష పబ్లికేషన్స్: 70 – 71 నవసాహితీ బుక్ హౌస్: 117 – 118 విశాలాంధ్ర బుక్ హౌస్: 160-166
వేణువు ఊదుకుంటున్న గోపాలుడికి ఆ సాయంత్రం పొద్దెక్కడం కొంచెం ఆలస్యంగా తెలిసింది. హడావుడి పడుతూ తన మేకలని కాలువ వైపుకి తోలాడు. ఊళ్ళో వాళ్ళెవరూ ఆ కాలువ, ఆ వంతెన వైపుకి చీకటి పడే సమయానికి రారు. భయం. ఎప్పుడో చెక్కతో కట్టిన వంతెన అది. ఇప్పుడో, అప్పుడో పడిపోయెటట్టుంది ఆ వంతెన. ఆ వంతెన ఇవతల గట్టుకి ఆనుకుని ఒక పెద్ద మఱ్ఱిచెట్టుంది. దాని మీద దెయ్యాలున్నాయిని ఆ ప్రాంతం ప్రజల నమ్మకం. చీకటి పడిన తరువాత ఆ వంతెన మీదుగా ఆ కాలువని దాటి ఏ ప్రాణి అయినా ఆ మఱ్ఱిచెట్టు కిందగా వెళ్తే దాని మీదున్న దయ్యాలు చంపేసి, రక్తం తాగి, శవాన్ని ఆ కాలువలో పడేస్తాయన్న కధని తరతరాలుగా ఆ ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటు ఉంటారు.
కాని గోపాలుడు మేకలని తొందరగా ఇంటికి చేర్చాలనే ఆలోచనలో ఉండి, ఆ మఱ్ఱిచెట్టు కిందుగా వెళ్ళి, ఆ కాలువ వంతెన మీదుగా దాటిస్తున్నాడు. అప్పటికే చీకటి పడిపోయింది. మఱ్ఱిచెట్టు భయంకరమైన దయ్యంలాగా కనబడుతోంది. గాలి విసురుగా తగుల్తోంది. మేకలన్ని పరిగెడుతున్నాయి. ఆఖరు మేక వంతెన దాటి గట్టు మీదకి చేరింది. దాని వెనకే గోపాలుడు కుడి కాలు మోపాడు. ఎడం కాలు ముందుకు తీసుకుని అడుగు వేస్తున్నాడు… వేసేశాడు. ఇప్పుడు కాలువకి ఇవతలి గట్టు మీదున్నాడు. పేద్ద శబ్దం చేస్తూ వంతెన ముక్కలు, ముక్కలుగా విరిగిపోయి, ఆ కాలువలోకి భళ్ళున పడిపోయింది. భయంతో మేకలన్నీ ఇంటి వైపు పరుగెట్టడం మొదలు బెట్టినవి. పరుగో, పరుగు, ఒకటే పరుగు. ఆగితే దయ్యాలు తమని కూడా పట్టుకుంటాయని భయం.
సరిగ్గా అప్పుడే గోపాలుడికి భయంతో ఏడుస్తున్న మేక పిల్ల అరుపు వినిపించింది. గబుక్కున వెనక్కి తిరిగి చూశాడు గోపాలుడు. ఆ కమ్ముకుంటున్న చీకట్లో అవతలి గట్టు మీద కనపడింది మేక పిల్ల. అది ‘మే… మే” అని భయంతో ఏడుస్తోంది. ఎర్రటి కళ్లతో దాని పీకని పట్టుకుని కనపడింది దయ్యం. చూడటానికే భయంకరంగా ఉంది ఆ దయ్యం.
“దాన్ని వదిలేయి, దయ్యమా. నువ్వేది అడిగితే అది ఇస్తాను, ” అని గోపాలుడు ఆ దయ్యాన్ని అడిగాడు. ఇవ్వను అన్నట్టుగా తలని అడ్డంగా అటూ, ఇటూ తిప్పింది దయ్యం.
గోపాలుడు మోకాళ్ళ మీద మోకరిల్లి, రెండు చేతులు కలిపి దణ్ణం పెడుతూ, “దయ్యం, దయ్యం దయచేసి నా మేకపిల్లని వదిలెయ్యవా?” అని మళ్ళీ అడిగాడు.
అప్పుడు దయ్యం, “సరే, వదిలేస్తాను. మరీ ఈ మేకపిల్ల నీ దగ్గిరకు ఎలా వస్తుంది?” అని అడిగింది.
గోపాలుడుకి ఏమి సమాధానం చెప్పాలో తెలియక బిక్క మొహం వేసాడు. అప్పుడు దయ్యం “నువ్వు ఒప్పుకుంటే ఒక షరతు మీద ఈ మేక పిల్లని వదిలేస్తాను,” అని అంది.
“ఏమిటా షరతు?” అని అడిగాడు గోపాలుడు.
“నువ్వు రేపు వచ్చేటప్పటికి ఇక్కడ ఒక సరికొత్త వంతెన ఏర్పాటు చేస్తాను. కానీ…”.
“ఊ…కానీ..నేను ఏం చెయ్యాలో చెప్పు,” అని ఆదుర్దాగా అడిగాడు గోపాలుడు.
“ఆ వంతెన మీదుగా దాటి వచ్చిన మొదటి ప్రాణిని నాకు బలి ఇవ్వాలి,” అని అంది ఆ దయ్యం.
“ఆ…?” అని ఆలోచనలో పడ్డాడు గోపాలుడు.
“నువ్వు ఒప్పుకోకపోతే ఈ మేకపిల్లని ఇప్పుడే చంపేస్తాను. రేపు ఆ వంతెన కూడా ఉండదు,” అని అంది ఆ భయంకరమైన దయ్యం.
“వద్దు, ఆ మేకపిల్లని చంపకు. నువ్వు చెప్పింది నాకు అంగీకారమే. అలాగే చేస్తాను, ” అని అన్నాడు గోపాలుడు.
మరుసటి రోజు ఉదయం, తన సద్దిమూటతో మేకలని తోలుకుంటూ కాలువ దగ్గిరకి బయలుదేరాడు గోపాలుడు. ఆశ్చర్యం! కాలువ మీద కట్టెలతో కట్టిన సరికొత్త వంతెన సిద్దంగా ఉంది అక్కడ. కాలువ అవతల గట్టున వంతెన దగ్గిర దయ్యం నిలబడి ఉంది. కాలువ ఇవతల గట్టున, వంతెనకి ఇవతల గోపాలుడు, అతని వెనకే మేకలు. ఆ మేకలతో పాటు ఒక గజ్జి కుక్క. మేకలని గట్టు మీదే ఉండమని చెప్పి, తను ఆ వంతెన మీద కాలు బెట్టి గట్టిగా ఉందో లేదో చూద్దామనుకున్నాడు. కానీ ఈ లోపు దయ్యానికి తనకి ఉన్న ఒప్పందం గుర్తు వచ్చింది. అందుకని వంతెన మీద కాలుపెట్టకుండా ఇవతలే నిలబడ్డాడు.
భుజానికి ఉన్న సద్ది మూటని విప్పాడు. అందులో నుంచి తను విడిగా పెట్టుకున్న మాంసం ముక్కని బయటికి తీసాడు. తన మేకలతో పాటే వచ్చిన గజ్జి కుక్కకి దాన్ని వాసన చూపించాడు. తన బలం అంతా వినియోగిస్తూ కుడి చేత్తో ఆ మాంసం ముక్కని వంతెన మీదుగా దయ్యం నిలబడి ఉన్న గట్టు మీదకి విసిరాడు. ఆ మాంసం ముక్క అవతల గట్టు మీద పడేలోపు, గజ్జి కుక్క ఆ కాలువ మీదున్న వంతెన మీదుగా అటు వైపుకి దూకింది. అటు దూకడేమేమిటి, ఆ గట్టు మీద పడ్డ మాంసం ముక్కని నోటితో పట్టుకోవడం కూడా అయిపోయింది.
ఇదంతా చూస్తున్న దయ్యం ఆశ్చర్యంతో నిర్ఘాంత పోయింది. దాని పక్కనే ఉన్న మేకపిల్ల దయ్యం పట్టు విదిలించుకుని ఆ గట్టునుంచి ఇటు గట్టు మీదకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. గోపాలుడు దాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ దయ్యం వైపు చూశాడు.
దయ్యం బూడిదగా మారి కుప్పగా కూలిపోయింది.
ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ మర్రిచెట్టు పైనకాని ఆ కాలువ గట్టున కానీ దయ్యాలు మళ్ళీ కనపడలేదు.
* * * కధ పూర్వపరాలు
2017లో మా అమ్మాయి, అల్లుడు తో కలిసి కొంత కాలం గదుపుదామని స్కాట్ లాండ్ వెళ్ళాను. వాళ్ళింట్లో వాళ్లుంటున్న ఎడిన్ బరో నగర పురాతన చరిత్ర గురించిన ఒక పుస్తకం కూడా ఉంది. ఎడిన్ బరో నగరంలో ఉన్న శిలా స్థూపాలు, ప్రతిమల గురించి కూడా కొంత వ్రాసి ఉంది. సెల్టిక్ కధల ప్రస్తావన వచ్చినప్పుడు జాలంలో కొన్ని కధలు చదివినప్పుడు వచ్చిన ఆలోచన ఇది. కధ వ్రాయడం మొదలుపెట్టిన తరువాత, ‘చిన్న పిల్లల కధ’ గా తయారయింది అనిపించింది. అప్పుడే చిన్న పిల్లలకి కూడా ఒక కధ వ్రాసానని, బాల సాహిత్యంలో కూడా వేలు పెట్టానని చెప్పుకోవచ్చు కదా అనిపించింది. దాంతో చిన్న పిల్లలకి కధలాగానే వ్రాసేసాను. చిన్న పిల్లల కధ గా రూపు దిద్దుకుంటునప్పుడు, పిల్లలకి దెయ్యలూ, భూతాలు, దేవుళ్ళు, దేవతలు (నేను నమ్మనివి) హేతువాదానికి, తర్కానికి నిలబడనివి, హింసని చూపించేవి ఎంత వరకు సబబు అని కూడా అనిపించింది. కానీ చందమామలో భేతాళ కధలు చదివిన నేను బాగానే ఉన్నానుకదా, నా పిల్లలూ బాగానే ఉన్నారు కదా , అని అనుకుని… దెయ్యాన్ని అలాగే ఉంచేసాను. ఇక ప్రచురణకి పంపాలనుకున్నప్పుడు ఏ పత్రిక అన్న మీమాంస మొదలైంది. సాహితీ మిత్రుడొకరు సాక్షిని సూచించారు. సాక్షి ఫన్ డే కి పంపాను. వారు ప్రచురించారు. కాకపోతే కధకి బొమ్మ వేసినవారు పెద్దగా శ్రమ పడకుండా జాలం నుంచి దెయ్యం బొమ్మకి బదులు దొరల మాంత్రీకురాలు బొమ్మని దింపేసి వాడేశారు. సాక్షి ఫన్ డే సంపాదకులకి ధన్యవాదాలు.
ప్రచురణానంతరం… కధ ప్రచురించిన తరువాత నేను పంచుకున్న మిత్రులలో ఒకరు, “నేనైతే పిల్లలకి దెయ్యాల భూతాల కధలు రాయనండి,” అని సున్నితంగా చెప్పారు. మరొకరు, “ఇమేజరి అంతా బాగుంది కాని పిల్లలకి దెయ్యం ఎందుకు…ఒక బాడ్ మాన్ తో వ్రాసి ఉండవచ్చు కదా?” అన్నారు. అది ఈ కధా నేపధ్యం. చి న సాంఘిక మాధ్యమాలలో ఇంకా ప్రచురించలేదు. చూడాలి అక్కడ చదివిన వాళ్ళేమంటారో! ద హ
పాద సూచి
సాక్షి, ఫన్ డే, ఆదివారం, ఆగస్ట్ 4 న సంచికలో వెలువడ్డ కధ పూర్తి పాఠం ఇక్కడ (image)
Text link here.
Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on whatsapp
WhatsApp
Share on email
Email
కొంత మంది పాఠకులకి నేను వ్రాసిన ఇడ్లి, వడ, సాంబారు కధ పూర్తిగా అర్ధం కాలేదన్నారు. ఈ టపా వారికోసం.
ఈ క్రింద ఇఛ్హినవి సారంగ లో వఛ్హిన కధ ఇడ్లి, వడ,సాంబార్ లోని వాక్యాలు. ఇవన్ని అంతర్గతంగా కధాంశానికి సంబంధించిన సూచినలిస్తాయి. వీటన్నింటిని ఒక క్రమంలో చదువుకుంటే కధ అర్ధం కావాలి. ఈ వాక్యాలు చదివిన తరువాత, కధని మళ్ళీ ఒకసారి చదువుకోండి. దానికి లంకె ఈ కింది వాక్యాల తరువాత చివర ఇఛ్హాను.
> ఇది అతని కధ.
> అతను ఒక స్త్రీ మూర్తిని తన చేతులమీదుగా ఎత్తుకుని తీసుకుని
రావడం…
> వాలిపోయిన ఆవిడ తలక్రింద చేతులు వేసి…
> స్త్రీని చాలా నెమ్మదిగా అతి జాగ్రత్తగా ఆ రేర్ సీట్ మీద పడుకోబెట్టాడు…
> …భుజాలక్రింద నుంచి చేతులేసి ఆవిడ తలని ఎంతో ప్రేమతో తన
ఒడిలోకి లాక్కుని…
> …తన రెండు చేతులతో ఎంతో వాత్సల్యంతో ఆవిడ కాళ్ళని తన ఒడిలోకి
తీసుకుంది…
> ఆంగర్, డినైయల్, బార్గైనింగ్, డిప్రెషన్ అండ్ అక్సెప్టన్స్. (Anger, denial, bargaining, depression and acceptance) – are the five stages of grief and not necessarily in that order. You can read more about it here. (If you haven’t yet, do watch that movie ‘All that Jazz‘. ఈ సినిమా ఆస్కార్ బహుమతులు పొందినది.))
> …(Yea…blood an’ shit!)…
> … బమ్స్ మధ్య నుంచి పరుపు మీదకి బెడ్ షీట్ మీదుగా. దేర్ గోస్ ది
బ్లడి షీట్!…
> …ఊపిరి తిత్తుల నిండా అవే. ఒన్…ఫోర్…ఎయిట్…మిలియన్స్ టు ది
పవర్ ఆఫ్ బిలియన్స్…దే ఆర్ చోకింగ్మాన్! లెట్ హర్ గో ఈజీలీ!
(Let her go easily!)…
> ఇట్ టూ ఈజ్ డెడ్ మాన్! (It too is dead man!)
> …(With a carcass…oh no!)…
(ఇది కధలో లేదు, కాని తెలియని పాఠకులకోసం ఇక్కడ ఇఛ్హాను. The following are the stages of “Rigor Mortis“, తెలుగులో ఇక్కడుంది. )
> బిలియన్స్ ఆఫ్ సెల్స్… డూ దే హావ్టు ప్రై దెమ్ ఓపెన్?
(Billions of cells…do they have to pry them open?)
> ఆర్ బ్రేక్? (Or break?)
> బ్రేక్ వాట్? (Break what?)
> ది జాస్, డూడ్…హర్ జాస్! (The jaws, dude…her jaws!)
> గెస్ నాట్! (Guess not!)
> షిట్… హౌ కెన్ యు ఎవెన్ధింక్ లైక్ దట్! (Shit…how can you
even think like that?)
> ఇట్స్ ఎ కడెవ…వాట్! (It’s a cadav’…what?)
> …నెమ్మదిగా సెటిన్ అవుతోంది…
> యు ధింక్ హర్ జా వుడ్హెవ్ బిగన్ టూ ఫ్రీజ్? (You think her jaw would have begun to freeze?)
> ఐ లిడ్స్?
(Eye lids?)
> …వాళ్ళందరూ ఇంకా తింటునే ఉన్నారు.
> ఇడ్లి, వడ, సాంబార్ కూడా…
That woman was part of their life and she lay dead in that car and they are having breakfast. Those monologues in English are his ( ఇంగ్లిష్ లోని స్వగతాలు, అతనివి) .
…. While they traveled with a member of their family who is dead (body), they stopped at a restaurant and had their breakfast.
చనిపోయిన తమ కుటుంబ సభ్యురాలి దేహంతో, ప్రయాణం సాగిస్తూ, దారిలో కనబడ్డ దాబా లో కూర్చుని ఉదయపు అల్పాహారాన్ని కోరుకుని తిన్నవి, ఈ కధలోని కొన్ని పాత్రలు. అది జీవితం. బహుశ మనందరి జీవితాలు అంతేనేమో!
ఇక తెలుగు కధలో ఇంగ్లిష్ వాక్యాలు, వాటిని టెంగ్లిష్ (ఇంగ్లిష్ పదాలని తెలుగు లో వ్రాయడం) మళ్ళీ అవే వాక్యాలని ఇంగ్లిష్లో (బ్రాకెట్లలో) ఇవ్వడానికి కారణం, తెలుగులో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్నవాళ్ళకి, ఇంగ్లిష్ తెలిసిన వాళ్ళకి, చదువుకోవడానికి సులువుగా ఉంటుందని.
ఈ టపా సమయానికి, నా వరకూ వఛ్హిన పాఠకుల వ్యాఖ్యలన్నింటినికి వివరణ ఇది.
భరణీ స్టూడియోస్ అధినేత పాలువాయి రామకృష్ణ దర్శకత్వంలో వెలువడిన ‘బాటసారి‘ లో నాయిక పాత్ర పోషించిన భానుమతి, రామకృష్ణగారి సతీమణి. అక్కినేని నాగేశ్వరరావు నాయకుడుగా నటించిన ఈ చిత్రానికి మూలకధ బెంగాలి నవల ‘బడదీది‘. బెంగాలి రచయిత శరత్బాబు. ఆ ‘బాటసారి’ చలనచిత్రాన్ని వెండితెర నవలగా ఆవిష్కరించి తెలుగువారికి వెండితెర నవలలను పరిచయం చేసింది అట్లూరి పిఛ్హేశ్వర రావు. త్రిపురనేని రామస్వామి కనిష్ట పుత్రిక చౌదరాణి వీరి శ్రీమతి. ఆ విధంగా బారిస్టరు, శతావధాని .’కవిరాజు’ త్రిపురనేని రామస్వామి కి అల్లుడు. అట్లూరి పిఛ్హేశ్వరరావు నాకు తండ్రి. చౌదరాణి నాకు తల్లి. నాన్న 92 ముగించుకుని 93లో అడుగు పెడుతున్న రోజు ఇది. బానుమతి పాడిన “ఓ బాటసారి…” పాట ని ఇక్కడ వినవఛ్హు.
బాటసారి – baa Tasaari
baaTasaari (బాటసారి) film novel – 153 pages was published by the makers of the movie in July 1961. It was priced 0.75 np. That would be three annas.
Tidbit
You will notice the banner mentioning the title of the movie is signed GHRao He was quite popular in those days. I personally knew him. My mother and I were keen on having the signboard for the proposed Rani Book Centre (an exclusive Telugu bookstore) written in Telugu. Our search brought him to us. He was Hanumantha Rao. In fact he did the first sign board in Telugu for Rani Book Centre in 1969. What a coincidence!
మొన్న అంటే మార్చ్ పదిహేనో తారీఖున, ఆంధ్రజ్యోతివారి ఆదివారం అనుబంధం లో, నేను తెలుగులో వ్రాసుకున్న కథని తొలిసారిగా ప్రచురించారు. దాని పేరు అదితి. మీరు అదితి చదవకపోతే ఇక్కడ చదువుకోవచ్చు.
ఆ కథ మీద పాఠకులనుండి వచ్చిన స్పందనల గురించి ఈ టపా.ఈ స్పందనలను ఇక్కడ నమోదు చెయ్యడానికి ప్రేరణ వి వి న మూర్తి గారు తమ కథ “ఒక రేపిస్టు ప్రేమలేఖ” (ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం – ఫిబ్రవరి 1,2015, ప్రచురణ) మీద ఫేస్బుక్లోని కథ సమూహంలో వారికి వచ్చిన స్పందనలని పంచుకోవడమే. అలాగని వారితో కాని మరెవ్వరితోకాని నన్ను కాని నా రచనలని కాని నేను పోల్చుకోవడం లేదు.
మరొక ముఖ్యమైన కారణం – భవిష్యత్తులో ఈ అదితి గురించి పాఠకులు నాకు చేరవేసిన తమ అభిప్రాయాలు వ్రాసుకున్న ఈ కొన్ని, నా జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. కథ చదువుకున్న తరువాత మీరు ముందుకు సాగితే బాగుంటుందని నా అభిప్రాయం. కథ చదవకుండా దానిమీద పాఠకుల స్పందన తెలుసుకున్న తరువాత కథ చదివితే మీ అభిప్రాయంలో మార్పుకి అవకాశం ఉండవచ్చు. ఉండకపోనూవచ్చు.
ఈ పాఠకుల స్పందనలకి గణాంకాలు కాని సంఖ్యాక వివరాలు కాని లేవు. జ్ఞాపకం ఉన్నంతమేరకు ఇక్కడ పంచుకుంటున్నాను. గమనించగలరు. ఫోన్లు చేసిన పాఠకుల పేర్లు నేను అడగలేదు. వారి ఏ ఊరు నుంచి చేస్తున్నారన్నది తెలుసుకోవడానికి మాత్రమే వారి ఊరి పేరు అడిగాను.
అదితి ని స్త్రీలూ పురుషులు ఇద్దరూ చదివారు. ఫోన్లు చేసారు, ఎస్ ఎమ్ ఎస్ లు పంపారు. చాట్ లో చెప్పారు.
ఫోన్లు చేసిన వారి సంఖ్యని నేను మొదట్లో లెఖ్ఖ పెట్టడానికి ప్రయత్నించాను కాని తరువాత విరమించుకున్నాను, నాకు అంత ఓపికాలేదు, ఆ ఆసక్తి లేకుండా పోయింది. ఉజ్జాయింపుగా ఒక అంచనా అయితే ఉంది.
అదితి కథ చదివిన తరువాత, నా గురించి తెలిసిన వారు, నా గురించి విన్నవారు చాలా ఆసక్తిగా అడిగిన ప్రశ్న. “ఇదేనా మీరు వ్రాసిన తొలి కథ?” అని. ముఖ్యంగా సాహిత్యకారులు. రచయితలు, కొంత మంది సంపాదకులు కూడా. ఆ ప్రశ్నని నేను అసలు ఎదురుచూడలేదు. బహుశ నన్ను నేను ఆ కోణంలోనుంచి (ఒక తెలుగు రచయితగా) చూసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ కలగలేదు. అందుకనేమో మరి!
ఇక వారి ప్రశ్నకి జవాబు;
తెలుగులో నేను వ్రాసిన కథలలో ఆఫ్లైన్లో అంటే (అచ్చు) పత్రికలలో ప్రచురణకి నోచుకున్న తొలి కథ ఇదే.
పోతే ఇందాక అనుకున్న పాఠకులలో రచయితలు, సంపాదకులూ ఉన్నారన్నాను కదా! వారందరి ఏకాభిప్రాయం: “ఇది మీ తొలికథ లాగా లేదు.”
గోక్కోవడం
“దురద” ని మెచ్చని వారు కూడా ఉన్నారు. కనీసం ముగ్గురున్నారు. ఒకరు స్వయంగా నాకు తన అభిప్రాయం తెలియజేస్తే మరొకరు ఫేస్బుక్ కథ సమూహంలో ఆ మాటలే కాకున్న అటువంటి అర్ధం వచ్చే మాటలే వాడారు. ఒకరు సందేశం పంపారు.
అదితి కథలో లంకేష్
ఒకరిద్దరు “శిల్పాన్ని ఇంకా చక్కగా engineer చేసి ఉంటే బాగుండేది,” అన్నవారున్నారు. కథని గతం – వర్తమానం మధ్య నడిపిస్తూ “మీరు కొత్తగా ఏమి చేసారు?” అని నిలదీసినవారున్నారు. అడిగిన వారికి నా అప్రకటిత (కనీసం వారి దృష్టిలో) రచనా సామర్థ్యం మీద వారికున్న నమ్మకానికి ఆశ్చర్యమేసింది.
శైలిని కూడ దాదాపు అందరూ మెచ్చుకున్నారు. భాష విషయానికి వస్తే, “మరి అంత ఇంగ్లిష్ అవసరమా?” అని అడిగినవారు కూడా ఉన్నారు. “మీరు ఎన్నుకున్న నేపధ్యానికి మీరు వాడిన బాషే సరిపోయింది,” అని మెచ్చుకున్నవారున్నారు.
దాదాపు అందరూ “…నట్లు కొట్టకుండా, ఆపకుండా చదివించింది మీ కథ,” అని చెప్పారు.
“మీ కథని తెలుగు పాఠకులు మెచ్చుకోవడం అనుమానమే,” అని అభిప్రాయాన్ని వెల్లడించిన ఇద్దరు పాఠకులు రచయితలే! వారిద్దరూ నా శ్రేయోభిలాషులే.
“మీ ఈ కథలని తెలుగు పాఠకులు అందుకోలేరండి. తొందరగా మీ కథలని కూడా నాకివ్వండి. అనువదిస్తాను,” అని అంటే ముక్కున వేలేసుకోవడం నా వంతైయ్యింది.
కాస్త చదువుకున్నవారు ( సాహిత్యం ), లోకజ్ఞానమున్నవారు కథ ముగింపుని హర్షించలేదు. సైకోసొమాటిక్ డిజార్డర్ అని మీరు చెప్పకపోయినా అది పాఠకులకి అర్ధం ఆయ్యేది అని వారు అభిప్రాయపడ్దారు. వీరందరూ పట్టణ ప్రాంతాలలో జీవిస్తున్న విద్యాధికులే! రచయితలందరూ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
కథకి పాత్ర పేరు అదితి కాకుండా మరోక మకుటం పెట్టిఉంటే బాగుండేది అన్నపాఠక, సంపాదక వర్గ, రచయితలున్నారు.
అదితి కథ అర్ధం కాలేదు అని సందేశాలు పంపినవారు ఇద్దరు.
బోర్ కొట్టిందని సందేశం పంపుతూ “ఇంకా మంచి కథలుమీరు వ్రాయలి!” అని ప్రోత్సహించిన వారు ఒకరు.
సైకోసొమాటిక్ డిజార్డర్ అనే లక్షణం నిజంగా ఉందా అని అడిగిన వారు కొందరు.
దాదాపు ఒక పదిమంది దాకా తమ కుటుంబంలోనో , స్నేహితులలోనే ఇటువంటివి చూసినవారున్నారు. వివరంగా నాతో వారి అనుభవాన్ని పంచుకున్నారు.
అదితి చదివిన తరువాత ఆ దురద లాంటి ఇతర అలవాట్లని గుర్తించిన పాఠకులు కథని విపరీతంగా మెచ్చుకున్నారు.
అదితి ఒక ప్రమాదాన్ని కూడా తెచ్చిపెట్టింది. కుటుంబ సమస్యలకి నన్ను పరిష్కారం కోరుతూ పాఠకులు ఫోను చేసారు. మరీ ముఖ్యంగా వైవాహిక జీవితంలో భార్యా భర్తల మధ్య వచ్చిన అవగాహానాలేమి. ఫోన్లు చేసిన వారందరూ స్త్రీలే!
పాత్రల పేర్లు మీద కూడా స్పందించారు. “ఆ పేర్లు ఏమిటి? అన్ని కృతకంగా ఉన్నాయి! ఆ భాష ఏంటి?” అని అన్నవారు కూడా ఉన్నారు.
ఈ టపా సమయానికి ప్రవాసాంధ్ర పాఠకులెవరి స్పందనా నాకు అందలేదు.
కథలతో పాటు రచయిత ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు ప్రచురణకర్తలకు అభిప్రాయాలు అందటం లేదట!
– ౦ –
నా పరిశీలనలోనూ, నా అధ్యయనంలో తెలిసిన రెండు ముఖ్యమైన విషయాలు చెప్తాను.
1 – స్థూలంగా 40ల లోపున్న వారికి ఈ కథ అంతగా నచ్చలేదు.
2 – 40 లు దాటిన వారందరికీ ఈ కథ చాలా బాగా నచ్చింది.
3 – ఈ నలభైలలోపు ఉన్నవారికి ఈ కథ: శోభన్ బాబు లాంటి పల్లెటూరి మొగుడు, పట్నం పెళ్లాం, కొత్త దేవత లాంటి భార్య ఇందులో కొత్తేముంది?” అని అడిగినవారు ఉన్నారు. మరో అడుగు ముందుకేసి ఇల్లాలు సినిమా కి మీ కథకి పెద్ద తేడా ఏముంది అనికూడా అడిగేసారు. 🙂
4 – లంకేష్ ఒక “చచ్చెధవ, సౌమ్య భలే పని చేసింది,” అని ఆ పాత్రని మెచ్చుకున్న స్త్రీ లు కూడా ఉన్నారు. 🙂
ఫేస్ బుక్ కథ సమూహంలో కథని పంచుకున్న సాయి పద్మ కి, సోదరుడు అట్లూరి శ్రీ కి, అబ్బిగారి రాజేంద్ర ప్రసాద్ , వ్యవస్థాపక అధ్యక్షులు రాష్త్ర కధానిలయం, నందలూరు వారికి మప్పిదాలు.ఇక ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం సంపాదక వర్గం సభ్యులకి, బొమ్మలు వేసిన అక్బర్ గారికి నా నెనర్లు.
గమనిక
ఈ కథని ఏ ఒక్క పత్రికనో దాని పాఠకులనో దృష్టిలో ఉంచుకుని వ్రాసింది కాదు. కథని వ్రాసుకున్న తరువాత ఒకే ఒకరితో పంచుకున్నాను. వారి అభిప్రాయాన్ని విన్నాను. ఆ అభిప్రాయంతో నా కథలో మార్పులు చేర్పులు చెయ్యలేదు. అది వారి అభిప్రాయంగానే తీసుకున్నాను. అంతే.
ఈ కథకి నేపధ్యం ఉందా అంటే ఉంది. ఒకటి అప్పుడెప్పుడో నేనేదో వ్రాస్తే దాన్ని చదివి ఒకానొకరు “మీరే వ్రాసారా? ఎవరైనా ఎడిట్ చేసారా?” అని అడిగితే ఆ ప్రశ్నకి కోపంవచ్చింది. అంతేకాదు మరొక distant cousin కూడా ఎక్కడో “…వ్రాసేవాళ్ళెవరూ లేరు నేను తప్ప,” అని అంటే అది గుచ్చుకుంది. అప్పుడు వ్రాసుకున్న కథలలో ఇది ఒకటి. అందుకోసమే వ్రాసిన దాన్ని ప్రచురణకి పంపాను. నాకు కోపం తెప్పించిన వారిద్దరికి కూడ మప్పిదాలు. 🙂 రెండు నా దృష్టికి వచ్చిన కొన్ని అనుభవాలని ఏర్చి కూర్చి ఒక కథగా మలిచాను. ఆ అనుభవాలు కూదా దాదాపుగా మూడు దశాబ్దాలమేరా విస్తరించిన అనుభవాల సమాహారం.