ఈ కథలు… చదవటమొక అవసరం

Atluri Pitcheswara Rao kathalu - title page

ఈ కథలు.. చదవటమొక అవసరం

నరేష్‌కుమార్ సూఫీ
నరేష్‌కుమార్ సూఫీ

విస్తృత పథికుడు, నిత్య చదువరి

Atluri Pitcheswara Rao kathalu - title page
అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు - సంపుటి - ముఖచిత్రం
Share on facebook
Share on twitter
Share on whatsapp
Share on telegram

కాస్త సిగ్గేసింది… మూడుదశాబ్దాల జీవితంలో చాలా చదివా అనే గర్వం లాంటిది ఏ మూలనైనా ఉంటే అది సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది. అట్లూరి పిచ్చేశ్వరరావు అనే పేరు కేవలం అనువాద రచయితగా మాత్రమే తెలుసు నాకు. అదీ… కిషన్ చందర్ రచనలవరకే…అయితే…! ఇదిగో ఈ పుస్తకం చూశాక ఈ కథలు చదివాక, ఒకానొక ఉద్విగ్న, దుఃఖ సమయాలని అనుభవించాక.. మా తరంమీద జాలేసింది. కొత్త కొత్త పుస్తకాలని తెస్తున్నాం, చూస్తున్నాం ఆధునిక సాహిత్యాన్ని మళ్లీ వెలుగులతో చూస్తున్నాం. కానీ, ఒకానొక కాలపు వెతలని ఇంత హృద్యంగా మళ్లీ చదవటం ఒక అనుభవం. భాష, కథనం రెండూ కలిసిన ఒక ఫ్లో… అద్భుతం కదా ఈ అనుభవం.

ఈ కథల్ని ఇప్పటికైనా చదవగలిగాను.. చదువుతూ గుండె చప్పుడు పైకే విన్నాను, కంటినుంచి అప్రయత్నంగా వచ్చిన కన్నీటి చుక్కని తుడుచుకుంటూ పుస్తకాన్ని చేతిలో ఆప్యాయంగా పట్టుకున్నాను… అట్లూరి పిచ్చేశ్వరరావుని అభిమానించుకున్నాను…

నెత్తురు కథలో… ఒక కాలాన్ని, ఒక పోరాటాన్ని అనుభవిస్తూనే ఆనాటి కాలాన్ని దర్శించుకున్నాను. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాంశాలని. పోరాట జీవితకాలాలని ఇంత హృద్యంగా టచ్ చేయటం, దాన్ని ఇంత అందంగా రాయటం. ఎలా పట్టుబడుతుందీ కళ!? “ఆ.. అదే ఎర్రజండా. సుత్తీలేదు,కొడవలీ లేదు. నిజమే! ఆ రంగు గూడానూ.. రంగేసిన గుడ్డ కాదది. నెత్తురుపులుముకున్న గుడ్డ. నీలా నాలా బతికిన మనిషి నెత్తురు…” (నెత్తురు కథ) పాఠకుడా! ఎట్లా భరించగలవీ వలపోతని? నిజంగా రాయటానికి ముందు ఆ రచయిత మామూలు మనిషిగా ఎలా భరించాడీ వ్యధని?? కథ సమకాలీన పరిస్థితులకి కూడా అచ్చంగా సరిపోయేదే మన దేశపు ముఖ చిత్రమైన నెత్తుటి బతుకు చిత్రణ ఈ కథ.

“చిరంజీవి చనిపోలేదు. అట్లా చూస్తావేం! వీళ్లంతా చిరంజీవులు కాదూ! ఆ (తిరగబడే) జనమంతా చిరంజీవులే!!” అంటున్నాడు డాక్టరు. ఎస్.బీ.ఏ. చేతిలోంచి తుపాకీ లాక్కున్నాను నేను… ఇక్కడితో “చిరంజీవి” కథ ముగుస్తుంది. కానీ ఆ చిరంజీవి ఇచ్చిన ఆలోచన మనలోనూ మొలకెత్తిపోయి ఉంటుంది. ఆ ఫీల్ నుంచి బయటకు రావడం అంత ఈజీ కాదు. అది ముద్ర రచయిత వేసిన ముద్ర.

“తెలివిగల నాలుక పనిచేయదోయ్ పిచ్చి! నవ్వే మొఖం పని చేస్తుంది” అంటుంది విన్నీ. (గడవని నిన్న) ఎన్నెన్ని ముఖాల, మరెన్ని మనుషుల్ని చూసిన అనుభవం ఇది. ముఖ్యంగా ఆ కథల్లో కనిపించే వాతావరణం. అచ్చంగా మనం ఆ పరిసరాలని ఊహించుకుంటూ చదవగలిగేంత స్పష్టంగా ఉంటుంది. అసలు దాదాపుగా వందేళ్ల కిందట రాసిన కథ… ఇప్పుడు ఈ కాలాన బతుకుతున్న కుర్రాడికి కూడా అదే అనుభవం ఇవ్వటం… వ్యవస్థ వైఫల్యమా? రచయిత భవిష్యద్దర్శనమా?? (ఆగస్టు 15న) ఒక ఆలోచన, అబ్స్ట్రాక్ట్ చిత్రణ. ఎన్నెన్ని ఆలోచనలకు మొలకలు వేసిన కథ ఇది. “నేటినుండీ నేను స్వతంత్రున్నట. ఔను! కాదనేందుకు నాకు స్వాతంత్రం లేదు.” ఎప్పటికాలపు వ్యాఖ్య ఇది!!? నిన్నా మొన్నా కూడా ఇదే వినపడిందే…!!!

నిజానికి తెలుగులో కథలో చాలా మార్పు వచ్చింది. కానీ ఇప్పుడు కూడా అద్భుతం అనిపించే థాట్, కొత్త రకపు ప్రజంటేషన్ మనల్ని చకితుల్ని చేస్తుంది. “వసుంధర” కథ రాసిన తీరు. ఇలాంటి ఫార్మాట్ లో కథ రాయొచ్చనే ఆలోచనే ఒక తిరుగుబాటు. స్టిల్ ఎ ఫ్రెష్ ఫీల్ ఇన్ ఇట్. అంత వైవిధ్యంలోనూ…. చెప్పాలనుకున్న విషయం సూటిగా పాఠకుడి మెదడుకు చేరుతూనే ఉంటుంది. చదవడంలో ఏమాత్రం అడ్డంకి ఉండదు. ఖచ్చితంగా ఇవి ఈనాటి కొత్త రచయితలకు అందాల్సిన కథలు, రాబోయే తెలుగు పాఠకులకు చేరాల్సిన విషయాలు. బహుశా ఇలాంటి శైలిలో తెలుగు కథ నావరకూ నేను గమనించింది “త్రిపుర”లో. పిచ్చేశ్వరరావుని అందుకోవటంలో కాస్త ఆలస్యమే జరిగింది. ఆనాటి కాలానికి ఇంత రాజకీయ చైతన్యంతో కూడిన రచనలు చాలా వచ్చి ఉండవచ్చును కానీ కచ్చితంగా ఇలాంటి ఫ్రేమింగ్ మాత్రం లేదు. ఇది పారడాక్స్ అనొచ్చునో లేదో కానీ ఒక విధపు “క్లిష్టమైన సరళత” కనిపించింది.

మంటో కథల్లో కనిపించే హృద్యమైన చిత్రణ, తగలి శివశంకరన్ పిళ్ళై తరహా సూటిదనం… పిచ్చేశ్వరరావులో కనిపించాక నిజ్జంగా మొదటిగా చెప్పుకున్నట్టు సిగ్గుగానే అనిపించింది. వేరు వేరు భాషల కథలని, కథకులని తెలుసుకున్న నేనూ… ఈయనని ఇంత ఆలస్యంగానా తెలుసుకోవటం?? నేవీ నేపథ్యంలో ఉన్న కథలు… ఆ కథల్లో కనిపించే వాతావరణం, కొత్త కొత్త పదాలు, ఆనాటి వస్తువులు… ఆఖరికి వారి వస్త్రధారణ కూడా మనకు కనిపిస్తుంది. ఇక ఆ పాత్రల ప్రవర్తన మనలో కూడా కొన్నిసార్లు ప్రవేశిస్తుంది. ఇది ఒక సినిమాకి పనికి వచ్చే స్టైల్, ప్రతీ కథని అలాగే నేరుగా స్క్రిప్టు కింద తీసుకోవచ్చు. అంత చక్కటి స్క్రీన్ ప్లే తరహా కథనం కనిపిస్తుంది.

శాస్త్రి కథ ఒకసారి చదివాక జీవితంలో మర్చిపోగలమా? అలాగని అందులో ఏముంది?? నరాల్ని పొంగించే ఇతివృత్తంకాదు, మరీ హత్తుకునే విషయమూ లేదు.. కానీ, ఆ సున్నితమైన వ్యంగ్యంతో కూడిన రచనా శైలి, ఆ స్మూత్ సర్కాజం. అవునూ..!ఈ శాస్త్రి కథ రాసినాయనేనా ఆ “నెత్తురు కథ”రాసిందీ!!??
“ఇదుగో, నిన్నే, ఎవరో చూడు. అడుక్కుతినేవాళ్ళు లాగుంది.” (అన్నాడు కవి)
“మనకంటేనా” అంటూ నడవాలోకెళ్లింది.(కవిగారి భార్య). అచ్చంగా కాదుగానీ ఇలాంటి కవి/రచయిత కథతో ఈమధ్యే టాలీవుడ్లో ఒక సినిమా కూడా వచ్చింది. రాయలేని తనాన్ని “కొత్తదనం అని, పాఠకులు తనంత ఎదగలేదని” కవర్ చేసుకునే రచయితలు ఉంటారుంటారు.. అప్పుడూ ఇప్పుడూనూ…

నన్ను అమితంగా ఆకట్టుకున్న కథ “విముక్తి” ఎన్నెన్ని తెలంగాణా పల్లెల జీవితాల చిత్రణ ఇది. ఆనాటి కాలపు పెను మార్పును డాక్యుమెంటేషన్ చేస్తూనే.. ఒక గుండెను పట్టుకునే ముగింపుతో మనసులోకి కథ ఇంకిపోతుంది. “సంఘానికీ జై” అన్న సుబ్బమ్మతో పాటుగా మనసులో జై… జై… అని అరవాలనిపిస్తుంది.

“అమ్మా ఆ పరుపుల పెట్టెలో మనం ఎందుకు ఎక్కలేదు?” అంటూ మొదలైన పసివాడి ప్రశ్నలు నిజంగా మనం ఎంతమందిమి వేసుకున్నాం? (కథకుడు) పిల్లలు.. అల్లరి చేసే పిల్లలు.. అమాయకప్పిల్లలు.. ఎన్ని ప్రశ్నలేస్తారు.. ఎంత ఆలోచనని తెప్పిస్తారు.. ఇవే ప్రశ్నలు మనం ఎందుకని ఎవర్నీ అడగటం లేదు? ప్రశ్నించటం మర్చిపోయామా?? ఇన్ని ప్రశ్నలని లేవనెత్తిన కథ “కథకుడు” ఆ పెట్టెలో ఎక్కితే డబ్బులు ఎక్కువ ఖర్చు కదా మరి వాళ్లేందుకు ఆపెట్టెలో ఎక్కారు? మనమెందుకు ఇంకా ఈ పెట్టెలో ఎక్కుతున్నాం అణా ప్రశ్న ఎంతటి తిరుగుబాటుని నిద్రలేపగలదూ… Leopoled Staff “మూడూళ్ళు” కవితలో అన్నట్టు.. “ప్రశ్నలడగని వాడు ఎంత దరిద్రుడైఉండాలి” అనే వాక్యం గుర్తొచ్చింది.

మొత్తంగా అట్లూరి పిచ్చేశ్వరరావు రాసిన ఈ కథలు ఇప్పుడు మళ్లీ చదవటం ఒక అవసరం. పాఠకుడికే కాదు… కొత్తగా రాస్తున్న రచయితలకు చాలా చాలా అవసరం. ఆనాటి తనాన్నే అందుకోలేక పోయిన వాళ్ళు ఇప్పుడు ఇంకా ఏమి కొత్తదనాన్ని వెతుకుతారు?

అద్భుతమైన అనుభవాన్నిచ్చిన కథలు… ఈ రకంగా నాకు అందటం చాలా హ్యాపీ.
ఎంతో నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను.
With ❤️ సూఫీ
27 Dec 2021 11.06pm

అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు
పుస్తకం ధర: 250.00 రూపాయలు
పుటలు :      280
బరువు :       220 గ్రాములు
ఈ పుస్తకానికి Sole Distributors:
Navodaya Book House, Opp: Metro Pillar 14, Kachiguda Cross Roads, Hyderabad 500 027,
Mobile: +91 – 90004 13413
వీరిదే ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌లో ఇక్కడ కూడా తీసుకోవచ్చు.

మీకు అమెజాన్‌లో కావాలనుకుంటే Analpa Books ద్వారా ఇక్కడ తీసుకోవచ్చు:

పుస్తకం లోగిలిలోకూడా లభ్యం:
Logili Book House, Guntur – 522007
Mobile:  +91 95501 46514
వారి ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌లో ఇక్కడ తీసుకోవచ్చు:
https://bit.ly/APRonLogili

విజయవాడ పుస్తకాల పండుగ
(Vijayawasda Book Festival) లో
జనవరి 1 వ తారీఖు నుంచి 11 వరకు
ఈ క్రింది స్టాల్స్ లో
అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు
అందుబాటులో వుంటాయి.

నవచేతన బుక్ హౌస్:       8 -10
పల్లవి పబ్లికేేషన్స్:          25 – 27
సాహితీ మిత్రులు:          29 – 31
శ్రీ హర్ష పబ్లికేషన్స్:         70  – 71
నవసాహితీ బుక్ హౌస్:  117 – 118
విశాలాంధ్ర బుక్ హౌస్:   160-166

Share on facebook
Share on twitter
Share on whatsapp
Share on telegram

మనసుంటే మార్గముంటుంది!

eenaaDu, vipula, chatura etc


1908, సెప్టెంబరు 9 బుధవారం. వినాయక చవితి పండగ రోజు. ముంబై లో ఆ రోజున ఆంధ్రపత్రిక – వారపత్రిక గా మొదలైంది. వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరావు పంతులు.  ముంబై నుండి 1914 లో మద్రాసు – ప్రస్తుతం చెన్నై కి వెళ్లింది ఆంధ్రపత్రిక. ఇసబెల్లా హాస్పిటల్, లజ్ కార్నర్ కి మధ్యలో నాగేశ్వరరావు పార్క్ వుంది. దానిని ఆనుకునే అమృతాంజన్ (ఆయుర్వేదం తైలం) నొప్పికి వాడే మందు కర్మాగారం కూడా అ పక్కనే వుండేది. (నాన్నతో కొన్ని సాయంత్రాలు ఆ పార్క్ లో గడిపాను నేను.) మద్రాసులో ఆ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుండి ఆ దినపత్రికతో బాటు ‘అంధ్ర పత్రిక’ వారపత్రిక కూడ వెలువడడం మొదలైంది.  దాదాపు దశాబ్దం తరువాత అంటే జవరి 1924 లో ‘భారతి‘ మాసపత్రిక వెలువరించారు నాగేశ్వరావు పంతులు గారు.

భారతియందు భాష, వాజ్మయము, శాస్త్రములు, కళలు మొదలగు విషయములు సాదరభావముతోఁ జర్చించుటకవకాశములు గల్పించబడును. వాజ్మయ నిర్మాణమునకిపుడు జరుగుచున్న ప్రయత్నములు పరిస్ఫుటము చేయబడును. శిల్పమునకు చిత్రలేఖనమునకు శాసనములకు సంబంధించిన విషయములు చిత్రములతోఁ బ్రచురింపఁ బడును.” అని భారతి సంపాదకులు చెప్పుకున్నారు.

పంతులు గారి మనవడు శివలెంక రాధకృష్ణ గారి హయాంలో ‘భారతి’ ని నిలిపి వేయాల్సి వచ్చింది. కారణం ‘ఆర్ధిక భారం.’ (ఆ రోజుల్లో మద్రాసులో రాణీ బుక్ సెంటర్ మాత్రమే క్రమం తప్పకుండా భారతి ని పాఠకులకి అందించేది. ప్రత్యేక సంచికలను ఒక పదో/పాతిక మందో నెల ముందే ‘బుక్’ చేసుకునేవారు.) కాని ‘భారతి’ ప్రచురణ ఆపడానికి కుదరదు. ఎందుకని? పంతులు గారు ‘అంధ్రపత్రిక’ దినపత్రిక వెలువడినంతకాలం ‘భారతి’ వెలువడాల్సిందే’ అని ఒక నిబంధనని పెట్టారు. మరేం చెయ్యాలి అని యాజమాన్యం ఆలోచించింది. ‘టాబ్లాయిడ్‘ గా వెలువరించాలని నిర్ణయించారు. అలా ‘ఆంధ్రపత్రిక’ దిన పత్రిక లో ఒక ‘బ్రాడ్ షీట్’ ని ‘భారతి’ అని మకుటం పెట్టి ‘టెక్నికల్’ గా ఆపకుండా దానిని నెలకొక సారి ప్రచురించారు. తరువాతి రోజుల్లో మళ్ళీ పుస్తక రూపంలో తెచ్చారు. కానీ ఆంధ్రప్రదేశానికి తరలివచ్చిన తరువాత మొత్తం ‘ఆంధ్రపత్రిక’ మూత పడిపోయింది. దిన పత్రిక, వార పత్రిక, భారతి అన్ని మూత పడ్డాయి.

eenaaDu, vipula, chatura etc
ఆంధ్రపత్రిక, భారతి, ఈనాడు ప్రకటన

ఇటీవలి కాలంలో ‘ఆంధ్రజ్యోతి‘ ఆదివారం ‘సండే’ కి కూడా గ్రహణం పట్టింది. అప్పట్లో పిన్నింగు అని, బైడింగు అని రవాణా సరఫరాలో ఇబ్బందులున్నవని చెప్పి ఆంధ్రజ్యోతి ‘ఆదివారం’ ని దినపత్రికలో టాబ్లాయిడ్ కి మార్చేసారు. ఏది ఏమైనా చివరకి అది మళ్ళీ తన పాత రూపులో వెలువడ్డం సంతోషం. ఈ #కరోనా #కోవిడ్19 గడ్డు కాలంలో కూడా పుటలు తగ్గించినా జాల పత్రికగా దాన్ని వెలువరించింనందుకు #ఆంధ్రజ్యోతి సంపాదకవర్గానికి, యాజమాన్యానికి సాహితీప్రియులు ధన్యవాదాలు చెప్పుకోవాలి. గత కొద్ది వారాలుగా అచ్చులో కూడా ‘ఆదివారం’ ఆంధ్రజ్యోతి అందుబాటులోకొచ్చింది. అందుకు కూడా మనం ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు తెలియజెయ్యాలి.

కొన్ని నెలల క్రితమే ‘సాక్షి‘ దినపత్రిక కూడా ‘సాహిత్యం‘ పేజిని ‘ఫన్ డే‘ లో కి పంపింది. ఆ ‘సాహిత్యం’ పేజి ‘డ్రాప్’ అయినప్పుడల్లా వచ్చే వారం వుంటుందా, వూడుతుందా అని ఎదురుచూసేవాళ్లు పాఠకులు. వాళ్లని నిరాశపరచడమెందుకని ‘పర్మనెంటు డ్రాప్’ అనుకుని, వద్దులే అని దయతో ‘ఫన్ డే’ లో ఒక పేజి ఇచ్చారు. గుడ్డిలో మెల్ల అది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి.  ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రతి సోమవారం ‘వివిధ‘ లో సాహిత్యానికి ప్రాముఖ్యత ఇచ్చి అందజేస్తోంది.  ఇంకా కొన్ని తెలుగు దిన పత్రికలు కూడా ఆదివారం మాగజైన్ సంచికలు వెలువరుస్తున్నవి. ఉదాః విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవతెలంగాణ, వార్త, సూర్య, దర్వాజ, నమస్తే తెలంగాణా ఇత్యాదులు.

మనకి జాలపత్రికలు కూడా తక్కువేమి కాదు. ‘సాహిత్యసేవ’ కోసం సాహితీ ప్రియులు వెలువరిస్తున్నవారున్నారు. ఈమాట (1998 అక్టోబరులో ప్రారంభం), సారంగ (దాదాపు దశాబ్దం క్రితం), కౌముది (2007), సంచిక, నెచ్చెలి, వగైరాలు. ఇవన్ని కూడా ఆయా నిర్వాహకులు ఎటువంటి ఆర్ధికమైన లాభాపేక్ష లేకుండా ప్రచురిస్తున్నారు. ప్రకటనలు సైతం వుండవు వీటిల్లో. సభ్యత్వం / చందా రుసుములు కూడా లేవు.

ఈ అంతర్జ్వాల పత్రికలని వ్యక్తులు నిర్వహిస్తుండగా, ఈనాడు / వసుంధర / రామోజి ఫౌండేషన్ ఆ నాలుగు పత్రికలు; విపుల, చతుర, తెలుగు వెలుగు, బాలభారతం ని కనీసం జాల పత్రికల రూపాన్నైనా వెలువరించలేకపోవడం అన్నది నమ్మశక్యంగా లేదు. విపుల, చతుర లు 1978లో మొదలైనవి. దాదాపు నలభై మూడేళ్ళ క్రిత్రం. అలాగే ‘భాషకు, సాహిత్యాని సేవ చేసేందుకు ప్రత్యేక వేదిక ఉండాలన్న ఉద్దేశంతో 2012 సెప్టెంబరు’ లో తెలుగు వెలుగు పాఠకులకి అందించారు. నా వరకు నేను ఇది తెలుగు వారికి మరో ‘భారతి’ గా వుంటుందని ఆశించాను. అలాగే జరిగింది మూతపడటం విషయంలో. ‘ఇన్నాళ్ళుగా సేవాదృక్పథంతో సాగిస్తూ వచ్చిన ఈ నాలుగు పత్రికలను’ ఈమ్యాగజైన్స్ రూపంలో ఈనాడు నెట్ లో అందుబాటులో ఉంచా‘ రు. కానీ ఈ ఏప్రిల్ నుండి నిలిపివేయడం అన్నది ‘సాహిత్యాభిమానులకు’ జీర్ణం కావడం కష్టం. ఈనాడు లాంటి వ్యవస్థ, మానవవనరులున్న సంస్థ ఈ నాలుగు పత్రికల నిర్వాహణ భారాన్ని మోయలేకపోతుండంటే ఆశ్చర్యంగా కూడా ఉంది. నిజమే #కోవిడ్19 లాంటి అనూహ్యమైన ఆపద మానవజీవితాన్ని అతలా కుతలం చేసింది కానీ ఈ రోజున మనకి కోవిడ్ టీకా అందుబాటులోకి వచ్చింది. వ్యాపారంలో ఒడిదుడుకులుంటాయి. వాటిని అధిగమించడం ఈనాడు లాంటి సంస్థలకు కష్టమేమి కాదు. ఈనాడు కంటే చిన్నవి మనగలుగుతున్న సందర్భంలో ‘మన అమ్మభాష పరిపుష్టత కోసం ఈనాడు, ఈటీవీ, ఈ టీవీ భారత్ లు నిరంతరం కృషిచేస్తునే ఉంటాయని’ మేనేజింగ్ ట్రస్టీ – రామోజీ ఫౌండేషన్ చెప్పినా …తెలుగు సాహితీ చరిత్రలో ఈ పత్రికలు ఆపేయ్యడం విషాదమే. ఇన్నాళ్లుగా ఆయా పత్రికలకి రచనలు పంపుతున్న రచయితలు కూడా నిరుత్సాహానికి లోనయ్యారు ఈ వార్త తెలుసుకుని. పాఠకుల ఆదరణ తగ్గింది అన్నప్పుడు బహుశ రచయితలు కూడా తమ చేస్తున్న రచనల గురించి పునరాలోచించుకోవల్సిన సందర్భం అనిపిస్తుంది. మనసుంటే మార్గముంటుంది! కనీసం జాలపత్రికల రూపంలో ఐనా ఈ నాలుగు పత్రికలని బ్రతికించమని రామోజీ ఫౌండేషన్ ని కోరడమే ఒక సాహిత్యాభిమానిగా నేను చెయ్యగలిగింది!

▓► ఆంధ్రపత్రికకి సంబంధించిన వివరాలకి మూలం తెలుగు వికి. – te.wikipedia.org/

బాలాంత్రపు – గోపీచంద్

Balantrapu Rajanikanta Rao

ఈ బాలాంత్రపు గోపీచంద్ ఎవరు?  
బాలాంత్రపు రజనీకాంతరావు గారంటే తెలుగువారిని తన లలిత సంగీతంతో అలరించినవాడు.  గేయకర్త.  స్వరకర్త.  ఇన్ని మాటలెందుకు, బహుముఖ ప్రజ్ఞాశాలి.  

Tripuareneni Gopichand
(8 September 1910 – 2 November 1962)

గోపీచంద్ అంటే సినిమాల్లో హీరో వేశాలేస్తుంటాడు. అతనేగా?  కాదు.  మరి?
ఈయన ఇంటిపేరు త్రిపురనేని.   కవి, సంఘసంస్కర్త, హేతువాది ‘కవిరాజు‘ బిరుదాంకితుడు, బార్-ఎట్‌-లా చదివినవాడు, త్రిపురనేని రామస్వామి కుమారుడు, ఈ త్రిపురనేని గోపీచంద్
తెలుగువారికి తొలి మనోవైజ్ఞానిక నవల అసమర్ధుని జీవయాత్ర  ని అందించి తెలుగు సాహిత్య చరిత్రలో అజరామరంగా నిలిచిపోయినవాడు.  చలన చిత్ర దర్శకుడు.  కొన్నింటికి కధలు కూడా అందించిన వాడు.  

మరి ఈ బాలంత్రపు వారికి, ఈ గోపిచంద్ కి ఏమిటి సంబంధం?  చలనచిత్రాలలో సంగీతం ఉంటుందిగా!  మరీ ముఖ్యంగా మన భారతీయ చలన చిత్రాలలో నృత్యాలు కూడా ఉంటాయికదా!  అలా…గోపీచంద్ కి బాలాంత్రపు వారికి సంబంధం ఉంది.  వారిద్దరు మిత్రులు.  గోపీచంద్ సినిమాలలో పాటలకి స్వరకర్త, బాలాంత్రపు.  

Balantrapu Rajanikanta Rao
బాలాంత్రపు రజనీకాంతరావు

 

వారిద్దరిమధ్య జరిగిన ఒక హాస్య సంఘటనే ఈ బ్లాగ్ పోస్ట్ కి నేపధ్యం.  బాలంత్రపు రజనీకాంతరావు గారి కుమారుడు హేమచంద్ర నాకు మంచి మిత్రుడు.  ఆ మధ్యేప్పుడో, ఫేస్ బుక్ లో తన తండ్రిగారికి, గోపీచంద్ కి మధ్య జరిగిన ఒక సున్నితమైన హాస్య సంఘటన గురించి తెలియజేసాడు.   రజనీకాంతరావు గారు మద్రాసులో మా అమ్మ స్థాపించి నిర్వహించిన రాణీ బుక్ సెంటర్ కి వచ్చిన గుర్తు నాకుంది.  ఆయనికి  గోపీచంద్ కి ఉన్న సాన్నిహిత్యం తెలిసి ఉండటం వల్ల వారివురి మధ్య జరిగిన ఆ హాస్య సంఘటనని తెలుగువారి సాంస్కృతక చరిత్రలో పొందుపరిస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను.  


Hemachandra Balantrapu
బాలాంత్రపు హేమచంద్ర

 సాక్షి దిన పత్రికలో  ప్రతి సోమవారం సాహిత్యానికంటూ ఒక పుటని కేటాయిస్తుంది.  అందులో మరమరాలు  మకుటంతో, సంగీత, సాహిత్యమనే కాకుండా ఇతర కళకారుల జీవితాలలోని ఆసక్తికరమైన సంఘటనలని ప్రచురించడం తెలుసు.  మొన్న గురువారం అంటే మే 8 న, హేమచంద్రతో కొన్ని చిన్న చిన్న సందేహాలుంటే తీర్చుకుని, ఈ కధనం ప్రచురించడానికి (వీలుంటే ఏదేని పత్రికలో) అనుమతి తీసుకుని, రాసి, శుక్రవారం మే 9న, సాక్షి దినపత్రిక కి పంపాను.  వాళ్ళు కూడా ప్రచురిస్తామని తెలియజేసారు. 



సాక్షి పత్రికకి పంపిన కధనానికి  నేను  కాలక్షేపం – బఠాణీలు అని పేరు పెట్టాను.  దానికి ఒక కారణం ఉంది.  దాసు వామనరావు గారనే హాస్య రచయిత ఒకాయన ఉండేవారు.  ఆయన ఆ రోజుల్లో ఒక కాలం రాసేవారు. దానిపేరు ‘కాలక్షేపం‘ అన్నట్టు గుర్తు. ఆయన్ని నేను గుర్తు  చేసుకున్నట్టూ ఉంటుందని ఆ పేరుతో  పంపాను.  (ప్రస్తుతం మద్రాసు, టీ. నగర్ లో దండపాణి వీధిలో ఉంటున్న ష్రైన్ వేలాంగణ్ణి సీనియర్ సెకండరీ స్కూల్, ఆ రోజుల్లో వామనరావు గారిదే!  )అంతే కాదు, హేమచంద్ర జ్ఞాపకాన్ని, నా మాటల్లో చెప్పానని కూడా సాక్షి వారికి తెలియజేసాను.  కాని ఏం లాభం!  రాసిన వారికే బైలైన్ క్రెడిట్ ఇవ్వటం వారి సాంప్రదాయమనుకుంటాను, అలానే చేసారు. 

ఇక కధలోకి వెళ్దాం!

రచయిత త్రిపురనేని గోపీచంద్ ‌– చదువుకున్న అమ్మాయిలు, ధర్మదేవత, ప్రియురాలు చిత్రాలకు కథ, మాటలు అందించారు; పేరంటాలు, లక్షమ్మ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. గాయకుడు, స్వరకర్త అయిన బాలాంత్రపు రజనీకాంతరావు, గోపీచంద్‌ మంచి స్నేహితులు. మద్రాసులో ఒకరోజు వీళ్ళిద్దరు కలిసి కారులో ప్రయాణం చేస్తున్నారు. గోపీచంద్‌ తీయబోతున్న చిత్రానికి బాలాంత్రపు గేయ రచన, సంగీత దర్శకత్వం వహించబోతున్నారు. ఒకానొక ఘట్టంలో కావల్సిన పాటకి కావాల్సిన మాటల కోసం ఆలోచనలో పడ్డారు గోపీచంద్‌. ఆ పాటకి సంగీతం గురించి ఆలోచిస్తున్న రజనీకి కాలుమీద దురద పుట్టి, పరధ్యానంగా గోక్కోవడం మొదలుపెట్టిన కాసేపటికి గాభరా పడుతూ, ‘‘నా కాలు స్పర్శ కోల్పోయింది. నేను గోక్కుంటుంటే తెలీటం లేదు. అర్జంటుగా డాక్టరు దగ్గరకి వెళ్ళి చూపించుకోవాలి’’ అన్నారు. తలతిప్పి ఆయన వంక చూసిన గోపీచంద్, ‘‘డాక్టరు, గీక్టరు అక్కర్లేదు. ఇందాకటి నుంచి మీరు గోక్కుంటున్నది మీ కాలు కాదు, నా కాలు’’ అన్నారు. దాంతో అసలు విషయం అర్థమై ఇద్దరు మిత్రులు పగలబడి నవ్వుకున్నారు.
అనిల్‌ అట్లూరి

సాక్షి సాహిత్యం పేజికి లంకె ఇక్కడ
ఇక ఆ సాహిత్యం పేజిలో కధనం జెపెగ్ ఈ దిగువునః

Sakshi LIterature page Gopichand and Balantrapu by Hemachandra and Anil Atluri
బాలాంత్రపు – గోపిచంద్ హాస్యం

ఎంజాయ్ చేసారా?  చి న

దెయ్యాల వంతెన

Devils' bridge

వేణువు ఊదుకుంటున్న గోపాలుడికి ఆ సాయంత్రం పొద్దెక్కడం కొంచెం ఆలస్యంగా తెలిసింది. హడావుడి పడుతూ తన మేకలని కాలువ వైపుకి తోలాడు. ఊళ్ళో వాళ్ళెవరూ ఆ కాలువ, ఆ వంతెన వైపుకి చీకటి పడే సమయానికి రారు. భయం. ఎప్పుడో చెక్కతో కట్టిన వంతెన అది. ఇప్పుడో, అప్పుడో పడిపోయెటట్టుంది ఆ వంతెన. ఆ వంతెన ఇవతల గట్టుకి ఆనుకుని ఒక పెద్ద మఱ్ఱిచెట్టుంది. దాని మీద దెయ్యాలున్నాయిని ఆ ప్రాంతం ప్రజల నమ్మకం. చీకటి పడిన తరువాత ఆ వంతెన మీదుగా ఆ కాలువని దాటి ఏ ప్రాణి అయినా ఆ మఱ్ఱిచెట్టు కిందగా వెళ్తే దాని మీదున్న దయ్యాలు చంపేసి, రక్తం తాగి, శవాన్ని ఆ కాలువలో పడేస్తాయన్న కధని తరతరాలుగా ఆ ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటు ఉంటారు.

కాని గోపాలుడు మేకలని తొందరగా ఇంటికి చేర్చాలనే ఆలోచనలో ఉండి, ఆ మఱ్ఱిచెట్టు కిందుగా వెళ్ళి, ఆ కాలువ వంతెన మీదుగా దాటిస్తున్నాడు. అప్పటికే చీకటి పడిపోయింది. మఱ్ఱిచెట్టు భయంకరమైన దయ్యంలాగా కనబడుతోంది. గాలి విసురుగా తగుల్తోంది. మేకలన్ని పరిగెడుతున్నాయి. ఆఖరు మేక వంతెన దాటి గట్టు మీదకి చేరింది. దాని వెనకే గోపాలుడు కుడి కాలు మోపాడు. ఎడం కాలు ముందుకు తీసుకుని అడుగు వేస్తున్నాడు… వేసేశాడు. ఇప్పుడు కాలువకి ఇవతలి గట్టు మీదున్నాడు. పేద్ద శబ్దం చేస్తూ వంతెన ముక్కలు, ముక్కలుగా విరిగిపోయి, ఆ కాలువలోకి భళ్ళున పడిపోయింది. భయంతో మేకలన్నీ ఇంటి వైపు పరుగెట్టడం మొదలు బెట్టినవి. పరుగో, పరుగు, ఒకటే పరుగు. ఆగితే దయ్యాలు తమని కూడా పట్టుకుంటాయని భయం.

సరిగ్గా అప్పుడే గోపాలుడికి భయంతో ఏడుస్తున్న మేక పిల్ల అరుపు వినిపించింది. గబుక్కున వెనక్కి తిరిగి చూశాడు గోపాలుడు. ఆ కమ్ముకుంటున్న చీకట్లో అవతలి గట్టు మీద కనపడింది మేక పిల్ల. అది ‘మే… మే” అని భయంతో ఏడుస్తోంది. ఎర్రటి కళ్లతో దాని పీకని పట్టుకుని కనపడింది దయ్యం. చూడటానికే భయంకరంగా ఉంది ఆ దయ్యం.

“దాన్ని వదిలేయి, దయ్యమా. నువ్వేది అడిగితే అది ఇస్తాను, ” అని గోపాలుడు ఆ దయ్యాన్ని అడిగాడు. ఇవ్వను అన్నట్టుగా తలని అడ్డంగా అటూ, ఇటూ తిప్పింది దయ్యం.

గోపాలుడు మోకాళ్ళ మీద మోకరిల్లి, రెండు చేతులు కలిపి దణ్ణం పెడుతూ, “దయ్యం, దయ్యం దయచేసి నా మేకపిల్లని వదిలెయ్యవా?” అని మళ్ళీ అడిగాడు.

అప్పుడు దయ్యం, “సరే, వదిలేస్తాను. మరీ ఈ మేకపిల్ల నీ దగ్గిరకు ఎలా వస్తుంది?” అని అడిగింది.

గోపాలుడుకి ఏమి సమాధానం చెప్పాలో తెలియక బిక్క మొహం వేసాడు. అప్పుడు దయ్యం “నువ్వు ఒప్పుకుంటే ఒక షరతు మీద ఈ మేక పిల్లని వదిలేస్తాను,” అని అంది.

“ఏమిటా షరతు?” అని అడిగాడు గోపాలుడు.

“నువ్వు రేపు వచ్చేటప్పటికి ఇక్కడ ఒక సరికొత్త వంతెన ఏర్పాటు చేస్తాను. కానీ…”.

“ఊ…కానీ..నేను ఏం చెయ్యాలో చెప్పు,” అని ఆదుర్దాగా అడిగాడు గోపాలుడు.

“ఆ వంతెన మీదుగా దాటి వచ్చిన మొదటి ప్రాణిని నాకు బలి ఇవ్వాలి,” అని అంది ఆ దయ్యం.

“ఆ…?” అని ఆలోచనలో పడ్డాడు గోపాలుడు.

“నువ్వు ఒప్పుకోకపోతే ఈ మేకపిల్లని ఇప్పుడే చంపేస్తాను. రేపు ఆ వంతెన కూడా ఉండదు,” అని అంది ఆ భయంకరమైన దయ్యం.

“వద్దు, ఆ మేకపిల్లని చంపకు. నువ్వు చెప్పింది నాకు అంగీకారమే. అలాగే చేస్తాను, ” అని అన్నాడు గోపాలుడు.

మరుసటి రోజు ఉదయం, తన సద్దిమూటతో మేకలని తోలుకుంటూ కాలువ దగ్గిరకి బయలుదేరాడు గోపాలుడు. ఆశ్చర్యం! కాలువ మీద కట్టెలతో కట్టిన సరికొత్త వంతెన సిద్దంగా ఉంది అక్కడ. కాలువ అవతల గట్టున వంతెన దగ్గిర దయ్యం నిలబడి ఉంది. కాలువ ఇవతల గట్టున, వంతెనకి ఇవతల గోపాలుడు, అతని వెనకే మేకలు. ఆ మేకలతో పాటు ఒక గజ్జి కుక్క. మేకలని గట్టు మీదే ఉండమని చెప్పి, తను ఆ వంతెన మీద కాలు బెట్టి గట్టిగా ఉందో లేదో చూద్దామనుకున్నాడు. కానీ ఈ లోపు దయ్యానికి తనకి ఉన్న ఒప్పందం గుర్తు వచ్చింది. అందుకని వంతెన మీద కాలుపెట్టకుండా ఇవతలే నిలబడ్డాడు.

భుజానికి ఉన్న సద్ది మూటని విప్పాడు. అందులో నుంచి తను విడిగా పెట్టుకున్న మాంసం ముక్కని బయటికి తీసాడు. తన మేకలతో పాటే వచ్చిన గజ్జి కుక్కకి దాన్ని వాసన చూపించాడు. తన బలం అంతా వినియోగిస్తూ కుడి చేత్తో ఆ మాంసం ముక్కని వంతెన మీదుగా దయ్యం నిలబడి ఉన్న గట్టు మీదకి విసిరాడు. ఆ మాంసం ముక్క అవతల గట్టు మీద పడేలోపు, గజ్జి కుక్క ఆ కాలువ మీదున్న వంతెన మీదుగా అటు వైపుకి దూకింది. అటు దూకడేమేమిటి, ఆ గట్టు మీద పడ్డ మాంసం ముక్కని నోటితో పట్టుకోవడం కూడా అయిపోయింది.

ఇదంతా చూస్తున్న దయ్యం ఆశ్చర్యంతో నిర్ఘాంత పోయింది. దాని పక్కనే ఉన్న మేకపిల్ల దయ్యం పట్టు విదిలించుకుని ఆ గట్టునుంచి ఇటు గట్టు మీదకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. గోపాలుడు దాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ దయ్యం వైపు చూశాడు.

దయ్యం బూడిదగా మారి కుప్పగా కూలిపోయింది.

ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ మర్రిచెట్టు పైనకాని ఆ కాలువ గట్టున కానీ దయ్యాలు మళ్ళీ కనపడలేదు.

* * *
కధ పూర్వపరాలు

2017లో  మా అమ్మాయి, అల్లుడు తో కలిసి కొంత కాలం గదుపుదామని స్కాట్ లాండ్ వెళ్ళాను.  వాళ్ళింట్లో వాళ్లుంటున్న ఎడిన్ బరో నగర పురాతన చరిత్ర గురించిన ఒక పుస్తకం కూడా ఉంది.  ఎడిన్ బరో నగరంలో ఉన్న శిలా స్థూపాలు, ప్రతిమల గురించి కూడా కొంత వ్రాసి ఉంది.  సెల్టిక్ కధల ప్రస్తావన వచ్చినప్పుడు జాలంలో కొన్ని కధలు చదివినప్పుడు వచ్చిన ఆలోచన ఇది.  కధ వ్రాయడం మొదలుపెట్టిన తరువాత, ‘చిన్న పిల్లల కధ’ గా తయారయింది అనిపించింది. అప్పుడే చిన్న పిల్లలకి కూడా ఒక కధ వ్రాసానని, బాల సాహిత్యంలో కూడా వేలు పెట్టానని చెప్పుకోవచ్చు కదా అనిపించింది.  దాంతో చిన్న పిల్లలకి కధలాగానే వ్రాసేసాను.  చిన్న పిల్లల కధ గా రూపు దిద్దుకుంటునప్పుడు, పిల్లలకి దెయ్యలూ, భూతాలు, దేవుళ్ళు, దేవతలు  (నేను నమ్మనివి) హేతువాదానికి, తర్కానికి నిలబడనివి, హింసని చూపించేవి ఎంత వరకు సబబు అని కూడా అనిపించింది.  కానీ చందమామలో భేతాళ కధలు చదివిన నేను బాగానే ఉన్నానుకదా, నా పిల్లలూ బాగానే ఉన్నారు కదా , అని అనుకుని… దెయ్యాన్ని అలాగే ఉంచేసాను.  ఇక ప్రచురణకి పంపాలనుకున్నప్పుడు ఏ పత్రిక అన్న మీమాంస మొదలైంది.  సాహితీ మిత్రుడొకరు సాక్షిని సూచించారు.  సాక్షి ఫన్ డే కి పంపాను.  వారు ప్రచురించారు.  కాకపోతే కధకి బొమ్మ వేసినవారు పెద్దగా శ్రమ పడకుండా జాలం నుంచి దెయ్యం బొమ్మకి బదులు దొరల మాంత్రీకురాలు బొమ్మని దింపేసి వాడేశారు. 
సాక్షి ఫన్ డే సంపాదకులకి ధన్యవాదాలు.

ప్రచురణానంతరం…
కధ ప్రచురించిన తరువాత నేను పంచుకున్న మిత్రులలో ఒకరు, “నేనైతే పిల్లలకి దెయ్యాల భూతాల కధలు రాయనండి,” అని సున్నితంగా చెప్పారు. 
మరొకరు, “ఇమేజరి అంతా బాగుంది కాని పిల్లలకి దెయ్యం ఎందుకు…ఒక బాడ్ మాన్ తో వ్రాసి ఉండవచ్చు కదా?” అన్నారు. 
అది ఈ కధా నేపధ్యం. చి న
సాంఘిక మాధ్యమాలలో ఇంకా ప్రచురించలేదు.  చూడాలి అక్కడ చదివిన వాళ్ళేమంటారో! 
ద హ
 

పాద సూచి
సాక్షి, ఫన్ డే, ఆదివారం, ఆగస్ట్ 4 న సంచికలో వెలువడ్డ కధ పూర్తి పాఠం ఇక్కడ  (image)
Text link here.

 

Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on whatsapp
WhatsApp
Share on email
Email

కవన శర్మ జ్ఞాపకాలతో…ఒక సాయంత్రం

KaVaNa Sarma

మొన్న (ఆదివారం, 4 నవంబరున, Hyderabad Study Circle లో )  జరిగిన కవన శర్మ జ్ఞాపకాల సభలో సాహితీ మిత్రులందించిన మూడు సందేశాలు వ్యవధి లేక జారిపొయ్యాయి.
ఒక నిర్వాహకుడిగా అది నా తప్పిదమే.  మిత్రులను క్షమాపణలు కోరుకుంటూ,  వాటిని ఇక్కడ అందరితో పంచుకుంటున్నాను.

రావు, వేమూరి – University of California, Davis విశ్రాంత ఆచార్యులు (అమెరికా)

Dr Vemuri Venkateswara Rao
ఆచార్య వేమూరి వెంకటేశ్వర రావు – అమెరికా

వేమూరి వెంకటేశ్వర రావు గారి సందేశంః
ఏనాటి మాటో! కవన శర్మ గారుట. బోస్టన్ నుండి ఫోనులో పిలచేరు – నేను తెలుగు భాషా పత్రికలో రాస్తూన్న వ్యాసాలు బావున్నాయని చెప్పడానికి. తరువాత పది సంవత్సరాల కాలం గడచిపోయింది. నేను హైదరాబాదు వచ్చేను. శర్మ గారు ఊళ్లో ఉన్నారని తెలసి పలకరించడానికి వెళ్లి పరిచయం చేసుకోబోయాను. “అయ్యో! మీరు తెలియకపోవడం ఏమిటి? కించిత్ భోగో కథ రాసింది మీరే కదూ?” అంటూ స్వాగతించేరు. తరువాత వైజాగులో వారింట్లో ఒక సారి కలుసుకున్నాను. నేను రాసిన మహాయానం కథల పుస్తకానికి అడిగిన వెంటనే ముందుమాట రాసి ఇచ్చారు. రెండేళ్ల క్రితం బెంగుళూరు శివార్లలో నేను ఉన్నానని తెలిసి ప్రత్యేకం నన్ను చూడడానికి వచ్చేరు. ఆయన్ని కలుసుకున్నది కేవలం మూడు సార్లు. ప్రతి సారి మా సమావేశం గంటకి మించలేదు. అయినా సరే, ఆయన నా మనస్సులో ఒక ముద్ర వేసుకుని కూర్చున్నారు. ఇటీవలి కాలంలో – ఆయన ఇక లేరని తెలిసిన తరువాత – ఫేస్ బుక్ ని తెరచి చూడబుద్ధి కావటం లేదు. కవన శర్మ గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ
— వేమూరి వేంకటేశ్వరరావు.


తులసీ జలంధర చంద్రమోహన్ – రచయిత్రి ( చెన్నై )
జలంధర గారు ఆడియో ఫైల్ పంపారు.  క్రింద ఆడియో ఫైల్ లో వారి
“కవన శర్మ గారికి పుష్పాంజలి” వినవచ్చు.

Smt Tulasi Jalandhara Chandramohan
శ్రీమతి తులసి జలంధర చంద్రమోహన్


K N Malleeswari
కె ఎన్ మల్లీశ్వరి – రచయిత్రి,, జాతీయ కార్యదర్శి – ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక.

గ్రీకువీరునికి వీడ్కోలు

కవనశర్మగారి గురించి నాలుగు మాటలు పంచుకోమని అనిల్ అడిగారు.

రచయితలుగా మన పరిచయంలో ఉన్నవారి గురించి మాట్లాడటం కొద్దిగా సులువు. సాహిత్య లోకానికి వారి తోడ్పాటుని మన అవగాహన లోనుంచి చెప్పవచ్చు. కానీ వారు మనకి వ్యక్తులుగా కూడా తెలిసినపుడు, వారి అభిమానాన్ని పొందిన స్నేహితులం అయినపుడు మాట్లాడటం కొద్దిగా కష్టం. వ్యక్తిగతం, సాహిత్యం కలగలిసిపోతాయి. విడదీసుకుని నిబ్బరంగా వ్యాఖ్యానించడానికి, వారి సాహిత్య కృషిని మదింపు చేయడానికి నాకైతే సాధ్యం కాదు. ఆమె ఇల్లు, విడాకులు చదివినపుడు స్త్రీల సమస్యల మీద ఆయనకి ఉన్న సహానుభూతికి సంతోషపడ్డాను. పరిధి చదివినపుడు అతిక్రమణల గురించి తెలుసుకున్నాను. రచన పత్రికలో సాహిత్య నిర్మాణ సూత్రాల గురించి రాసినపుడు ఆ దీర్ఘ వ్యాసానికి ఉన్న శాస్త్రీయ దృష్టికి ఆశ్చర్యపడ్డాను. వ్యంగ్య కవనాలకి నవ్వుకున్నాను.

నచ్చింది రాయడం తప్ప నచ్చనిదాని గురించి మాట్లాడను, మౌనమే విమర్శ అన్నపుడు అంగీకరించలేకపోయాను. ఏ రచనకైనా మానవ స్పర్శ అంటుకుని ఉండాలని చెప్పినపుడు ప్రేమించాను. రెండునెలల కిందట కలిసినపుడు, “ప్రత్యేకించి వైద్యం తీసుకోనని, రాబోయే వారికోసం చోటు ఖాళీ చేసేయాలని చెప్పినపుడు బాధతో వాదించాను. నిక్కచ్చితనాన్ని మృదువుగా చూపేపుడు అబ్బురపడ్డాను. సమయపాలనకి పెట్టింది పేరైన కవనశర్మ గారు, మొదటిసారి సమయం తప్పారు. 29 వ తారీఖున విశాఖ వెళ్లాలని, తన ఇంటిలోని నల్లబల్ల మీద రాసుకున్న ఆయన దానిని మర్చేపోయారు. విశాఖ వచ్చినపుడు మాట్లాడాల్సిన విషయాలున్నాయని రెండు మెయిల్స్ పెట్టారు. ఆయన నాతో ఏం మాట్లాడాలనుకున్నారో వివినమూర్తి గారికి తెలుసు, కుందుర్తి రజనికాంత్ గారికి తెలుసు. మీరు నాకు చెపితే కవనశర్మ గారు నాకు చెప్పేసినట్లే.
మల్లీశ్వరి కె ఎన్ – రచయిత్రి (విశాఖపట్నం)


కోరిన వెంటనే తమ తమ సందేశాలను పంపినందుకు శ్రీమతి తులసీ జలంధర చంద్రమోహన్, వేమూరి వెంకటేశ్వర రావు, కె.ఎన్ మల్లీశ్వరి గారలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, జరిగిన పొరబాటుకి మన్నించగలరని ఆశిస్తున్నాను.

భలేగా దొరికాడు!

క్లాసు పుస్తకాలు, నోటుబుక్కులు, హోం వర్కులు చేస్తూ కనబడ్డవాడేకాని చేతిలో చందమామ, బాలమిత్ర లాంటి పుస్తకాలతో చూసిన గుర్తు లేదు. (చదివే ఉంటాడు, చదవకుండా ఎలా!) ఇద్దరమూ, మిగతా మిత్రులతో కలిసి, గోళీలు ఆడుకున్నాం. బిళ్లం గోడు కూడా అడుకున్నాం. క్రికెట్టు కూడా. కొట్టుకున్న, తిట్టుకున్న సందర్భాలు లేవు.

తరువాతెప్పుడో, మెడిసిన్ లో సీటు వచ్చింది చదువుకుంటున్నాడని తెలుసు. సరే, ఇక పెళ్ళి. బజుల్లా రోడ్డు ఇంట్లో సత్యనారాయణ వ్రతం. ఒకటి రెండు సార్లు, ఆంధ్రా బాంకులో కనపడ్డాడు. వాళ్ళ నాన్నగారు ఉన్నన్నిన్నాళ్ళు తన కబుర్లు కొన్ని తెలుస్తుండేవి. తరువాత ఎప్పుడో స్పర్ టాంక్ రోడ్ మూలమీద కనపడ్డాడు. ఇంగ్లాడ్‌లో ఉంటున్నానన్నాడు.

అప్పుడప్పుడు వెతుక్కునేవాడిని, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో అని! ఆ తరువాతెప్పుడో తెలిసింది అమెరికాకి వెళ్ళాడని.  వాళ్ళ్ అన్నయ్యనుకుంటాను చెప్పాడు.

అనుకోకుండా రెండు, మూడేళ్ల క్రితం, హైద్రాబాదులో ఎయిర్‍పోర్టుకి వెళ్తూ దారిలో కధాసాహితి నవీన్ ఫోనులో పలకరించాడు. మూలింటామె గురించి మాట్లాడాడు. ఆశ్చర్య మేసింది. “సాహిత్యమేమిటి, తెలుగు సాహిత్యమేమిటి, మూలింటామె ఏమిటి? దాన్ని నువ్వు సమీక్షించడమేమిటి,” అన్న నా ప్రశ్నల పరంపరకి, “దేశానికి దూరంగా ఉన్నప్పుడు, ప్రేమలు, ఆపేక్షలు పెరుగుతాయిగా…నాకు అలా తెలుగు మీద ప్రేమ, సాహిత్యం మీద అనురాగం పెరిగింది,” అన్నాడు. సరేలే అనుకున్నాను.

మొన్న జంపాల గారు ఫేస్‌బుక్ లో, DTLC పేజిలో ఒక ఫోటోలో ఉన్నారు.  అది గ్రూప్ ఫోటో.   అందులో కనబడ్డాడు. వార్ని, భలే దొరికాడుగా అనుకున్నాను. ఆ ఫోటో కి కామెంట్ లో ఆ మిత్రుడికి తెలియజేయమని కోరాను.

DTLC Detroit Oct 2018
డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి సమావేశంలో రాఘవేంద్ర చౌదరి

మర్నాడు 22 అక్టోబరు. ఉదయం తన ఫోను కాల్ తో నిద్రలేపాడు. ఆ తేది, ఆ రోజు మర్చిపోను.

గొప్ప విషయం ఏమిటంటే, DTLC లో ఉన్నాడు. 2005 నుంచి.  దాదాపు పదమూడేళ్ళు! ఇద్దరికి తెలిసిన వారు, పరిచయం ఉన్నవారు, సాహిత్య పిపాసులు.  తెలుగు, తెలుగు సాహిత్యం! అయినా నాకు తెలియక పోయింది!  బహుశ ఏ సోషల్ మెడియాలోను ప్రోఫైల్ లేదనుకుంటాను!  లేకపోతే నేనెప్పుడో తగులుకునేవాడిని.  (బహుశ నాలాంటి వాళ్లు తగులుకుంటారనే తప్పుకునుంటాడు.
ద హ
)

రాత్రి నిఘంటువు చూసా,” అని అందులో అంటూ నన్ను ‘రిపబ్లిక్ గార్డెన్స్‘ కి తీసుకువెళ్లిపొయ్యాడు. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం. తన భాష, యాస, పలుకుబడి, ఆ నవ్వు, ఆ తల ఊపడం, దేన్ని వదులుకోలేదు! “ఆంధ్ర సాహిత్య పరిషత్తు” గురించి ప్రస్తావిస్తూ, “మా ఊరు మద్రాసు” అని అన్నాడు! ప్రాణం ఒక్కసారి లేచి వచ్చింది! చి న

Amazing, రాఘవేంద్ర…చౌదరి! అసలు నువ్వు తెలుగులో, ఆ సామెతలు, ఆ కోటబుల్ కోట్స్ , ఆ వ్యంగ్యం, ఆ చమత్కారం…భలే!  You know something! DTLC స్పూర్థి నాకు వేదిక ని మొదలుపెట్టడానికి. అఫ్‍ కోర్సు, మద్రాసులో మేము (అమ్మ, నేను, ఇతర సాహితీమిత్రులు) దాదాపు మూడు దశాబ్దాలు నిర్వహించిన సాహితీ సమావేశాల అనుభవం ఉందనుకో!

It is nice to know of your association with DTLC and love for your Telugu language! You made my day.

ఇక్కడ DTLC లో తన మాటలని వినండి.

BTW, that is…
పోఁగాలము దాపించినవారు దీప నిర్వాణగంధము నరుంధతిని మిత్రవాక్యమును మూర్కొనరు, కనరు, వినరని పెద్దలు చెప్పుదురుచి న

సంగీతం – మూడు కథలు

vedika october
వేదిక – 27 అక్టోబరు 2018

 వేదిక మిత్రులకు,
ఈ శనివారం అంటే 27 అక్టోోబరున, 2018 నాడు “వేదిక” సాహిత్య సమావేశంలో
సంగీత నేపధ్యంతో మూడు కథలు గురించి ముచ్చటించుకుందాము.
కానుక – ముళ్ళపూడి వెంకటరమణ ( మోహిత)
వాయులీనం – చా సో (ఊణుదుర్తి సుదాకర్)
చూపున్న పాట – కె ఎన్ వై పతంజలి (శ్రీమతి. రామలక్షి)

కధలను ఇక్కడ ఆన్‍లైన్‍లో చదువుకోవఛ్హు.
http://bit.ly/Vedika27Oct2018
మరో ముఖ్యమైన విషయం
అక్టోబరు 25 ఉదయాన, అధ్యాపకులు, రచయిత కవన శర్మ గారు బెంగుళూరులో చనిపోయారు. వేదిక వారికి శ్రద్దాంజలి ఘటిస్తుంది.

సమావేశం సాయంత్రం 5.30కి మొదలవుతుంది. సభాస్థలి: ఆలంబన, 85 – హెచ్ ఐ జి కాలని, వెంగళాస్ కేటరర్స్ పక్కన, బాలాజీనగర్, కూకట్‌పల్లి, హైదరాబాదు 500072.
దారి వివరాలకు; +(91)-40-2305 5904, +(91) – 9440103189, 98483 21703
Google Map:
https://goo.gl/maps/GvjOi

How to reach the venue Aalambana Hyd – వేదిక చేరుకోవడానికి దారి:
Omni Hospitals is the land mark visible on Kukatpally village main road. Take the road adjacent to it. You will find Kalyan Jewellers to your right on that road. Stick to that road. Pass ‘More’ departmental store, to your left. You will come across a ‘+’ junction.. and then Apollo Pharmacy, again to your left, while approaching from the Kukatpally main road. Take the left there and you will find Aalambana to your right. The 3rd building.

కొత్త కథ 2018 లో #మీ టూ, దాని నేపధ్యం

A short Poster for the sort story mee too

2016 లో వ్రాసుకున్న ఒక పెద్ద కథలో ఒక భాగం, ఈ ‘#మీ టూ’. ఆ కధ చాల పెద్దది. బహుశ జాల పత్రికలకి కూడా పెద్దదయ్యేదేమో. అందుకనే అందులో నుంచి ఒక భాగమే తీసుకున్నాను.

కధా వస్తువు నా జీవితంలో నేను చూసిందే. నా బాల్యంలోనే. లోపల ఎక్కడో దాగుంది అది. 2016 లో బయట పడింది. మార్నింగ్ వాక్ లో పార్క్‌లో కనబడేవాళ్లోలో ఒకతను తన కూతుర్ని కూడా తీసుకుని వఛ్హేవాడు. ప్రతిరోజు వఛ్హేవాడు కాదుకాని వఛ్హినప్పుడు ఒకొసారి అతని కూతురు కూడా తనతో పాటు వఛ్హేది.  చిన్న పిల్ల బహుశ ఒక పది పన్నెండేళ్లుంటాయేమో! ఆ వారంలో వాళ్ల స్కూల్లో ఏదో పోటిలో ఒక చిన్న బహుమతి అందుకుంది. తండ్రి తన కూతురు ప్రతిభని గురించి చెబుతుంటే ఆపి, పాపనే చెప్పమన్నాను. దాన్ని గురించి నా పక్కనే కూర్చుని సిగ్గు పడుతూ చెబుతోంది. ఆ సిగ్గు చూసి ముఛ్హటేసి, దగ్గిరకు తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను. It was spontaneous act of appreciation, and an act of encouragement to continue to participate in competitions without giving a damn about winning or losing! అంతే. నేను ముద్దు పెట్టిన మరుక్షణం తన చేత్తో బుగ్గని తుడుచుకుంది. It was almost a reflex action. ఎందుకనో ఆ అనుభవం (తనకి గతంలోఒక bad touch అనుభవాన్ని గుర్తుంచేసిందేమో అన్న అనుమానం) తో ఇక నా దగ్గిరకు రాదేమో అనుకున్నాను. ఆ తరువాతెప్పుడో ఒకసారి వాళ్ళింటికి వెళ్లడం తటస్థించింది. “అంకుల్” అంటూ దగ్గిరకొఛ్హి వాటేసుకుంది. అక్కడ పడింది ఈ కథకి పునాది.  గత అయిదారు దశాబ్దాల పరిశీలన, ఇతరుల జీవితానుభవాలతో ఒక కధ రాయడం మొదలుపెట్టాను.  ఇందాక అన్నట్టు చాలా పెద్దదైపోయింది.  అందులో నుంచి ఒక భాగాన్ని విడగొడితే ఈ #మీటూ వఛ్హింది.  ఇది సూక్షంగా ఈ కథ నేపధ్యం. #మీటూ పోగా మిగతా వాటితో బహుశ మరో రెండు కధలు రాద్దామనుకుంటున్నాను.  చూద్దాం.

2017 లోనే ఈ కధని వీలైనంత మంది పాఠకుల చేరువగా తీసుకెళ్లాలని అనుకున్నాను. 2017 నవంబరులో ఒక ప్రధాన పత్రికకి పంపాను. సంపాదక వర్గం ఎందుకనో ‘గజ,గజ’ వణికిందన్నారు. నాలుగు అక్షరాల పదాలు లేవు. అసభ్యమైన మాటలు లేవు. సెక్సు లేదు. బూతు లేదు. మరో పత్రికకు పంపాను. ఆ పత్రిక కూడా నిరాకరించింది. రెండో పత్రిక నుంచి, కథ అర్ధంకాక రెండో సారి చదువుకుని నాకు ఫోను చేస్తే ఆ కధ వివరం చెప్పిన సందర్భం కూడా ఉంది. పిడోఫైలియా అన్నదొకటి ఉన్నది అని కూడా తెలియని తనం కనపడింది. బహుశ అప్పుడే అక్టోబర్ ఆ ప్రాంతాల్లో #మీటూ ఉద్యమం మన భారతదేశంలో కూడ మొదలయ్యింది. బహుశ అదొక కారణం అయివుంటుంది. సున్నితమైన వస్తువు అని అనుకునుంటాయి ఆ రెండు పత్రికలు. పైగా ఆ సమయంలోనే కాదు, ఇతరత్రా కూడా అందరి దృష్టి స్త్రీల మీదే ఉంది. పిల్లల మీద లేదు. నాకు తెలిసినంతలో పిడోఫైలియా మీద తెలుగులో కధలు లేవు. ఉంటే దయచేసి తెలియజేయండి. చదువుకుంటాను. లింక్ ఇస్తే మరీ సంతోషం.

ఇందాక అన్నాను కదా, ఎక్కువమంది పాఠకులకి అందాలని అనుకున్నానని. కారణం ఇది. తల్లి, తండ్రులకి, శ్రేయోభిలాషులకి, ఇలాంటి అనుభవాలు కూడా ఉండే ఉంటాయి, కాబట్టి జాగ్రత్త అని హెఛ్హరించాలని! ఒక సేఫ్ టచ్, బాడ్ టచ్ గురించి పిల్లలకి చెప్పడం మాత్రమే కాదు. వారి వేష భాషల్లోను మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్ని వేళలా, అన్ని చోట్ల వారిని ఒంటరిగా వదిలెయ్యడం కూడా సరికాదు.

కథను చదివిన పెద్దలు (మగవారు) కొందరు తాము కూడా ఈ అనుభవాలకి గురయ్యాము అని తెలియజేసారు! మాములుగా స్త్రీలు చెబుతారు, మగవాళ్ళు ఇలా చేస్తారు, అలా చూస్తారు అని!

2017 లో వెలువడాల్సిన కథే ఇది.  ప్రచురణకి నోచుకున్న నాలుగో కధ అయినా, (ఇది నా మూడో కథ, మొదటిది ఇక్కడ, రెండోది ఇక్కడ), కొత్త కధ 2018 సంకలనం లో చేర్చుకున్నందుకు ఖదీర్‍కి, సురేష్ కి కృతజ్ఞుడను.  కొత్తకధ 2018 సంపాదకులైన వెంకట్ సిద్ధారెడ్డికి, కుప్పిలి పద్మకి నమస్సులు.  సోషల్ మీడియాలో ప్రాచుర్యం కోసం ఆకర్షణీయమైన బొమ్మతో ఒక డిజైన్ ని తయారు చేసి ఇఛ్హినందుకు Artio మహీ బెజవాడకు ధన్యవాదాలు.

సోషల్ మీడీయాలో #మీటూ ప్రచురణార్ధం, మహీ బెజవాడ తయారుచేసిన కార్డ్ లో కధలోని వాక్యం ఇదిః
మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్‘ సినిమా వాల్ పోస్టర్ని చూస్తోంది. ఇందాక జిష్ణు చూసిన ఆ అమ్మాయి, పన్నెండు పదమూడేళ్ళు ఉంటాయేమో! వైట్ హెయిర్ బాండ్ కింద నుంచి నల్లని పొడుగాటి జుత్తు భుజాల మీదుగా వీపు మీదకి జారుతోంది. టాప్ టైట్ గానే ఉంది.’

కొత్త కథ 2018 ప్రతులు ఇక్కడ దొరుకుతాయిః
ధర రూ 149.00 మాత్రమే (24 కథలు)
♣ నవోదయ బుక్ హౌజ్
3-3-865,Opp Arya Samaj mandir, Kachiguda,Hyderabad, Pin Code: 500027,
Telangana,India. Mob:+91-9000413413, Office:040-24652387
Email:[email protected]
Web: www.TeluguBooks.in

♣ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్
Karl Marx Road, Opp:Hotel Raj Towers, Eluru Road, Vijayawada, 520 002,
Andhra Pradesh, India.
Contactః  (0866) 257 2949, +91 94909 52107

♣ నవచేతన
Navachethana Book House
Address: 4-1-456, Bank St, Troop Bazaar, Abids, Hyderabad, Telangana 500 001, India.
Phone: 040 2460 2646

 

అసిఫా! అసిఫా!

LT metro rail

ఆ మధ్య ఒక సాయంత్రం జుబిలీ హిల్స్‌, మహాప్రస్థానం లో ఎవరికో వీడ్కోలు పలికి వస్తుంటే, దారిలో ఆ పాప, తమ్ముడు, వాళ్ళ నాన్నతో కనిపించారు. చలాకిగా నవ్వుతూ, తుళ్ళుతూ, హుషారుగా, సంతోషంగా దాదాపుగా పరిగెడుతున్నారు. వాళ్ల వెనుక వాళ్ళ నాన్న అనుకుంటా, భుజం నుంచి వాటర్ బాటిల్ తగిలించుకుని వాళ్ళ అడుగులో అడుగు వేసుకుంటూ హాయిగా నవ్వుతూ వెళ్తున్నాడు. అమీర్ పేట మెట్రో స్టేషన్. నేను వాళ్లతో పాటే, స్టేషన్ వైపుకి అడుగేసాను. ఆ పాప ఎస్కలేటర్ ఎక్కడానికి సందేహిస్తూ ఆగి పోయింది. తమ్ముడు, ఒక గెంతు, గెంతి ఎస్కలేటర్ మీదికి చేరుకున్నాడు. అప్పుడు గమనించాను. వాళ్ళ తండ్రి, ఎడం చేతివైపు మెట్లమీద, మాకంటే ముందుండి తన పిల్లల్ని మొబైల్‌ కెమెర ఫోటోలతో జ్ఞాపకాలని దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని.

“ఫరవాలేదమ్మా, ముందుకొక అడుగెయ్యి, వెనక నేనున్నాగా!” అంటూ వెనక నుంచి నాకు అందుబాటులో ఉన్న పాప కుడి భుజం మీద తట్టాను. అప్పటిదాక నన్ను చూడని పాప వెనక్కి తిరిగి చూసింది. బిగుతుగా కట్టిన రెండు జడలు ఒక్కసారిగా వెనక్కి తిరిగాయి. చక్కగా నవ్వుతున్న పెద్ద కళ్ళు. వాళ్ళమ్మ కాటుకతో దిద్దిన కళ్ళు. వాటి మధ్య ఎర్రటి బొట్టు. అమాయకంగా నవ్వుతున్న పెదవులు! ఆ నవ్వు పాపకళ్ళలో కూడా జర్రున పాకింది! ఎంత అమాయకంగా, ఆనందంగా ఉందో! ఆ మొహం! గబుక్కున మరో పాప మొహం గుర్తోఛ్హింది!

తమ్ముడు ఎస్కలేటర్ మీద రెండు మెట్లు ముందుకు దూకాడు.
పాప ఎస్కలేటర్ మీదకి అడుగేసింది.
అవతల తండ్రి మెట్ల మీద మరో రెండడుగులేసి, రెండు మెట్లు దాటి వాటి పైకి చేరుకున్నాడు. ఫోటో తియ్యడానికి వాళ్ళూ, వీళ్లు అడ్డం వస్తున్నారు.

“నువ్వు దూకు ముందుకి. మెట్లెక్కినట్టు ఎక్కెయ్. ఏమి కాదు. నీ వెనక నేనున్నానుగా!” అంటుంటే విని, నేను భుజం తట్టేలోపు, ఒక మెట్టేక్కింది. మళ్ళీ మరొకటి. ఈ సారి రెండు. రైలింగ్‍ని పట్టుకుని వడివడిగా, హుషారుగా! అందరం పైకి చేరుకున్నారు. నేను పైకి వెళ్ళేటప్పడికి, పిల్లల్నిద్దర్ని ఒక వైపు నుంచో బెట్టి తండ్రి ఫోటోలు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. పశ్చిమాన దిగుతున్న సూర్యుడు, తండ్రి మొఖం మీద. అక్కడున్న సైన్‌బోర్డ్‌ నీడలో పిల్లలిద్దరు.

“Go, stand with them, I will help you with the pictures,” అని నేను ముందుకు వెళ్తే, ఆ తండ్రి “థాంక్ యూ సార్” అంటూ మొబైల్ ఫోన్ నాకందించాడు.

ఇప్పుడు సైన్‍బోర్డ్‌ నీడలో తండ్రి, పాప, తన తమ్ముడు. రెర్ కెమెరా లో వాళ్ల బొమ్మలు ప్రస్ఫుటంగా కనబడటం లేదు. వెలుతురు సరిపోవడం లేదు.  జూమ్ చేసాను. పాప జూమ్‍లో ఉంది. అమాయకంగా నవ్వుతున్న కళ్ళు. నవ్వుతున్న పెదాలు. గబుక్కున మరో పాప మొహం గుర్తోఛ్హింది.  కళ్ళు అలుక్కుపొయ్యాయి.

రెండో, మూడో టక టక మని క్లిక్ మనిపించాను. వాళ్ల ముగ్గురుని గ్రూప్ లోకి తీసుకుని మరో రెండో, మూడో క్లిక్ చేసాను. తరువాత, వాళ్ళ ముగ్గుర్ని దిగుతున్న సూర్యుడికి అభిముఖంగా, టికెట్ కౌంటర్స్ బాక్ డ్రాప్‍ తో తీస్తుంటే, తమ్ముడు పెదవులు బిగించి చూస్తున్నాడు. “Say cheese and smile,” అని అంటుంటే వాడు, వాడి అక్క #అసిఫా, వాళ్ల నాన్న నవ్వుతుంటే రాపిడ్‍గా మరో అయిదో, ఆరో క్లిక్ చేసాను.

“Say thanks to uncle,” ఆంటూ వాళ్ళ తండ్రి నేనందించిన తన మొబైల్ ని అందుకున్నాడు. పాప దగ్గిరకొఛ్హి, కుడి చెయ్య సాచి, “థాంక్స్ అంకుల్,” అంది. తమ్ముడు అక్కడే నిలబడి నా వంక చూస్తున్నాడు. “It’s OK”, అంటూ నేను వెను తిరిగాను.

ఆ పాపలో నాకు Asifa కనపడింది.  అప్పట్నించి నా చుట్టూ నాకు ప్రతి బాలికలోను అసిఫా కనబడుతోంది.

క్లుప్తంగా ఇడ్లి, వడ, సాంబార్ కధ ఇది!

కొంత మంది పాఠకులకి నేను వ్రాసిన ఇడ్లి, వడ, సాంబారు కధ పూర్తిగా అర్ధం కాలేదన్నారు.  ఈ టపా వారికోసం.

ఈ క్రింద ఇఛ్హినవి సారంగ లో వఛ్హిన కధ ఇడ్లి, వడ,సాంబార్ లోని వాక్యాలు. ఇవన్ని అంతర్గతంగా కధాంశానికి సంబంధించిన సూచినలిస్తాయి.  వీటన్నింటిని ఒక క్రమంలో చదువుకుంటే కధ అర్ధం కావాలి. ఈ వాక్యాలు చదివిన తరువాత, కధని మళ్ళీ ఒకసారి చదువుకోండి.  దానికి లంకె ఈ కింది వాక్యాల తరువాత చివర ఇఛ్హాను. 

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

> ఇది అతని కధ.
> అతను ఒక స్త్రీ మూర్తిని తన చేతులమీదుగా ఎత్తుకుని తీసుకుని
రావడం…

> వాలిపోయిన ఆవిడ తలక్రింద చేతులు వేసి…
> స్త్రీని చాలా నెమ్మదిగా అతి జాగ్రత్తగా ఆ రేర్ సీట్ మీద పడుకోబెట్టాడు…
> …భుజాలక్రింద నుంచి చేతులేసి ఆవిడ తలని ఎంతో ప్రేమతో తన
ఒడిలోకి లాక్కుని…

> …తన రెండు చేతులతో ఎంతో వాత్సల్యంతో ఆవిడ కాళ్ళని తన ఒడిలోకి
తీసుకుంది…

> ఆంగర్, డినైయల్, బార్గైనింగ్, డిప్రెషన్ అండ్ అక్సె‌ప్‌టన్స్.
(Anger, denial, bargaining, depression and acceptance) – are the five stages of grief and not necessarily in that order. You can read more about it here.
(If you haven’t yet, do watch that movie ‘All that Jazz‘.  ఈ సినిమా ఆస్కార్ బహుమతులు పొందినది.))
…(Yea…blood an’ shit!)…
బమ్స్ మధ్య నుంచి పరుపు మీదకి బెడ్ షీట్ మీదుగా. దేర్ గోస్ ది
బ్లడి షీట్!…

> …ఊపిరి తిత్తుల నిండా అవే. ఒన్…ఫోర్…ఎయిట్…మిలియన్స్ టు ది
ప‌వర్ ఆఫ్ బిలియన్స్…దే ఆర్ చోకింగ్ మాన్! లెట్ హర్ గో ఈజీలీ!
(Let  her go easily!)…

> ఇట్ టూ ఈజ్ డెడ్ మాన్! (It too is dead man!)
> …(With a carcass…oh no!)…

(ఇది కధలో లేదు, కాని తెలియని పాఠకులకోసం ఇక్కడ ఇఛ్హాను. The following are the stages of “Rigor Mortis“, తెలుగులో ఇక్కడుంది. )

బిలియన్స్ ఆఫ్ సెల్స్… డూ దే హావ్టు ప్రై దెమ్ ఓపెన్?
(Billions of cells…do they have to pry them open?)

>  ఆర్ బ్రేక్? (Or break?)

>  బ్రేక్ వాట్? (Break what?)

>  ది జాస్, డూడ్…హర్ జాస్! (The jaws, dude…her jaws!)
గెస్ నాట్! (Guess not!)
షిట్… హౌ కెన్ యు ఎవెన్ధింక్ లైక్ దట్! (Shit…how can you
even think like that?)

ఇట్స్ ఎ కడెవ…వాట్! (It’s a cadav’…what?)
…నెమ్మదిగా సెటిన్ అవుతోంది…

>  యు ధింక్ హర్ జా వుడ్‌హెవ్ బిగన్ టూ ఫ్రీజ్?
(You think her jaw would have begun to freeze?)

ఐ లిడ్స్?
(Eye lids?)

>  …వాళ్ళందరూ ఇంకా తింటునే ఉన్నారు.
ఇడ్లి, వడ, సాంబార్ కూడా…

కధ అర్ధం అయివుండాలి.

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

అంతర్జాల పత్రిక, సారంగ లో కధ ఇక్కడ చదువుకోవఛ్హు.
ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి.  కధకి తగ్గ abstract బొమ్మ గీసిన అన్వర్ కి థాంక్స్.

ఇక్కడ ఈ టపాకి వాడిన Photo by Axel Antas-Bergkvist on Unsplash.

That woman was part of their life and she lay dead in that car and they are having breakfast. Those monologues in English are his ( ఇంగ్లిష్‌ లోని స్వగతాలు, అతనివి) .

….
While they traveled with a member of their family who is dead (body), they stopped at a restaurant and had their breakfast.

చనిపోయిన తమ కుటుంబ సభ్యురాలి దేహంతో, ప్రయాణం సాగిస్తూ, దారిలో కనబడ్డ దాబా లో కూర్చుని ఉదయపు అల్పాహారాన్ని కోరుకుని తిన్నవి, ఈ కధలోని కొన్ని పాత్రలు.  అది జీవితం.  బహుశ మనందరి జీవితాలు అంతేనేమో!

ఇక తెలుగు కధలో ఇంగ్లిష్ వాక్యాలు, వాటిని టెంగ్లిష్ (ఇంగ్లిష్ పదాలని తెలుగు లో వ్రాయడం) మళ్ళీ అవే వాక్యాలని ఇంగ్లిష్‍లో (బ్రాకెట్లలో) ఇవ్వడానికి కారణం, తెలుగులో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్నవాళ్ళకి, ఇంగ్లిష్‍ తెలిసిన వాళ్ళకి, చదువుకోవడానికి సులువుగా ఉంటుందని.

ఈ టపా సమయానికి, నా వరకూ వఛ్హిన పాఠకుల వ్యాఖ్యలన్నింటినికి వివరణ ఇది.