ఈ దశాబ్దం నవలది, తెలుగు కథ ది!

ముందున్నది మూడు చెరువులు.  ఒడ్డున్న ఉన్నది అప్పుడే వాటిల్లో  మునిగి, ఈది, తేలి, గట్టుకు చేరిన సుశిక్షుతులైన గజ ఈతగాళ్ళు.  ఆ చెరువులు చెరువులేనా?.. ద్రోహ వృక్షం, నల్ల మిరియం చెట్టు, ఆకుపచ్చని దేశం.  ఒడ్డున్న ఉండి మళ్ళీ దూకడానికి ఉద్యుక్తుడవుతున్న నవయువకుడు శివారెడ్డి..కానీండి ఇంకా చూస్తారే?..నేనైతే  ‘జీవని‌’ లోకి దూకాను.  ‘ఐదు హంసలు‌’ని కూడా చూసాను.  దూకడమే..అలా ఒడ్డున నిలబడిపోతే  మీ జీవితంలో ఒక ఎపిక్ ప్రపోర్షన్‌ లో ఒక అనుభవాన్ని కోల్పోతారంటాడు.

ఇందులో ద్రోహవృక్షం కథల సంపుటి.  మిగతా రెండూ – నల్లమిరియం చెట్టు, ఆకుపచ్చని దేశం నవలలు. రచయిత డా॥ వి. చంద్రశేకఖర రావు.

Dr. v chandrasekhara Rao novels release function
డా: చంద్రశేఖర రావు నవలలు ఆవిష్కరణ సభ..మీ ఎడమవైపు నుండి..శ్రీ జగన్నాధ శర్మ, నవ్య సంపాదకులు – ఆకుపచ్చిని దేశం తో, కవి శివారెడ్డి అక్కుపచ్చిని దేశం లో నల్ల మిరియం చెట్టు తో, రచయిత డా॥ చంద్రశేఖర రావు వి, వారి ప్రక్కన విమర్శకులు సీతారాం.

ఆ పుస్తకాల పేర్లు చూడండి.  ఒక మార్మికత లేదూ వాటిల్లో?!  చిన్నప్పుడు మా నాన్న తెచ్చి ఇస్తే పుస్తకాలు, ఏది ముందు చదవాలో అర్ధం అయ్యేది కాదు.  అన్నింటిని ఒకే సారి చదవలేము.  సరే, పుస్తక పరిచయ సభకి వెళ్ళాం కదా..ఆ మహామహుల మాటలు విన్నాం కదా?  వాళ్ళందరూ ఏదో ఒక పుస్తకాన్ని ఆకాశానికెత్తేస్తే దాంతో మొదలు పెట్టవచ్చు. అసలు ఆ సాహితీవేత్తలు ఆ అవకాశం లేకుండా అన్నింటి గురించి చెప్పేసారు.  అసలు ముందు వాళ్ళ మాటలు వింటుంటే ఒక అయోమయం.

నల్లమిరియం చెట్టు గురించి మాట్లాడుతూ, ఆకుపచ్చని దేశం లోకి వెళ్ళిపోతారు.  పోనీ దాని గురించి మాట్లాడుతారా అంటే ఉహు మళ్ళీ ద్రోహవృక్షంలోకి వెళ్ళిపోతారు.  అక్కడ ఉంటారా అంటే ఆబ్బే సుందరం అంట..ఆదెమ్మ అంట,  చెంచులు అంట, నరసింహం ఆత్మహత్య, మొసళ్ళు వాటితో యుద్దమా లేదా తప్పించుకుని అవతలి ఒడ్డుకి చేరటమా అన్న ఆలోచనంట..ఇవేవి కావు అసలు ఈ చంద్రశేఖరం గారు కవిత్వం వ్రాస్తున్నాడంటున్నారు, నా దృష్టిలో అది కవిత్వం కాదు..ఈ రచయిత రచనల మీద నేను పరిశోధన చేస్తున్నాను అని మరో వక్త.  సరే!  వాళ్ళు పుస్తకాలు చదివారు కాబట్టి వేదిక మీద ఉన్నవాళ్ళందరికి రచయితతో సహా తాము ఏమి మాట్లాడుతున్నారో తెలుసు.

మరి పాఠకుడి పరిస్థితి.

సీరియల్‌ని చదివిన పెద్దాయన కవి శివారెడ్డి.  ప్రతి వారం ఒక వార పత్రికని కొని..ఒక ముక్క చదివి..మళ్ళీ వచ్చేవారం కోసం ఎదురుచూస్తు..ముక్కలు ముక్కలుగా చదవటానికి విముఖుడు.  అలా చదవాలంటే చెడ్డ చిరాకు ఈ కవికి.  కాని ఆయన ప్రతివారం ముక్కలు ముక్కలుగానే చదువుకున్నాడంట సీరియల్‌ని.  అంతగా ఆకర్షించింది ఆయన్ని.  ఇక్కడ గుర్తుంచుకోవలసింది ఒకటి ఉంది.  ఆయన కవి. కథకుడు కాదు.  నవలా కారుడు అంతకంటే కాదు.  అవంటే పెద్ద ప్రేమా, మోజు లేదాయనకి. ఆయనే చెప్పుకున్నాడా మాట ఆ వేదిక మీద నుంచి.  ఏకంగా 22 పేజీల ముందుమాట వ్రాసేయించింది ఆ నవల ఆ కవితో.

ఎవరూ ఏ పుస్తకాన్ని ఒక్క సారి చదివి నమిలి పిప్పిని పారేసిన వారు కాదు, బెకన్ అన్నట్టుగా.  మాట్లాడిన వారందరూ ఆ నవలలని..ఆ కథలని పరిచయం చేసిన వారందరు ప్రతి పుస్తకాన్ని ఆవాహన చేసుకున్నవారే.  ఆ పుస్తకాలు వారందర్నీ తమ ప్రపంచంలోకి రమ్మనమని సాదరంగా ఆహ్వానించినవి.  వీరు ఆ యా ప్రపంచాలలోకి వెళ్ళి ప్రతి పాత్రతోను పయనించి,  వారి జీవితాలని స్పృశించి, ఆ లోకాలను అనుభవిస్తూ వెలికి వచ్చారు.  మళ్ళీ అ సాహిత్యంలోకి వెళ్లాలనిపించి వెళ్ళారు.  వదలలేదు.  వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్లారు.  రేపు మరోసారి మళ్ళీ వెడతారు. వారి మాటలు వింటుంటే మళ్ళీ మళ్ళీ ఆ లోకాలలో విహరిస్తూనే ఉంటారనిపిస్తుంది.

నవీన్ వాసిరెడ్డి
సభకు అధ్యక్షుడు. నేను పోలీసుల చెకప్పులు, వినాయకుడి విగ్రహాలను తప్పించుకుంటూ హైద్రాబాదు ట్రాఫిక్కులోపడి ఈదుకుంటూ వెళ్ళేటప్పడికి ఆయన ఉపన్యాసం అయిపొయ్యి  వక్తలను ఆహ్వానిస్తున్నారు.

జగన్నాధ శర్మ  (నవ్య సంపాదకులు,) చాల క్లుప్తంగా మాట్లాడారు.
“సాహితీలోకంలో ఒక మాట ఉంది. 1910 నంచి 20/30 ల దాక తెలుగు సాహిత్యంలో అనువాద కాలం అని.  కాని నేను ఇప్పుడు చెబుతున్నాను.  2010 నుంచి  మళ్ళీ తెలుగు కధా సాహిత్యం, నవలా సాహిత్యం మొదలైనది.  భారతదేశంలోని ఇతర భాషలు తెలుగు భాష వైపు తెలుసు సాహిత్యం వైపు చూస్తుండాల్సిన తరుణం వచ్చేసింది.  దానికి కారణం చంద్రశేఖర రావు లాంటి రచయితలు.  నవల రూపు చూడకండి.  నవలలో వస్తున్న వస్తువుని చూడండి.  గొప్ప తెలుగు సాహిత్యం ఈ దశాబ్దం తో మొదలయ్యింది మళ్ళీ.  ఇంతకన్నా తెలుగు సాహిత్యం గురించి నేను చెప్పగలిగింది లేదు”.

కవి శివారెడ్డి
కవి శివారెడ్డి మూడు సార్లు చదివారు. ఆయన నల్ల మిరియం చెట్టు కి ముందుమాట(?) అందామా “ఒక గాధ గురించి” అని శీర్హిక పెట్టి..అంటారు కదా..తొలి వాక్యం లో.
” నేనిప్పుడో మహోపన్యాసం చెయ్యగలను డా॥ వి. చంద్రశేకఖర రావు గారి సాహిత్యం మీద”.

“Preconceived notions లేకుండా రచయిత దగ్గిరకు వెళ్ళే ఒక తరం పాఠకులొస్తారు. వచ్చారు.  విమర్శకులే రావాల్సింది.

ఊర్వశి అంటుంది పురూరవుడి తో,’ప్రేమ కావాలా..నీ అలంకారాలన్ని, ఆభరణాలన్నీ పక్కన బెట్టి దిగంబరంగా నా దగ్గిరకు రా,’ అని.  అలా పాఠకుడు అన్ని misconceived, wrong notions ని పక్కనబెట్టి – పరమ దిగంబరంగా వాచకం దగ్గిరకెళ్ళాలి –  ఆ పాల సముద్రం లో మునగాలి.”  అవి ఆయన మాటలు.

ఎ కె ప్రభాకర్ గారు
చంద్రశేఖర రావు సాహిత్యం గురించి సోదాహరణం గా వివరించారు. నల్ల మిరియం చెట్టుగురించి మాట్లాడుతూ వారి మిగతా సాహిత్యంలోకి సభికులను లాకెళ్ళారు.  ప్రత్యేకంగా ఆ నవల ముగింపుని పాజిటివ్ దృక్పధంతో నే చూడవచ్చు అని అన్నారు.

సీతారాం
చంద్రశేఖర రావు వచనం కవిత్వం కాదు.  ఆయన తన ఆవేదనని పరివేదని అలా వ్యక్తం చేస్తున్నాడు.  It is his expression of agony.  His form and content needs more critics. “ఆయన రచనలమీద పరిశోధన చేస్తున్నాను,” అని అన్నారు.  అంతగా కదిలించినవి చంద్రశేఖర రావు గారి సృజనలు ఆయనలోని విమర్శకుడిని.  నల్ల మిరియం చెట్టుగురించే తాను మాట్లాడు దాం అని అనుకున్నానని కాని..దాని పరిధి దాటి మాట్లాడారు.

గుడిపాటి
చంద్రశేఖర రావు గారి సాహిత్యం మీద చాల చర్చ జరగవలసి ఉంది.  ఇక్కడ కలిసిన ఈ రెండు మూడు వందల సాహితీవేత్తల మధ్య జరిగినదే కాదు.  ఇంకా జరగాలి.  వేదికలెక్కాలి.  పాఠకులు అందులో ఇన్వాల్ కావాలి.  ఇది ఇక్కడితో ఆగిపోదు.

రచయిత
నా కాల పరిస్థితులే నా రచనలని రూపొందించినవి. ఈ వేదిక మీద ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడం బాగుండదు.

జరిగిన సభ గుఱించి నా మాటలు:
ఎవరూ కూడా రచయిత వ్రాసిన ఏ ఒక్క కథకో ఏ ఒక్క నవలకో పరిమితం కాలేకపొయ్యారు.  కారణం రచయిత ఎన్నుకున్న వస్తువు, శిల్పం, శైలి, భాష.  ఒకరు దండోరా గుఱించి మాట్లాడితే, మరొకరు తెలంగాణా నేపధ్యంతో వ్రాసిన హె‌చ్ నరసింహం అత్మహత్య  గురించో లేక చెంచువుల గురించో..ఐదు హంసల గురించో మరో కథ గురించో మాట్లాడారు.  మధ్యలో కొ కు ఫోర్త్ డైమన్షన్ ని లాకొచ్చారు.

సాహిత్యం, పోకడలు, చంద్రశేఖర రావు రచనలు వారిమీద వారి ఆలోచనల మీద, ఆయన రచనలు తమ బుర్రకు పెట్టిన పనిమీద, పదునెక్కించిన రీతి..ఆ యా నవలల సాంఘిక, రాజకీయ, ఆర్ధిక, సామాజిక నేపధ్యాలు అధ్యయనం చెయ్యవలసిన అవసరం ఒకటేమిటి ఎన్నో అంశాలు..పరిపూర్ణమైన ఒక సాహితీ సభ అది.

కొత్త తరం పాఠకులు వచ్చారు!
కొత్త తరం పాఠకులు వచ్చారు. నేనంటున్నది కూడా అదే.  నవ్య సంపాదకులు అంటున్నది అదే!  కవి శివారెడ్డి అంటున్నది అదే.  ప్రభాకర్ గారు అన్నది అదే! సీతారాం చెబుతున్నది అదే!  గుడిపాటి చెప్పింది అదే! మీరందరూ చదవవలసిన పుస్తకాలు ఇవి.

చాలా రోజుల తరువాత సాహితీ మిత్రులను చాల మందిని కలుసుకున్నాను.  చాల సంతోషమేసింది.  ఎంత సాదరంగా అహ్వానించారో!  ఆదరంగా పలుకరించారో అందరూ.

ఇక మీరు చెయ్యవలసింది.
ఈ బ్లాగ్ పోస్ట్ చూసి ఇక్కడి దాకా చదివారంటే..మీకు అంతర్జాలంతో పరిచయం ఉండే ఉండాలి.  సాహిత్యం మీద అభిరుచు ఉండి ఉండాలి.  కాబట్టి ఈ మూడు పుస్తకాలు ముందు సంపాదించండి.తరువాత వీటిని కూడా సంపాదించి చదువుకోండి.

జీవని
లెనిన్ ప్లేస్
మాయా లాంతరు
ద్రోహవృక్షం..ఈవన్నీ ఈ రచయిత కధా సంకలనాలు.

నవలలు ఇవి:  ఐదు హంసలు, ఆకుపచ్చని దేశం, నల్ల మిరియం చెట్టు.
కినిగెలో ఈ ఒక కథా సంకలనం, రెండు నవలలు..ఈ బుక్స్ గాను ప్రింట్ బుక్స్ గాను ఉన్నవి.

దిష్టి చుక్క:
తెలుగు ప్రసార మాధ్యమాల ఫోటోగ్రాఫర్‌లు.  జరుగుతున్న సభ మధ్యలో దూరి, ఆ క్రమాన్ని ఆరాచకంగా ఆపేసి, తమ కెమరా ప్రలోభానికి కి లొంగనివాడెవ్వడూ లేడని చెప్పకుండా చెబుతూ దర్పంగా వచ్చినంత వేగంగా వెళ్ళిపోతారు.  వాళ్ళు అడ్డం రావడం కారణంగా గుడిపాటి, నవీన్, ఎ కె ప్రభాకర్ బొమ్మల్లో కనిపించకుండా పొయ్యారు.  తీసినవి సరిగ్గా  రాలేదు.  ఉన్నవి కాని ఇక్కడ పోస్ట్ చెయ్యలేదు.

గొప్ప సాహితీ సభ ఎందుకైనదంటే..ఎవరూ పక్కవారి చెవులు కొరకలేదు. గుస గుసలు లేవు.  ఫోన్లు మోగలేదు.  హాలు బయట కుహానా సాహితీవేత్తల అరుపులు, పెడబొబ్బలు లేవు. ఇక సభలో ఉన్నవారి సంగతంటారా!   అందర్ని ఆ వేదిక మీద వక్తలు తమ మాటలతో కట్టి పడేసారు.  ఇప్పుడు అర్థమయ్యిందా  ఆ రచయిత డా॥వి. చంద్రశేఖర రావు రచనా పటిమ?  పుస్తకాలు కొనుక్కుని చదువుకోండి.  చదువుకుని మీ బ్లాగుల ద్వారానో మరొక వెబ్‌సైట్ ద్వారానో మీ అభిప్రాయాలని పది మందితో పంచుకోండి! ఇక మొదలెట్టండి!

7 Replies to “ఈ దశాబ్దం నవలది, తెలుగు కథ ది!”

  1. చాలా పుస్తకావిష్కరణ సభల్లో జరిగేదే.ఆ పుస్తకం గురించి మాట్లాడేవారు దాన్ని సరిగా చదివిఉండరు.వాళ్ళకు తోచినవేవో మాట్లాడతారు .

    1. నా ఉద్దేశం “పుస్తకం గురించి మాట్లాడేవారు దాన్ని సరిగా చదివిఉండరు.వాళ్ళకు తోచినవేవో మాట్లాడతారు” అని కాదండి. వక్తలందరూ ముందే ఏమి మాట్లాడాలి అన్నది నిర్ణయించుకునే వచ్చారు. అందులో అనుమానం ఏమి లేదు. బహుశ నా పోస్ట్ మీకు ఆ అభిప్రాయం కలగచేసి ఉంటే అది నా పొరబాటు కాని వారికి సంబంధం లేదు.

  2. నేను నల్ల మిరియం చెట్టు నవ్య లో సీరియల్ గా వస్తున్నపుడు చదివాను. దళిత (మాదిగ) కోణం అర్ధం చేసుకోవటానికి నాకు ఆ నవల బాగా ఉపకరించింది. రచయిత కధనం శైలీ నాకు నచ్చాయి.
    తెలుగు పత్రికలను చదివే కొత్త తరం పాఠకుల డెమోగ్రఫీ మారిపోయింది. ఇప్పుడు దళితులూ బీ సీ లూ ఈ వారపత్రికల పాఠకుల లో ముఖ్య భాగం. కాబట్టీ దళిత వాదానికి పత్రికల లో మంచి రోజులు వచ్చాయి. ఒకప్పుడు తెలుగు సాహిత్యాన్ని వామ పక్ష భావాలు డామినేట్ చేఇనట్లు, ఇప్పుడు అస్థిత్వ వాదాలు తెలుగు సాహిత్యం లో మెయిన్ స్ట్రీం.

  3. 1.
    మీరన్నట్లు ముందుగా ఆలోచించుకొనే మాట్లాడేరనుకొందాము.కాని ఒక పుస్తక ఆవిష్కరణసభలో ప్రధానంగా ఏమి మాట్లాడాలి?ఆ పుస్తకం గురించి ,రచయిత గురించి సాహిత్యంలో దాని స్థానం గురించి మాట్లాడాలి.కాని అలా చెయ్యరని ,పై సభలో చెయ్యలేదని నా అభిప్రాయం.
    2.
    ప్రస్తుతం దళిత,అస్తిత్వ ,వాదాల నవలలు ఎక్కువగా వస్తున్నాయన్నారు.మంచిదే.తెలుగును పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యకుండా ఏవో రాస్తూ ఉండడం హర్షణీయమే.కాని ఇంకా ఇతర రకాలGenres లో కూడా రాస్తే ఇంకా మంచిది కదా.

  4. 1 – మూడు పుస్తకాల గురించి సభ ఏర్పాటు చేసినట్టు కనపడుతున్నది. కనీసం ఇద్దరు వక్తలు నల్ల మిరియం చెట్టు మీద మాట్లాడలని అనుకున్నారు. మాట్లాడారు కూడా. బహుశ రచయిత ఇతర రచనల గురించి కూడా మాట్లాడారు.
    2 – మీరన్నది నిజమే. ఇతర genres లో సాహిత్యం వస్తుందన్న నమ్మకం నాకున్నదండి. అందుకనే అన్నాను, “కొత్త పాఠకులు వచ్చేసారు. వెతుక్కుంటున్నారు,” అని.
    మీ స్పందనకి నెనరులండి మాధవ రావు గారు!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.