డా.వింజమూరి తో సరదాగా కాసేపు RainBow FM లో

వైద్యులు వింజమూరి సూర్య ప్రకాశ్ గారు రేపు అంటే

20th, శుక్రవారం2012 రోజున,
Rainbow (Radio channel) AIR FM 101.9 లో

Spreading Lights

కార్యక్రమం గురించి శ్రోతలతో

సరదాగా కాసేపు

పంచుకుంటారు.

మధ్యహ్నాం

1.30 కి

ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.

సరే.  ఇక ఈ డా. వింజమూరి ఎవరు?
Vinjamuri
డాక్టరు గారు.  వైద్యం చేసే డాక్టరు గారు.  కాని వైద్యం కాదు మన సంఘానికి కావల్సింది విజ్ఞానం.  అది పుస్తకాలలో ఉంది కాబట్టి దానిని ముందు ప్రజల మస్తిష్కాలలోకి ఇంజెక్ట్ చేస్తే సంఘం బాగు పడుతుంది అని నమ్మి డాక్టరిని వదిలేసి ఇదిగో ఈ పస్తకాల పూజతో ప్రజలని సేవించుకుంటున్నారు.  ఒక్క రూపాయి అడగరు. నిస్వార్ధంగా చేస్తున్నారు ఈ డాక్టరు వింజమూరి గారు.

Spreading Lights
వారు మొదలుపెట్టిన “Spreading Lights” కార్యక్రమలో ఒక భాగమే పుస్తకాలను చదువుకోవడం. రచయిత తన పుస్తకాన్ని కాని, పాఠకుడు తనకు నచ్చిన పుస్తకాన్ని కాని పది మంది తో ను పంచుకోవడం ఈ కార్యక్రమం విశేషం. భాగ్యనగరం లో ఐతే ప్రకాశ్ చొరవ,కృషి, పట్టుదల పుణ్యమా అంటూ ఇప్పుడు కనీసం పది చోట్ల ప్రతి వారం ఏదో ఒక దరోజున ఈ Spreading Lights కార్యక్రమం జరుగుతున్నది.  నేను కూడా వీటిలో పాల్గొన్నాను.

మీరు కూడా మీ ప్రాంతంలో ఈ Spreading Lights కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు.  మీరు ముగ్గురే ఐనా ఫరవాలేదు.  ముప్పై మంది ఐతే మరీ సంతోషం.  🙂

సరదాగా కాసేపు

ఇక  రేపటి సరదాగా కాసేపు ప్రతి సాహిత్యాభిమాని తప్పక వినదగ్గ రేడియో కార్యక్రమం. నిజమే,ఏ సాయంత్రమో ఐతే బాగుండేది, ఆఫీసులకి వెళ్ళేవాళ్ళకి ఇబ్బందే.

ఐనా వినడానికి ప్రయత్నించండి.

ఇక్కడ పైన ఉన్న చాయచిత్రంలో మీ ఎడమవైపు నుండి రెండో వారు శ్రీ వింజమూరి సూర్య ప్రకాశ్ గారు. (భుజానికి సంచీ తగిలించుకుని ఉన్నారే వారే)

I found Telugu literature dead

ఏప్రిల్ నెలలో విడుదలైన మిసిమి లో వెలగా వెంకటప్పయ్య గారు ఒక వ్యాసం వ్రాసారు.  దాని మకుటం “విదేశీయులు ప్రచురించిన తెలుగు గ్రంధాలు“.  (పుట 58 – 62).  అందులో బ్రౌన్ దొర గారి ప్రస్తావన కూడా ఉంది.  1825 లోనే దొర ” I found  Telugu literature dead ” అని వ్యాఖ్యానించాడు.  దాదాపు 30 సంవత్సరాల తరువాత ” In thirty years raised it to life” అని కూడా అన్నాడు.

Charles Philip Brown

చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్, ఒక ఇంగ్లిష్ దొర మన భాష కోసం పడ్డ కష్టం ముందు, మనదెంత.  మనకున్న వనరుల ముందు ఆ దొరకున్నదెంత?  ఆయన చేయగాలేనిది, మనం ఈ రోజున ఉమ్మడిగా నైనా చెయ్యలేమా?

కినిగె లో మిసిమి ని ఇక్కడ కొనుక్కోవచ్చు, లేదా అద్దెకి చదువుకోవచ్చు!

ఈబుక్స్‌కి లేవా సమీక్షకు అర్హతలు!

పిలల్ల నామకరణానికి నేమ్స్ కోసం నెట్‌ని ఆశ్రయిస్తాం.
వాళ్ళ సందేహలు తీర్చడానికి జాలంలో జవాబులు వెదుక్కుంటాం.
అర్ధాలు చెప్పడానికి ఆన్‌లైన్ డిక్షనరీలు చూసుకుంటాం.
ఆ పిల్లల పరిక్షా ఫలితాలని ఇంటర్నెట్ ‌లో తెలుసుకుంటాం.
ఉద్యోగాలకి ఇంటర్నెట్‌లో అప్ప్లై చేసుకుంటాం.
ప్రేమలేఖలు, ఊస్టింగ్ ఆర్డర్లు, గ్రీంటిగ్‌లు ఆన్‌లైన్‌లో అందుకుంటాం.
ఫేస్‌బుక్కు‌లోను, జీప్లస్సు‌లోను స్నేహాలు చేస్తాం.
కోడల్లని, అళ్ళుళ్ళని నెట్‌లో వెతుక్కుంటాం.
బస్సు టికెట్లు, రైలు టికెట్లని, సినిమా టికెట్లని ఇంటర్‌నెట్‌లో కొనుక్కుంటాం.
పాన్ కార్డ్లు, వోటర్ కార్డులకి ఫారాలు ఆన్‌లైన్లో నింపుతాం.
RTI రా భయ్, అని వాడ్ని ఆన్‌లైన్‌లో నిలదీస్తాం.
పత్రికలని, కథలని, కవితలని ఆన్‌లైన్‌లో చదువుకుంటాం.
స్టోరిని, ఫీచర్‌ని, కవరింగ్‌ని, ఐటంని ఈమైల్‌లో పంపుకుంటాం.

EBook

ప్రింట్ బుక్ ని, డి‌వి‌డిని, ఈబుక్ ని ఆన్‌లైన్‌లో కొనుక్కుంటాం.
కొనుక్కున్న ఈబుక్‌ని కిండిల్ లోను, ఐపాడు లోను అందరూ గమనించేలా చూసుకుంటాం.  లాప్‌టాప్‌లోనూ, డెస్క్‌టాప్‌లోను అప్పుడప్పుడూ చదువుకుంటాం.

ఉచితం  గా పుస్తకాలని అందుకుంటాం, స్వీకరిస్తాం, రివ్యూ చేస్తాం, సమీక్షిస్తాం. పుస్తకం అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాలలో దొరుకుతుంది అని కూడ పాఠకులకి చెబుతాం. తన ఈ బుక్ గురించి రచయిత తెలియజేస్తే, అది మాకూ తెలుసన్నట్టుగా బుర్ర ఊపుతాం.

కాని..
కాని
ఈబుక్ గా వెలువడిన సాహిత్యాన్ని గుర్తించం. ఒకవేళ గుర్తించినా స్వీకరించం. స్వీకరించినా రివ్యూ చెయ్యం, సమీక్షించం, ఆన్‌లైన్‌లో ఎక్కడ దొరుకుతుందో అని కూడా పాఠకుడికి తెలియజేయం. అదేమిటంటే ఈబుక్స్ గురించి అందరికి తెలిదుగా అని అనేస్తాం. స్పేసు లేదండి అని అంటాం. పైగా మిగతావాళ్ళేవరూ, ఈ భాషలోను చెయ్యటం లేదుగా అని కూడా అనేస్తాం. మరీ ఐతే, టెక్ని‌కల్ సమస్యలున్నాయని దాటేస్తాం.

అదే మా వాడేతే భుజాలమీదకెక్కించుకుని ఊరేగిస్తాం.

కాని మా సాహిత్యాభిమాన్నాన్ని శంకింస్తే మాత్రం ఊరుకోం!

కొసమెరుపు ప్రాసారమధ్యమాలలో పనిచేస్తున్నవారి పుస్తకాలు కూడా kinige.com లో ఉన్నవి.  కనీసం ఇప్పుడైనా ఈ సాహిత్యాన్ని ఈ ప్రసార మాధ్యమాలు గుర్తిస్తాయని, దానికి సముచిత స్థానాన్ని కలిపిస్తుందని ఆశిస్తాను.

త్రిపురనేని గోపిచంద్ తపాళ బిళ్ళ విడుదల

త్రిపురనేని గోపిచంద్ తపాళబిళ్ళ ప్రదానోత్సవ అహ్వాన పత్రిక.

మీకు సాదర అహ్వానం.

త్రిపురనేని గోపిచంది తపాళబిళ్ళ విడుదల సభ ఆహ్వాన పత్రిక
త్రిపురనేని గోపిచంద్ తపాళబిళ్ళ ప్రదానోత్సవ అహ్వాన పత్రిక. కార్యక్రమం
మీకు సాదర అహ్వానం.
Commomoretive Postal Stamp Release Honoring Telugu Author Gopichand Tripuraneni
An invitation to the Postage Stamp Release Function on Gopichand Tripuraneni

మో “బ్రతికిన క్షణాలు” లో కొన్ని..

ఆరేళ్ళో అరవై ఏళ్ళో బ్రతుకుతాం.  ఆరేళ్ళముందెలా పుట్టామో ఎవడికి తెలీదు.  అరవై తర్వాత ఎలా చస్తామో మనకి తెలీదు.  తీసుకు తీసుకుని తడిసిన నులక మంచానికి తప్ప ఆరు నుంచి అరవైదాక ఈలోపల బేరామాడ్తాం. చివరకు గిట్టుబాటవుతుంది తప్పక.

ఒకే కవితకు ఆరు అర్థాలు ఒస్తాయని ఒకడు అమ్మ చూపుతాడు.  ఆరూ అనర్థాలే.  అసలు అర్థం అమ్మేవాడికే తెలీదు. కొనేవాడు నూరర్థాలు అడుగుతాడు – ఓ శతాధిక గ్రంధకర్తని.  శతపత్ర సుందరిని అరవై ఏళ్ళ ఆంధ్ర కవిత్వాన్ని ఆరు రూపాయలకే అచ్చెయ్యమంటాడు అరసున్నాలకి అమ్ముడు పోయేవాడు.

మో వీటిని ‘పద మూర్చన’ లన్నాడు. చచ్చిన తర్వాత చెప్పే మొదటి మాటలంట!  పైగా అంటాడు..”వాస్తవాన్ని అధివాస్తవికంగా మలుచుకునే ప్రయత్నంలో వచనం విరిగి ముక్కలయ్యి ఆ గాజు పెంకులు పద్యానికి గుచ్చుకొంటాయి”ట.

“ప్రతి నేనుకి ఒక మేనుంటుంది.  నేను లోంచి మేము, మనం అవటానికే ఏ రచన అయినా.  తారీఖులూ, దస్తావేజులూ ఏమిలేని అనామక స్వీయ జీవన చిత్రణ ఈ ‘బతికిన క్షణాలు‌’.  దృశ్యం అదృశ్యంగాను శబ్దం నిశ్శబ్దంగానూ రంగులు పులుముకుని మాటలుగా మ్రోగుతాయ్.

అంతాలో ఎంతో కొంత యిది.

ఎక్కువ మాట్లాడే వాడు ఏది చెప్పడు.

నిశ్శబ్ద క్షణంలో శాశ్వత శబ్దాన్ని పట్టుకోవాలని

ఈ నూత్న యత్నం”.

వెతకండి..ఎక్కడన్నా దొరికితే, దొరకబుచ్చుకుని చదవండి. చదివి ఆ “బతికిన క్షణాలు” మళ్ళీ బతకడానికి ప్రయత్నించండి.

ఎందుకంటే “మో” ఆ “బతికిన క్షణాలు” అన్నింటిని ఐదు వందల ప్రతులకి మాత్రమే పరిమితం చేసాడు..అది ఒక దశాబ్దం క్రితం!

మో “బ్రతికిన క్షణాలు” తొలి ముద్రణ 1990 – మలి ముద్రణ  2000

అశాశ్వత సత్యం; శాశ్వతం

కవిత నుండి కొన్ని పంక్తులు:

ఎన్ని బాడిలు అన్ని జన్మలు ఎన్నిక్షణాలు

నిల్చి సాగి తూలి జారి రాలి

నిలూనా చీలుస్తాయి నిన్నూ నన్నూ

రక్తాక్షరాలలో ఏ కవి రాసుకుంటాడు ఎన్నని

ఇన్ని సత్యాల్ని ఇన్ని ప్రేగుల్ని

బొమికెల్ని చర్మపు నునుపుల్ని

సౌందర్యపుటుంగరాల్ని కేశపాశపు మోహపు మెలికల్ని

మమతా మైత్రి పాశాలెన్నని తెంచుకుంటాడు

ఎన్ని రంగుల్ని ఉడుపుల్నిఒల్చుకుంటాడు

ఆయాసంతో

ఏ అసఫలీకృత కాంక్షల్ని

పాపం! ఎన్నిటినని పేర్చుకుంటాడు

దేహం గొప్పది దేహమే గొప్పదనకుండా!

ఆత్మలేదు

శరీరం అనాత్మ.

 చితిచింత లోని ఒక కవితలోని పై పంక్తులు “మో” వి.

మో ఇక లేరు.

‘మో’ ఎవరు?

అని నిన్న నన్నొకరు అడిగారు.

ఎక్కడ?

రవీంద్రభారతి, భాగ్యనగరం.

సందర్భం:

తనికెళ్ళ భరణి సాహితి పురస్కార ప్రదానం.

కూర్చోడానికి ఖాళీ కుర్చీ కనపడక అడిగినట్టున్నాడు.  అడిగిందెవరా అని వెనక్కి తిరిగి చూసాను.  కళ్ళజోడు. నెరిసిన జుత్తు. “సభ మొదలైన తరువాత తెలుస్తుందండి మీకు”, అని  మళ్ళీ నా దృష్టిని వేదిక మీదకి సారించాను.

అవధానం జరుగుతున్నది. అప్రస్తుత ప్రశ్న ; ” అత్యంత లోభి కూడ దానం చెయ్యలేనిది ఏది?”.  అవధాని గారు జవాబిచ్చే లోపే, నా చుట్టూ ఉన్న ప్రేక్షకులు ” కాలధర్మం” అని ఘొల్లుమన్నారు.

అధ్యక్షుడు సి. నారాయణ రెడ్డి గారు, నిషాదం అంటే సంగీతంలో సప్తమ స్వరం అని  వివరిస్తూ.. మో పుస్తకం నిషాదం చదవడం మొదలుపెట్టినప్పుడు..”ఏమో‌” అని అనుకున్నానని కాని “అమ్మో” అని అనిపిస్తుందని అన్నారు.

గవర్నమెంట్ ఎలిమెంటరి స్కూల్ళో చదువుకున్న తనకు, “మో‌” నిషాదం మీద మాట్లాడేంత పరిజ్ఞానం లేదని, నటుడు భరణి ఇలాంటి సత్కార్యాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అందజేసారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య.

ఇక తెలుగు భాష బోధకుడిగా కొన్నాళ్ళు ఉద్యోగం చేసినా, చలన చిత్ర నటుడుగా బ్రహ్మాండంగా సాగిపోతున్న బ్రహ్మానందం,

“అది గది

దాని అద్దె పది”

అనే కవితలోస్తూన ఈ రోజుల్లో, మో నిషాదం చదివి, అర్ధం చేసుకుని, జీర్ణం చేసుకునే అవకాశం ఆ భగవంతుడు తనకివ్వలేదని, తన ఫేసుకి ఆయన ఒక స్టఫ్ ని ఇచ్చి ప్రజలని రంజింపజెయ్యమన్నాడని చెప్పుకొచ్చారు.

ప్రేక్షకులతో పాటూ గా కూర్చోవలసిన తనను, వేదిక మీద కూర్చోపెట్టిన భరణి, తన అభిమానాన్ని చాటుకున్నాడే కాని తనకి ఆ అర్హత లేదని, వినమ్రంగా విన్నవించుకున్నాడు నటుడు ప్రకాశ్ రాజ్.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ‘మో‌’ మీద కోపం వచ్చింది.  ఔను, దర్శకుడు శ్రీనివాసే! ‘మో‌’ చదివినంత తను చదవలేదు కాబట్టి, తన కోపం.  ఆ కోపంతో ఆ సాహిత్యం అంతా చదివేస్తానంటాడియన.  అసలు తనకి రవింద్ర భారతి కార్ పార్కింగ్‌లో నిలబడే అర్హత కూడా లేదని కాని భరణి మాట తీసెయ్యలేక వేదిక మీద దాక్కోడం కుదరక కూర్చున్నాని నవ్వుల మధ్య చెప్పాడు.

న్యాయనిర్ణేతలు శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు, ఆచార్య మృణాళిని, కవి శివారెడ్డి.  తాము ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నుకున్న కవితా సంపుటి “నిషాదం” అని తమకు అందిన 108 కవితా సంపుటాలలో దానిని ఎన్నుకోవడానికి గల కొన్ని కారణాలని వివరించారు, కవి శివారెడ్డి.

తనికెళ్ళ భరణి, చక్కని చామరం క్రింద ‘మో‌’ అని  మనం పిలుచుకునే వేగుంట మోహన ప్రసాద్ ని సుఖాసీనుడిని చేసి, వేద పండితుల మంత్రోచ్హారణల మధ్య  స్వర్ణ పుష్పాభిషేకం చేసారు. వేదికనలంకరించిన పెద్దలలో చలన చిత్ర కథకులు, సంభాషణ కర్త పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన వేంకటేశ్వర రావు గారితో సహా అందరూ ‘‌మో’ కి తమ శుభాకాంక్షలు అందజేసారు.

‘మో‌’ తన దైన శైలిలో..ముందే వ్రాసుకుని తెచ్చుకున్న పాఠం నుంచి కొంత మేరకు చదివి వినిపించారు.

బర్త్ డే బాయ్ భరణికి కొంత మంది మిత్రులు తమ శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు.

జాతీయ గీతం జనగణ మణతో సభ ముగిసింది.

ఎటువంటి హడావిడి లేకుండా, వెకిలి ప్రసంగాలు, అనవసరపు డప్పాలు లేకుండా సాఫీగా, హాయిగా జరిగిన గొప్ప సాహిత్య సభ ఇది.  తెలుగు కవి కి తెలుగు కవిత్వానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే పండుగ రోజులకి ఇది తొలి రోజు మాత్రమే.

భరణి తన మాటల్లో చెప్పిన “గద్వాల్ సంస్థానం వారి ఆచారం” మళ్ళీ మొదలవ్వాలని..తెలుగు భాష బ్రతకడానికి ఇటువంటి సాహిత్య కార్యక్రమాలు విరివిగా జరగాలని మనమందరం కోరుకోవాలి.

వీలైతే ‘మో‌’ ప్రసగం పూర్తి పాఠం, అలాగే మితృడు నరేశ్ నున్న ‘మో‌’ మీద వ్రాసి, అచ్చొత్తంచి, ఉచితంగా పంచిన ఒక చిన్న పుస్తకాన్ని మీకు ఇక్కడ అందించడానికి ప్రయత్నిస్తాను.

ఈ తనికెళ్ళ భరణి సాహితి పురస్కారం జరిగినది కళా ఫౌండేషన్ ఆధ్యర్యంలో..కనకధార వెంచర్స్ సహాయంతో..

కినిగె.కాం లో

తనికెళ్ళ భరణి సాహిత్యం ఇక్కడ  ..  ‘మో’ నిషాదం ఇక్కడ  లభ్యం.

విదేశాలలో ‘కవిరాజు‌’ త్రిపురనేని 125వ జయంతి కార్యక్రమాలు

విదేశాలలో కూడా ‘కవిరాజు‌’ 125 జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారని నేటి ఆంధ్రజ్యోతి ద్వారా వారి మనుమడు, త్రిపురనేని గోపిచంద్ గారి పుత్రుడూ, లఘు / చలన చిత్ర నిర్మాత, దర్శకుడు, ప్రముఖ నటుడు  త్రిపురనేని సాయిచంద్ తెలియజేస్తున్నారు.

ఈ పత్రికా ప్రకటన మూలంగా కొంత  సమాచారం అందినా, సభా వేదిక, సంప్రదించవలసిన వారి వివరాలు తెలియడం లేదు.  బహుశ స్థలాభావం వల్ల పత్రికలు ఆ వివరాలను ఇవ్వలేక పోయినవేమో! ఆయా ప్రాంతాలలోని తెలుగు వారికి, ‘కవిరాజు’ అభిమానులకి ఆ వివరాలు అందిస్తే బాగుంటుంది. మీలో ఎవరికైన ఆ వివరాలు తెలిస్తే నాకు అందించ గలరు.  అందరికి అందుబాటులో ఇక్కడ పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ పత్రికా ప్రకటనలో ఉన్న వివరాలతో మీరు ప్రయత్నించ గలరు.

వివిధ దేశాలలో కార్యక్రమం వివరాలు

అమెరికాలోని డల్లస్ నగరంలో మే 14 న  – శ్రీ తోటకూర ప్రసాద్ ఆధ్వ్యర్యంలో,

న్యూ యార్క్‌ నగరంలో మే 15న – శ్రీ త్రిపురనేని తిరుమల రావు ఆధ్వర్యంలో,

సెయింట్ లూయి నగరంలో మే 20 న – శ్రీ దండమూడి ఆధ్వర్యంలోను జరగనున్నాయి.

అలాగే,

ఇంగ్లండ్ లో మే 28 న – శ్రీ చదలవాడ సుబ్బారావు ఆధ్వర్యంలోను,

లండన్ నగరం లో మే 28 న – శ్రీ దాసోజు రాములు ఆధ్వర్యంలోను ఈ సభలను నిర్వహించడానికి ఏర్పాటులు జరిగినవి.

kaviraju anniversary in USA, Canada, UK
అమెరికా,కెనడ, ఐరోపాలలో కవిరాజు త్రిపురనేని రామస్వామి 125 జయంతి ఉత్సవాలు

నేటి ఆంధ్రజ్యోతిలో పత్రికా ప్రకటన