కుక్క బిస్కత్తులు కుక్కలు తింటాయ్.
యజమాని బిస్కత్తులు ఎప్పుడు విసురుతాడా అని ఎదురుచూస్తూ ఉంటాయ్.
అచ్చం మనుషుల్లాగానే, నక్కలు, తోడేళ్ళు కూడా ఉంటాయి, కుక్కల్లాగా తింటాయి!
కాని సింహం అలా కాదు.
ఎవరో వొచ్చి పెడతారని ఎదురు చూడదు.
ఆకలి వేస్తేనే వేటాడుతుంది.
ఆకలి వేసినప్పుడు సింహాం పంజా విసురుతుంది.
మెడని విరిచి, చంపి తాపీగా తింటుంది.
తను తినగా మిగిలితే వదిలేస్తుంది.
కడుపునిండినా కుక్కుకుంటూ కూర్చుని తినదు.
నక్కలకి తోడేళ్ళకి, రాబందులకి, డేగలకి ఇతర ప్రాణకోటికి వదిలేస్తుంది.
కుక్కలాగా మనిషి కాళ్ల దగ్గిర కూర్చుని దేబిరిస్తూ ఉండదు, సింహం.
సింహం మృగరాజు. రారాజు.
ఏనుగులాగా చచ్చినా బ్రతికిఉన్నా దాని విలువ దానిదే!
జీవించినంత కాలం సింహం లా జీవించాలి!
బాలూ..వెండితెర మీద మరో కోకిల
నాకు గుర్తున్న బాలు మహేంద్ర ఈ క్రింది బొమ్మలో ఉన్నట్టు ఉండేవాడు.అప్పటికే మూండ్రాం పిరై విడుదలై పోయింది. సఫైర్ కాంప్లెక్స్ లోని ఎమరాల్డ్ లో చూసాను ఆ సినిమాని. సెకండ్ షో. తరువాత సత్యం ధియేటర్స్లో చూసాను. శివం లో అనుకుంటాను. తెలుగు సినిమాలలో కెమరా ఒకటి ఉంది, దానితో సినిమాని మనకి చూపించేవాడు కెమరమెన్ అని తెలియజేసిన అద్బుతమైన కెమరామెన్ వి ఎస్ ఆర్ స్వామి అని అనుకునేవాళ్లం నేను నా స్నేహితులం. అలాగే తమిళ సినిమాలకి బాలు.

కూర్చుని ఏదో చదువుకుంటున్నాను. నీడ, తరువాత అలికిడి. చదువుతున్న పుస్తకంలోనుండి తలెత్తి చూస్తే పొడుగ్గా ..నాకంటే ఎత్తు.. అదిగో ఆ బొమ్మలో లాగా ఆలివ్ గ్రీన్ కాప్ తో బాలు. నవ్వుతూ. మామూలుగా సినిమా రంగం వాళ్ళతో వాళ్ల సినిమా గురించి పబ్లిక్ గా ప్రస్తావించేవాడిని కాదు. ఆ రోజున మేమిద్దరమే ఉన్నాం. “మూండ్రాం పిరై బాగుంది. మీ కెమరా అద్భుతం”, అని అన్నాను. చిరునవ్వు తో సమాధానమిచ్చాడాయన. “నేను కూడా చాలా హాపి. అందరికి నచ్చింది. నాకూ నచ్చింది” అన్నాడాయన. తెలుగులో అదే “వసంత కోకిల” గా విడుదలైనది.

ఒక రెండు నిముషాలు అవి ఇవి మాట్లాడుకున్న తరువాత.. “తెలుగు లో గొప్ప సాహిత్యం ఉందంట కదా? ఏమైన మంచి పుస్తకాలు సజెస్ట్ చెయ్యండి అన్నాడాయన. “మీకు తెలుగు చదవడం వచ్చా?” అని ఆశ్చర్యంగా అడిగాను. “ఏం తెలుగు చదవడం నాకు రాకపోతే ఏం? ఎవరితోనైనా చదివించుకుంటానుగా!” అని అన్నాడాయన”.
అలా తెలుగు సాహిత్యం తో ఆయనకి పరిచయం. తెలుగు సాహిత్యం ద్వారా నాకు పరిచయం. ఆయన సినిమాలు అన్ని చూసాను. గొప్ప కెమెరామెన్. నిన్న #pepperspray కథ లేకుండా ఉంటే..బహుశ మన మిడియా వాళ్ళూ ఆయన క్లిప్లతో మోత మోగించేవారనుకుంటా!
ఏమైనా మరో మంచి కళాకారుడు వెళ్ళిపొయ్యాడు.
పాఠకుడే రారాజు
కా రా మాస్టారు ని అడిగాను, “చదవగలుగుతున్నారా?” అని. “ఇబ్బందిగానే ఉంది. ఇదివరకటిలాగా ఏకధాటిగా చదవలేక పోతున్నాను. ఐనా మధ్య మధ్య ఆపి కళ్ళకి కాస్త విశ్రాంతినిస్తూ చదువుతూనే ఉన్నాను. చదవకపోతే ఎలా? ఊపిరి ఆడదుగా?! మీకు తెలియందేముంది ?” అని అన్నారు. అప్పటికి వారికి సుమారు 86 ఏళ్ళు అనుకుంటాను. ఐనా చిన్న స్టూలు లాక్కుని దానిమీద కెక్కి నిలబడి, అటక మీదున్న కొన్ని పుస్తకాలని అందుకుని, దిగి తీసుకువచ్చి మీరు చదవాలని నాకు అందజేసారు. చదవడం మీద ప్రేమ అది.
“అదిగో, దానితో చదువుతున్నాను” అంటూ టేబుల్ మీదున్న భూతద్దాన్ని చూపించారు త్రిపుర, అదే ప్రశ్నని వారిని అడిగినప్పుడు. అది చూసినప్పుడు, “సమగ్ర ఆంధ్ర సాహిత్యం” కోసం భూతద్దం తో కుస్తీపడుతున్న ఆరుద్ర గుర్తు వచ్చారు. “చెక్కుల మీద సంతకాలు పెట్టగలుగుతున్నారా?” అని అడిగాను. “నా కోడి కెలుకుడిని మా బాంక్ వాళ్ళు సంతకం క్రిందే భావిస్తున్నారు. ఐ యాం థాంక్ఫుల్ టు దెం” అని అన్నారు త్రిపుర నవ్వుతూ. చదవకుండా, రాయకుండా ఎలా ఉండగలరు ఎవరైనా అన్నది వారి ప్రశ్న. చదవడం మీద ప్రేమ అది.
“ప్రతిరోజు నెట్ ని ఎప్పుడో ఒకప్పుడు చూస్తూనే ఉంటాను. కంప్యూటర్ మీద, నా రచనలన్నింటిని నేనే టైప్ చేసుకుంటాను నాకు ఇబ్బంది ఏమి లేదు. ఇంటర్నెట్ లో చదువుకుంటాను కూడా”, అని అన్నారు మొన్న “పెద్ధిభొట్ల సాహితీ పురస్కారం” అందుకున్న రచయిత్రి సత్యవతి పోచిరాజు. చదవడం మీద ప్రేమ అది.
“టాంక్ బండ్ మీద వెళ్తున్నప్పుడు వచ్చింది..ఒక ఫ్లాష్ లాంటి ఆలోచన. బండి అపేసి, పక్కనే లాన్లో కూర్చుని లాప్టాప్ మీద అప్పటికప్పుడు వ్రాసిన కధ “వర్డ్ కాన్సర్” అని తెలియజేసిన పాత్రికేయురాలు – వర్ధమాన రచయిత్రి అరుణ పప్పు. వ్రాయడం, చదవడం మీద ప్రేమ అది.
తెలుగు ఆచార్యులు. మల్లీశ్వరి గారు ఆన్లైన్లో వ్రాసుకున్న బ్లాగులను ఏర్చి కూర్చి “జాజిమల్లి” బ్లాగు కథలు గా ప్రచురించింది పర్స్పెక్టివ్ ప్రచురణ సంస్థ.
ఆ మధ్య ఒక పుస్తక ఆవిష్కరణ సభకి హైద్రాబాదు నుండి సకాలంలో అచ్చు పుస్తకాలు అమెరికాలో అందకపోతే, “ప్రింట్ ఆన్ డిమాండ్” సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడే తెలుగు పుస్తకాలన్ని అచ్చొంతించి ఆ ఆవిష్కరణ సభని నిర్విఘ్నంగా, విజయవంతంగా నిర్వహించుకున్నారు.
కేంద్ర సాహిత్య అకాడెమి లాంటి ప్రచురణ సంస్థలు కూడా ఈ నాడు రచయితలు తమకు పంపే రచనలను సాఫ్ట్కాపీలుగానే పంపమని కోరుతున్నవని గమనించాలి.
ఈ రోజు అదిలాబాదు లో తను రాసిన రచన ని ఆన్లైన్లో తన లాప్టాప్నుండే ఈపబ్లిష్ చేసుకుంటున్నాడు తెలుగు రచయిత.
అది ఈ రోజు రచనా వ్యాసంగంలో ఉన్న తెలుగు రచయితలు, వారి రచనలు, ప్రచురణల పరిస్థితి.
ఒకప్పుడు హైద్రాబాదులోని కోఠీలోనో, కాచీగూడాలోనో, వైజాగు గుప్తా బ్రదర్స్లోనో, విజయవాడ ఏలూరు రోడ్డులోని నవోదయలో నో, మద్రాసు పాండి బజారులోని రాణి బుక్ సెంటర్ లోనో, తెలుగు పుస్తకాలు కొనుక్కుని, మద్రాసు ఇంటర్నేషనల్ ఏయిర్పోర్టు నుంచి వెళ్ళే వారు ప్రవాసాంధ్ర పాఠకులు. కాని ఇప్పటి పరిస్థితి వేరు.
ఇల్లినాయ్లో ఉంటున్న అన్నయ్య, అదిలాబాదులో తన తమ్ముడికి కావల్సిన పుస్తకాన్ని ఆన్లైన్లో ఈబుక్ రూపంలో కొని ఈమైల్ ద్వారా పంపిస్తే దానిని డవున్లోడ్ చేసుకుని చదువుకుంటున్నాడు ఆ విద్యార్ధి. ఫ్రాన్స్ లో తెలుగు పదాన్ని ఉపయోగించడంలో సంధిగ్ధం ఎదురైతే ఆన్లైన్ లో ఆంధ్రబారతికి వెళ్ళి అర్ధం తెలుసుకుంటున్నాడు తెలుగు భాషాభిమాని.
ఇంటర్నెట్ పుణ్యామా అని పుస్తకాలకోసం ఇది వరకటిలాగా గంటల సేపు ప్రయాణాలు, రోజుల తరబడి విలువైన సమయాన్ని వెచ్చించి వెతుక్కోవడం తగ్గింది. ఆన్లైన్ లో ఈబుక్స్ మాత్రమే కాదు, అచ్చు పుస్తకాలు కూడా కొనుక్కోవచ్చు, బంగారం, బస్సు, టికెట్లు లాగా. కొనుక్కోవడమే కాదు, అద్దెకి కూడా తీసుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల మీద దాడికి అమెరికా ఉపయోగించిన “డ్రోన్” ల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్న నవతరం “డ్రోన్” తో పాఠకుడు కోరుకున్న అచ్చు పుస్తకాన్ని అతని ఇంటికే అతి తక్కువ ఖర్చుతో అందే ఏర్పాట్లు చక చకా సాగుతున్నవి.
మనవడితో మాట్లాడుకోవడానికి బామ్మ “టాబ్లెట్” తో కుస్తీ పడుతోంది. మనవరాలికి తెలుగు నేర్పడానికి “స్మార్ట్ఫోన్” ఆప్స్ని ఆశ్రయిస్తున్నాడు తాత గారు. సీరియల్స్ వచ్చి తెలుగు పుస్తకాలని పక్కకి నెట్టేసింది అనడం ఫాషన్ అయి’పోయింది’.
తెలుగు పాఠక ప్రపంచం దినదినాభివృద్ధి చెందుతున్నది. అంది పుచ్చుకోవలసిన వారు, రచయితలు, ప్రచురణ కర్తలే! వారిదే ఆలస్యం! పాఠకుడే రారాజు, ఈ రోజున!
గెస్ట్కాలం – ఈ రీడింగ్
ఈ రీడింగ్ – ఈజీ రీడింగ్
ఈ వ్యాసం నిన్న సాక్షి దినపత్రిక, ఫామిలీ లో మొదలైన గెస్ట్కాలం లో వచ్చింది. పుస్తకాలతో మొదలుపెడితో బాగుంటుందని అని వారనుకుని నన్ను వ్రాయమని కోరారు. ఆ సందర్భంగా వ్రాసిని వ్యాసం ఇది. అన్నట్టు ఈ గెస్ట్కాలం ప్రతి బుధవారం వస్తుంది. ఆయా రంగాలలో నిష్ణాతుఁలు వారనికొకరు మీకు అందిస్తుంటారు. ఇక వ్యాసం ఇది. స్థలాభావం వల్ల వ్యాసం కొంత “సంపాదకుల కోత” కి గురైంది. పూర్తి పాఠం తరువాత ఎప్పుడైనా వీలున్నప్పుడు ఇక్కడే పోస్ట్ చేస్తాను.
సూచన: బొమ్మ మీద క్లిక్ చెయ్యండి. సులభంగా చదువుకోవచ్చు
వేనరాజు “ఖూనీ”
“ఆంధ్రా బెర్నాడ్ షా త్రిపురనేని” అని అన్నది కట్టమంచి రామలింగారెడ్డి. ఆయన అనడానికి ఒక కారణం ఉంది. “కవిరాజు” త్రిపురనేని రామస్వామి తన రచనలకి సుధీర్ఘమైన పీఠికలు వ్రాసాడు, ఐరిష్ రచయిత జార్జ్ బెర్నాడ్ షా లాగ. పీఠికలు ఎందుకు వ్రాస్తారు? తను చెప్పదలుచుకున్నదానికి ఉపోధ్ఘాతం. ఆ రచనకి పూర్వాపరాలు. నేపధ్యం. ఎందుకు వ్రాయవలసి వచ్చింది. రచనకి ఉపయోగపడ్డ వస్తు సామగ్రి గురించి. ఇత్యాదులన్నింటి గురించి. ఒక వివరణ అని అనుకోవచ్చు. పీఠిక చదవడం మూలంగా రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు, ఎందుకు చెప్పదలుచుకున్నాడు అన్నది పాఠకుడికి కొంత తెలుస్తుంది. తరువాత రచయిత రచనలోకి ప్రవేశించవచ్చు. ఆ రచయిత ఆలోచన తెలుసు కాబట్టి ఆ దారంటే ఆ రచనని చదవవచ్చు. చదివిన తరువాత తనకి తెలిసిన దానితో బేరీజూ వేసుకోవచ్చు. తనకి తెలియని అంశం మీద ఐతే కొత్తది తెలుసుకుంటాడు. రచన వస్తు సామగ్రి గురించి ముందే తెలిసినవాడు మరొక పాఠకుడు. అతను దాని మీద అభిరుచి ఉంటే చదువుతాడు. లేక పోతే ఈ గోల నా కేల అని ఆ పుస్తకాన్ని అవతల పడే అవకాశం ఉంది.
“కవిరాజు“కి తను వ్రాయలి అని తెలుసు. ఎందుకు వ్రాయలో కూడా తెలుసు. ఎవరికోసం వ్రాయలో కూడా తెలుసు. తన రచనలు చదివే వారి గురించి కూడా తెలుసు. తన పాఠకుడుని ఆయన గౌరవించాడు. కాబట్టే అంత పెద్ద ముందుమాటలు, పీఠికలు వ్రాసాడు. తనతో పాటు తన కాలంలో ఉన్న తన సమకాలీనుల కోసం కూడా వ్రాసాడు. వాటిని తన కోసం వ్రాసుకోలేదు. తను నమ్మిన “లోక కళ్యాణార్ధం” వ్రాసాడు.
కాలం పరిగెడుతోంది. దానితో పాటు మనిషి పరుగెడుతున్నాడు. ఆ పరుగు క్రమంలో మార్పుకి లోనవుతున్నాడు. చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతున్నవి. మార్పు సహజం కదా! వేష, భాషలు, సంస్కృతి అన్ని ఎంతో కొంత మార్పుకి లోనవుతున్నాయ్. ఆ నేపధ్యం లో 1980 ప్రాంతాలలో మళ్ళీ కవిరాజు రచనల ని చదవడం మొదలు పెట్టాను. నా తోటి వాళ్ళు “కవిరాజు” రచనలను చదివిన వారు చాల తక్కువమందే కనపడ్డారు. కారణం భాష. త్రిపురనేని రామస్వామి చక్కని తెలుగులో వ్రాసినా, ఆ తెలుగు వీళ్ళకి పాషాణ పాకం లాగా కనపడుతుండేది. పైగా ఆయన మీద ఆయన రచనల మీద ఒక అభిప్రాయం. ఆయన దేముళ్ళని తిట్టాడు. నేను దేముడ్ని నమ్ముతాను కాబట్టి ఆయన దేముడిని నమ్మడు కాబట్టి ఆయన పుస్తకాలని నేను చదవవలసిన అవసరం లేదని వీరి భావన.
అప్పుడనిపించింది నాకు. ఈ తరానికి కూడా త్రిపురనేని రచనలు అందాలి. వాటిని మళ్ళీ మూలాలు చెడకుండా, ఈ నాటి యువత కి అందజెయ్యాలి అని. మద్రాసులో (చెన్నై ఇప్పడు) ” ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి చౌదరి ఫౌండేషన్” ని స్థాపించడం జరిగింది. ఆ ఫౌండేషన్ ఉద్దేశాలలో ఇది కూడ ఒకటి. కవిరాజు రచనలని యువతరానికి వారికి అర్ధమయ్యేరీతిలో వారు వాడుతున్న “తెలుగు” లోనే అందించాలని.
దాదాపు రెండు దశాబ్దాల తరువాత “కవిరాజు” త్రిపురనేని రామస్వామిని అభిమానించిన కీ శే బొడ్డు రామకృష్ణ, కవిరాజు “సూతపురాణం” రెండు భాగాలని వచనం చేసారు. 2011 లో ఆ వచన “సూతపురాణం” రెండు భాగాల్ని తెనాలి లోని కవిరాజు త్రిపురనేని ఫౌండేషన్ వెలవరించి ఉచితంగానే ఆ పుస్తకాలని పదిమందికి పంచింది. ఆ “సూతపురాణం” రెండు భాగాల్ని, పీకాక్ క్లాసిక్స్ , హైద్రాబాదు ప్రచురించింది.
సూతపురాణం వెలువడింది. మరి మిగతా రచనల సంగతి ఏమిటి? వాటిని ఎలా ఈ పాఠకులకి అందించాలి?
ఈ నేపధ్యం లో నేను సంప్రదించిన వారిలో గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా ఉద్యోగవిరమణ చేసిన, తెలుగు భాషాభిమాని, కవిరాజు త్రిపురనేని రామస్వామి ఆశయాలని నమ్మి ఆచరిస్తూన్న రావెల సాంబశివరావు గారు ఒకరు. వారి అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలిసినవి. త్రిపురనేని వేనరాజు మీద వ్రాసిన “ఖూనీ” నాటిక ని “మన మాటలు” లో ఈ తరానికి అందిద్దాం అని ముందుకువచ్చారు. వారే దానిని ఈ నాటి తెలుగు చదవగలిగిన వారికి అర్ధమయ్యేరీతిలో, పీఠికలతో సహా వ్రాసారు. 2013 జనవరి లో రామస్వామి జయంతి రోజునే దీనిని ప్రచురించాల్సింది. కారణాంతరాల వల్ల 2014 జనవరిలో “కవిరాజు” త్రిపురనేని రామస్వామి 127 జయంతి నాడు దీనిని ఈబుక్ రూపంలో మీకు అందజేస్తున్నాను.
బహుశ ఫిబ్రవరి, మార్చి నాటికి అచ్చులో కూడ ఈ పుస్తకాన్ని వెలువరిద్దామని అనుకుంటున్నాము.
మీకు అర్ధమయ్యే తెలుగులో, సుమారు 42 పేజీలూ మాత్రమే ఉన్న ఈ “ఖూనీ” ని చదవండి. మీకు నచ్చితే పదిమంది కి చెప్పండి. దీని మీద మీ అభిప్రాయాలు ఇక్కడే వ్యాఖ్యల ద్వారా తెలియజేయవచ్చు.
కినిగె.కామ్ లో ఈ కవిరాజు త్రిపురనేని రామస్వామి “ఖూనీ” ఈబుక్ని ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు:
http://kinige.com/kbook.php?id=2482&name=khooni
కొన్ని వేల ప్రతులని కినిగె తన పాఠకులకి అందించింది. ఐనా డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు కాని, చేసుకున్న తరువాత గాని ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే ఈ లింక్స్ని చదవండి.
http://kinige.com/help.php
ఇంకా అవసరం ఐతే [email protected] కి ఈమైల్ చెయ్యండి. వారు మీ సమస్యకి పరిష్కారం చూపిస్తారు.
ఉంటాను.
అనిల్
నో
“నాన్న”.
“ఊ..”
“రిటైర్..అయిపోయింతరువాత, ఏం చేద్దామనుకుంటున్నావు?”
“ఇక్కడే ఉంటాను”.
“అలా కాదు, ఒంటరిగా ఇక్కడెందుకు? మా దగ్గిరకు వచ్చి ఉండవచ్చుగా?”
“ఉహూ”.
“ఎందుకని?”
“మీ ఇంటికి వస్తే, నేను మీ హౌజ్ రూల్స్ పాటించాలి. అదే నా ఇంట్లో ఐతే నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. ఇన్ని సంవత్సరాలు నేను, మీ అమ్మ అందరం అలానే ఉన్నాం. మీ ఇంట్లో అలా ఉండటానికి కుదరదు. అందుకని, నో!”
కొత్త వంతెన
“కొత్త వంతెన”
నిన్న సాయంత్రం “కొత్తవంతెన” పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. “ఆంధ్రజ్యోతి” దిన పత్రిక సంపాదకుడు. కె.శ్రీనివాస్, ఈ వ్యాసాలను తొలుత “ప్రజాతంత్ర” పత్రికలో దాదాపు ఒక దశాబ్దం క్రితం ప్రచురించారు. వాటన్నింటిని ఇప్పుడు మళ్ళీ ఒక సంకలనం కింద “అనేక పబ్లికేషన్స్” ప్రచురించింది.
ఘంటా చక్రపాణి నిర్వహించిన ఈ సభలో “కొత్తవంతెన” అచ్చు పుస్తకాన్ని టిజాక్ అధ్యక్షులు కోదండరామ్ ఆవిష్కరించగా, “కినిగె” ఈబుక్ ని ఆచార్యులు జి హరగోపాల్ ఆవిష్కరించారు. రచయిత కె శ్రీనివాస్ కోరిక మేరకు “గొంతు బాగొలె”దంటునే “జై తెలంగాణ” పాటని పాడి ప్రముఖ గాయకుడు అందెశ్రీ సభికులను అలరించారు.

వేదికని అలంకరించినవారిలో షాజహాన, జూపాక సుభద్ర, “నమస్తే తెలంగాణ” సంపాదకుడు అల్లం నారాయణ ఉన్నారు.
విరసం సభ్యులు వరవరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సభలో మరో విశేషం ఏమిటంటే, రచయిత శ్రీనివాస్ తండ్రి శ్రీ సింగరాచార్యులు పాల్గొని ప్రసంగించడం.
ఇది జీవితమే…కథ కాదు
చదివిన కొన్ని వేల పుస్తకాలనుండి, అక్కడొక అధ్యాయం, ఇక్కడొక పేజి, మరెక్కడినుండో ఒక పేరా, మరో చోట నుండి ఒక పదబంధం తో అద్భుతమైన అనుభవాలతో ఏర్చి కూర్చిన పూలదండ కాదిది.
శిల్పం, శైలి, ప్రక్రియలతో కథనంకు కావల్సిన దినుసులతో పాఠకులను అలరించాలని వండి వార్చినది అంతకంటే కాదు. వారేవరో అడిగినట్టు..ఒక మంచి సంపాదకుడు చెక్కిన శిల్పం అసలే కాదు.
జీవితం అలవోకగా, నిర్లక్షంగా, విదిల్చిన గాజుపెంకులు హృదయపు మాంసపు ముద్దలమీద గీసిన గాట్లనుండి, స్రవిస్తున్న రక్తపుబొట్లతో తడిచి పోతున్న పచ్చి గాయాలనుండి జారి పడిన మాటలివి.
ఆఫ్సర్ కి కృతజ్ఞతలతో..
పాదసూచికః ౩౧ మార్చ్ ౨౦౧౭ తో బహశ సారంగ సర్వర్స్ డౌన్ అయిపోతాయి. అందుకని నా స్వంత గూగుల్ డైవ్ కి ౨౮ మార్చ్ న లంకె ఇఛ్హాను.
మీకు తెలిస్తే చెప్పరూ!
మాలతీ చందూర్ – మద్రాసు – ఒక స్మృతి
మొన్న జనవరి లో కలిసాను మాలతీ చందూర్ గారిని. వారింట్లోనే. కచేరి రోడ్డు లో, మైలాపూర్లో శాంధోమ్ చర్చి కి దగ్గిర్లో. వారింటి పక్కనే ఒక కేరళ వైద్యశాల ఉంటుంది. శ్యామలాంబ గారు వారి సోదరి. నేను, ఆరుద్ర రామలక్షి గారి పిల్లలు, దాశరధి గారి పిల్లలందరం కలిసి చదువుకున్న చిల్డ్ర్న్స్ గార్డెన్ స్కూలో లో వారు ఉపాధ్యాయురాలు. దాదాపు మా కుంటుబాలు అన్ని కూడా 4 దశాబ్దాలుగా కలుస్తునే ఉన్నాయి. సాహిత్య సభలు కానివ్వండి, సినిమా ప్రీవ్యూలు కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, వివాహాలు కానివ్వండి మరొహటి కానివ్వండి.
చందూరు గారు వచ్చేవారు, హెరాల్డ్ కారులో. మాలతీ గారు కూడ వారితో బాటే. సినిమా సెన్సార్ బోర్డ్ కి వేసే సెన్సార్ షో కి నేను కూడ వెళ్ళేవాడిని. సినిమా నటుడు, ఛంద్రమోహన్ మామగారు, రచయిత్రి తులసి జలంధర గారి తండ్రి , డా గాలి బాలసుందర రావు గారు అద్దెకుండే ఇంట్లో ఒక పక్కగా ఖాళీ స్థలం ఉండేది. దానిలో సాహితీ సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. వాటికి కూడా భార్యా భర్తలు ఇద్దరూ వస్తుండేవారు.
1996 లో మా అమ్మ చనిపోయిన తరువాత ఫోనులో పలకరించుకోవడమే గాని, నేను వెళ్ళి కలిసింది లేదు. కాని మొన్న జనవరిలో వెళ్ళినప్పుడు కలిసాను. సాయంత్రం కలుద్దామనుకుంటే, మరుసరి రోజు ఉదయం కలుద్దామని అన్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో వెళ్ళాను. దాదాపు గంటో గంటన్నరో గడిపాను. మద్రాసులో తెలుగు వాతావరణం, తెలుగు సాహిత్య సభలు, సమావేశాలు, ఆ వాతావరణం, ఆంధ్ర రాష్ట్రం లో సాహిత్యం, సాహిత్య రంగంలో రాజకీయాలు వగైరాలు సాహితి మిత్రుల గురించి వాకబులు, కబుర్లు.
“జగతి” గురించి ప్రస్తావన వచ్చింది. చందూర్ గారు పోగానే “జగతి” ప్రచురణ ని ఆపేసానని చెప్పారు. ఇంతలో నేను వద్దని వారిస్తున్నా వినకుండా “కాఫీ చేసి తెస్తానుండు”, అంటూ మా టీచర్ గారు లోపలికి వెళ్ళారు. “అనిల్ తో మామయ్య గురించి మాట్లాడవచ్చు అంటావా?” అంటూ మాలతి గారు మా టీచర్ గారిని అడగటం..వారు “తనేమన్నా బయట వాడా నువ్వు మాట్లాడకుండా ఉండటానికి” అంటుండగానే..లోపలికి వెళ్ళి ఇంతలావు బైండ్ చేసిన పుస్తకం తీసుకువచ్చారు. అదే “జగతి డైరి”. జగతి నుంచి ఏరి కూర్చిన వ్యాస సంకలనం. చందూరు గారి వ్రాసినవి. ఎంతొ ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో ఆ పుస్తకాన్ని నాకు చూపించారు ఆవిడ. దాదాపు ఒక సంవత్సర కాలం “జగతి” లన్ని ముందేసుకుని వాటిలో ఏరి కూర్చిన సంకలనం అది. అంత పెద్ద పుస్తకానికి ధర కూడ తక్కువే పెట్టారు.
నా భార్య గతించిన విషయం తనకి తెలిసిందని అంటూ తను వ్రాసిన శిశిరవసంతం నవల లో “సంధ్య” గురించి చెబుతూ ఆ నవలని తప్పకుండా చదవమని కోరారు. ఆ నవలలో “సంధ్య” కి కాన్సర్. కాన్సర్ తో చేసిన యుద్దంలో సంధ్య గెలుస్తుంది ఆ నవలలో.
పాత్రికేయురాలు అరుణ పప్పు వ్రాసిన కథా సంపుటి “చందనపు బొమ్మ“కి ఒక పరిచయ సభని మద్రాసులో ఏర్పాటు చేసినప్పుడు ఆ నాటి సాయంత్రం వక్తలలో ఆమె ఒకరు. సినీ రచయిత, కవి భువనచంద్ర, నటి లక్ష్మి, నిర్మాత కాట్రగడ్డ మురారి, ఘంటసాల రత్నకుమార్ తదితరులు ఆ సభలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో తన కోసం ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళి వారితో సంతంకం చేయించుకున్న జ్ఞాపకంగా మిగిలి పోయిన “శిశిర వసంతం” నవల ఇది. కాని నిజ జీవితంలో గెలిచిన మాలతీ చందూర్ కాన్సర్ తో చేసిన యుద్దంలో పరాజిత.