“నేనైన నీకు నీవైన నేను” అని 2006 లో అన్నాడామాట. పైగా అతి రమణీయం గాను.
“రాయడం ఒక దురద,” అని కూడ అన్నాడు.
“ఆ మాట చాలా చీప్ గా ఉంది,” అని ఒకానొక పాఠకుడి ఒక వ్యాఖ్య.
“నా కథల్లో అంతర్లీనంగా తార్కికత, తాత్వికత కనిపించడానికి నా చిన్నప్పటి అధ్యయనం కారణం కావచ్చు,” అని నిన్న అన్నాడు.
ఇంకా ఆరుపదులకి ఆమడ దూరంలోనే ఉన్నా..ఒక ఆరుపదులవరకు రాసేసాడు, కథలు.
ట్విన్నవలలు. అసలు ఆ మాట విన్నారా? ఇవిగో ఇక్కడున్నవి.
ట్విన్నవలలు – రాతగాడు అనామకుడు
పోయినేడాది…దాదాపు ఇవే రోజుల్లో…వాళ్ళిద్దరు కలిసి ఒకొళ్ళపుస్తకాన్ని మరొకరికి అంకితం ఇచ్చుకున్నారు.
పరిణయం చేసుకుని పాతికేళ్ళే..కాని అంతకుముందే పరిచయం అనొచ్చా? అనకూడదేమో! బంధుత్వం ఉందిగా మరి.
“ఖుదర్దు,” అని అన్నది అతనే.
“ఖుదర్దు,” అని ఆ యాజమానుడు అనకపొతే అస్సలు ఈ జీవితంలో ఈ ఘటనేలేదు.
ఖుదర్దు.
తప్పదు.
బతకాలిగా!
బతకాలి అంటే తినాలి.
కాని కొంతమంది తినడంకోసమే బతుకుతారు. అది మనకు అప్రస్తుతం. కాబట్టి ప్రస్తుతంలోకి వద్దాం. నేను బతకడానికి తినాలి. తినాలి కాబట్టి వేటాడాలి. వేటలో ఒక భాగం మెట్ట్లు ఎక్కడం. కాబట్టి మెట్లు ఎక్కాలి. ఎక్కి వారి ముందు నిలబడాలి. అప్పుడు చూపు ప్రస్తావన వస్తుంది. వాళ్ళని నేను చూడటం. నన్ను వాళ్ళు చూడటం. నా వేటకి, నా చూపుకి , వాళ్ళకి చూపులకి సంబంధించిన విషయం. ఇక ఆ చూపుల కథలోకి వెళదాం.
* * *
ఆ చూపే..ఆ చూపంటేనే చిరాకు.
నల్లగా ఉన్నాడు. నలుపు మీద తెల్లని పొడుగు చేతుల లినెన్ చొక్కా. దగ్గిరకు వెళ్లగానే నిలబడి చూసేవాడికి ముందు జుత్తు కనపడుతుంది. క్యాష్ కవుంటరు వెనక కూర్చునిఉంటాడుగా అందుకని. కుడి వేపు పాపిడి. నుదుటి మీదకి పడే రంగేసుకున్నజుట్టు. జుత్తు ఏమంత ఒత్తుగా లేదు. నుదురు పెద్దదే. కొంపదీసి ఆ కనుబొమలికి కూడా రంగేసాడేటో! కోటేరు ముక్కు మీదకి జారిపోతున్న బంగారపు రంగు ఫ్రేమున్న కళ్ళజోడు. ఫోటోక్రొమాటిక్ అద్దాలు. నారింజ రంగు పూత ఆ అద్దాలకి. అదీ హౌరా బ్రిడ్జ్లాగా పొడుగాటి ముక్కు మీద. జారడం ఇప్పుడా తరువాత అని అలోచిస్తున్నట్టుంది. అద్దాల వెనుక చిన్ని గుండ్రటి కళ్ళు. కళ్ళక్రింద బీరు సంచులు. ఆ ముక్కు కింద బొగ్గు నలుపు రంగేసిన సన్నటి మీసం. ముక్కులాగానే అదీ పలచగానే ఉంది. గంభీరంగా లేదు. సన్నటి పెదాలు. విడిపోతే ముత్యాలు రాలిపోతాయేమో అనే భయంతో ముడుచుకుని పోయినట్టున్నయి.
రాగిబిందె గొంతు లాంటి మెడ. దానిని మూడొంతులు కప్పేసిన లినెన్ కాలరు. కాలరు క్రింది కనపడాలని కనపడే చిటికిన వేలేడు మందాన ఉన్న బంగారు గొలుసు. దానికో పులిగోరు పతకం. పులిగోరు పతకం క్రింద తెల్లని బన్ని. బన్నీ మీద పై మూడు బొత్తలూడదీసేసిన లినెన్ చొక్కా.
ఎక్జిక్యూటివ్ కుర్చిఅంటారే అలాంటి కుర్చి. కొని ఎన్ని సంవత్సరాలు అయిందో గాని దాన్ని తయారుచేసిన వర్క్షాప్వాడు వేసిన ప్లాస్టిక్ కవర్లు ఇంకా తియ్యలేదు..దుమ్ముకొట్టుకుని కుర్చి ఎంత పాతదో చెపుతున్నాయి. కౌంటర్ అడ్డం ఉందిగాని కాని లేకపోతే ఏదో ఒక మోకాలి మీద మరో కాలు అడ్డం వేసుకుని కాలూపుతూ చూసేవాడు. కుర్చిలో ముందుకు జారాడా కావాలని లేక ముడ్డిమీద లినెన్ పాంటు ఆ రెక్జిన్ లెదర్ మీద ఆగలేదోకాని ముందుకు జారుతూ, ముక్కుమీదకి జారిన కళ్లజోడు పై ఫ్రేమ్ అంచుమీదనుండి నా మీదకు దృష్టి సారించాడు. ఏలినవారి రాజ్యంలోకి భిక్షకోసం అడుగుపెట్టిన ఏలియన్ని కదా నేను మరి.
“పుల్కాలున్నయ్యా?” అని అడిగాను. తలేగరేసాడు ఉన్నాయన్నట్టు. కుడి చెయ్యి కౌంటర్ మీదకి వచ్చింది. ముంజేతి మీదకు జారిపోతున్న అర అంగుళం వెడల్పున్న బంగారపు పట్టి. బొటనవేలుకు మందంగా ఉన్న బంగారపు ఉంగరంలో పొదిగిన తెల్ల రాయి సిఎఫ్ఎల్ లాంప్ వెలుతురులో ధగధగమెరుస్తూ నాకు కనపడింది. నేను చూసానన్నది ఆ చిన్న గుండ్రటి కళ్ళు గుర్తు పట్టేసి ఆ గర్వాన్ని నాకు కనపడేలా వెలిబుచ్చినవి. ఈ లోపు నా కుడిచేతివేపు పాంటు జేబులో నుంచి లెదర్ వాలెట్ బయటికి లాగాను.
“ఎంత?” అని అడిగాను.
“ఎన్ని కావాలేటి?” అని అడిగాడు.
“ప్లేటుకి ఎన్నండీ?” అని అడుగుతూ ఆ డైనింగ్ హాలులోపలికి దృష్టి సారించాను.
” ఫ్లేట్కి రెండు.”
“ప్లేట్ ఎంత?”
“ఒకటీ సిక్స్ రుపీస్. అంటే ఫ్లేటు టెల్వ్ రుపీస్.” నాకు లెక్కలు నేర్పించిన ఆనందం, ఆంగ్లలో నేర్పించాను చూసుకోహ్ మరి అన్న గర్వం వారి గొంతులో వినబడి, కంటిలో కనబడింది అన్నది నా బుర్రకి అర్ధం అయ్యింది.
“రెండు ప్లేట్లు,” అంటూ యాభై రూపాయలనోటు అందించాను.
కప్పనాలుక విసిరేసి పురుగుని పట్టుకున్నట్టు, అతని కుడిచెయ్యి నోటుని లాక్కుంది. క్షణం లోపే.
భ్రుక్రుటి ముడిపడింది.”అయిదు తీసుకోండి,” అని అన్నాడా ఏలిక, లేదా ఆజ్ఞాపించారా?
చిరాకేసింది. ఈయనేవడు నేను ఎన్ని తినాలో నిర్ణయించడానికి. ఒహో వారు ప్రభువులు కదూ!
“నేను అన్ని తినలేనండి,” అని ఏ మాత్రం వ్యంగ్యం, కోపం, నిర్లక్ష్యం లాంటివి వినపడకుండా మామూలుగా అతి సాధారణంగా అన్నాను అని అనుకున్నాను. అనే ఉంటాను. అలవాటేగా.
తల వంగింది. పెదాల మీద బొగ్గు నలుపు రంగేసిన మీసం కొసలు మరి కొంచెం కిందకి కుంగాయి. సరే ఇక కనుబొమల సంగతి చెప్పఖ్లేర్లేదు. నెత్తిమీద జుత్తు ఎక్కువ కనపడుతోంది. కాస్త పలచబడింది. దట్టంగా నూనే రాసినట్టుంది. ఏలిన వారి శ్రీమతే అయిఉంటుంది. ముఖంలో కళ్లు పూర్తిగా కనపడటం లేదు. పెదాల అంచులు కూడ ఒక లిప్తపాటు కుంగి బలవంతంగా విచ్చుకున్నాయి. ఈ పెపంచకంలో, ఏది…తన సామ్రాజ్యంలో ఇటువంటి పౌరుడ్ని ..ఏది ముష్టి ఆరు రూపాయల పులక తినలేని దౌర్భాగ్యుడ్ని తన జీవితంలో చూడల్సి వచ్చినందుకు వగస్తున్నట్టుంది. పెదాలు విడివడ్డాయి..మూసుకున్నాయి. దవడలు కదిలాయి. పళ్ళు కనబడ్డాయి. వాటి మధ్యనుంఛి నాలుక అలా చెంగున ఒక్కసారి బయటికి దూకింది. అలాగే వెనక్కి లోపలికి వెళ్ళిపోయింది. ఊరికే వెళ్ళిపోలేదు…పెదాలని తడిపేసివెళ్ళింది. నా రెండు చెవుల మధ్యనున్న పదార్ధానికి అర్ధం అయ్యిదేమిటంటే…ఇలాంటి బేరం నాకే తగలాలా అని తెలుపు లినైన్ చొక్కా అనుకుందని.
“కూర ఎంతండి?” ప్రభువుల వారు కదా. అందుకని సగౌరవంగానే అడిగాను.
“ఒరేయి రాజు, చెప్పు” అని తలేత్తకుండా ఒక ఆజ్ఞని అలా గాలిలోకి వదిలారు వారు. ఫుడ్డు కవుంటరు వెనకాతల ఉన్న “రాజు” గోరు, అర్ధనిమిలిత నేత్రాలతో, తన శ్వాసకి అడ్డుపడుతున్న పదార్దాన్ని కుడి చూపుడివేలితో వారి నాసికలోనుండి వెలికితీయడానికి తీవ్రమైన ప్రయత్నంలో ఉన్నా…నా వైపుకి తిరిగి, ”వెజ్ కరీనా, నాన్ వెజ్జా?” అని ప్రశ్నించారు. కళ్ళు తెరిచేనండి.
కాష్ కవుంటరు వెనకమాతలున్న ప్రభువులవారి తలకిందికి వంగే వుంది. ఆయన దవడలు కదులుతూనే ఉన్నాయి. “రాజు” అనబడే సేవకుడి నాసికలో వేలు అలాగే వుంది.
“వెజ్జు.”
“టొంటి రుపీస్,” రాజు గారి ధరని సూచించారు.
రెండు పది రూపాయలు, ఒక అయిదు, రూపాయల నోట్లు, ఒక రూపాయి నాణెం.
రెండు పళ్ళేల పులకాలు, అంటే నాలుగు పులకాలు. ఒకొక్క పులక ఆరు రూపాయలు చొప్పున, నాలుగు పులకాల ధర ఇరవై నాలుగు రూపాయలు. ఒక శాఖాహారపు కూర ఇరవై రూపాయలు. మొత్తం వెరసి నలభై ఆరు రూపాయలు అని లెక్కవేసుకుని కాషు కవుంటరు వెనకమాతల ఎక్జిక్యూటివ్ కుర్చిలో కూర్చుని ఇంకా దింపిన తలెత్తకుండా సొరుగులో దేనికోసమో దెవులాడుతున్న ప్రభువులవారు బహుశ నేను సమర్పించుకున్న యాభై రూపాయలలో, ఇరవై నాలుగు రూపాయలు వారు పుచ్చుకోగా, నాకు ఇవ్వాల్సిన ఇరవై ఆరు రూపాయలు కాబట్టి ఏలిక వారి వద్ద ఒక్క రూపాయ బిళ్ళ గాని నోటుగాని వుండివుండక దాని కోసం వెతుకుతున్నారేమో అని అనుకుని, నా పంట్లాము ఎడమచేతివైపునున్న జేబిలోనికి చేతిని పంపి ఏవైనా నాణేలున్నాయమోనని చూసాను. చేతికి ఏవి తగలలేదు.
ఇక తప్పదు.
“ఫరవాలేదు. ఉంచండి. ఆ రూపాయి ఈ సారి వచ్చినప్పుడు ఇద్దురులెండి,” అని అన్నాను.
చివాల్నా తలెత్తారు, నాధులు. బుస బుస మని పొంగింది. రక్తం. ఆ ముఖం నలుపులో కూడా ఎరుపు కనపడింది. కళ్లలోని తెల్లగుడ్డులోని రక్తవాహికలలో రక్తం కూడా గంటకి దాదాపు అయిదారు వందల కిలోమీటర్ల వేగంతో పరిగెత్తింది.
“ఖుద్దర్దు,” అని అనడం లో ఱేడు, వారి జీవితకాలం లో , ఏది తనుపెడితే పెట్టిన కూడు తినే ఓహ సామాన్య బీద పౌరుడి “ధయాధాఖ్సుణ్యాల” మీద జీవించడమే.. ఖుదర్దు. ఒక్క రూపాయ. ఒక్క రూపాయ అప్పుండమే! ఖుదర్దు.
ఈ లోపు దేవర వారి సేవకుడు..ఏది నాసికలో ఉన్న పదార్ధాన్ని చూపుడు వేలితో వెలికి లాగడానికి ప్రయత్నిస్తున్నవారు తమ షరాయి జేబు అడుగునుండి ఒక నాణేన్ని బయటికి లాగి అది రూపాయి ని నిర్ధారించుకుని, దేవర వారిని సమీపించడము, వంగి, ఆ ఒక్క రూపాయి విలువ నాణ్ణేన్ని తన కుడి చేత్తో, కాష్ కవుంటర్ మీద జాగ్రత్తగా పెట్టడము జరిగింది.
అధీపులవారు దానిని అందుకుని, దానితో పాటుగా రెండు పదిరూపాయలనోటుని , ఒక అయిదు రూపాయల విలువ నాణ్ణేన్ని నా వైపుకి ఆ కాష్ కవుంటరు మీద నెట్టారు. కుడి చెయ్యి చూపుడు వేలితో. అప్పుడు గమనించాను అధీపులవారు చేతికి గోరింటాకు కూడా వేసుకున్నారని.
ఒక పదిరూపాయలనోటు మీద మరో పది రూపాయలనోటు, వాటి మీద మధ్యలో పెట్టిన ఒక అయిదు రూపాయల నాణెం దానిపైన పెట్టిన ఒక రూపాయ్ బిళ్ళని కాష్ కవుంటరు మీదుంచి నా ముందుకు తోసారు.
ఖుదర్దు, అంతే. నాలుగంటే నాలుగే పులకాలు, నా మాటే నాది.
వరండాలో నుంచి హాలు గుమ్మందగ్గిరకి వెళ్ళి లోపలికి తొంగి చూడ్డం. అమ్మ కనపడుతుంది శూన్యంలోకి చూస్తూ. తన పక్కన అందరూ స్త్రీలే. అమ్మ కి అటువైపు చాప మీద నాన్న కదలకుండా. ఎవరి దుఃఖంలో వారు.
నేను బేరుమని ఏడవడం. ఇవతలికి రావడం. వరండాలో పేము కుర్చిలో కూలబడటం. ఏడుపు. చూట్టూ ఉన్నవాళ్లలో ఎవరో ఒకళ్ళో ఇద్దరో దగ్గిరకి తీసుకోవడానికి ప్రయత్నించడం. నేను వాళ్ళని దూరంగా నెట్టివేయడం. కాసేపటికి వెక్కిళ్ళు ఆపుకోవడం. ఈ లోపు మరెవరో హాలులోకి వెళ్ళడం. మళ్ళీ లోపలినుండి సన్నగా రోదన మొదలవ్వడం.
అది విని నేను మళ్ళీ బిగ్గరగా ఏడవడం. వెక్కిళ్ళు. నా స్నేహితులు ఎవరూ పక్కన లేరు. ఒంటరిని. ఎవరి దగ్గిరకి వెళ్ళకుండా నేను ఆ పేము కుర్చిలో కూర్చుని ఏడుస్తున్నాను. చుట్టూ తెలిసినవాళ్ళు, తెలియని వాళ్ళు, బంధువులు, పరిచయస్తులు అందరూ పెద్దవాళ్ళే.
నా స్నేహితులు ఎవరూ లేరు. వెనక ఎక్కడో నా మోతి ఏడుపు.
ఆ రాత్రి విలపిస్తూ, రోదిస్తున్నప్పుడు వచ్చాడు ఆయన. ఏవో వాళ్ళతో గుసగుసలు. లోపల హాల్లోకి వెళ్ళివచ్చాడు. ఆయన్ని గుర్తు పట్టాను. ఏమి మాట్లాడలేదు. నేను ఏడుస్తున్నాను. ఎవరో నా పక్కనే ఒక ఫోల్డింగ్ చెయిర్ వేసారు. కూర్చున్నాడు, ఆయన. గుర్తుపట్టాను ఆయన్ని. అంతకుముందు ఏవో స్టూడియోలలో షూటింగులలో చూసాను. ఆయనంటే ఇష్టం కూడా. నెమ్మదిగా నా ఎడమరెక్క పట్టుకుని దగ్గిరకు తీసుకున్నాడు. ఒళ్ళోకి తీసుకున్నాడు. కళ్ళు తుడిచాడు. ఏవో అవి ఇవి మాటలు చెపుతున్నాడు. నేను వినడం మొదలుపెట్టాను. చేతులు కదిలిస్తున్నాడు. ఖాళీ అరచేతులు. గబుక్కున అందులో ఒక కలం కనపడింది. గుప్పెట మూసాడు. తెరిచాడు. అరచేతిలో ఏమిలేదు. మళ్ళీ ఖాళీ. మరో చెయ్యి చూపించాడు. అందులో ఉంది కలం. ఈ సారి నాణేలు. గుప్పిట్లో చూపించి మూసి తెరిచాడు. లేవు. తన షర్ట్ జేబులోకి వెళ్ళిపోయినవి.
నా ఏడుపు ఆగిపోయింది. మళ్ళీ నాకు ఏవో కబుర్లు చెప్పాడు. తల నిమిరాడు. బుగ్గలు నిమిరాడు. కళ్ళు తుడిచాడు. నా స్నేహితుడి లాగా బుజ్జగించాడు.
లేచి నిలబడ్డాడు. ఎవరినో పిలిచాడు. వారికేదో చెప్పాడు. హాలులో నుంచి ఎవరో వచ్చారు. వరండా లోనుంచి నన్ను హాల్ లోకి, అటునుంచి పడకగదిలోకి తీసుకెళ్ళారు. నా మంచం మీద పడుకోబెట్టారు. దుప్పటి కప్పారు. నేను అలాగే నిద్రపొయ్యాను.
ఆ తరువాత కూడ ఆయన అప్పుడప్పుడు వచ్చేవారు. అమ్మని నన్ను పలకరించేవారు. కాసేపు కూర్చుని కబుర్లు చెప్పేవారు. ఆయనే రమణా రెడ్డి.
సినిమా చూడటానికి ఎడ్ల బళ్ళు కట్టుకుని వెళ్ళిన వాళ్ళున్నారు. వైజాగ్ నుంచి మద్రాసుకి ఒకరాత్రంతా ప్రయాణం చేసి వచ్చి సినిమా చూపించమని నన్ను వేధించుకుని తిని సినిమా చూసి అటునుంఛి అటే సెంట్రల్ స్టేషన్లో పొగబండికి రిజర్వేషన్ కూడా నాతో చేయించుకుని వెళ్ళిపోయినవారున్నారు.
అటువంటి అవకాశం లేని వారికి అప్పట్లో ఆకాశవాణి వారి సంక్షిప్త శబ్ద చిత్రాలే గతి. ఒకటికి పది సార్లు చూడటానికి అవకాశం లేని వారు, ఎన్టీవోడి డవిలాగు, ఏ ఎన్ ఆర్ ఎస్వీఆర్ డవిలాగు కాకుండా అసలు కథ ని ఓల్మొత్తం అర్ధం చేసుకోవడానికి, చదివి చూడలేని తోటివారికి చదివి వినిపించడానికి వెండితెర నవలలు భలే పనిచేసేవి. అంతే కాకుండా ఆ వెండి తెర నవల ద్వారా తమ సినిమాలకి కొంత అదనపు ఆకర్షణ ని కూడ తెచ్చుకోవడానికి వాటిని వాడుకున్నారు ఆనాటి చలనచిత్ర నిర్మాతలు, పంపిణీదారులు.
తెలుగు లో వెండితెరనవలకు ఆద్యులు అట్లూరి పిచ్చేశ్వర రావు (12th April 1925 – 26th Sept 1966). వారి తొలి తెలుగు ప్రక్రియ కి తెరతీసినది గౌతమ బుద్ధ లఘుచిత్రం. ఆ బాటనే పయనించినవారు రామచందర్, ముళ్ళపూడి వెంకటరమణ, రావి కొండలరావు, నేటి చలన చిత్ర దర్శకులు వంశీ తదితరులు.
వెండితెర నవలల మీద TV 5 ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తమ “Favorite Five” శీర్షికన ప్రసారం చేసింది. సుమారు పదిహేను నిముషాలు నిడివి ఉన్న ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు.
గమనిక: ఈ ప్రసార కార్యక్రమం పూర్తి హక్కులు TV5 కే చెందుతాయి. నాకు ఎటువంటి సంబంధం హక్కులు లేవు. All rights to this program whether implied or otherwise belong to TV5 or to their respective entities.
ఆ మధ్య ఒక రచయితని అడిగాను, “మీరు ఎందుకు వ్రాస్తున్నారు?” అని.
ఠకీమని చెప్పాడాయన “డబ్బుల కోసం” అని.
మరొకరిని అడిగాను. “అయ్ ఆమ్ ఎక్స్ప్రెసివ్” అని జవాబు.
ఆంధ్రులు కాదు తెలుగు వారందరూ అభిమానించే (సినవారు కూడా ఉన్నారు) జవాబు, “రాయక పోతే చచ్చిపోతా”.
సముద్రంలోనుంచి బయటపడి, చెట్టుమీదకి ఎక్కి కిందకి దిగాడు. అన్ని వందల వేల సంవత్సరాలలో, వాడికి శబ్దం చెయ్యడం వచ్చింది. దానికి ఒక లయ ఏర్పచుకున్నాడు. భాష అయ్యింది అది. కథలు చెప్పుకోవడం మొదలయ్యింది. అనుకుందాం! సరే మౌఖికంగా కథలు చెప్పుకుంటున్ననాటి నుంచి బూతులు, అసభ్యపదజాలం వాడుక దేశ కాల పరిస్థితులని బట్టి మారుతునే ఉన్నవి. రోజు ఇంటా బయటా వింటున్నవేకదా?
ఫ్రీడ్మన్ అన్నట్టు, డాల్ఫిన్స్ కి , వేల్స్ కీ కూడా భాష ఉంది. మాట్లాడుకుంటాయి. ఏనుగులు, కాకులు, కుక్కలు, పిల్లులు, పాములు అన్నింటికి ఒక భాష వుంది. అన్ని ప్రేమించుకుంటాయి, కాట్లాడు కుంటాయి, తిట్టుకుంటాయి, ఆడుకుంటాయి అన్ని పనులు చేసుకుంటాయి.
“దిద్దుబాటు” తెలుగులో తొలి కథ అని అన్నారు. అబ్బే లేదు..ఇంకా చాలా కథలున్నవి (దాదాపు ఒక తొంభై దాకా అని ఒక అంచనా!) దానికి ముందే అని తెల్ఛేసారు. రేపో, మాపో అవి మనచేతుల్లోకి రానున్నవి. (బహుశ ఈ 2014 లోనే రావచ్చు).దిద్దుబాటు ని షార్ట్ఫిల్మ్గా కూడా తీసాడు అట్టాడ అప్పల్నాయుడు గారి అబ్బాయి సృజన్.
సరే, దిద్దుబాటుతోనే మొదలు పెడదాం.
మరి ఆ రోజే సాని కొంపలున్నవిగా?
మగాడు తిరుగుతునే ఉన్నాడుగా? ఆవిడ ఇంట్లోనే ఉందిగా?
“కన్యాశుల్కం” నుంచి, ఈ రోజు “వాడి పాకేజి నాకంటే తక్కువలేవే..వాడ్ని నేనెలాచేసుకుంటానే మమ్మీ?” అని ఈ రోజు చదువుకుని,ఉద్యోగంచేసుకున్న యువతి గారాలు పోతోంది.దిద్దుబాటు వెలువడిన సాంఘిక నేపధ్యం ఏమిటి? దేశ కాల పరిస్థితులేమిటి? ఈ రోజు దేశ కాల పరిస్థితులేమిటి? ఎరుపు రోజుల్లో కథకి ఒక సాంఘిక బాధ్యత ఉంది అని అనుకుని వాళ్ళు కథలు, నవలలు, కవితలు, నాటికలు గట్రా వ్రాసుకున్నారు. అవి “గర్జించు రష్యా” రోజులనుకుంటే ఇవి “గాండ్రించు అమెరికా ” రోజులనుకోవచ్చు. మరి మార్పు రాలేదా?మూలింటామె లో లాగా పందొసంత లాంటి వ్యక్తులు లేరా? అంటే ఉన్నారు! ఇప్పుడు కాదు..అనగనగా అప్పుడెప్పుడోనే ఉన్నారు. ఈ రోజు బయటికి వచ్చిందా? కాదే? పల్లెటూళ్ల లో పాలేర్లు, రైతులు, రైతు కూలీలు అయితే, పట్టణాలలో సేల్స్ గరల్స్, ఆఫీసులో క్లెర్క్లు వాళ్ళ రాసలీలల మీద ఎన్ని కథలు రాలేదు!
మరి “అరుంధతి” (ఉన్నంతలో – రాజారామ్మోహనరావు – 2012 స్వాతి మాస పత్రికలో) రామారావు పక్కలోకి వెళ్ళలేదేం? (కథ 2012 సంకలనం – సం: వాసిరెడ్డి నవీన్, శివశంకర్ పాపినేని)
కాబట్టి ఆ మార్పుని ఒప్పుకున్నవాళ్ళు ఈ మార్పులని కూడా అంగీకరించాలి.
అలాగే చదవతగ్గ రచన ఏదైనా సరే చదువుతారు. దానికి భాష అడ్డం రాకూడదు. కాని వచ్చేసిందిగా?!
భాషే కాదు. వస్తువులో కూడా మార్పులు వచ్చేసినవి.
* * *
ఈ మధ్య వచ్చిన కథ ఒకటి. ఎబినేజర్ అనబడే ఒక మాదిగ నింబోడి కథ ని వ్రాసింది కాశీభట్ల వేణుగోపాల్.
ఈయన “F” నాలుగు అక్షరాల పదాన్ని ఆంగ్లంలోనే అయినా వాడారు. (ఈ నాలుగు అక్షరాల ఎఫ్ పదం ఏమిటని అడగేవారి కోసం కాదు ఇది వ్రాస్తుంట!) అందులో ఎబినేజర్ పాత్రకి కళ్ళలో ఒక దానికి శుక్లం వచ్చింది. శుక్లాన్ని ఆంగ్లంలో కాటరాక్ట్ అంటారు. కాటరాక్ట్ని కొన్ని ప్రాంతలలో కొంత మంది “కన్ను పూసింది” అని అంటారు. శుక్లం ని “కన్ను లో పూత” అని కూడ చెప్పుకుంటారు. అంటే ఈ కథలో ఎబినీజర్ అనే పాత్ర కన్నుపూచింది. కన్నులో పూవు. కన్నులో పూవు ఉంది కాబట్టి ఆ వ్యక్తికి *పూకంటోడు అనే మారుపేరు (నిక్నేమ్) ఎగతాళిగా పిలుచుకునే పేరు పెట్టారు.ఆ మారుపేరు తన పాఠకులకు అమోదయోగ్యంకాదని ఒకరో ఇద్దరో సంపాదకులు అభిప్రాయపడ్డారు. ఆ మారుపేరులో వారికి బూతు వినపడింది. అంతే కాదు వారికి అసభ్యంగాను అభ్యంతరకరంగాను తోచింది. రచయితకి ఒక సూచన చేసారు. ఎబినేజర్ “మారుపేరు” (nickname) మార్చండి. ఆ కథని మేము ప్రచురిస్తామని. రచయిత ఒప్పుకోలేదు. రచయిత “మా ప్రాంతంలో అలా కన్నులో పూత అంటే శుక్లాలున్నవాడిని అదే పేరుతో పిలుస్తారు. అది జనబాహుళ్యంలో ప్రచారంలో ఉంది కాబట్టి నేను మీ సూచనను అంగీకరించను. మీరు కథని ప్రచురించకపోయినా ఫరవాలేదు” అంటూ వివరణ ఇచ్చారు.
ఆ పత్రిక సంపాదకులు అంగీకరించలేదు. కాబట్టి ఆ కథని అచ్చులో చదువుకునే అదృష్టం కొంత మంది పాఠకులకి దక్కలేదు. కొంతమంది జాలపాఠకులకి (online readers) ఆ దురదృష్టం కలిగింది. అవును, ఎవరు దీన్ని గురించి మాట్లడుకున్నట్టు కనపడలేదే!?
ఇందులో లచ్చుమమ్మ మొగుడు కామేశ్వరరావు. ఆ లచ్చుమమ్మ వయసు దాదాపు 39 ఏళ్ళు. కాలేజిలో చదువుకునే సరయు ఈ దంపతుల కూతురు. మురళి లచ్చుమమ్మ మేనల్లుడు. డాక్టరి చదువుకుంటున్నాడు. వాడి దృష్టి తన మీదకు “మళ్ళించుకోవడానికి సరయు తిప్పలు. దానిని వదిలి నా పక్క చేరడానికి వాడి చిరాకులు.” అని ఆ తల్లి స్వగతం. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? మురళీ తన మేనత్త తో గడపటానికే వాళ్ళింటికి వెళ్ళడం. ఎందుకని అంటే ఆమెకి “చేతనైంది చెప్తే చచ్చిపోతావ్రా మగడా. కావాలంటే మురళిని అడుగు. నెలకు మూడుసార్లు ఇంత దూరం ఎందుకొస్తాడో తెలుస్తుంది” అనుకుంటుంది. లచ్చుమమ్మ మళ్ళీ మరో మాట కూడా అనుకుంటుంది “అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?” అని.
ఎబనీజర్ పాత్ర వాడి పూకంటోడు అనే పేరు 2014 లోదే. అరుంధతి పాత్ర 2012 లోదే
పునీత పాత్ర 2014 లోదే.
ఈ మూడు కథలని చదువుకున్నవారు ఉన్నారు.
“కీమో” కథలో ఆరు చోట్ల *F* పదం వాడారు రచయిత. అది ఆంగ్ల పదం అయినా సంభాషణలు ఇంగ్లిష్లో కాబట్టి ట్రాన్స్లిటరేటేడ్ పదం అది. మరి ఇందాక భాష అనుకున్నామే?! మరి ఇక్కడ ఇది కూడా వచ్చేసిందిగా?!
మరో సందర్భం;
ఈ సారి ఏకంగా ఒక వెబ్జైన్ సంపాదకుడే వాడేసుకున్నారు F పదాన్ని!
ఆయన మాటల్లోనే “I fucked up so many relationships. I want us to be a success“.
మరి దీనికేమంటారు ?
మరి మంచుపూవు లోని కావేరి కూతురు ప్రియ లో భార్యని చూసుకున్న తండ్రి ఆలోచనలని వెలికి తెచ్చిన రచయిత ని ఏంచెయ్యాలి?మొన్న వేదికసమావేశం లో ఒక ఆంగ్ల కధని పరిచయం చేసాను. Ba-Boon – థామస్ పియర్సన్ వ్రాసిన కథ అది. 2014 లొనే వచ్చిందా కథ. అన్ని తనే అయిన సోదరుడు ఒకానొక దుర్ఘటనకి గురైన తరువాత అతని చెల్లెలు అతనికి తోడై ఉండాల్సిన పరిస్థితి. తన బాయ్ఫ్రెండ్తో ఒకానొక సందర్భంలో ఒక compromising situation లో వీడియో షూట్ లో పాల్గొంటుంది. ఆ టేప్ తెచ్చుకోవాలి. కొన్ని వందల వీడియో టేపులన్నింటిని చూస్తేగానీ ఏది తనది అన్నది తెలియదు. మరి సొంత అన్నతోనే ఆ వీడియో చూడాలా? ఈ అంశాన్ని ప్రంపంచంలోని ప్రతి ఆంగ్ల పాఠకుడు అంగీకరిస్తాడా?
కొవ్వలి నవలలని జాకెట్లలలో, లంగాలలో, ఓణీలలో దాచుకుని చదువుకునే వారు ఒకనాటి చదువుకున్న స్త్రీలు. అలాగే మధు పుస్తకాలని కూడా దాచుకుని చదువుకునేవారు ఈ జాలం అవతరించకముందు.ఇప్పుడు వస్తున్న ఈ కథలమీద, ఆ కథల కోసం తీసుకున్న వస్తువు మీద, ఆ పాత్రలు వాడిన భాషమీద కొంత మంది పాఠకుల అభిప్రాయాలని చదివిన తరువాత, ఇవన్నీ కూడా సెక్సు అంటే బూతు పదాలు వాడినందుకు వచ్చిన విమర్శలు అనే అనిపిస్తోంది. కొంత మంది అనుకునే బూతు ఆలోచనలు, అవి బయట పెట్టినందుకు వచ్చిన విమర్శలు గానే మిగిలిపోతాయి తప్ప మరొకటి కాదు.
మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా అంతర్జాలం లోనే వెబ్జైన్లలోనే వెలువడ్డవి. అంతర్జాలానికి ఎల్లలు లేవు. అలాగే అక్కడ స్వేచ్చమీద కట్టడి లేదు.కా రా మాస్టారు అన్నట్టు: ” చీకటిలో ఉన్నా కొందరందులో వెలుగుని గురించి రాస్తారు. వెలుగులో ఉంటూ జీవితం లోని చీకటి గురించి రాస్తారు. వెలుగే తప్ప చీకటిని ఎరుగని వారు అందులోని నీలి నీడలనే చీకటిగాను, మరి కొందరు చీకటి చీకటి కాదని, వెలుగే చీకటి, చీకటే వెలుగని రాస్తారు” ( కా రా రచనలు పుట 379).
ఆయన వ్రాసిన సందర్భం వేరైనా ఈనాటి కథకులకి, పాఠకులకి తెలియాల్సి ఉంది.
ఆంక్షలు పెట్టకండి.వచ్చేవి ఎలాగు వస్తాయి. పొయ్యేవి ఎలాగూ పోతాయి.
మంచి ముత్యాలని ఏరుకోవడమే మీరు చేయగలిగింది!
ఏది మంచి? మీకు ఏది మంచి అని తోస్తే అదే మంచి!!
నిండా డేంజరస్ మనుషులుండారు ఈ ప్రపంచంలో. అతి ప్రమాదకారులు వీరు. మాటలతో మనల్ని మాయజేస్తారు. ఇదిగో అంటారు. అదిగో అంటారు. వీళ్ళు మన నోటికి వినిపిస్తారు. చెవులకి చూపిస్తారు. చొంగ కారుతుంటుంది ఒక పక్క. చేతులూపుకుంటూ, కళ్ళు తెరుచుకుని వాళ్ల మాయమాటల దారెంట వెళ్ళిపోయి వాళ్ళు చూపించే ఆ మరో ప్రపంచాన్ని కంటాం! చిన్నపిల్లల్లగా!!
సా వెం రమేశ్
డబల్ ఢమాకా అంటారనుకుంటా..ఒక కథతో మొదలుపెడతాడు, మరో కథ మొదలుపెడతాడు. వాటి చుట్టూ మరో ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఆ మూడింటీతో పాటు మరో కొత్త అంశం ప్రవేశపెడతాడు. త్రీ డి అంటారే. అలా! కళ్ళు తిరుగుతాయి. ఆ సుడిగుండంలో పడిపోతాం. గిరా గిరా తిరుగుతాం, పడి కొట్టుకుపోతాం. మన లోపలికి నీళ్ళేళ్ళిపోతాయి. మరో కొత్త భాష! మరో కొత్త కోణం. మరో కొత్త మూలం అవిష్కరింపజేస్తాడు. ఎక్కడో తెల్తాం. అక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది..కాని ఉండలేం కదా! ఒక జీవితం ఉంది కదా? ఒక జీవనం చెయ్యాలి కదా? ఒక జీవిక కావాలి కదా?
కాని అతనికి అదే జీవితం, అదే జీవనం, అదే జీవిక అయ్యింది. సిగ్గు ఎవరికి ఉండాలో మరి?
భగ, భగా, ధగ ధగా మెరుస్తూ కళ్ళు మిరిమిట్లు గొలుపుతుంది., సిడిమొయిలు. అలాంటి లోకం ఒకటి ఉందా? తెలుసుకోవాలంటే వివరాలకు కథ 2013 ని కొనుక్కుని చదువుకోండి! కథకి అద్భుతమైన బొమ్మ గీసినవారు ఏలే లక్షణ్.
తొలి ముద్రణ 2013. మలి ముద్రణ 2013. అమ్మకాలు దాదాపు ముప్పై ఐదు వేలు. పుస్తకం ఆవిష్కరణ సభ భాగ్యనగరం లో పెద్ద హోటలు. ఐదువందల రూపాయలు నోట్లు ఇచ్చిన వారు, చేతికి అందిన ప్రతులు అందుకున్నారు. చిల్లర అడగలేదు. తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు..
మరో మంచి హోటల్ లో పుస్తక ఆవిష్కరణ. తొలి ముద్రణ ఆగస్టు 2013. అమ్మకానికి ప్రతులు లేవు. మలి ముద్రణ డిసెంబరు 2013. కథకుడు మరో ముద్రణ గురించి ఆలోచిస్తున్నాడు.
తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు.
మరో పుస్తకం. మూడవ ముద్రణ. కొన్ని వేల ప్రతులు. తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు.
పైన నేను ఉదహరించిన తెలుగు పుస్తకాలన్నింటిని చదవాలని, కావాలని పాఠకులు కొనుకున్నారు.
మూడు పుస్తకాలు తెలుగులోనే ఐనా వాటిలోని విషయాలు విభిన్నమైనవి. ఒకటి కధా సంకలనం. ఒకటి జీవిత చరిత్ర. మరొకటి సాహిత్య పురస్కారం అందుకున్నది.
మొన్న ఏప్రిల్ లో నెల్లూరులో మరో పుస్తకం ఆవిష్కరణ. వేదిక దగ్గిర ప్రతులు అమ్ముడైపోయినవి. పుస్తకాలు కావాలి. ప్రతులు లేవు. తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు…కొనుక్కున్నారు. కొంతమంది పదుల ప్రతులు కొనుకున్నారు.
నేనిక్కడ ఉదహరించినవి నా దృష్టికి వచ్చిన వాటిల్లో మూడో నాలుగో పునర్ముద్రణలు మాత్రమే! ఇవి కాక ఇతర ప్రాంతాల్లో పునర్ముద్రణలకు నోచుకున్న పుస్తకాలు అనేకం! ఇవికాక ప్రచురణకర్తలు పునర్ముద్రించుకుంటున్నవి అనేకం ఉన్నవి! ప్రవాసాంధ్రుల ప్రచురణలు?
అనంతరామ్ పేరు విన్నారా? మొన్నామధ్య ఏప్రిల్లో పెళ్ళి చేసుకున్న అనంతరామ్ కొంతమంది బ్లాగర్లకి మాత్రమే తన బ్లాగు ద్వారా పరిచయం. రెండువేల పదమూడులో రామ్@శ్రుతిడాట్కామ్ అనే శీర్షికతో ఈ నవ యువ రచయిత తన తొలి ప్రేమకధా నవలని ఈబుక్ గా ప్రచురించుకున్నాడు. తొలుత అది ఈబుక్గానే వెలువడింది. ఆ నవల తొలుత అచ్చులో వెలువడలేదు. ఈబుక్ అమ్మకాల మీద వచ్చిన రాయల్టీలతో తన పుస్తకం అచ్చువేసుకున్నాడు. తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు. కొనుక్కున్నారు. (పాఠకమహాశయా! ఈ యువ నవ రచయితని ఈ వ్యాసకర్త ఇప్పడిదాక కలవలేదు. కనీసం ఆ రచయిత వివాహానికి ఆహ్వాన పత్రిక అందుకున్న గుర్తు కూడా లేదు).
ఒకప్పుడు రచయితలకి సిగరెట్ల పాకెట్టిచ్చి, తేనిరు పోసి, హ్విస్కి లు తాగించి, పుస్తకాలు వ్రాయించి, డబ్బు పెట్టుబడి పెట్టి, ఆ పుస్తకాన్ని ప్రచురించి, లాభాలార్జించి , భవంతులు కట్టుకున్న ప్రచురణకర్తలున్నకాలం తెలిసినవారుండేవుంటారు మీ పాఠకులలో. అవి ఆ రోజులు.
తన పుస్తకాల అమ్మకాల మీద వచ్చిన రాయల్టీలతో పిల్లలకి చదువులు చెప్పించుకుంటూ, విదేశాలలో ఉద్యోగాలకు పంపించుకుంటూ, భవంతులు కట్టించుకుని, కారులలో షికారులు చేస్తూన్నాడు ఈ రోజు రచయిత. ఇవి ఈ రోజులు.
శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాక.. అదిలాబాదు నుండి తిరుపతి దాక ఉన్న తెలుగు రచయితల సాహిత్యం ఈ రోజు అంతర్జాలం ద్వారా అందరికి అందుబాటులోకి వచ్చింది. ఆక్లాండ్ నుండి, ఆసియా నుండి, ఆఫ్రికానుండి, అమెరికా సంయుక్త రాష్ట్రాల దాక కాక వాటిమధ్యనున్న దేశాలలోని తెలుగు పాఠకుడు ఈ రోజు తెలుగు పుస్తకాలు కొనుక్కుంటున్నాడు. చదువుకుంటున్నాడు. లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాడు. ఏటా, అనధికార గణాంకాల ప్రకారం సుమారు గా పదిహేను కోట్ల రూపాయల విలువగల పుస్తక క్రయ విక్రయాలు జరుగుతున్నవీ. ఈ లెఖ్ఖలలో జాలం ద్వార అమ్మిన అచ్చు పుస్తకాలు కాని డిజిటల్ పుస్తకాలు కాని కలపలేదు. అలాగే విదేశాలలో ముద్రిణపొంది అమ్ముడవుతున్న పుస్తకాల గణాంకాలు లేవు! ఐనా ఇవన్నీ తెలుగు భాషవి మాత్రమే సుమా! తెలుగు వారెంతమంది? ఆ మధ్య పదిహేను / పదహారు కోట్లమంది ఉన్నారని అన్నారుగా. ఆ మాటే ప్రామాణికంగా తీసుకుంటే ప్రతి తెలుగువాడు తెలుగు పుస్తకం కోసం ఒక రూపాయి వెచ్చించినట్టే!
ఎన్నికల లెక్కల్లో కొంచెం అటు ఇటుగా ఎనిమిది కోట్ల మంది అని తేలిందా? పోని అదే లెఖ్ఖ వేసుకుందాం! ఆ లెఖ్ఖన సగటున ప్రతి తెలుగువాడు తెలుగు పుస్తకం కోసం రెండు రూప్యంబులు వెచ్చించెనన్నమాట! ఇప్పుడు చెప్పమనండి..తెలుగు ఎలా చచ్చిపోతుందో, తెలుగు భాష ఎలా చచ్చిపోతుందో, తెలుగు పుస్తకం ఎలా అవసాన దశకి చేరుకుందో రుజువు చెయ్యమనండి!! చూసే వాడి చూపులో ఉంటుంది అందం అన్న చందానా,.పచ్చ కామెర్లవాడికి ప్రపంచం అంతా పచ్చగానే కనపడుతుంది.
అది నేటి సాహిత్యం పరిస్థితి. ఇక తెలుగు చచ్చిపోయింది. చచ్చి పోతోంది. ఇక తెలుగు చదివేవారు లేరు అనేది ఎవరో మీరే నిర్ణయించుకోండి.
ఒక యువ నవ కథా రచయిత, ఒక సాయంత్రం ఒక సాహిత్య సభ దగ్గిర నా బుర్ర తిని (తినిపించుకునేవాడుంటే బుర్రలు తినడం నాకు చాలా ఇష్టం) ఒకటో రెండో సంవత్సరాలు ఆలోచించుకుని మొన్నిమధ్య అచ్చు పత్రికలలో వెలువడ్డ తన కధలన్నింటిని గుదిగుచ్చి ఒక సంకలనంగా వెలువరించాడు. ఆవిష్కరణ సభకు ముందే తనకు తెలిసిన పుస్తకాల దుకాణాలలో పాఠకులకు అవి అందుబాటులో ఉండే ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే జాలంలో ఈబుక్గా దేశవిదేశాలలో అవిష్కరణ సమయానికి వెలువడేటట్టుగా ఏర్పాట్లు చేసుకున్నాడు. అంతర్జాలంలో అంటే ఆన్లైనులో సాహిత్యానికి, తెలుగు భాషకి, తెలుగుకి సంబంధించిన దాదాపు ప్రతి సమూహంలోను తన పుస్తక ఆవిష్కరణ గురించి పదిమందికి తెలిసేటట్టు ముఖపత్రాల రూపురేఖలు, రంగులు, అక్షరాల ఎంపిక దగ్గిరనుండి ప్రచారం చేసాడు.
పది పత్రికల కార్యాలయా మెట్లు, లిప్ట్లు ఎక్కాడు. తెలిసిన పదిమంది పాత్రికేయ మిత్రులని తన పుస్తకం గురించి సమీక్షో, పరిచయమో, స్వీకారమో, కనీసం ఒక వాక్యమో, ఏదో ఒకటి వ్రాయమని అడగడమో, బతిమాలడమో చేస్తూ తలా రెండు ప్రతులు అందించాడు. తెలియని వారిని పరిచయం చేసుకుని వారి చేతికి తన ప్రతిని అందించి సవినయంగా మరీ అడిగాడు.
నిర్మొహమాటంగా, నిస్సిగ్గుగా తనకు తెలిసిన బ్లాగర్లని, జాలపత్రికల సంపాదకులని, తోటి రచయితలని అందరిని తన పుస్తకం గురించి తమ పత్రికలలో, బ్లాగులలో, పేజిలలో, కాలంలలో, వెబ్సైటులలో వెబ్జైనలలో వ్రాయమని అడిగాడు.
ముందే నిర్ణయించుకున్న ఒకానొక సాయంత్రాన ఆవిష్కరణ సభ కావించాడు. సభ పేలింది. అమ్మకానికి ఆవిష్కరణ సభలోనే కొన్ని ప్రతులని అందుబాటులో ఉంచాడు. అమ్మినవి అమ్మగా..ఉచితంగా ఇచ్చినవి కూడ ఉన్నవి. (నాకు ఇంకా ప్రతి ఇంకా అందిలేదు. పైగా నేను ఆ ఆవిష్కరణ సభలో పాల్గొనలేదు. అది వేరే విషయం). ఇంత వివరంగా మీకు ఎందుకు తెలియజేయవలసి వచ్చినదంటే..దమ్ముంటే నా పుస్తకం అమ్ముడవుతుంది అని అనుకోరాదని. ఆ రోజులు చెల్లిపోయినవని మీకు తెలియజేయడానికే. బంగారు పళ్ళేనికైనా గోడ చేర్పు కావాలి!
పొద్దున లేచినప్పటినుంచి ఫోనులో ఎస్ ఎమ్ ఎస్లు, దినపత్రికలు తెరిస్తే వార్తల సంగతి తరువాత, ముందు ప్రకటనలు. దిన పత్రికల వారు సొమ్ము పుచ్చుకుని వేసే ప్రకటనల మధ్య మళ్ళీ లీఫ్లెట్లు, కరపత్రాలు. ఇంటి గేటుకి ప్లేటులు, కారు బంపర్ మీద స్టికరు, బైకు నెంబరు ప్లేటు మీద ప్రకటన, బస్సు సీటు మీద ప్రకటన, రహాదారికి అటూ, ఇటూ హోర్డింగులు. ఇది గాక స్కూలు ఫీజులు, ఫేర్వెల్ పార్టి చందాలు, హాస్పిటల్ బిల్లులు, కట్టవలసిన కిస్తీలు, ఈఎమ్ఐలూ ఇలా సవాలక్ష సమస్యలు ఈ జీవికి. వీటన్నింటి మధ్య మీ పుస్తకం కనపడాలి. కుదిరే పనేనా?
అందుకనే అనేది ఇందాక చెప్పానే ఈ నవశకం యువ రచయిత చేసిన పనులన్ని చెయ్యాలి! నా పుస్తకం దమ్ముంది అనుకుంటే చాలదు. దమ్ముంది అని ఆ చదువరికి చెప్పాలి. ఉన్నది లేనిది పాఠకుడు నిర్ణయిస్తాడు.
కాబట్టి ఓ రచయితా, నీ డబ్బుతో ప్రచురించుకున్న నీ పుస్తకం పదిమందికి అందాలంటే ముందు దానిని గురించి వారికి తెలియజేయి. అంతేగాని ఉచితంగా ఇచ్చేయ్యకు. అదేదో సామెతుంది. ఉచితంగా వస్తే ఫినాయిలు కూడా తాగే మనుషులుంటారని!
ఆదివారం. మార్చ్ 2, 2014. మళ్ళీ SMS. ఆర్టిస్ట్ మోహన్ గారి పిలుపు. మనవాళ్లందరూ వస్తున్నారు. మీరు కూడా రావాలి. మన శేఖర్ కి మనం చెయ్యాలి! సందర్భం శేఖర్ కార్టూనిస్ట్గా గోల్డెన్ జూబిలి సెలబ్రేషన్.
శేఖర్ కార్టూనిస్ట్ గా నే పరిచయం అయ్యాడు ఆంధ్రజ్యోతి లో. కె.పి డెస్క్ పక్కనే. కె.పి ని దాటుకుని శేఖర్ డెస్క్కి వెళ్ళాలి. ఆ పక్కనే వసంతలక్ష్మి గారి డెస్క్.
కినిగె కి తన కార్టూన్ పుస్తకాన్ని ఇచ్చిన తొలి కార్టూనిస్టు శేఖర్. అదొక అభిమానం. తరువాత ఎప్పుడో ఒకసారి నా మీద కోపగించుకున్నాడు కూడా! “నాకు మీరు పిచ్చేశ్వరరావు గారి అబ్బాయని ఎందుకు చెప్పలేదు. ఆయనంటే మా తరానికి ఎంత ఇష్టమో, మీకు తెలియదు. అటువంటి వాళ్ళు అంత త్వరగా వెళ్ళిపోవాడనికి హడావుడి ఏమిటో?” అనుకున్నడు స్వగతంగా.
అమెరికా సంయుక్త రాష్ట్రాలకి వెళ్లబోయేముందు, వెళ్ళి వచ్చిన తరువాత తన పుస్తకాన్ని డిజిటల్ బుక్గా ఎలా డిజైన్చేస్తే బాగుంటుందో అని కలిసినప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. కలవనప్పుడు ఫోన్ చేసేవాడు. ఫోనులో “తింటున్నాన్నా?” అని అడిగి నవ్వేవాడు.
“సార్, మీ ఇంటికి దగ్గిర్లోకి మారుతున్నాను. మనం ఇక రోజు కలుసుకోవచ్చు. బహుశ నేనే మీ ఇంటికి వస్తాను. కలిసి టీ తాగోచ్చు,” అని ఎంతో సంతోషంగా నవ్వుతూ చెప్పినప్పుడు ఆనందమేసింది.
తరువాత ఎప్పుడో తెలిసింది..ఆరోగ్యం బాగోలేదని. ఇంటికి వెళ్ళి పలకరించాలని అనుకునేటప్పడికి ఇల్లు మారడం కూడా ఐపోయింది.
Cartoonist Chandrasekher (Jul 16, 1965 – 19 May 2014)
ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అతని కోసం చూసాను. కొంచెం ఆలస్యం అయ్యింది నేను వెళ్ళేటప్పటికి. మనిషి కనబడలేదు. వెతుకున్నాను. కాప్..నోటికి మాస్క్ అడ్డం ఉంది. ఆ మాస్క్ పైన కళ్ళు. నవ్వు. ఉగ్గబట్టుకున్న ఆనందం. సంతోషం. ప్రెస్క్లబ్ నిండిపోయింది. కాని మనిషిని చూసిన నేను ఖంగు తిన్నాను. నాకు తెలిసిన శేఖర్ రూపు కాదది. మనిషి మొఖంలో విపరీతమైన అలసట. సగం అయిపొయ్యాడు. ఎందుకో ఉండబుద్ది కాలేదక్కడ. తనతో మాట్లాడడానికి తగిన ప్రదేశమూ కాదు..సందర్భమూ కాదు. ఈ లోపు ఒకటికి రెండు సార్లు ఫోను చేసిన అన్వర్, sms లు గుప్పించిన ఇతర మిత్రులని పలకరించాను.
హడావుడిగా పరిచయుస్థుడొకాయన వచ్చాడు. పక్కనే శ్రీమతి అనుకుంటాను. పేద్ద పూలమాల. ఒక పుష్ఫగుచ్చం. హడావుడి హడావుడిగా వేదిక దగ్గిరకు దాదాపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపొయ్యారు. ఆఖరి చూపు. పార్ధివ శరీరాన్ని పుష్పమాలంకృతాన్ని చెయ్యాలన్న తాపత్రయం కనపడింది ఆ వేగంలో, ఆ మాటల్లో, ఆ గమనంలో. విరక్తి పుట్టింది.
విజయవాడలో “మో” హాస్పిటల్లో ఉంటే..”సార్, ఐపోయ్యిందా? డిక్లేర్ చేసేద్దామా”? అని స్ట్రింగర్స్ శ్రీ శ్రీ విశ్వేశ్వరావు గారిని పీక్కు తిన్న వైనం గుర్తోచ్చింది. మనసు రోసింది. అసహ్యం వేసింది. రోత పుట్టింది.
వెళ్ళిపోదామని వెనక్కి తిరుగుతుంటే..అన్వర్ ఎదురువచ్చాడు. “సార్, వెళ్ళిపోతున్నారా?” అంటూ. ఔనన్నట్టుగా తలూపూతూ గేటు వైపుకి కదులుతుంటే..”వుండండి సార్..రెండు మాటలు మాట్లాడి వెళ్లండి” అని అన్నాడు. వాళ్ళ మధ్య నేనేమి మాట్లాడుతాను అనుకుంటూ నిలబడిపొయ్యాను. “ఉండండి సార్. ఒక్క రెండు మాటలు మాట్లాడండి. తనుకూడా వింటాడు కదా?”అని అన్నాడు. ఇక ఆ మాటకు తిరుగులేదు. సరే అని ఆగి పొయ్యాను.
ఈ లోపు మాట్లాడేవాళ్ళున్నారు. వాళ్ళ తరువాత..అన్వర్ నాకు మైకు ఇప్పించాడు. శేఖర్ వెనకకి చేరుకున్నాను. శేఖర్ భుజం మీద చెయ్యి వేసాను. శేఖర్ నా ముఖంలోకి చూసాడు. మా ఇద్దరి కళ్ళు కలిసినవి. He knows. He knew, I knew. He also knew that my heart is with him. I wished him all the best with all my heart. I expressed my good wishes to all his frineds for supporting him at that time. లేచి నిలబడ్డాడు. కౌగలించుకున్నాడు. That was the parting embrace. I knew.
మైక్ ఆర్టిస్టు మోహన్ గారికిచ్చాను. అన్వర్ కి థాంక్స్ చెప్పాను. వచ్చేసాను.
మా అమ్మ పోయినప్పుడు చలసాని ప్రసాదరావు గారు రాలేదు. దానికి ఆయన చెప్పిన కారణం. “నాకు మీ అమ్మ చక్కగా సంతోషం గా నవ్వుతూ ఉన్నప్పుడు చూసిన జ్ఞాపకం. నాకు అదే గుర్తుంచుకోవాలని ఉంది” అని.
చంద్రశేఖర్ విషయం లో నాది అదే ఉద్దేశం. అందుకే కొడుకు పెళ్ళికి వెళ్ళలేక పొయ్యాను. ఈ రోజు వెళ్ళడం లేదు. ఫోటో కూడ తను నవ్వుతున్నదే పెట్టాను.
ఆ రోజున అన్వర్ నన్ను గుర్తుపెట్టుకుని పిలవకపొతే..నాకు శేఖర్ చిరు దరహసం అందేది కాదు.
గుడ్బై శేఖర్. You are a good friend. I shall remember your smile. Always.
ఇది వ్యాపారం కాదు. నేను ఇప్పుడు కినిగె లో లేను కూడా! శేఖర్ పుస్తకాలు ఇవి కొన్ని అని చెప్పడానికి మాత్రమే: http://kinige.com/author/Shekar
పోయిన సంవత్సరం అంటే 2013 లో ఒక పెద్ద రచయిత (“మాకు తెలియకుండా ఎప్పుడు పెద్దవాడైపొయ్యాడు” అని ఒక మరో పెద్దాయన సభాముఖంగానే అడిగాడు అనుకొండి, అది వేరే విషయం!) నన్నో ప్రశ్న అడిగాడు.
కాని నా జవాబు మాత్రం, “నాకు మరో విధంగా ఉండటం చేతకాదు” అని. ఈ ప్రస్థావన ఇప్పుడెండుకంటారా..ఎందుకో గుర్తు వచ్చింది..అద్దంలో నా దంతాలు చూసుకుంటూఉంటే..the last smile is always mine.