స్త్రీ వాదంతో ఓ సాయంత్రం!

Telugu author Volga at Vedika Literary Meet

స్త్రీ వాదంతో ఓ సాయంత్రం!

స్త్రీ వాదము, స్త్రీత్వము, స్త్రీ ఆలోచనా విధానము.. వీటి గురించి ఎన్నిసార్లు విన్నా, ఎంతమంది చెప్పినా, ఎంత చదివినా ఎప్పుడూ నాకు ఓ సరైన సమాధానం వచ్చేది కాదు. అసలు సమాధానమే వచ్చేది కాదా?

అంటే అలా అనేం లేదు. సమాధానమైతే వచ్చేది కానీ, నా వయసుకు, నా స్థాయికి సరిపడే ఆలోచనకు ఆ సమాధానాన్ని పోల్చుకుని చూసేప్పటికి అది ఎక్కడో తేలిపోయినట్లు కనిపించేది.

సరే, ఈ ప్రశ్నలా ఉండనీ, పూర్తి సమాధానం ఏదో ఒకరోజు దొరక్కపోదా అనుకుంటూనే నన్ను నేను అఫీషియల్‌గా ఫెమినిస్ట్‌నని ఎప్పుడో ప్రకటించుకున్నా. ప్రకటించుకోవడం వరకూ బాగానే ఉంది. నా ఆలోచనా
స్థాయిలో స్త్రీ వాదినని చెప్పుకోవడమూ బాగానే ఉంది. మరి పూర్తి సమాధానం ఎప్పుడు దొరకాలి? ఎలా దొరకాలి? ఉఫ్..

మోగిందండీ.. ‘నీకీ విషయం చెప్పడానికే వేదిక గ్రూపు ఓల్గా గారితో ఓ సమావేశం ఏర్పాటు చేసింద’న్న సమాచారంతో ఓ ఫోన్ కాల్.

13 ఫిబ్రవరి 2016. సరిగ్గా 5 అయిందప్పుడు (అంటే మన టైమ్ ప్రకారం నాలుగున్నరే అనుకుందాం!)

అప్పటికే వచ్చినవారంతా సమావేశం కోసం ఆసక్తి ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఆ రోజు సమావేశంలో సాహిత్యంతో తన ప్రయాణం గురించి చెప్పేందుకు ఓల్గా గారు సిద్ధంగా ఉన్నారు. నా మెదడులో ఒక్కటే
తిరుగుతోంది, సమాధానం దొరుకుతుంది కదా?

మెల్లిగా సమావేశం ప్రారంభమైంది. ఓల్గా గారు సాహిత్యంతో తన ప్రయాణాన్ని, తన సాహిత్య ప్రయాణాన్ని, స్త్రీ వాదాన్ని, స్త్రీ ఆలోచన విధానాన్ని లోతుగా ప్రస్తావిస్తూ వెళుతున్నా కొద్దీ, ఈ విషయంపై నాకు  కావాల్సిన సమాధానం కూడా దొరుకుతున్నట్లనిపించింది. ఇక్కడ ఆ ముందు మాటలు కొన్ని ఓల్గా స్వరంతోనే

కొన్ని పుటోలు ఇక్కడ.

చిన్నతనం నుంచే పుస్తకాలతో స్నేహం పెంచుకోవడం, కాలేజీ రోజుల్లో చిన్న చిన్న కవితలు రాయడం, సాహితీ వేత్తలను, రచయితలను కలుసుకోవడం, వాళ్ళ దగ్గర్నుంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, రాజకీయాలు, స్త్రీ ఆలోచనా, స్త్రీని సమాజం అర్థం చేసుకున్న విధానం, స్త్రీ వాదం అనే ఆలోచన, స్త్రీ వాదం అనే ఆలోచనను సమాజం అర్థం చేసుకున్న విధానం.. ఇలా ఓల్గా గారు ఒక్కో విషయాన్ని చెబుతూ పోతూ ఉంటే నీదనే ఆలోచన బలపడాలంటే నీదైన ప్రయాణం ఒకటి చేయాల్సి ఉంటుందని, ఆ ప్రయాణం మొదలుపెట్టడం దగ్గర్నుంచి, ఆ ప్రయాణం మనకు అర్థమయ్యే వరకూ ధైర్యంగా ముందుకెళ్ళడం ఒక్కటే మనముందున్న కర్తవ్యమని ఆమె మాటల్లో అర్థం అర్థమవుతూ పోయింది.

స్త్రీ వాదం అంటే ఏంటో అర్థమయ్యాక, దాన్ని తానుగా ఈ ప్రపంచానికి ఎలా అర్థమయ్యేలా చెప్పడానికి చేసిన రచనలే తన సాహిత్య ప్రయాణమని చెప్పినపుడు ఒక వ్యక్తి, ఒక వాదాన్ని అర్థం చేసుకొని, దానికోసమే శ్రమిస్తే ఎంతదూరం వెళ్ళగలరో ఓల్గా గారు నిరూపించి చూపినట్లనిపించింది.

“స్త్రీ వాదమంటే.. స్త్రీ తన శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచనను ప్రపంచానికి చెప్పడమే. స్త్రీ వాదమంటే స్త్రీ ధైర్యంగా తన సొంతంగా, తానుగా నిలబడి ముందుకెళ్ళడమన్న ఒక ఆలోచనే. అంతేకానీ, స్త్రీ వాదమంటే
పురుషుడిని ధ్వేషించడమో, మరోటో కాదు” అని స్త్రీ వాదానికి ఓల్గా గారిచ్చిన నిర్వచనం చాలా స్పష్టంగా అర్థమయ్యేలా ఉంది. స్త్రీ వాదంలో మళ్ళీ ఇంకా చాలా ఆలోచనలున్నాయని, వాటిని వేరు చేసి చూడడం అన్న ఆలోచనను పక్కనబెడితే, వాటి గురించి కూడా ఇంకా లోతైన చర్చ జరిగి ఒక అభిప్రాయం బలపడాల్సిన అవసరం ఉందని ఓల్గా గారు ఈ సందర్భంగా తన ఆలోచనను పంచుకున్నారు.

ఓల్గా గారి కథల సంపుటి ‘విముక్త‘కు కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడమనేది ఒక వాదాన్ని చెప్పడంతో పాటు, ఆ వాదాన్ని చెప్పడానికి ఎంచుకున్న ఒక సరైన సాహితీ ప్రక్రియ వల్లే సాధ్యమైందని భావిస్తున్నట్లు ఒక అభిప్రాయం వినిపించింది. దాంతో పాటు ఈ సాహితి ప్రక్రియలో మీదైనా ముద్రను తేవడానికి ఎలాంటి కృషి చేశారు? అన్న ప్రశ్నకు ఓల్గా గారు సమాధానమిస్తూ.. “ఒక వాదాన్ని చెప్పేందుకు ఎంచుకునే భాషలో కూడా ప్రయోగం, కొత్తదనం చూపాలి. అప్పుడే అందరికీ ఆ ఆలోచన చేరడంతో పాటు దానికి ఒక అర్థం వస్తుంది. నా వరకూ నేను నా భాష పరంగా ఎదగడం ఎప్పటికప్పుడు సాహిత్యంతో స్నేహం వల్లే సాధ్యమైంది” అన్నారు.

ఇలా చాలా ప్రశాంతంగా మొదలైన సమావేశం, అంతే ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రశాంత సమావేశానికి ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఓ అందాన్ని, అర్థాన్ని తెచ్చిపెట్టింది.

ఇలాంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన వేదికకు, ఆలంబనకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆలంబనలో చిన్నారులు నాకైతే తెగ నచ్చేశారు. గొడవ పడే స్థాయి చర్చలు జరిగినా, ఈ పిల్లలు నవ్వులు ఆ ఆలోచనను కూడా తేనివ్వవేమో అన్నంత అందంగా ఉన్నాయి.

రమణ మూర్తి గారు సమావేశం మొదలయ్యే ముందు The Story of an Hour అనే కథ గురించి ప్రస్తావించారు. ఆ కథను వీలైతే (వీలైతే కాదు, తప్పక) చదవండి.
ఈ నివేదిక ని అందించినవారు వర్ధమాన రచయిత – వి మల్లికార్జున్.

త్రిపురనేని గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారం 2015

TripuraneniGopichandNationalLiteraryAward

సెప్టెంబరు 8న సాహిత్యకారుడు త్రిపురనేని గోపిచంద్ జన్మదినం.  గోపీచంద్ జాతీయ పురస్కారాన్ని ఆరోజున ఎంపిక చేసిన గ్రహీతకు అందజేయడం ఒక సత్సాంప్రదాయంగా నిర్వహిస్తున్నారు.   2015 సంవత్సరానికి గాను సర్.  విలియం మార్క్  టుల్లి కి ఈ సారి దానిని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా అందించారు.  ఆ కార్యక్రమానికి వేదిక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైద్రాబాదు.

ఆ కార్యక్రమం ఆహ్వాన పత్రిక ఇది.
The invitation to the Tripuraneni Gopichand National Literary Award presentation to event.

గవర్నర్ రోశయ్య గారి ప్రసంగ పాఠం ఆంగ్లంలో ఇక్కడ.
పురస్కార స్వీకర్త సర్. విలియం మార్క్  టుల్లీ ప్రసంగం ఇక్కడ మీరు వినవచ్చు.
ఇక దిన పత్రికలలో వచ్చిన వ్యాసాలు వివరాలు ఇవి.
ఇక్కడ ది హిందు లో.
పున్నా కృష్ణమూర్తి పరిచయం వ్యాసం సాక్షి దినపత్రికలో ఇక్కడ.
ఈనాడు దిన పత్రికలో ఇక్కడ.
ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇక్కడ.

From your left: Y. K Nageswara Rao, Saichand (youngest son of Gopichand) Saripalli Kondal Rao,  Padmabhushan Sir Mark Tully (seated), Sri Latha, Dr Sunaina Singh and Dr T H Chowdary

From your left: Y. K Nageswara Rao, Saichand, Saripalli Kondal Rao, Sir Mark Tully, Sri Latha, Dr Sunaina Singh, Dr T H Chowdary

నీ సాహిత్యానికి అదే ఎక్కువ!

puraskar - felicitation - award

దాదాపు ఒక రెండు దశాబ్దాల క్రితం అనుకుందాం. పడవల్లాంటి కార్లు,  ఆరడగుల ఆజానుబాహువు, నుదుటి మీద ముంగుర్లు  సర్దుకుంటూ ఏ ఫెమినానో, డికెన్సు పుస్తకాన్ని చదువుకుంటున్న ఆమె, తో, ప్రేమ, ఆఖరి పేజిలో కధానాయిక కోరుకున్న ఆసుపత్రి ప్రారంభోత్సవం లాంటి ఆకాశంలో విహరించడానికి కావల్సిన అందమైన కలలతో వెలువడే నవలా శకం అది.
ShadowShadowByMadhuBaabuTulasidalamByYandamoori PracticalJokerByKommuriSambasivaRao secretaryByYaddanapudiSulochanaRani
ఒక ఒంటరి వాడు, ఒక యువతి, ఏ పల్లెటూరు నుంచో ఒక మహా నగరానికి వచ్చి ప్రపంచాన్ని జయించే క్రమంలో ఇచ్చే వాల్యుబుల్ కోట్స్ తో మరో వైపునుంచి పర్సనాలిటి డెవలెప్మెంట్ ఇత్రివృత్తాలతో వెలువెడుతున్న సో కాల్డ్ ‘క్షుద్ర సాహిత్యం’ నవలా యుగం అది.

బెంగాలి నవలల అనుసృజనలతో హోరెత్తి పోతున్న సమయంలో, రాబిన్ కుక్నిక్ కార్టర్ కిల్ మాస్టర్, ఆర్ధర్ హెయిలి, అలిస్టర్ మెక్లెయిన్, హారోల్డ్ రాబిన్స్, స్టాన్లి గార్డ్‌నెర్ , ఫోర్స్‌త్, డేవిడ్ సెల్జర్ ల రచనల / పాత్రల కిచిడి తో సీరియస్‌గా సీరియల్స్ తో వార పత్రికల అమ్మకాలు లక్షల్లోకి  చేరుకున్న శకం అది.

puraskar - felicitation - award
పురస్కారం – బహుమతి

బ్లాంక్ చెక్‌లతో తన ఇంటి వసారాలో ప్రచురణ కర్తలు కూర్చుని ఉంటే రచయిత/త్రు లు వారిని గుర్తించని రోజులు, అవి.

ఆలాంటి రోజులలో రచయితకు సాంఘిక బాధ్యత ఉన్నదన్న నిర్దుష్టమైన అభిప్రాయంతో ఉండి రచనలు చేస్తున్న ఒకానొక రచయితకు ప్రభుత్వం గుర్తింపుతో బాటు కొంత నగదు కూడ అందింది.

కమర్షియల్ రైటర్‌గా డబ్బుకు డబ్బుకు, పేరు, గుర్తింపు పొందిన ఒకానొక రచయిత , ఈనాడు గ్రూప్‌‌లో మేగజైన్స్  ఎడిటర్ చలసాని ప్రసాద రావు గారిని కలిసాడు.  పిచ్చాపాటి మాటల్లో, ఆ రచయిత “ఆయ్యా, ఇన్ని పత్రికలలో, నా కథ గాని, నవలగాని, సీరియల్ గాని, ప్రచురించనివి ఒకటి కూడ లేవు.  మరి నన్ను గుర్తించదేమి ఈ ప్రభుత్వం?” అని తన అవేదనని, ఆక్రోశాన్ని, అక్కస్సుని వెళ్లబుచ్చాడు.

ఠకీ మని ఆయన అన్నాడు కదా, ” నీకు గుర్తింపు ఎందుకు?  డబ్బు సంపాదించుకుంటున్నావు కదా?  నీకు గ్లామర్ ఉంది కదా?  ఆయనకి అవి రెండు లేవు కదా!  అందుకనే ఆయన్ని ప్రభుత్వం గుర్తించింది.  పురస్కారమిచ్చి గౌరవించింది.  నీకున్న దానితో నువ్వు తృప్తి పడు.  నీ సాహిత్యానికి అదే ఎక్కువ!”

ఈ సందర్భంగా
మీకు,
మీ అప్తులకు,
మీ ఆత్మీయులందరికి
సంక్రాంతి
శుభాకాంక్షలు

తెలియజేసుకుంటున్నాను.

సౌజన్యం ఆ మధ్య ఏవో మాటల మధ్య దాసరి అమరేంద్ర, నేను, కథ నవీన్ కలిసి మాట్లాడుకుంటుంటే బయటపడ్డ విషయం అది. రచయిత/త్రి పేరు మాత్రం నన్ను అడగవద్దు.   😉

నేనైన నీకు నీవైన నేను

“నేనైన నీకు నీవైన నేను”  అని  2006 లో అన్నాడామాట. పైగా అతి రమణీయం గాను.
రాయడం ఒక దురద,” అని కూడ అన్నాడు.
“ఆ మాట చాలా చీప్ గా ఉంది,” అని ఒకానొక పాఠకుడి ఒక వ్యాఖ్య.
“నా కథల్లో అంతర్లీనంగా తార్కికత, తాత్వికత కనిపించడానికి నా చిన్నప్పటి అధ్యయనం కారణం కావచ్చు,” అని నిన్న అన్నాడు.
ఇంకా ఆరుపదులకి ఆమడ దూరంలోనే ఉన్నా..ఒక ఆరుపదులవరకు రాసేసాడు, కథలు.
ట్విన్నవలలు.  అసలు ఆ మాట విన్నారా? ఇవిగో ఇక్కడున్నవి.

<img class="wp-image-19 size-full" src="https://telugu.anilatluri.com/wp-content/uploads/sites/3/2014/12/TwinnavalaluByAnaamakuduRamasastri_Anil_Atluri.jpg?w=656" alt="ట్విన్నవలలు " originalw="656" width="808" height="1220" scale="2">
ట్విన్నవలలు – రాతగాడు అనామకుడు

పోయినేడాది…దాదాపు ఇవే రోజుల్లో…వాళ్ళిద్దరు కలిసి ఒకొళ్ళపుస్తకాన్ని మరొకరికి అంకితం ఇచ్చుకున్నారు.
పరిణయం చేసుకుని పాతికేళ్ళే..కాని అంతకుముందే పరిచయం అనొచ్చా?  అనకూడదేమో! బంధుత్వం ఉందిగా మరి.

మరి విముక్తి మూలంగా ఈ ప్రత్యేకత వచ్చిందో..లేక విముక్తి కి జనార్ధన మహర్షి, నవ్య సంయుక్తంగా ఇచ్చిన బహుమతి వల్లవచ్చిందో కాని నవ్య కళ్ళకి ఇతని రూపు ప్రత్యేకం గా కనపడింది.  ఆ ప్రత్యేకం ఇక్కడ చదువుకోండి.

చాలా మందికి తెలియని మరొక విషయం.  ఇతను ఆంగ్లంలో కూడ కథలు వ్రాసాడు. ఇదిగో ఇక్కడుంది ఒకటి చదువుకోండి.

నవ్య వార పత్రిక. తేది డిసెంబరు 10, 2014.  పుటలు 15 నుంచి 20 దాకా.

పబ్లిక్కుగా బాగానే జరిగింది..ఐనా

ఏదో వెలితి.

తలిశెట్టి రామారావు గారి పేరు విన్నారా?
లేదా?

The first Telugu Cartoonist Talisetty Ramarao

ఆ మహాను భావుడే తొలి తెలుగు వ్యంగ చిత్రకారుడు (అంటే కార్టూనిస్ట్) అని తెలుగు వ్యంగ చిత్రకారులు నిర్ణయించేసారు.  పబ్లిక్కుగానే.  ప్రసార మాధ్యమాలకి ప్రకటనలు, పత్రికలలో వ్రాతలు వగైరా అన్ని ఐపోయినవి. ఆయనే తొలి తెలుగు వ్యంగ చిత్రకారుడు అని వూరుకున్నారా?  లేదు.  ఆయన పుట్టిన మే 20వ తారీఖుని తెలుగు కార్టూనిష్టుల దినోత్సవం గా కూడా నిర్ణయించేసారు.  పబ్లిక్కుగానే.  అలా అనేసి వూరుకున్నారా?  లేదు. ప్రకటించేసారు! ఎలా? పబ్లిక్కుగానే.  ప్రసారమాధ్యమాల వారందరూ కూడ తమ తమ శ్రోతలకి, పాఠకులకి, వీక్షకులకి, ఇతరులకి ఆ వార్తని బట్వాడా చేసేసారు.  ప్లబిక్కుగానే ఇదంతా!

పైగా ఈ తెలుగు ఈ వ్యంగ చిత్రకారులందరూ కలిసి, ఆయన..ఎవరూ? ఆ తొలి తెలుగు వ్యంగ చిత్రకారుడి పేరు మీద ఒక “తలిశెట్టి రామారావు అవార్డు కార్టూన్‌ ల పోటి” ని కూడా ఘనంగా నిర్వహించారు.  పబ్లిక్కుగానే నండీ!  బహుమతులిచ్చారు ఆ పోటీలలో. పబ్లిక్కు గానే!  ఎవరు ఇచ్చారండి బహుమతులు. తనికెళ్ల భరణి..చలనచిత్ర వ్యంగ నటుడు (అందామా)!  ఎక్కడ? భాగ్యనగరం లోనే!ఎప్పుడూ?  ఆ తేదినే!  మే 20వ తారీఖునే!! అది కూడ పబ్లిక్కుగానే.  పబ్లికే కదండీ నేను, అందుకనే హాజరయ్యానండి, దానికి కూడా!

Tanekella Bharani, MVR Sastry, Sanku on dais and Sudhama at the podium

అయ్యా అది ఐపోయింది.

మొన్న అంటే, 28 న మొదలుబెట్టి, 29, 30 న కూడ మన కార్టూనిష్టు మిత్రులు కార్టూనోత్సవ్ పబ్లిక్కుగా,పబ్లిక్కుకి అందుబాటులో ఉండే పబ్లిక్ గార్డెన్స్‌లో జరుపుకున్నారు.నరేంద్ర లూథర్ గారు, పొత్తూరి వేంకటేశ్వరావు గారు, మరి కె.వి రమణా చారి గారు లాంటి  పెద్దల సమక్షంలో 30 వ తారిఖున తమ పెద్దలని ఘనంగా సన్మానించుకున్నారు. పబ్లిక్కు గానే నండోయి!

Cartoonotsav 2012, held between 28th and 30th October, 2012 at Public Gardens, Hyderabad.

అందులో ఒక కొత్త ప్రతిపాదన చేసారు.  పబ్క్లిక్ గానే నండి.  అదేమిటంటే, తమకి గురుతుల్యులైన మరో పెద్ద “కార్టూనిష్టు”  పుట్టిన రోజుని తెలుగు కార్టూనిష్టుల దినోత్సవంగా పరిగణించాలని.  వారు ఎంచుకున్న “కార్టూనిష్టు” గారి గురించి ఏ ఒక్కరికి అభ్యంతరంలేదు. వారికి జరగవలసిన సన్మానాలు, పురస్కారాలు భవిష్యత్తు లో చేయవలసిని కార్యక్రమాలు చాలానే ఉంటవి. అటువంటి సందర్భంలో ఇటువంటి “ప్రతిపాదన” ఎంత వరకు సమంజసమన్నదే ప్రశ్న!  పైగా ఆ “గురువు” గారికి అసలు ఈ విషయం తెలుసా అన్న సందేహం కూడా కలుగుతుంది. తెలిసుంటే వారు సున్నితంగా తిరస్కరించే మనస్తత్వమున్నవారే అని కూడా నా బోటి వారి అభిప్రాయం.    ఆ “గురువు” గారే తన “గురువు” గా భావించే మరొ “పెద్ద గురువు” గారు హటాత్తుగా ఆ సభకి వచ్చివుంటే, అప్పుడు గౌరవం వారికే దక్కేదేమో?! పబ్లిక్కుగా అన్నా, అనకపోయీనా నిన్న “కార్టూనోత్సవ్” కి హాజరైన కొంతమంది మిత్రులు ప్రైవేటుగా నాతో తమ అభిప్రాయాన్ని వెల్లడి చేసుకున్నారు.

ఒకరికి తగిలించిన కిరీటాన్ని లాక్కుని మరొకరిని దానిని ధరింపజెయ్యబూనడం ఎంత వరకు సమంజసం?

అందులోను  పబ్లిక్కుగా!

తలిశెట్టి వ్యంగ చిత్రాలు ఇక్కడ కినిగె.కాం లో

‘మో’ ఎవరు?

అని నిన్న నన్నొకరు అడిగారు.

ఎక్కడ?

రవీంద్రభారతి, భాగ్యనగరం.

సందర్భం:

తనికెళ్ళ భరణి సాహితి పురస్కార ప్రదానం.

కూర్చోడానికి ఖాళీ కుర్చీ కనపడక అడిగినట్టున్నాడు.  అడిగిందెవరా అని వెనక్కి తిరిగి చూసాను.  కళ్ళజోడు. నెరిసిన జుత్తు. “సభ మొదలైన తరువాత తెలుస్తుందండి మీకు”, అని  మళ్ళీ నా దృష్టిని వేదిక మీదకి సారించాను.

అవధానం జరుగుతున్నది. అప్రస్తుత ప్రశ్న ; ” అత్యంత లోభి కూడ దానం చెయ్యలేనిది ఏది?”.  అవధాని గారు జవాబిచ్చే లోపే, నా చుట్టూ ఉన్న ప్రేక్షకులు ” కాలధర్మం” అని ఘొల్లుమన్నారు.

అధ్యక్షుడు సి. నారాయణ రెడ్డి గారు, నిషాదం అంటే సంగీతంలో సప్తమ స్వరం అని  వివరిస్తూ.. మో పుస్తకం నిషాదం చదవడం మొదలుపెట్టినప్పుడు..”ఏమో‌” అని అనుకున్నానని కాని “అమ్మో” అని అనిపిస్తుందని అన్నారు.

గవర్నమెంట్ ఎలిమెంటరి స్కూల్ళో చదువుకున్న తనకు, “మో‌” నిషాదం మీద మాట్లాడేంత పరిజ్ఞానం లేదని, నటుడు భరణి ఇలాంటి సత్కార్యాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అందజేసారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య.

ఇక తెలుగు భాష బోధకుడిగా కొన్నాళ్ళు ఉద్యోగం చేసినా, చలన చిత్ర నటుడుగా బ్రహ్మాండంగా సాగిపోతున్న బ్రహ్మానందం,

“అది గది

దాని అద్దె పది”

అనే కవితలోస్తూన ఈ రోజుల్లో, మో నిషాదం చదివి, అర్ధం చేసుకుని, జీర్ణం చేసుకునే అవకాశం ఆ భగవంతుడు తనకివ్వలేదని, తన ఫేసుకి ఆయన ఒక స్టఫ్ ని ఇచ్చి ప్రజలని రంజింపజెయ్యమన్నాడని చెప్పుకొచ్చారు.

ప్రేక్షకులతో పాటూ గా కూర్చోవలసిన తనను, వేదిక మీద కూర్చోపెట్టిన భరణి, తన అభిమానాన్ని చాటుకున్నాడే కాని తనకి ఆ అర్హత లేదని, వినమ్రంగా విన్నవించుకున్నాడు నటుడు ప్రకాశ్ రాజ్.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ‘మో‌’ మీద కోపం వచ్చింది.  ఔను, దర్శకుడు శ్రీనివాసే! ‘మో‌’ చదివినంత తను చదవలేదు కాబట్టి, తన కోపం.  ఆ కోపంతో ఆ సాహిత్యం అంతా చదివేస్తానంటాడియన.  అసలు తనకి రవింద్ర భారతి కార్ పార్కింగ్‌లో నిలబడే అర్హత కూడా లేదని కాని భరణి మాట తీసెయ్యలేక వేదిక మీద దాక్కోడం కుదరక కూర్చున్నాని నవ్వుల మధ్య చెప్పాడు.

న్యాయనిర్ణేతలు శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు, ఆచార్య మృణాళిని, కవి శివారెడ్డి.  తాము ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నుకున్న కవితా సంపుటి “నిషాదం” అని తమకు అందిన 108 కవితా సంపుటాలలో దానిని ఎన్నుకోవడానికి గల కొన్ని కారణాలని వివరించారు, కవి శివారెడ్డి.

తనికెళ్ళ భరణి, చక్కని చామరం క్రింద ‘మో‌’ అని  మనం పిలుచుకునే వేగుంట మోహన ప్రసాద్ ని సుఖాసీనుడిని చేసి, వేద పండితుల మంత్రోచ్హారణల మధ్య  స్వర్ణ పుష్పాభిషేకం చేసారు. వేదికనలంకరించిన పెద్దలలో చలన చిత్ర కథకులు, సంభాషణ కర్త పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన వేంకటేశ్వర రావు గారితో సహా అందరూ ‘‌మో’ కి తమ శుభాకాంక్షలు అందజేసారు.

‘మో‌’ తన దైన శైలిలో..ముందే వ్రాసుకుని తెచ్చుకున్న పాఠం నుంచి కొంత మేరకు చదివి వినిపించారు.

బర్త్ డే బాయ్ భరణికి కొంత మంది మిత్రులు తమ శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు.

జాతీయ గీతం జనగణ మణతో సభ ముగిసింది.

ఎటువంటి హడావిడి లేకుండా, వెకిలి ప్రసంగాలు, అనవసరపు డప్పాలు లేకుండా సాఫీగా, హాయిగా జరిగిన గొప్ప సాహిత్య సభ ఇది.  తెలుగు కవి కి తెలుగు కవిత్వానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే పండుగ రోజులకి ఇది తొలి రోజు మాత్రమే.

భరణి తన మాటల్లో చెప్పిన “గద్వాల్ సంస్థానం వారి ఆచారం” మళ్ళీ మొదలవ్వాలని..తెలుగు భాష బ్రతకడానికి ఇటువంటి సాహిత్య కార్యక్రమాలు విరివిగా జరగాలని మనమందరం కోరుకోవాలి.

వీలైతే ‘మో‌’ ప్రసగం పూర్తి పాఠం, అలాగే మితృడు నరేశ్ నున్న ‘మో‌’ మీద వ్రాసి, అచ్చొత్తంచి, ఉచితంగా పంచిన ఒక చిన్న పుస్తకాన్ని మీకు ఇక్కడ అందించడానికి ప్రయత్నిస్తాను.

ఈ తనికెళ్ళ భరణి సాహితి పురస్కారం జరిగినది కళా ఫౌండేషన్ ఆధ్యర్యంలో..కనకధార వెంచర్స్ సహాయంతో..

కినిగె.కాం లో

తనికెళ్ళ భరణి సాహిత్యం ఇక్కడ  ..  ‘మో’ నిషాదం ఇక్కడ  లభ్యం.