బాటసారి – వెండితెర నవల – అట్లూరి పిచ్హేశ్వరరావు

బాటసారి_baaTasaari

భరణీ  స్టూడియోస్ అధినేత పాలువాయి రామకృష్ణ దర్శకత్వంలో వెలువడిన ‘బాటసారి‘ లో నాయిక పాత్ర పోషించిన భానుమతి,  రామకృష్ణగారి సతీమణి. అక్కినేని నాగేశ్వరరావు నాయకుడుగా నటించిన ఈ చిత్రానికి మూలకధ బెంగాలి నవల ‘బడదీది‘. బెంగాలి  రచయిత శరత్‍బాబు.  ఆ ‘బాటసారి’ చలనచిత్రాన్ని వెండితెర నవలగా ఆవిష్కరించి తెలుగువారికి వెండితెర నవలలను పరిచయం చేసింది అట్లూరి పిఛ్హేశ్వర రావు. త్రిపురనేని రామస్వామి కనిష్ట పుత్రిక చౌదరాణి వీరి శ్రీమతి. ఆ విధంగా  బారిస్టరు, శతావధాని .’కవిరాజు’ త్రిపురనేని రామస్వామి కి అల్లుడు.  అట్లూరి పిఛ్హేశ్వరరావు నాకు తండ్రి. చౌదరాణి నాకు తల్లి.  నాన్న 92 ముగించుకుని 93లో అడుగు పెడుతున్న రోజు ఇది.  బానుమతి పాడిన “ఓ బాటసారి…”  పాట ని ఇక్కడ వినవఛ్హు. 

బాటసారి_baaTasaari
బాటసారి – baa Tasaari

baaTasaari (బాటసారి) film novel – 153 pages was published by the makers of the movie in July 1961.  It was priced 0.75 np.  That would be three annas.

Tidbit

You will notice the banner mentioning the title of the movie is signed GHRao He was quite popular in those days.  I personally knew him.  My mother and I were keen on having the signboard for the proposed Rani Book Centre (an exclusive Telugu bookstore) written in Telugu.  Our search brought him to us. He was Hanumantha Rao. In fact he did the first sign board in Telugu for Rani Book Centre in 1969.  What a coincidence!

స్త్రీ వాదంతో ఓ సాయంత్రం!

Telugu author Volga at Vedika Literary Meet

స్త్రీ వాదంతో ఓ సాయంత్రం!

స్త్రీ వాదము, స్త్రీత్వము, స్త్రీ ఆలోచనా విధానము.. వీటి గురించి ఎన్నిసార్లు విన్నా, ఎంతమంది చెప్పినా, ఎంత చదివినా ఎప్పుడూ నాకు ఓ సరైన సమాధానం వచ్చేది కాదు. అసలు సమాధానమే వచ్చేది కాదా?

అంటే అలా అనేం లేదు. సమాధానమైతే వచ్చేది కానీ, నా వయసుకు, నా స్థాయికి సరిపడే ఆలోచనకు ఆ సమాధానాన్ని పోల్చుకుని చూసేప్పటికి అది ఎక్కడో తేలిపోయినట్లు కనిపించేది.

సరే, ఈ ప్రశ్నలా ఉండనీ, పూర్తి సమాధానం ఏదో ఒకరోజు దొరక్కపోదా అనుకుంటూనే నన్ను నేను అఫీషియల్‌గా ఫెమినిస్ట్‌నని ఎప్పుడో ప్రకటించుకున్నా. ప్రకటించుకోవడం వరకూ బాగానే ఉంది. నా ఆలోచనా
స్థాయిలో స్త్రీ వాదినని చెప్పుకోవడమూ బాగానే ఉంది. మరి పూర్తి సమాధానం ఎప్పుడు దొరకాలి? ఎలా దొరకాలి? ఉఫ్..

మోగిందండీ.. ‘నీకీ విషయం చెప్పడానికే వేదిక గ్రూపు ఓల్గా గారితో ఓ సమావేశం ఏర్పాటు చేసింద’న్న సమాచారంతో ఓ ఫోన్ కాల్.

13 ఫిబ్రవరి 2016. సరిగ్గా 5 అయిందప్పుడు (అంటే మన టైమ్ ప్రకారం నాలుగున్నరే అనుకుందాం!)

అప్పటికే వచ్చినవారంతా సమావేశం కోసం ఆసక్తి ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఆ రోజు సమావేశంలో సాహిత్యంతో తన ప్రయాణం గురించి చెప్పేందుకు ఓల్గా గారు సిద్ధంగా ఉన్నారు. నా మెదడులో ఒక్కటే
తిరుగుతోంది, సమాధానం దొరుకుతుంది కదా?

మెల్లిగా సమావేశం ప్రారంభమైంది. ఓల్గా గారు సాహిత్యంతో తన ప్రయాణాన్ని, తన సాహిత్య ప్రయాణాన్ని, స్త్రీ వాదాన్ని, స్త్రీ ఆలోచన విధానాన్ని లోతుగా ప్రస్తావిస్తూ వెళుతున్నా కొద్దీ, ఈ విషయంపై నాకు  కావాల్సిన సమాధానం కూడా దొరుకుతున్నట్లనిపించింది. ఇక్కడ ఆ ముందు మాటలు కొన్ని ఓల్గా స్వరంతోనే

కొన్ని పుటోలు ఇక్కడ.

చిన్నతనం నుంచే పుస్తకాలతో స్నేహం పెంచుకోవడం, కాలేజీ రోజుల్లో చిన్న చిన్న కవితలు రాయడం, సాహితీ వేత్తలను, రచయితలను కలుసుకోవడం, వాళ్ళ దగ్గర్నుంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, రాజకీయాలు, స్త్రీ ఆలోచనా, స్త్రీని సమాజం అర్థం చేసుకున్న విధానం, స్త్రీ వాదం అనే ఆలోచన, స్త్రీ వాదం అనే ఆలోచనను సమాజం అర్థం చేసుకున్న విధానం.. ఇలా ఓల్గా గారు ఒక్కో విషయాన్ని చెబుతూ పోతూ ఉంటే నీదనే ఆలోచన బలపడాలంటే నీదైన ప్రయాణం ఒకటి చేయాల్సి ఉంటుందని, ఆ ప్రయాణం మొదలుపెట్టడం దగ్గర్నుంచి, ఆ ప్రయాణం మనకు అర్థమయ్యే వరకూ ధైర్యంగా ముందుకెళ్ళడం ఒక్కటే మనముందున్న కర్తవ్యమని ఆమె మాటల్లో అర్థం అర్థమవుతూ పోయింది.

స్త్రీ వాదం అంటే ఏంటో అర్థమయ్యాక, దాన్ని తానుగా ఈ ప్రపంచానికి ఎలా అర్థమయ్యేలా చెప్పడానికి చేసిన రచనలే తన సాహిత్య ప్రయాణమని చెప్పినపుడు ఒక వ్యక్తి, ఒక వాదాన్ని అర్థం చేసుకొని, దానికోసమే శ్రమిస్తే ఎంతదూరం వెళ్ళగలరో ఓల్గా గారు నిరూపించి చూపినట్లనిపించింది.

“స్త్రీ వాదమంటే.. స్త్రీ తన శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచనను ప్రపంచానికి చెప్పడమే. స్త్రీ వాదమంటే స్త్రీ ధైర్యంగా తన సొంతంగా, తానుగా నిలబడి ముందుకెళ్ళడమన్న ఒక ఆలోచనే. అంతేకానీ, స్త్రీ వాదమంటే
పురుషుడిని ధ్వేషించడమో, మరోటో కాదు” అని స్త్రీ వాదానికి ఓల్గా గారిచ్చిన నిర్వచనం చాలా స్పష్టంగా అర్థమయ్యేలా ఉంది. స్త్రీ వాదంలో మళ్ళీ ఇంకా చాలా ఆలోచనలున్నాయని, వాటిని వేరు చేసి చూడడం అన్న ఆలోచనను పక్కనబెడితే, వాటి గురించి కూడా ఇంకా లోతైన చర్చ జరిగి ఒక అభిప్రాయం బలపడాల్సిన అవసరం ఉందని ఓల్గా గారు ఈ సందర్భంగా తన ఆలోచనను పంచుకున్నారు.

ఓల్గా గారి కథల సంపుటి ‘విముక్త‘కు కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడమనేది ఒక వాదాన్ని చెప్పడంతో పాటు, ఆ వాదాన్ని చెప్పడానికి ఎంచుకున్న ఒక సరైన సాహితీ ప్రక్రియ వల్లే సాధ్యమైందని భావిస్తున్నట్లు ఒక అభిప్రాయం వినిపించింది. దాంతో పాటు ఈ సాహితి ప్రక్రియలో మీదైనా ముద్రను తేవడానికి ఎలాంటి కృషి చేశారు? అన్న ప్రశ్నకు ఓల్గా గారు సమాధానమిస్తూ.. “ఒక వాదాన్ని చెప్పేందుకు ఎంచుకునే భాషలో కూడా ప్రయోగం, కొత్తదనం చూపాలి. అప్పుడే అందరికీ ఆ ఆలోచన చేరడంతో పాటు దానికి ఒక అర్థం వస్తుంది. నా వరకూ నేను నా భాష పరంగా ఎదగడం ఎప్పటికప్పుడు సాహిత్యంతో స్నేహం వల్లే సాధ్యమైంది” అన్నారు.

ఇలా చాలా ప్రశాంతంగా మొదలైన సమావేశం, అంతే ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రశాంత సమావేశానికి ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఓ అందాన్ని, అర్థాన్ని తెచ్చిపెట్టింది.

ఇలాంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన వేదికకు, ఆలంబనకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆలంబనలో చిన్నారులు నాకైతే తెగ నచ్చేశారు. గొడవ పడే స్థాయి చర్చలు జరిగినా, ఈ పిల్లలు నవ్వులు ఆ ఆలోచనను కూడా తేనివ్వవేమో అన్నంత అందంగా ఉన్నాయి.

రమణ మూర్తి గారు సమావేశం మొదలయ్యే ముందు The Story of an Hour అనే కథ గురించి ప్రస్తావించారు. ఆ కథను వీలైతే (వీలైతే కాదు, తప్పక) చదవండి.
ఈ నివేదిక ని అందించినవారు వర్ధమాన రచయిత – వి మల్లికార్జున్.

కథ 2014 … మరో ముగ్గురు కథకులు

katha 2014 book launch invitation

కథ 2014 కథా సంపుటి కథాసాహితి వారి ప్రచురణలో ఇరవై అయిదవది.  ఈ పాతిక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వెలువడింది.  కథాసాహితి తొలి కధల సంపుటి వెలువడింది 1990 లో.  కీ శే ఆచార్య. చేకూరి రామారావు గారి చేతులమీదుగా ఆవిష్కరణ.  ఆనాటి సభాధ్యక్షులు ఆచార్య కె.వి శివారెడ్డి.  ఆ అధ్యక్షుల వారిది తెనాలి.  పాతికేళ్ళ కథ 2014 కూడా తెనాలిలో అవిష్కరణకి నోచుకోవడం కాకతాళీయం అయినా తెలుగు సాహిత్యంలో ఒక చారిత్రక ఘట్టం.

ఇక ఆ ముగ్గురు కథకులు ఎవరో చూద్దాం.

Author Patanjalisastry
తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారి తొలి కథ సీతన్న తాట.  ఇది 1962 లో ఆంధ్రప్రభ వారు ప్రచురించారు.  వీరి ఇతర కథలు, నవలలు గురించిన వివరాలు కథానిలయంలో
ఇక్కడ తెలుసుకోవచ్చు.

వాల్ పోస్టర్, సర్మా, గారడీ, రామేశ్వరం కాకులు ఇదివరలో ఆయా కథ వార్షిక సంకలనాలలో ప్రచురించారు.

వీటిలో వేదిక లో రామేశ్వరం కాకులు మీద చర్చ జరిగింది. ఆ కధని ఇక్కడ చదువుకోవచ్చు.

అద్దేపల్లి ప్రభు, కాకినాడ వాస్తవ్యులు.  వీరి తొలి కధ విలువలు 1984 లో అరుణతార మాస పత్రికలో వెలువడింది. వారి ఇతర సాహిత్యం కథానిలయంలో ఇక్కడ చూడండి.

     

Sunil Kumar P V - Author

1986 స్వాతి వార పత్రికలో ప్రచురించిన మూషికార్జునీయం కథకులు పి విసునీల్ కుమార్. లఘుచిత్రం గా వెలుగుచూసిన కథ దెయ్యం వీరిదే.  వేదిక లో వీరి తోక దెయ్యం చెప్పిన డిసిప్లి మీద 2015 మే నెలలో చర్చించుకున్నారు.   ఆ కథని ఇక్కడ చదువుకోవచ్చు.

వీరు ముగ్గురూ, నిన్న ముగ్గురు కధకులు మాత్రమే కాదు.  ఇంకా ఉన్నారండి.  వారిలో మరో ముగ్గురు కధకులని మీకు రేఫు పరిచయం చేస్తాను.

రానున్న ఆదివారం, సెప్టెంబరు 20, 2015 న తెనాలిలో  జరగనున్న ఆవిష్కరణ సభకి ఇదిగో ఆహ్వానం.katha 2014 book launch invitation

మొన్న సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా హైద్రాబాద్‌కి వచ్చాడు

The Loneliness of Being
Rajesh Khanna
DARK STAR
ఇది ఇంగ్లిష్ పుస్తకం.

హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్.  ఈ పుస్తకానికి  #hydlitfestival కి  ఈ టపాకి ఏమిటి సంబంధం అని మీకు సందేహాలు రావడం ఆశ్చర్యం లేదు.  మద్రాసు.  అదే సంబంధం.  Chennai is a city, Madras is an emotion అదే జ్ఞాపకం వస్తోంది ఇప్పుడు.

దాదాపు దశాబ్దం క్రితం వరకు దక్షిణాది చలనచిత్రాలకు కేంద్రంగా ఉండేది మద్రాసు.  ఉత్తరాది వాళ్ళు కూడ మద్రాసులో సినిమా నిర్మాణాలు చేసుకునేవారు.  వాళ్ళకి పంపిణీ కార్యాలయాలు కూడ అక్కడ ఉండేవి.  ఆంద్రప్రదేశ్ వారికి కూడ మద్రాసే అప్పుడు.

చాలా సినిమాలు మద్రాసులో షూట్ చేసుకున్నారు బాంబే నిర్మాతలు.  వాటిలో ఒకటి.  హాతీ మేరే సాథి. నిర్మాత సాండో‘ చిన్నప్ప తేవర్. హాతీ మేరే సాథి లో నాయకుడు రాజు పాత్రధారి – రాజేష్ ఖన్నా. సినిమాలో హీరో ఉద్యోగం కోసం రోడ్లవెమ్మటపడతాడు.  అందులో భాగంగా పాండిబజార్‌ లో ఆ దృశ్యాలని చిత్రీకరించారు.  (ఆ పాండిబజారులోనే రాణి బుక్ సెంటర్ తెలుగు పుస్తకాల కొట్టు ఉండేది.  రాణి బుక్ సెంటర్‌ని స్థాపించింది  చౌదరాణి. రచయిత అట్లూరి పిచ్చేశ్వర రావు – చౌదరాణి నా తల్లితండ్రులు.  చౌదరాణి కవిరాజుత్రిపురనేని రామస్వామి కనిష్ట పుత్రిక.)  ఇక మా నాన్న అట్లూరి పిచ్చేశ్వరావు తొలి తెలుగు వెండితెర కథనాన్ని గ్రంధస్తం చేసినవారు.

హాతీ మేరే సాథి లో రాజేష్ ఖన్నాకి “ఉద్యోగం కావాలి, ఉందా?” అని అడిగితే, “లేదు పో,” పొమ్మనడం కూడ ఉంది. రాణి బుక్ సెంటర్ ఎదురుగుండా ఉండే రాజేశ్వరి ఎలక్ట్రికల్స్‌లోను, హమీదియా హోటల్ & బేకరి లో కూడా ఉద్యోగాలు లేవని ఈ కాకా / జతిన్ ఖన్నా ని తరిమేస్తారు.

ఆ హాతీ మేరే సాథి సినిమా గురించి, రాజేష్ ఖన్నా గురించి పుస్తకం రాసిన రచయిత ఈ #hydlitfestival కి వస్తున్నాడు కదా అని వెళ్ళాను.

Gautam at hyd Lit festival jan26, 2015
రాజేష్ ఖన్నా డార్క్ స్టార్ రచయిత గౌతమ్ చింతామణి, ఉమా మగళ్, రచయిత రాఘవేందర్.

రచయిత ఎవరు?  కవిత చింతామణి పుత్రుడు.  కవిత ఎవరు?  కె. ఆరుద్ర రామలక్షి ల ప్రధమ పుత్రిక.  సరే, ఈ ఆరుద్ర, రామలక్షి‌ లు ఎవరు?  ( మీకు తెలియకపపోతే  గూగుల్ చెయ్యండి).  నా తల్లి తండ్రులకు స్నేహితులు. సాహితీ బంధువులు.  ఓహ్ రచయిత పేరు చెప్పలేదు కదూ!  అతని పేరు గౌతమ్ చింతామణి.

ఇవన్ని అతి ముఖ్యమైన కారణాలు నేను #hydlitfestival కి వెళ్లడానికి. జనవరి 23,24,25, 26 తారిఖులలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగం పేట లో జరిగింది ఈ హైద్రాబాద్ లిటరేచర్ ఫెస్టివల్.  పైన హెడర్ లో ఉంది ఆ పాఠశాల ప్రధాన భవంతి చిత్రమే!  అందులో 26 వ తేదిన టాటా రాక్‌ఫోర్ట్ సభాస్థలి వేదిక.  మధ్యాహ్నం Reams on Reels అనే శీర్షికమీద గౌతమ్ , ఎమ్. కె రాఘవేంద్ర లు చలనచిత్ర రంగం మీద తాము వ్రాసిన పుస్తకాలను గురించి సంచాలనకర్త ఉమ మగళ్ తో కలిసి వచ్చిన ఆహుతులతో పంచుకున్నారు.

ఇక పుస్తకం ఎలాగుంది?

ఇప్పటికే బాలివుడ్‌మీద రాస్తూ తనకుంటూ ఒక ఉనికిని ఏర్పరుచుకుంతున్న రచయిత గౌతమ్. నిబద్ధతతో చేసిన రచన ఇది.

సూపర్ స్టార్

Rajesh Khanna Superstar
The Loneliness of Being Rajesh Khanna Dark Star

→  రాజేష్ ఖన్నా ఎవరితో పడుకున్నాడు,
→  ఏ నిర్మాతని ఏడిపించాడు,
→  రోజుకుని ఎన్ని పెగ్గులు తాగేవాడు,
  పేక ఆడేవాడా?

లాంటి వ్యక్తిగత విషయాలూ, అతని జీవితంలోని వివాదాలు రాయలేదు. సూపర్‌స్టార్ రాజేష్‌ ఖన్నా గురించి అతని నటజీవితం గురించి మాత్రమే వ్రాసాడు. ఒక్క మాటలో చెప్పాలంటే  ఈ గౌతమ్ చింతామణి తన మాతమహుల పేరు నిలబెట్టాడు.  అనవసరమైన వ్యక్తిగత వివాదాలలోకి వెళ్ళలేదు.  అయినా పుస్తకం విడుదలైన అతి తక్కువ సమయంలోనే మలి ముద్రణకి నోచుకుంది.  భారతీయ చలనచిత్ర రంగంలోని తొలి  “సూపర్ స్టార్” మీద వెలివడిన పుస్తకం ఇది.

The Loneliness of Being Rajesh Khanna  DARK STAR బాలివుడ్ మీద ఆసక్తి వున్నవాళ్ళు అందరూ చదవతగ్గ పుస్తకం.

1950 ప్రాంతలలో పుట్టిన వాళ్ళకి హింది సినిమా అభిమానులకు, ‘సూపర్ స్టార్’ రాజేష్ ఖన్నా ఫాన్‌లకు గొప్ప బహుమతి ఈ పుస్తకం.

ఈ పుస్తకం గురించి ఆంగ్ల పత్రికలలో వచ్చిన కొన్ని సమీక్షలు ఇక్కడున్నవి.
తెలుగులో ఈ పుస్తకం గురించి పూర్ణిమ వ్రాసిన పరిచయం ఇక్కడ  పుస్తకం డాట్ నెట్‌లో చదువుకోవచ్చు .
ప్రతులు – ఇక్కడ అమెజాన్ లోనూ ఫ్లిప్‌కార్ట్‌లో ఇక్కడ కొనుక్కోవచ్చు

వెలగా వెంకటప్పయ్య

మొన్న మళ్ళీ కాళీపట్నం రామారావు మాస్టారి నవతీతరణం అభినందన ప్రత్యేక సంచిక చదివినప్పుడు వెలగా వారి వ్యాసం చదివాను.  చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వారి వయస్సుకి అంతర్జాలం గురించి ఆ మాత్రం అవగాహన ఉండటం.  అంతే కాదు ఆ ఏడు పేజీల సాహితీ వ్యాసం చివరి పేరగ్రాఫ్ లో వారన్న మాట: “ఇంటర్‌నెట్ ఉంటే ప్రతి ఇల్లు ఒక కథానిలయం అవుతుంది…కారా మాస్టారు సేకరించిన అపూర్వ కథా సంపదను అధికంగా ఉపయోగించినా, అసలు ఉపయోగించకపోయినా శిధిలమౌవుతుంది.  శిధిలం మాట మరిపించేది, మురిపించేది అంతర్జాల మాయాజాలం.”

Dr Velaga Venkatappaiah, Tenali
డా. వెలగా వెంకటప్పయ్య (1930 – 29 Dec 2014)

సాక్షి దిన పత్రిక లో నేను వ్రాసిన గూగుల్ నెట్‌లో e బుక్స్ చదివి వెంటనే నాకు ఫోన్ చేసి అభినందించిన వారిలో ఆయన ఒకరు.  ఆ వ్యాసాన్ని ఆయన ఆంధ్రా యూనివర్సిటి కి సమర్పించిన ఒక పత్రంలో ప్రస్తావించానని, అక్కడి విద్యార్ధులకి అందజేసానని కూడ తెలియజేసారు.

తెలుగునాట గ్రంధాలయాల ఏర్పాటు కోసం ఆయన చేసిన కృషి చాల గొప్పది.

కవిరాజు త్రిపురనేని రామస్వామి అంటే వారికి అభిమానం.  కవిరాజు మనుమడిగా ఆ అభిమానం నా మీద కూడ కొంత చూపించారనుకుంటాను.  మేము మద్రాసులో ఉన్నప్పుడు ఆక్కడికి వచ్చినప్పుడల్లా మా అమ్మ ‘కవిరాజు’ కుమార్తె చౌదరాణి ని తప్పక కలిసేవారు.

ఆదివారం మే 6, 2012 న కేంద్ర సాహిత్య అకాడెమి కవిరాజు త్రిపురనేని రామస్వామి సాహిత్యం మీద గుడివాడ లో నిర్వహించిన సదస్సులో వారు కూడ పాల్గొన్నారు.

Seminar on Kaviraju Tripuraneni Ramaswamy
The invitation to the seminar on ‘Kaviraju’ Tripuraneni Ramaswamy.

వెలగా వారు ఈ రోజు ఉదయం విజయవాడలో ఆయుష్ హాస్పిటల్స్ లో ఆఖరి శ్వాస తీసుకున్నారని తెలిసినప్పుడు బాధవేసింది. మరో స్థంభం నేల కూలింది.

రచనలు
వారి రచనలలో కొన్ని, వాటి  ముఖచిత్రాలు ఇక్కడున్నవి.  సాహిత్యాభిమాని – ఆర్ బి రావ్ సౌజన్యం.
https://www.facebook.com/media/set/?set=a.10155009212985385.1073741875.624985384&type=1&l=1ce9757082

…అమెరికా పుస్తకాల మీద బ్రహ్మాండమైన దాడిని ప్రారంభించింది!

“బెర్నాడ్  షా వ్రాసిన ‘సీజర్ అండ్  క్లియోపాట్రా’ నాటకంలో థియోడాటస్ అనే అతను అలెగ్జాండ్రియా లైబ్రెరి తగలబడిపోతుంటే చూడలేక సీజర్ దగ్గిరకి వెళ్ళి బ్రతిమాలాతాడు. సైనికులని పంపి మంటలార్పమనీ, పుస్తకాలని కాపాడమనీ.  సీజరు ససేమిరా అంటాడు.

‘అక్కడాహుతౌతున్నది వట్టి కాగితాల కట్టలు కాదు.  మానవజాతి కష్టించి ఆర్జించుకున్న సంస్కృతీ, సంస్కార, సంప్రదాయాలు దగ్ధమౌతున్నాయి.  మానవజాతి సంపాదించుకున్న మధుర స్మృతులన్నీ మసైపోతున్నాయి’ అని అక్రోశిస్తాడు ధియోడాటస్.

‘నువ్వేమి చెయ్యకుండా కూర్చుంటే రాబొయ్యే తరాలవారు నిన్ను పుస్తకాల విలువ కూడా తెలుసుకోలేని మూర్ఖుడిగాను, ఆటవిక సైనికుడిగాను జమ కడతారు సుమా!’ అని సీజర్ని హెచ్చరిస్తాడు.

అలాంటి  సీజర్లింకా యీ యిరవయ్యో శతాబ్దంలో కూడా ఉన్నారా?  అని మనం సందేహించవల్సిన అగత్యం లేకుండా పోయింది: ‘ప్రజాస్వామ్యానికి, వ్యక్తి స్వాతంత్యానికి పట్టుకొమ్మ అని, భూతలస్వర్గం (God’s own country) అని పేరు మోసిన అమెరికా పుస్తకాల మీద బ్రహ్మాండమైన దాడిని ప్రారంభించింది.’ ”
అట్లూరి పిచ్చేశ్వర రావు వ్రాసిన విన్నవి – కన్నవి లో నుంచి.
నిన్న జరిగిన సంఘటన నాకు మా నాన్న వ్రాసిన పై పేరాగ్రాఫ్‌ని గుర్తు చేసింది.

కానీ దాని నేపధ్యం వేరు.

నిన్న సాయంత్రం యువ సాహితీ మిత్రుడు అనిల్ బత్తుల  (అతను ఈ భూమ్మిద పడకముందే ప్రచురించబడ్డ సోవియట్ పుస్తకాలు అతి ముఖ్యంగా వాటి తెలుగు అనువాదాలని ఇప్పుడు డిజిటల్ ఫార్మాట్ లో ఉచితంగానే అందరికి అందజేయాలనే ఒక ఆశయంతో ముందుకు సాగుతున్నవాడు) నాకు ఫోన్ చేసి, “సార్, పారిస్ పతనం మీ నాన్నగారే కదా అనువదించింది?  ఒక పాత ప్రతి ఒకటి ఈ హైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో ఎక్కడో ఉందట!  ఇందాక ఫలానా వారు ఫోన్ చేసారు.  ఒక్కసారి మిమ్మల్ని కనుక్కుని కన్ఫర్మ్ చేసుకుందామని చేసాను సార్,” అని అన్నాడు.

అతను అడిగింది నిజమే!  The Fall of Paris ని వ్రాసింది  ఇల్యా ఎహ్రెన్‌బర్గ్ (Ilya Ehrenburg).  ఆంగ్లంలో తొలి ప్రచురణ 1940 ప్రాంతాలలో.

Ilya Ehrenburg
Ilya Ehrenburg Soviet writer, journalist, translator.

దాని తెలుగులో కి అనువదించింది అట్లూరి పిచ్చేశ్వర రావు.  సుమారు 840 పేజిలు.  తెలుగులో ప్రచురణ కాలం మార్చ్ 1960.

సరే, ఇక బుక్ ఫైయిర్ లో పారిస్ పతనం దొరకడానికి, మీ నాన్న వ్రాసిన దానికి, సీజర్ కి ఆ లైబ్రేరి తగలబెట్టడానికి సంబంధం ఏవిటి అనే దానికి వస్తున్నాను.

పారిస్ పతనం
పారిస్ పతనం – తెలుగు
“ఫాల్ ఆఫ్ పారిస్” కి అనువాదం

1980  ప్రాంతాలలో తానా సభలకి వెళ్ళారనుకుంటాను డి. వి. నరసరాజు గారు.  తానా పత్రిక లో ఏదో వ్యాసం కోసం వారికి ఫోను చేసినప్పుడు “ఇస్తాను, రండి ఇంట్లోనే ఉన్నాను,” అని అన్నారు.  ఆ సందర్భాన్ని కూడ గుర్తు చేసింది నిన్నటి అనిల్ బత్తుల ఫోన్ కాల్.

నరసరాజు గారు అన్నారు కదా, “అనిల్, పుస్తకాలు మన దగ్గిరే ఉంటే లాభం ఏమి ఉంది?  అవి ముద్రించింది పది మంది చదవాలనే కదా! మీరు తీసుకు వెళ్లండి.  చదవండి.  మీ పని అయిపోయిన తరువాత  నాకు తెచ్చి ఇవ్వండి.  మీరు నాకు ఇవ్వక పోయినా ఫరవాలేదు.  ఇంకేవరైనా చదువుతానంటే వారికివ్వండి,” అని.

పదిమంది చదవడానికి పుస్తక భాండాగారాలు అంటే లైబ్రేరిలు ఏర్పడ్డాయి.  ఆ భాండాగారాలలోని పుస్తకాలు ఇప్పుడు పదిమందికి అందుబాటులోకి వెళ్లకుండా దొడ్డి గుమ్మంద్వారా ఇలా బజారులోకి వస్తున్నాయ్యా?  అది హర్షణీయమా అన్న ప్రశ్న తలెత్తింది నాలో.

మా నాన్న గారి సాహిత్యం పునర్ముద్రణ కోసం నాకు ప్రస్తుతం అందుబాటులోలేని పుస్తకాలకోసం వెతుక్కుంటున్నప్పుడు సాహిత్యాభిమానులలో ఒకరిద్దరు తాము చూసామని దొరికిన రెండు మూడు పుస్తాకాలు సుమారు నాలుగైదు దశాబ్దాల క్రితం ప్రచురితమైన వాటి ప్రతులు కొని పంపారు.

840 పుటల పారిస్ పతనం, 1960 మార్చి ప్రచురణ, (బవుండ్ ఎడిషన్ అనేవారు) ప్రతి ధర 10 రూపాయలు.  ఈ రోజు అదే పుస్తకాన్ని బహుశ ఏ 250/- కో 300/- కో అమ్మినా కొనుక్కునే వారున్నారు. ఎందుకంటే అంత ధర పెట్టి ఆ ప్రతిని కొన్నవారిని నేనెరుగుదును.

మనకి తెలుసో, తెలియకో ఇలాంటి అరుదైన పుస్తకాలని ఏదో ఒక విధంగా సంపాదించి ఇలా అమ్ముకోవడాన్ని మనం సమర్ధించాలా అన్నది నా ప్రశ్న.  ఏదో ఒక పుస్తకమే కదా అని సరిపుచ్చుకోమంటారా?  అలా ఒక పుస్తకంతో మొదలైనది మరి రేపు లైబ్రేరిలను కొల్లగొడితే?  పది మంది కి అందాల్సిన పుస్తకాలు ఏ ఒక్కరి అలమారకో పరిమితమైతే అప్పుడేమంటారు?

దయచేసి మీ అభిప్రాయాల్ని క్రింది వ్యాఖ్యలలో తెలియజేయగోర్తాను.

తా. కలంహైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో ప్రతి అమ్ముడైపోయింది !  చి న.

కతల గంప – స వెం రమేశ్

ఇప్పుడే అందింది.  రమేశ్ పంపాడు.
ముఖచిత్రం చూస్తే ‘రయికముడి ఎరగని బతుకు’ (భూమిక, డిసెంబరు 2012) గుర్తు వచ్చింది.
అట్టమీద బొమ్మ వేసింది బి కిరణ్ కుమారి.  బాగుంది.  చూడగానే చేతిలోకి పుస్తకాన్ని తీసుకుని చదవాలనిపిస్తుంది…రమేశ్ ఎవరో,  రమేశ్ కతలేమిటో తెలియని వారికి కూడా!
ఆ నలుపు, తెలుపు రంగులలో ఒక అందం ఉంది.

పుస్తకం వెనుక తిప్పిచూస్తే…కొన్ని స్కెచెస్ ఉన్నాయి.  నలుపులో తెలుపు. అక్షరాలు కూడా తెలుపులో.
ఆ అక్షరాలతో మనం కూడ పరుగెడతాం!

రమేశ్ కళ్ళెదుట నిలిచిన కల లో కొన్ని మాటలు:
మళ్ళా ‘కతలమ్మో కతలు’ అనే నా గొంతు తెరువులో ఉలివింది.
తిరిగినాను, తిరిగినాను, తెరువంతా తిరిగినాను.  అది బాగా రూకలుండే తెరువే.  అంతకు ముందు నా కతల్ని అబ్బురంగా తీసుకున్నవాళ్ళు ఉండే తెరువే.  కాని నా కతలు వెలపోలేదు.
. . .
ఒక్కటీ నచ్చలేదు వాళ్లకు, ఒక్కటీ కతగా తోచలేదు వాళ్ళకు.
. . .
నాకు దిగులు కలిగింది.
. . .
అప్పుడు తిరుపతి ఉమన్న చెప్పినాడు, ‘పెద్దతెరువులోనే బండిని తిప్పితే ఎట్టాసామీ, సన్న సందుల్లో కూడా మణుసులు ఉంటారు.  అక్కడకూడ కతలంటే ఊపిరిచ్చేవాళ్ళు ఉంటారు.  ఒకసారి ఆ తట్టుకు పోయిరా పో’ అని.

పుస్తకాన్ని పూదోట శౌరీలు, మల్లవరపు విజయమరియదాస్ లకు అంకితం ఇచ్చాడు రమేశ్.

<img class="wp-image-19 size-full" src="https://telugu.anilatluri.com/wp-content/uploads/sites/3/2014/12/KathalaGampaBySaVeMRamesh_Anil_Atluri13thDec2014.jpg?w=808" alt=" kathala gaMpa" originalw="808" width="225" height="300" scale="2">
కతల గంప – తెలుగు కతలు కతకుడు స. వెం రమేశ్

పుస్తకం లో ఉన్న కతలు వాటి క్రమం:

తెలుగు సిన్నోడు తిమ్మరాయప్ప
మీసర వాన
ఊడల్లేని మర్రి
పదిమందికి పెట్టే పడసాల
ఆ అడివంచు పల్లె
కాకికి కడవడు పిచిక్కి పిడికిడు
రయికముడి ఎరగని బతుకు
చెట్లు చెప్పిన కత
సిడిమొ‌యిలు
బడకొడితి
వాడు గోపాలకృష్ణ కొటాయి
ఒంటినిట్టాడి గుడిసె
ఎందుండి వస్తీవి తుమ్మీదా
అబ్బిళింత
కతలగంప
మాదిగపుటక కాదు
మొ‌యిలు నొగులు
పాంచాలమ్మ పాట

ప్రతి కథ చివర అందులో తను వాడిన కొన్ని పదాలకి…మీకు, మీకేంటి నాకు కూడ అర్ధం అయ్యే తెలుగు పదాల అర్ధం ఇచ్చాడు.

ప్రతులకు మీరు పుస్తకం ధర రెండు వందలు పంపవలసింది ఇక్కడికి:
1-2-740, హనుమాన్ మందిరం దగ్గిర, రాకాసి పేట, బోధన్ 503 180
ఫోను: +91 90101 53505

గమనిక  పుస్తకంలో  ప్రతులకు “అన్ని ముఖ్యమైన పుస్తక కేంద్రాలు” అని ఉన్నా  అవి ఈ విషాదాంధ్రలో కాని, ప్రజాశ్రేయస్సులో కాని దొరుకుతాయన్న నమ్మకం లేదు.  కాబట్టి పై ప్రచురణకర్తలకి రొక్కం పంపండి.  అనుమానాలుంటే వారికి ఫోను చెయ్యండి.  చెబుతారు మీకు పుస్తకం ఎక్కడ దొరుకుతుందో.  వీలైతే వాళ్ళకి కొరియరు / పోస్ట్ ఖర్చులు పంపండి.  మరో పుస్తకం వాళ్ళు ప్రచురిస్తే మనకి మరో పుస్తకం అందుబాటులోకి వస్తుంది మరి!

“అమ్మ” ఉంది, జాన్!

ఆయనతో నాకు పరిచయం లేదు. సుమారుగా బ్లాగ్‌లోకం రోజులనుండి తెలుసు.  అయినా  మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నది లేదు. ఒకసారి ఎక్కడో పలకరించుకున్న గుర్తు. అయితే ఏం? ఆయన మంచితనం గురించి తెలుసు.  ఈయన పేరు జాన్ హైడ్ కనుమూరి.  నిన్న రాత్రి హటాత్తుగా హృద్రోగం తో వెళ్ళిపొయ్యాడు.

<img class="wp-image-19 size-full" src="https://telugu.anilatluri.com/wp-content/uploads/sites/3/2014/12/JphnHydeKanymuri.jpg? w=656" alt="amma" originalw="255" width="300" height="291" scale="2">
జాన్ హైడ్ కనుమూరి – తెలుగు బ్లాగర్ ( ? – 7th Dec 2014 )

ఆయన సంపాదకత్వాన తెలుగులో ఒక ఈ బుక్ వెలువరించాడు.  బహుశ అది తెలుగువారికి రెండవ ఈబుక్ అవుతుందేమో! ఈ మనిషిలో ప్రేమ పొంగినట్టే ..ఆ ఈబుక్ కూడ “అమ్మ” ప్రేమతోనే నిండింది. ఆమే ప్రేమతోను, అమ్మ మీద ప్రేమను వెలిబుచ్చిన  సుమారు 15 మంది బ్లాగర్ల కవితలతోను “అమ్మ”ని కూర్చాడు.  కవితలు కూర్చడానికి కారణం ..కవిత్వం అంటే వల్లమాలిన ప్రేమ జాన్‌కి.

<img class="wp-image-19 size-full" src="https://telugu.anilatluri.com/wp-content/uploads/sites/3/2014/12/ammaAcompilationByJohnHydeKanumuri_AnilAtluri.jpg? w=656" alt="amma" originalw="584" width="775" height="300" scale="2">
“amma” is a compilation of poetry by a few Telugu bloggers. John compiled them.

జాన్  అమ్మ ఈబుక్ ని తనే డిజైన్ చేసాడు.  డిటిపి మొత్తం అంతా తనే చేసుకున్నాడు.  దానికి ముందు మాటలు వ్రాసాడు.  ఆ ముందు మాటల్లో రెండు వాక్యాలు.
“జన జీవనం వస్తూవుంటుంది, పోతూ వుటుంది, నేను ప్రవహిస్తునేవుంటాను
జాన్ లేడు..కాని …”అమ్మ” ఉంది, జాన్!
ఏందుకో..జాన్ అలా వెళ్ళిపొయ్యాడు అంటే బాధగా ఉంది.

జాన్ సంపాదకత్వాన్న వెలువడిన కొందరి తెలుగు బ్లాగర్ల కవితల సంకలనాన్ని –  “అమ్మ” ఈబుక్ ని ఇక్కడ్నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జాన్ హైడ్ కనుమూరి బ్లాగులు:
http://johnhaidekanumuri.blogspot.in/
http://telugubible.blogspot.in/
http://alalapaikalatiga.blogspot.in/

అన్వర్ కి ధాంక్స్‌తో..

ఆదివారం.  మార్చ్ 2, 2014. మళ్ళీ SMS.  ఆర్టిస్ట్ మోహన్ గారి పిలుపు.  మనవాళ్లందరూ వస్తున్నారు.  మీరు కూడా రావాలి.  మన శేఖర్ కి మనం చెయ్యాలి! సందర్భం శేఖర్ కార్టూనిస్ట్‌గా గోల్డెన్ జూబిలి సెలబ్రేషన్.

శేఖర్ కార్టూనిస్ట్ గా నే పరిచయం అయ్యాడు  ఆంధ్రజ్యోతి లో.  కె.పి డెస్క్ పక్కనే.  కె.పి ని దాటుకుని శేఖర్ డెస్క్‌కి వెళ్ళాలి.  ఆ పక్కనే వసంతలక్ష్మి గారి డెస్క్.

కినిగె కి తన కార్టూన్ పుస్తకాన్ని ఇచ్చిన తొలి కార్టూనిస్టు శేఖర్.  అదొక అభిమానం.  తరువాత ఎప్పుడో ఒకసారి నా మీద కోపగించుకున్నాడు కూడా!  “నాకు మీరు పిచ్చేశ్వరరావు గారి అబ్బాయని ఎందుకు చెప్పలేదు.  ఆయనంటే మా తరానికి ఎంత ఇష్టమో, మీకు తెలియదు. అటువంటి వాళ్ళు అంత త్వరగా వెళ్ళిపోవాడనికి హడావుడి ఏమిటో?” అనుకున్నడు స్వగతంగా.

అమెరికా సంయుక్త రాష్ట్రాలకి వెళ్లబోయేముందు, వెళ్ళి వచ్చిన తరువాత తన పుస్తకాన్ని డిజిటల్ బుక్‌గా ఎలా డిజైన్‌చేస్తే బాగుంటుందో అని కలిసినప్పుడు మాట్లాడుకునేవాళ్ళం.  కలవనప్పుడు ఫోన్ చేసేవాడు.  ఫోనులో “తింటున్నాన్నా?” అని అడిగి నవ్వేవాడు.

“సార్, మీ ఇంటికి దగ్గిర్లోకి మారుతున్నాను. మనం ఇక రోజు కలుసుకోవచ్చు.  బహుశ నేనే మీ ఇంటికి వస్తాను.  కలిసి టీ తాగోచ్చు,” అని ఎంతో సంతోషంగా నవ్వుతూ చెప్పినప్పుడు ఆనందమేసింది.

తరువాత ఎప్పుడో తెలిసింది..ఆరోగ్యం బాగోలేదని.  ఇంటికి వెళ్ళి పలకరించాలని అనుకునేటప్పడికి ఇల్లు మారడం కూడా ఐపోయింది.

Cartoonist Chandrasekher
Cartoonist Chandrasekher (Jul 16, 1965 – 19 May 2014)

ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ ‌క్లబ్‌లో అతని కోసం చూసాను.  కొంచెం ఆలస్యం అయ్యింది నేను వెళ్ళేటప్పటికి.  మనిషి కనబడలేదు.  వెతుకున్నాను.  కాప్..నోటికి మాస్క్ అడ్డం ఉంది.  ఆ మాస్క్ పైన కళ్ళు. నవ్వు.  ఉగ్గబట్టుకున్న ఆనందం.  సంతోషం.  ప్రెస్‌క్లబ్ నిండిపోయింది.  కాని మనిషిని చూసిన నేను ఖంగు తిన్నాను.  నాకు తెలిసిన శేఖర్ రూపు కాదది.  మనిషి మొఖంలో విపరీతమైన అలసట. సగం అయిపొయ్యాడు.  ఎందుకో ఉండబుద్ది కాలేదక్కడ.  తనతో మాట్లాడడానికి తగిన ప్రదేశమూ కాదు..సందర్భమూ కాదు.  ఈ లోపు ఒకటికి రెండు సార్లు ఫోను చేసిన అన్వర్, sms లు గుప్పించిన ఇతర మిత్రులని పలకరించాను.

హడావుడిగా పరిచయుస్థుడొకాయన వచ్చాడు.  పక్కనే శ్రీమతి అనుకుంటాను.  పేద్ద పూలమాల.  ఒక పుష్ఫగుచ్చం.  హడావుడి హడావుడిగా వేదిక దగ్గిరకు దాదాపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపొయ్యారు.  ఆఖరి చూపు.  పార్ధివ శరీరాన్ని పుష్పమాలంకృతాన్ని చెయ్యాలన్న తాపత్రయం కనపడింది ఆ వేగంలో, ఆ మాటల్లో, ఆ గమనంలో.  విరక్తి పుట్టింది.

విజయవాడలో “మో” హాస్పిటల్‌లో ఉంటే..”సార్,  ఐపోయ్యిందా?  డిక్లేర్ చేసేద్దామా”?   అని స్ట్రింగర్స్ శ్రీ శ్రీ విశ్వేశ్వరావు గారిని పీక్కు తిన్న వైనం గుర్తోచ్చింది.  మనసు రోసింది. అసహ్యం వేసింది. రోత పుట్టింది.

వెళ్ళిపోదామని వెనక్కి తిరుగుతుంటే..అన్వర్ ఎదురువచ్చాడు.  “సార్, వెళ్ళిపోతున్నారా?” అంటూ. ఔనన్నట్టుగా తలూపూతూ గేటు వైపుకి కదులుతుంటే..”వుండండి సార్..రెండు మాటలు మాట్లాడి వెళ్లండి”  అని అన్నాడు.  వాళ్ళ మధ్య నేనేమి మాట్లాడుతాను అనుకుంటూ నిలబడిపొయ్యాను.  “ఉండండి సార్.  ఒక్క రెండు మాటలు మాట్లాడండి.  తనుకూడా వింటాడు కదా?”అని అన్నాడు. ఇక ఆ మాటకు తిరుగులేదు.  సరే అని ఆగి పొయ్యాను.

ఈ లోపు మాట్లాడేవాళ్ళున్నారు.  వాళ్ళ తరువాత..అన్వర్ నాకు మైకు ఇప్పించాడు.  శేఖర్ వెనకకి చేరుకున్నాను.  శేఖర్ భుజం మీద చెయ్యి వేసాను.  శేఖర్ నా ముఖంలోకి చూసాడు.  మా ఇద్దరి కళ్ళు కలిసినవి.  He knows.  He knew, I knew. He also knew that my heart is with him. I wished him all the best with all my heart.  I expressed my good wishes to all his frineds for supporting him at that time. లేచి నిలబడ్డాడు.  కౌగలించుకున్నాడు.  That was the parting embrace. I knew.

మైక్ ఆర్టిస్టు మోహన్ గారికిచ్చాను.  అన్వర్ కి థాంక్స్ చెప్పాను.  వచ్చేసాను.

మా అమ్మ పోయినప్పుడు చలసాని ప్రసాదరావు గారు రాలేదు.  దానికి ఆయన చెప్పిన కారణం.  “నాకు మీ అమ్మ చక్కగా సంతోషం గా నవ్వుతూ ఉన్నప్పుడు చూసిన జ్ఞాపకం.  నాకు అదే గుర్తుంచుకోవాలని ఉంది” అని.
చంద్రశేఖర్ విషయం లో నాది అదే ఉద్దేశం. అందుకే కొడుకు పెళ్ళికి వెళ్ళలేక పొయ్యాను.  ఈ రోజు వెళ్ళడం లేదు.  ఫోటో కూడ తను నవ్వుతున్నదే పెట్టాను.

ఆ రోజున అన్వర్ నన్ను గుర్తుపెట్టుకుని పిలవకపొతే..నాకు శేఖర్ చిరు దరహసం అందేది కాదు.

గుడ్‌బై శేఖర్.  You are a good friend.  I shall remember your smile.  Always.

ఇది వ్యాపారం కాదు.  నేను ఇప్పుడు కినిగె లో లేను కూడా!  శేఖర్ పుస్తకాలు ఇవి కొన్ని అని చెప్పడానికి మాత్రమే:  http://kinige.com/author/Shekar

కుక్క బిస్కత్తులు

కుక్క బిస్కత్తులు కుక్కలు తింటాయ్.
యజమాని బిస్కత్తులు ఎప్పుడు విసురుతాడా అని ఎదురుచూస్తూ ఉంటాయ్.
అచ్చం మనుషుల్లాగానే, నక్కలు, తోడేళ్ళు కూడా ఉంటాయి, కుక్కల్లాగా తింటాయి!
కాని సింహం అలా కాదు.
ఎవరో వొచ్చి పెడతారని ఎదురు చూడదు.
ఆకలి వేస్తేనే వేటాడుతుంది.
ఆకలి వేసినప్పుడు సింహాం పంజా విసురుతుంది.
మెడని విరిచి, చంపి తాపీగా తింటుంది.
తను తినగా మిగిలితే వదిలేస్తుంది.
కడుపునిండినా  కుక్కుకుంటూ కూర్చుని తినదు.
నక్కలకి తోడేళ్ళకి, రాబందులకి, డేగలకి ఇతర ప్రాణకోటికి వదిలేస్తుంది.
కుక్కలాగా మనిషి కాళ్ల దగ్గిర కూర్చుని దేబిరిస్తూ ఉండదు, సింహం.
సింహం మృగరాజు.  రారాజు.
ఏనుగులాగా చచ్చినా బ్రతికిఉన్నా దాని విలువ దానిదే!
జీవించినంత కాలం సింహం లా జీవించాలి!