మనసుంటే మార్గముంటుంది!

eenaaDu, vipula, chatura etc


1908, సెప్టెంబరు 9 బుధవారం. వినాయక చవితి పండగ రోజు. ముంబై లో ఆ రోజున ఆంధ్రపత్రిక – వారపత్రిక గా మొదలైంది. వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరావు పంతులు.  ముంబై నుండి 1914 లో మద్రాసు – ప్రస్తుతం చెన్నై కి వెళ్లింది ఆంధ్రపత్రిక. ఇసబెల్లా హాస్పిటల్, లజ్ కార్నర్ కి మధ్యలో నాగేశ్వరరావు పార్క్ వుంది. దానిని ఆనుకునే అమృతాంజన్ (ఆయుర్వేదం తైలం) నొప్పికి వాడే మందు కర్మాగారం కూడా అ పక్కనే వుండేది. (నాన్నతో కొన్ని సాయంత్రాలు ఆ పార్క్ లో గడిపాను నేను.) మద్రాసులో ఆ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుండి ఆ దినపత్రికతో బాటు ‘అంధ్ర పత్రిక’ వారపత్రిక కూడ వెలువడడం మొదలైంది.  దాదాపు దశాబ్దం తరువాత అంటే జవరి 1924 లో ‘భారతి‘ మాసపత్రిక వెలువరించారు నాగేశ్వరావు పంతులు గారు.

భారతియందు భాష, వాజ్మయము, శాస్త్రములు, కళలు మొదలగు విషయములు సాదరభావముతోఁ జర్చించుటకవకాశములు గల్పించబడును. వాజ్మయ నిర్మాణమునకిపుడు జరుగుచున్న ప్రయత్నములు పరిస్ఫుటము చేయబడును. శిల్పమునకు చిత్రలేఖనమునకు శాసనములకు సంబంధించిన విషయములు చిత్రములతోఁ బ్రచురింపఁ బడును.” అని భారతి సంపాదకులు చెప్పుకున్నారు.

పంతులు గారి మనవడు శివలెంక రాధకృష్ణ గారి హయాంలో ‘భారతి’ ని నిలిపి వేయాల్సి వచ్చింది. కారణం ‘ఆర్ధిక భారం.’ (ఆ రోజుల్లో మద్రాసులో రాణీ బుక్ సెంటర్ మాత్రమే క్రమం తప్పకుండా భారతి ని పాఠకులకి అందించేది. ప్రత్యేక సంచికలను ఒక పదో/పాతిక మందో నెల ముందే ‘బుక్’ చేసుకునేవారు.) కాని ‘భారతి’ ప్రచురణ ఆపడానికి కుదరదు. ఎందుకని? పంతులు గారు ‘అంధ్రపత్రిక’ దినపత్రిక వెలువడినంతకాలం ‘భారతి’ వెలువడాల్సిందే’ అని ఒక నిబంధనని పెట్టారు. మరేం చెయ్యాలి అని యాజమాన్యం ఆలోచించింది. ‘టాబ్లాయిడ్‘ గా వెలువరించాలని నిర్ణయించారు. అలా ‘ఆంధ్రపత్రిక’ దిన పత్రిక లో ఒక ‘బ్రాడ్ షీట్’ ని ‘భారతి’ అని మకుటం పెట్టి ‘టెక్నికల్’ గా ఆపకుండా దానిని నెలకొక సారి ప్రచురించారు. తరువాతి రోజుల్లో మళ్ళీ పుస్తక రూపంలో తెచ్చారు. కానీ ఆంధ్రప్రదేశానికి తరలివచ్చిన తరువాత మొత్తం ‘ఆంధ్రపత్రిక’ మూత పడిపోయింది. దిన పత్రిక, వార పత్రిక, భారతి అన్ని మూత పడ్డాయి.

eenaaDu, vipula, chatura etc
ఆంధ్రపత్రిక, భారతి, ఈనాడు ప్రకటన

ఇటీవలి కాలంలో ‘ఆంధ్రజ్యోతి‘ ఆదివారం ‘సండే’ కి కూడా గ్రహణం పట్టింది. అప్పట్లో పిన్నింగు అని, బైడింగు అని రవాణా సరఫరాలో ఇబ్బందులున్నవని చెప్పి ఆంధ్రజ్యోతి ‘ఆదివారం’ ని దినపత్రికలో టాబ్లాయిడ్ కి మార్చేసారు. ఏది ఏమైనా చివరకి అది మళ్ళీ తన పాత రూపులో వెలువడ్డం సంతోషం. ఈ #కరోనా #కోవిడ్19 గడ్డు కాలంలో కూడా పుటలు తగ్గించినా జాల పత్రికగా దాన్ని వెలువరించింనందుకు #ఆంధ్రజ్యోతి సంపాదకవర్గానికి, యాజమాన్యానికి సాహితీప్రియులు ధన్యవాదాలు చెప్పుకోవాలి. గత కొద్ది వారాలుగా అచ్చులో కూడా ‘ఆదివారం’ ఆంధ్రజ్యోతి అందుబాటులోకొచ్చింది. అందుకు కూడా మనం ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు తెలియజెయ్యాలి.

కొన్ని నెలల క్రితమే ‘సాక్షి‘ దినపత్రిక కూడా ‘సాహిత్యం‘ పేజిని ‘ఫన్ డే‘ లో కి పంపింది. ఆ ‘సాహిత్యం’ పేజి ‘డ్రాప్’ అయినప్పుడల్లా వచ్చే వారం వుంటుందా, వూడుతుందా అని ఎదురుచూసేవాళ్లు పాఠకులు. వాళ్లని నిరాశపరచడమెందుకని ‘పర్మనెంటు డ్రాప్’ అనుకుని, వద్దులే అని దయతో ‘ఫన్ డే’ లో ఒక పేజి ఇచ్చారు. గుడ్డిలో మెల్ల అది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి.  ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రతి సోమవారం ‘వివిధ‘ లో సాహిత్యానికి ప్రాముఖ్యత ఇచ్చి అందజేస్తోంది.  ఇంకా కొన్ని తెలుగు దిన పత్రికలు కూడా ఆదివారం మాగజైన్ సంచికలు వెలువరుస్తున్నవి. ఉదాః విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవతెలంగాణ, వార్త, సూర్య, దర్వాజ, నమస్తే తెలంగాణా ఇత్యాదులు.

మనకి జాలపత్రికలు కూడా తక్కువేమి కాదు. ‘సాహిత్యసేవ’ కోసం సాహితీ ప్రియులు వెలువరిస్తున్నవారున్నారు. ఈమాట (1998 అక్టోబరులో ప్రారంభం), సారంగ (దాదాపు దశాబ్దం క్రితం), కౌముది (2007), సంచిక, నెచ్చెలి, వగైరాలు. ఇవన్ని కూడా ఆయా నిర్వాహకులు ఎటువంటి ఆర్ధికమైన లాభాపేక్ష లేకుండా ప్రచురిస్తున్నారు. ప్రకటనలు సైతం వుండవు వీటిల్లో. సభ్యత్వం / చందా రుసుములు కూడా లేవు.

ఈ అంతర్జ్వాల పత్రికలని వ్యక్తులు నిర్వహిస్తుండగా, ఈనాడు / వసుంధర / రామోజి ఫౌండేషన్ ఆ నాలుగు పత్రికలు; విపుల, చతుర, తెలుగు వెలుగు, బాలభారతం ని కనీసం జాల పత్రికల రూపాన్నైనా వెలువరించలేకపోవడం అన్నది నమ్మశక్యంగా లేదు. విపుల, చతుర లు 1978లో మొదలైనవి. దాదాపు నలభై మూడేళ్ళ క్రిత్రం. అలాగే ‘భాషకు, సాహిత్యాని సేవ చేసేందుకు ప్రత్యేక వేదిక ఉండాలన్న ఉద్దేశంతో 2012 సెప్టెంబరు’ లో తెలుగు వెలుగు పాఠకులకి అందించారు. నా వరకు నేను ఇది తెలుగు వారికి మరో ‘భారతి’ గా వుంటుందని ఆశించాను. అలాగే జరిగింది మూతపడటం విషయంలో. ‘ఇన్నాళ్ళుగా సేవాదృక్పథంతో సాగిస్తూ వచ్చిన ఈ నాలుగు పత్రికలను’ ఈమ్యాగజైన్స్ రూపంలో ఈనాడు నెట్ లో అందుబాటులో ఉంచా‘ రు. కానీ ఈ ఏప్రిల్ నుండి నిలిపివేయడం అన్నది ‘సాహిత్యాభిమానులకు’ జీర్ణం కావడం కష్టం. ఈనాడు లాంటి వ్యవస్థ, మానవవనరులున్న సంస్థ ఈ నాలుగు పత్రికల నిర్వాహణ భారాన్ని మోయలేకపోతుండంటే ఆశ్చర్యంగా కూడా ఉంది. నిజమే #కోవిడ్19 లాంటి అనూహ్యమైన ఆపద మానవజీవితాన్ని అతలా కుతలం చేసింది కానీ ఈ రోజున మనకి కోవిడ్ టీకా అందుబాటులోకి వచ్చింది. వ్యాపారంలో ఒడిదుడుకులుంటాయి. వాటిని అధిగమించడం ఈనాడు లాంటి సంస్థలకు కష్టమేమి కాదు. ఈనాడు కంటే చిన్నవి మనగలుగుతున్న సందర్భంలో ‘మన అమ్మభాష పరిపుష్టత కోసం ఈనాడు, ఈటీవీ, ఈ టీవీ భారత్ లు నిరంతరం కృషిచేస్తునే ఉంటాయని’ మేనేజింగ్ ట్రస్టీ – రామోజీ ఫౌండేషన్ చెప్పినా …తెలుగు సాహితీ చరిత్రలో ఈ పత్రికలు ఆపేయ్యడం విషాదమే. ఇన్నాళ్లుగా ఆయా పత్రికలకి రచనలు పంపుతున్న రచయితలు కూడా నిరుత్సాహానికి లోనయ్యారు ఈ వార్త తెలుసుకుని. పాఠకుల ఆదరణ తగ్గింది అన్నప్పుడు బహుశ రచయితలు కూడా తమ చేస్తున్న రచనల గురించి పునరాలోచించుకోవల్సిన సందర్భం అనిపిస్తుంది. మనసుంటే మార్గముంటుంది! కనీసం జాలపత్రికల రూపంలో ఐనా ఈ నాలుగు పత్రికలని బ్రతికించమని రామోజీ ఫౌండేషన్ ని కోరడమే ఒక సాహిత్యాభిమానిగా నేను చెయ్యగలిగింది!

▓► ఆంధ్రపత్రికకి సంబంధించిన వివరాలకి మూలం తెలుగు వికి. – te.wikipedia.org/

బాలాంత్రపు – గోపీచంద్

Balantrapu Rajanikanta Rao

ఈ బాలాంత్రపు గోపీచంద్ ఎవరు?  
బాలాంత్రపు రజనీకాంతరావు గారంటే తెలుగువారిని తన లలిత సంగీతంతో అలరించినవాడు.  గేయకర్త.  స్వరకర్త.  ఇన్ని మాటలెందుకు, బహుముఖ ప్రజ్ఞాశాలి.  

Tripuareneni Gopichand
(8 September 1910 – 2 November 1962)

గోపీచంద్ అంటే సినిమాల్లో హీరో వేశాలేస్తుంటాడు. అతనేగా?  కాదు.  మరి?
ఈయన ఇంటిపేరు త్రిపురనేని.   కవి, సంఘసంస్కర్త, హేతువాది ‘కవిరాజు‘ బిరుదాంకితుడు, బార్-ఎట్‌-లా చదివినవాడు, త్రిపురనేని రామస్వామి కుమారుడు, ఈ త్రిపురనేని గోపీచంద్
తెలుగువారికి తొలి మనోవైజ్ఞానిక నవల అసమర్ధుని జీవయాత్ర  ని అందించి తెలుగు సాహిత్య చరిత్రలో అజరామరంగా నిలిచిపోయినవాడు.  చలన చిత్ర దర్శకుడు.  కొన్నింటికి కధలు కూడా అందించిన వాడు.  

మరి ఈ బాలంత్రపు వారికి, ఈ గోపిచంద్ కి ఏమిటి సంబంధం?  చలనచిత్రాలలో సంగీతం ఉంటుందిగా!  మరీ ముఖ్యంగా మన భారతీయ చలన చిత్రాలలో నృత్యాలు కూడా ఉంటాయికదా!  అలా…గోపీచంద్ కి బాలాంత్రపు వారికి సంబంధం ఉంది.  వారిద్దరు మిత్రులు.  గోపీచంద్ సినిమాలలో పాటలకి స్వరకర్త, బాలాంత్రపు.  

Balantrapu Rajanikanta Rao
బాలాంత్రపు రజనీకాంతరావు

 

వారిద్దరిమధ్య జరిగిన ఒక హాస్య సంఘటనే ఈ బ్లాగ్ పోస్ట్ కి నేపధ్యం.  బాలంత్రపు రజనీకాంతరావు గారి కుమారుడు హేమచంద్ర నాకు మంచి మిత్రుడు.  ఆ మధ్యేప్పుడో, ఫేస్ బుక్ లో తన తండ్రిగారికి, గోపీచంద్ కి మధ్య జరిగిన ఒక సున్నితమైన హాస్య సంఘటన గురించి తెలియజేసాడు.   రజనీకాంతరావు గారు మద్రాసులో మా అమ్మ స్థాపించి నిర్వహించిన రాణీ బుక్ సెంటర్ కి వచ్చిన గుర్తు నాకుంది.  ఆయనికి  గోపీచంద్ కి ఉన్న సాన్నిహిత్యం తెలిసి ఉండటం వల్ల వారివురి మధ్య జరిగిన ఆ హాస్య సంఘటనని తెలుగువారి సాంస్కృతక చరిత్రలో పొందుపరిస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను.  


Hemachandra Balantrapu
బాలాంత్రపు హేమచంద్ర

 సాక్షి దిన పత్రికలో  ప్రతి సోమవారం సాహిత్యానికంటూ ఒక పుటని కేటాయిస్తుంది.  అందులో మరమరాలు  మకుటంతో, సంగీత, సాహిత్యమనే కాకుండా ఇతర కళకారుల జీవితాలలోని ఆసక్తికరమైన సంఘటనలని ప్రచురించడం తెలుసు.  మొన్న గురువారం అంటే మే 8 న, హేమచంద్రతో కొన్ని చిన్న చిన్న సందేహాలుంటే తీర్చుకుని, ఈ కధనం ప్రచురించడానికి (వీలుంటే ఏదేని పత్రికలో) అనుమతి తీసుకుని, రాసి, శుక్రవారం మే 9న, సాక్షి దినపత్రిక కి పంపాను.  వాళ్ళు కూడా ప్రచురిస్తామని తెలియజేసారు. 



సాక్షి పత్రికకి పంపిన కధనానికి  నేను  కాలక్షేపం – బఠాణీలు అని పేరు పెట్టాను.  దానికి ఒక కారణం ఉంది.  దాసు వామనరావు గారనే హాస్య రచయిత ఒకాయన ఉండేవారు.  ఆయన ఆ రోజుల్లో ఒక కాలం రాసేవారు. దానిపేరు ‘కాలక్షేపం‘ అన్నట్టు గుర్తు. ఆయన్ని నేను గుర్తు  చేసుకున్నట్టూ ఉంటుందని ఆ పేరుతో  పంపాను.  (ప్రస్తుతం మద్రాసు, టీ. నగర్ లో దండపాణి వీధిలో ఉంటున్న ష్రైన్ వేలాంగణ్ణి సీనియర్ సెకండరీ స్కూల్, ఆ రోజుల్లో వామనరావు గారిదే!  )అంతే కాదు, హేమచంద్ర జ్ఞాపకాన్ని, నా మాటల్లో చెప్పానని కూడా సాక్షి వారికి తెలియజేసాను.  కాని ఏం లాభం!  రాసిన వారికే బైలైన్ క్రెడిట్ ఇవ్వటం వారి సాంప్రదాయమనుకుంటాను, అలానే చేసారు. 

ఇక కధలోకి వెళ్దాం!

రచయిత త్రిపురనేని గోపీచంద్ ‌– చదువుకున్న అమ్మాయిలు, ధర్మదేవత, ప్రియురాలు చిత్రాలకు కథ, మాటలు అందించారు; పేరంటాలు, లక్షమ్మ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. గాయకుడు, స్వరకర్త అయిన బాలాంత్రపు రజనీకాంతరావు, గోపీచంద్‌ మంచి స్నేహితులు. మద్రాసులో ఒకరోజు వీళ్ళిద్దరు కలిసి కారులో ప్రయాణం చేస్తున్నారు. గోపీచంద్‌ తీయబోతున్న చిత్రానికి బాలాంత్రపు గేయ రచన, సంగీత దర్శకత్వం వహించబోతున్నారు. ఒకానొక ఘట్టంలో కావల్సిన పాటకి కావాల్సిన మాటల కోసం ఆలోచనలో పడ్డారు గోపీచంద్‌. ఆ పాటకి సంగీతం గురించి ఆలోచిస్తున్న రజనీకి కాలుమీద దురద పుట్టి, పరధ్యానంగా గోక్కోవడం మొదలుపెట్టిన కాసేపటికి గాభరా పడుతూ, ‘‘నా కాలు స్పర్శ కోల్పోయింది. నేను గోక్కుంటుంటే తెలీటం లేదు. అర్జంటుగా డాక్టరు దగ్గరకి వెళ్ళి చూపించుకోవాలి’’ అన్నారు. తలతిప్పి ఆయన వంక చూసిన గోపీచంద్, ‘‘డాక్టరు, గీక్టరు అక్కర్లేదు. ఇందాకటి నుంచి మీరు గోక్కుంటున్నది మీ కాలు కాదు, నా కాలు’’ అన్నారు. దాంతో అసలు విషయం అర్థమై ఇద్దరు మిత్రులు పగలబడి నవ్వుకున్నారు.
అనిల్‌ అట్లూరి

సాక్షి సాహిత్యం పేజికి లంకె ఇక్కడ
ఇక ఆ సాహిత్యం పేజిలో కధనం జెపెగ్ ఈ దిగువునః

Sakshi LIterature page Gopichand and Balantrapu by Hemachandra and Anil Atluri
బాలాంత్రపు – గోపిచంద్ హాస్యం

ఎంజాయ్ చేసారా?  చి న

దెయ్యాల వంతెన

Devils' bridge

వేణువు ఊదుకుంటున్న గోపాలుడికి ఆ సాయంత్రం పొద్దెక్కడం కొంచెం ఆలస్యంగా తెలిసింది. హడావుడి పడుతూ తన మేకలని కాలువ వైపుకి తోలాడు. ఊళ్ళో వాళ్ళెవరూ ఆ కాలువ, ఆ వంతెన వైపుకి చీకటి పడే సమయానికి రారు. భయం. ఎప్పుడో చెక్కతో కట్టిన వంతెన అది. ఇప్పుడో, అప్పుడో పడిపోయెటట్టుంది ఆ వంతెన. ఆ వంతెన ఇవతల గట్టుకి ఆనుకుని ఒక పెద్ద మఱ్ఱిచెట్టుంది. దాని మీద దెయ్యాలున్నాయిని ఆ ప్రాంతం ప్రజల నమ్మకం. చీకటి పడిన తరువాత ఆ వంతెన మీదుగా ఆ కాలువని దాటి ఏ ప్రాణి అయినా ఆ మఱ్ఱిచెట్టు కిందగా వెళ్తే దాని మీదున్న దయ్యాలు చంపేసి, రక్తం తాగి, శవాన్ని ఆ కాలువలో పడేస్తాయన్న కధని తరతరాలుగా ఆ ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటు ఉంటారు.

కాని గోపాలుడు మేకలని తొందరగా ఇంటికి చేర్చాలనే ఆలోచనలో ఉండి, ఆ మఱ్ఱిచెట్టు కిందుగా వెళ్ళి, ఆ కాలువ వంతెన మీదుగా దాటిస్తున్నాడు. అప్పటికే చీకటి పడిపోయింది. మఱ్ఱిచెట్టు భయంకరమైన దయ్యంలాగా కనబడుతోంది. గాలి విసురుగా తగుల్తోంది. మేకలన్ని పరిగెడుతున్నాయి. ఆఖరు మేక వంతెన దాటి గట్టు మీదకి చేరింది. దాని వెనకే గోపాలుడు కుడి కాలు మోపాడు. ఎడం కాలు ముందుకు తీసుకుని అడుగు వేస్తున్నాడు… వేసేశాడు. ఇప్పుడు కాలువకి ఇవతలి గట్టు మీదున్నాడు. పేద్ద శబ్దం చేస్తూ వంతెన ముక్కలు, ముక్కలుగా విరిగిపోయి, ఆ కాలువలోకి భళ్ళున పడిపోయింది. భయంతో మేకలన్నీ ఇంటి వైపు పరుగెట్టడం మొదలు బెట్టినవి. పరుగో, పరుగు, ఒకటే పరుగు. ఆగితే దయ్యాలు తమని కూడా పట్టుకుంటాయని భయం.

సరిగ్గా అప్పుడే గోపాలుడికి భయంతో ఏడుస్తున్న మేక పిల్ల అరుపు వినిపించింది. గబుక్కున వెనక్కి తిరిగి చూశాడు గోపాలుడు. ఆ కమ్ముకుంటున్న చీకట్లో అవతలి గట్టు మీద కనపడింది మేక పిల్ల. అది ‘మే… మే” అని భయంతో ఏడుస్తోంది. ఎర్రటి కళ్లతో దాని పీకని పట్టుకుని కనపడింది దయ్యం. చూడటానికే భయంకరంగా ఉంది ఆ దయ్యం.

“దాన్ని వదిలేయి, దయ్యమా. నువ్వేది అడిగితే అది ఇస్తాను, ” అని గోపాలుడు ఆ దయ్యాన్ని అడిగాడు. ఇవ్వను అన్నట్టుగా తలని అడ్డంగా అటూ, ఇటూ తిప్పింది దయ్యం.

గోపాలుడు మోకాళ్ళ మీద మోకరిల్లి, రెండు చేతులు కలిపి దణ్ణం పెడుతూ, “దయ్యం, దయ్యం దయచేసి నా మేకపిల్లని వదిలెయ్యవా?” అని మళ్ళీ అడిగాడు.

అప్పుడు దయ్యం, “సరే, వదిలేస్తాను. మరీ ఈ మేకపిల్ల నీ దగ్గిరకు ఎలా వస్తుంది?” అని అడిగింది.

గోపాలుడుకి ఏమి సమాధానం చెప్పాలో తెలియక బిక్క మొహం వేసాడు. అప్పుడు దయ్యం “నువ్వు ఒప్పుకుంటే ఒక షరతు మీద ఈ మేక పిల్లని వదిలేస్తాను,” అని అంది.

“ఏమిటా షరతు?” అని అడిగాడు గోపాలుడు.

“నువ్వు రేపు వచ్చేటప్పటికి ఇక్కడ ఒక సరికొత్త వంతెన ఏర్పాటు చేస్తాను. కానీ…”.

“ఊ…కానీ..నేను ఏం చెయ్యాలో చెప్పు,” అని ఆదుర్దాగా అడిగాడు గోపాలుడు.

“ఆ వంతెన మీదుగా దాటి వచ్చిన మొదటి ప్రాణిని నాకు బలి ఇవ్వాలి,” అని అంది ఆ దయ్యం.

“ఆ…?” అని ఆలోచనలో పడ్డాడు గోపాలుడు.

“నువ్వు ఒప్పుకోకపోతే ఈ మేకపిల్లని ఇప్పుడే చంపేస్తాను. రేపు ఆ వంతెన కూడా ఉండదు,” అని అంది ఆ భయంకరమైన దయ్యం.

“వద్దు, ఆ మేకపిల్లని చంపకు. నువ్వు చెప్పింది నాకు అంగీకారమే. అలాగే చేస్తాను, ” అని అన్నాడు గోపాలుడు.

మరుసటి రోజు ఉదయం, తన సద్దిమూటతో మేకలని తోలుకుంటూ కాలువ దగ్గిరకి బయలుదేరాడు గోపాలుడు. ఆశ్చర్యం! కాలువ మీద కట్టెలతో కట్టిన సరికొత్త వంతెన సిద్దంగా ఉంది అక్కడ. కాలువ అవతల గట్టున వంతెన దగ్గిర దయ్యం నిలబడి ఉంది. కాలువ ఇవతల గట్టున, వంతెనకి ఇవతల గోపాలుడు, అతని వెనకే మేకలు. ఆ మేకలతో పాటు ఒక గజ్జి కుక్క. మేకలని గట్టు మీదే ఉండమని చెప్పి, తను ఆ వంతెన మీద కాలు బెట్టి గట్టిగా ఉందో లేదో చూద్దామనుకున్నాడు. కానీ ఈ లోపు దయ్యానికి తనకి ఉన్న ఒప్పందం గుర్తు వచ్చింది. అందుకని వంతెన మీద కాలుపెట్టకుండా ఇవతలే నిలబడ్డాడు.

భుజానికి ఉన్న సద్ది మూటని విప్పాడు. అందులో నుంచి తను విడిగా పెట్టుకున్న మాంసం ముక్కని బయటికి తీసాడు. తన మేకలతో పాటే వచ్చిన గజ్జి కుక్కకి దాన్ని వాసన చూపించాడు. తన బలం అంతా వినియోగిస్తూ కుడి చేత్తో ఆ మాంసం ముక్కని వంతెన మీదుగా దయ్యం నిలబడి ఉన్న గట్టు మీదకి విసిరాడు. ఆ మాంసం ముక్క అవతల గట్టు మీద పడేలోపు, గజ్జి కుక్క ఆ కాలువ మీదున్న వంతెన మీదుగా అటు వైపుకి దూకింది. అటు దూకడేమేమిటి, ఆ గట్టు మీద పడ్డ మాంసం ముక్కని నోటితో పట్టుకోవడం కూడా అయిపోయింది.

ఇదంతా చూస్తున్న దయ్యం ఆశ్చర్యంతో నిర్ఘాంత పోయింది. దాని పక్కనే ఉన్న మేకపిల్ల దయ్యం పట్టు విదిలించుకుని ఆ గట్టునుంచి ఇటు గట్టు మీదకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. గోపాలుడు దాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ దయ్యం వైపు చూశాడు.

దయ్యం బూడిదగా మారి కుప్పగా కూలిపోయింది.

ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ మర్రిచెట్టు పైనకాని ఆ కాలువ గట్టున కానీ దయ్యాలు మళ్ళీ కనపడలేదు.

* * *
కధ పూర్వపరాలు

2017లో  మా అమ్మాయి, అల్లుడు తో కలిసి కొంత కాలం గదుపుదామని స్కాట్ లాండ్ వెళ్ళాను.  వాళ్ళింట్లో వాళ్లుంటున్న ఎడిన్ బరో నగర పురాతన చరిత్ర గురించిన ఒక పుస్తకం కూడా ఉంది.  ఎడిన్ బరో నగరంలో ఉన్న శిలా స్థూపాలు, ప్రతిమల గురించి కూడా కొంత వ్రాసి ఉంది.  సెల్టిక్ కధల ప్రస్తావన వచ్చినప్పుడు జాలంలో కొన్ని కధలు చదివినప్పుడు వచ్చిన ఆలోచన ఇది.  కధ వ్రాయడం మొదలుపెట్టిన తరువాత, ‘చిన్న పిల్లల కధ’ గా తయారయింది అనిపించింది. అప్పుడే చిన్న పిల్లలకి కూడా ఒక కధ వ్రాసానని, బాల సాహిత్యంలో కూడా వేలు పెట్టానని చెప్పుకోవచ్చు కదా అనిపించింది.  దాంతో చిన్న పిల్లలకి కధలాగానే వ్రాసేసాను.  చిన్న పిల్లల కధ గా రూపు దిద్దుకుంటునప్పుడు, పిల్లలకి దెయ్యలూ, భూతాలు, దేవుళ్ళు, దేవతలు  (నేను నమ్మనివి) హేతువాదానికి, తర్కానికి నిలబడనివి, హింసని చూపించేవి ఎంత వరకు సబబు అని కూడా అనిపించింది.  కానీ చందమామలో భేతాళ కధలు చదివిన నేను బాగానే ఉన్నానుకదా, నా పిల్లలూ బాగానే ఉన్నారు కదా , అని అనుకుని… దెయ్యాన్ని అలాగే ఉంచేసాను.  ఇక ప్రచురణకి పంపాలనుకున్నప్పుడు ఏ పత్రిక అన్న మీమాంస మొదలైంది.  సాహితీ మిత్రుడొకరు సాక్షిని సూచించారు.  సాక్షి ఫన్ డే కి పంపాను.  వారు ప్రచురించారు.  కాకపోతే కధకి బొమ్మ వేసినవారు పెద్దగా శ్రమ పడకుండా జాలం నుంచి దెయ్యం బొమ్మకి బదులు దొరల మాంత్రీకురాలు బొమ్మని దింపేసి వాడేశారు. 
సాక్షి ఫన్ డే సంపాదకులకి ధన్యవాదాలు.

ప్రచురణానంతరం…
కధ ప్రచురించిన తరువాత నేను పంచుకున్న మిత్రులలో ఒకరు, “నేనైతే పిల్లలకి దెయ్యాల భూతాల కధలు రాయనండి,” అని సున్నితంగా చెప్పారు. 
మరొకరు, “ఇమేజరి అంతా బాగుంది కాని పిల్లలకి దెయ్యం ఎందుకు…ఒక బాడ్ మాన్ తో వ్రాసి ఉండవచ్చు కదా?” అన్నారు. 
అది ఈ కధా నేపధ్యం. చి న
సాంఘిక మాధ్యమాలలో ఇంకా ప్రచురించలేదు.  చూడాలి అక్కడ చదివిన వాళ్ళేమంటారో! 
ద హ
 

పాద సూచి
సాక్షి, ఫన్ డే, ఆదివారం, ఆగస్ట్ 4 న సంచికలో వెలువడ్డ కధ పూర్తి పాఠం ఇక్కడ  (image)
Text link here.

 

Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on whatsapp
WhatsApp
Share on email
Email

క్లుప్తంగా ఇడ్లి, వడ, సాంబార్ కధ ఇది!

కొంత మంది పాఠకులకి నేను వ్రాసిన ఇడ్లి, వడ, సాంబారు కధ పూర్తిగా అర్ధం కాలేదన్నారు.  ఈ టపా వారికోసం.

ఈ క్రింద ఇఛ్హినవి సారంగ లో వఛ్హిన కధ ఇడ్లి, వడ,సాంబార్ లోని వాక్యాలు. ఇవన్ని అంతర్గతంగా కధాంశానికి సంబంధించిన సూచినలిస్తాయి.  వీటన్నింటిని ఒక క్రమంలో చదువుకుంటే కధ అర్ధం కావాలి. ఈ వాక్యాలు చదివిన తరువాత, కధని మళ్ళీ ఒకసారి చదువుకోండి.  దానికి లంకె ఈ కింది వాక్యాల తరువాత చివర ఇఛ్హాను. 

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

> ఇది అతని కధ.
> అతను ఒక స్త్రీ మూర్తిని తన చేతులమీదుగా ఎత్తుకుని తీసుకుని
రావడం…

> వాలిపోయిన ఆవిడ తలక్రింద చేతులు వేసి…
> స్త్రీని చాలా నెమ్మదిగా అతి జాగ్రత్తగా ఆ రేర్ సీట్ మీద పడుకోబెట్టాడు…
> …భుజాలక్రింద నుంచి చేతులేసి ఆవిడ తలని ఎంతో ప్రేమతో తన
ఒడిలోకి లాక్కుని…

> …తన రెండు చేతులతో ఎంతో వాత్సల్యంతో ఆవిడ కాళ్ళని తన ఒడిలోకి
తీసుకుంది…

> ఆంగర్, డినైయల్, బార్గైనింగ్, డిప్రెషన్ అండ్ అక్సె‌ప్‌టన్స్.
(Anger, denial, bargaining, depression and acceptance) – are the five stages of grief and not necessarily in that order. You can read more about it here.
(If you haven’t yet, do watch that movie ‘All that Jazz‘.  ఈ సినిమా ఆస్కార్ బహుమతులు పొందినది.))
…(Yea…blood an’ shit!)…
బమ్స్ మధ్య నుంచి పరుపు మీదకి బెడ్ షీట్ మీదుగా. దేర్ గోస్ ది
బ్లడి షీట్!…

> …ఊపిరి తిత్తుల నిండా అవే. ఒన్…ఫోర్…ఎయిట్…మిలియన్స్ టు ది
ప‌వర్ ఆఫ్ బిలియన్స్…దే ఆర్ చోకింగ్ మాన్! లెట్ హర్ గో ఈజీలీ!
(Let  her go easily!)…

> ఇట్ టూ ఈజ్ డెడ్ మాన్! (It too is dead man!)
> …(With a carcass…oh no!)…

(ఇది కధలో లేదు, కాని తెలియని పాఠకులకోసం ఇక్కడ ఇఛ్హాను. The following are the stages of “Rigor Mortis“, తెలుగులో ఇక్కడుంది. )

బిలియన్స్ ఆఫ్ సెల్స్… డూ దే హావ్టు ప్రై దెమ్ ఓపెన్?
(Billions of cells…do they have to pry them open?)

>  ఆర్ బ్రేక్? (Or break?)

>  బ్రేక్ వాట్? (Break what?)

>  ది జాస్, డూడ్…హర్ జాస్! (The jaws, dude…her jaws!)
గెస్ నాట్! (Guess not!)
షిట్… హౌ కెన్ యు ఎవెన్ధింక్ లైక్ దట్! (Shit…how can you
even think like that?)

ఇట్స్ ఎ కడెవ…వాట్! (It’s a cadav’…what?)
…నెమ్మదిగా సెటిన్ అవుతోంది…

>  యు ధింక్ హర్ జా వుడ్‌హెవ్ బిగన్ టూ ఫ్రీజ్?
(You think her jaw would have begun to freeze?)

ఐ లిడ్స్?
(Eye lids?)

>  …వాళ్ళందరూ ఇంకా తింటునే ఉన్నారు.
ఇడ్లి, వడ, సాంబార్ కూడా…

కధ అర్ధం అయివుండాలి.

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

అంతర్జాల పత్రిక, సారంగ లో కధ ఇక్కడ చదువుకోవఛ్హు.
ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి.  కధకి తగ్గ abstract బొమ్మ గీసిన అన్వర్ కి థాంక్స్.

ఇక్కడ ఈ టపాకి వాడిన Photo by Axel Antas-Bergkvist on Unsplash.

That woman was part of their life and she lay dead in that car and they are having breakfast. Those monologues in English are his ( ఇంగ్లిష్‌ లోని స్వగతాలు, అతనివి) .

….
While they traveled with a member of their family who is dead (body), they stopped at a restaurant and had their breakfast.

చనిపోయిన తమ కుటుంబ సభ్యురాలి దేహంతో, ప్రయాణం సాగిస్తూ, దారిలో కనబడ్డ దాబా లో కూర్చుని ఉదయపు అల్పాహారాన్ని కోరుకుని తిన్నవి, ఈ కధలోని కొన్ని పాత్రలు.  అది జీవితం.  బహుశ మనందరి జీవితాలు అంతేనేమో!

ఇక తెలుగు కధలో ఇంగ్లిష్ వాక్యాలు, వాటిని టెంగ్లిష్ (ఇంగ్లిష్ పదాలని తెలుగు లో వ్రాయడం) మళ్ళీ అవే వాక్యాలని ఇంగ్లిష్‍లో (బ్రాకెట్లలో) ఇవ్వడానికి కారణం, తెలుగులో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్నవాళ్ళకి, ఇంగ్లిష్‍ తెలిసిన వాళ్ళకి, చదువుకోవడానికి సులువుగా ఉంటుందని.

ఈ టపా సమయానికి, నా వరకూ వఛ్హిన పాఠకుల వ్యాఖ్యలన్నింటినికి వివరణ ఇది.

త్రిపురనేని గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారం 2015

TripuraneniGopichandNationalLiteraryAward

సెప్టెంబరు 8న సాహిత్యకారుడు త్రిపురనేని గోపిచంద్ జన్మదినం.  గోపీచంద్ జాతీయ పురస్కారాన్ని ఆరోజున ఎంపిక చేసిన గ్రహీతకు అందజేయడం ఒక సత్సాంప్రదాయంగా నిర్వహిస్తున్నారు.   2015 సంవత్సరానికి గాను సర్.  విలియం మార్క్  టుల్లి కి ఈ సారి దానిని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా అందించారు.  ఆ కార్యక్రమానికి వేదిక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైద్రాబాదు.

ఆ కార్యక్రమం ఆహ్వాన పత్రిక ఇది.
The invitation to the Tripuraneni Gopichand National Literary Award presentation to event.

గవర్నర్ రోశయ్య గారి ప్రసంగ పాఠం ఆంగ్లంలో ఇక్కడ.
పురస్కార స్వీకర్త సర్. విలియం మార్క్  టుల్లీ ప్రసంగం ఇక్కడ మీరు వినవచ్చు.
ఇక దిన పత్రికలలో వచ్చిన వ్యాసాలు వివరాలు ఇవి.
ఇక్కడ ది హిందు లో.
పున్నా కృష్ణమూర్తి పరిచయం వ్యాసం సాక్షి దినపత్రికలో ఇక్కడ.
ఈనాడు దిన పత్రికలో ఇక్కడ.
ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇక్కడ.

From your left: Y. K Nageswara Rao, Saichand (youngest son of Gopichand) Saripalli Kondal Rao,  Padmabhushan Sir Mark Tully (seated), Sri Latha, Dr Sunaina Singh and Dr T H Chowdary

From your left: Y. K Nageswara Rao, Saichand, Saripalli Kondal Rao, Sir Mark Tully, Sri Latha, Dr Sunaina Singh, Dr T H Chowdary

పగలని గోళీ

ఆరడుగుల ఎత్తున్న ప్రహరీ గోడ. ఇనుముతో చేసిన చట్రానికి ఇనుపరేకు బిగించిన గేటు. అటూ ఇటూ చూస్తే
గేటుని బిగించిన స్తంభానికి అమర్చి ఉంది ఒక బుల్లి మీట. దానిని నొక్కాడు. భయంకరమైన గొంతుతో కుక్క
అరుపులు మొదలైనవి. ఒక్కసారి ఝడుసుకున్నాడు. అప్రయత్నంగానే ఒకడుగు వెనుకకు పడింది. దానిని
అదిలిస్తూ లోపలెక్కడ్నుంచో ఒక ఆడమనిషి వచ్చి గేటు పైనించి అతన్ని ఎవరికోసం అన్నట్టు చూసింది.

గొంతు పెగల్చుకుని అక్కకోసం అని చెప్పేలోపు వసారా లోపల నుండి అక్క. ‘‘ఎవరూ?’’ అని చూస్తూ
తమ్ముణ్ని గుర్తుపట్టి, పనిమనిషిని గేటు తెరవమని పురమాయిస్తూ ముందు వసారాలోకి వచ్చింది.

‘‘ఎప్పుడొచ్చావు?’’ అని అడుగుతూ, పరదాలని అడ్డం తీస్తూ లోపల హాలులోకి దారితీసింది. ‘‘నిన్ననే
వచ్చాను, ఇంటర్వ్యూ కోసం,’’ అని చెబుతూ ఎడమచేతి వైపు త్రీ సీటర్ సోఫాలో ఒదిగి కూర్చున్నాడు. అతనికి
ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది అక్క. పనిమనిషి తెచ్చిన మంచినీళ్ల గ్లాసును అందుకుంటూ అటూ ఇటూ
చూస్తుంటే, ‘‘బావగారు ఆఫీసు పనిమీద బయటకు వెళ్లారు’’ అంటూ అందరి క్షేమ సమాచారాలు అడిగి
తెలుసుకుంటోంది. కాసేపు అవీ ఇవీ మాట్లాడిన తరువాత. ‘‘మాటల్లో పడి మరిచిపోయాను, ఉండు నీకు టీ అంటే
ఇష్టం కదా! చేసి తీసుకు వస్తాను’’ అని లేచి లోపలికి వెళ్లింది. ఆ గుమ్మానికీ పొడుగాటి పరదాలు.

ఎదురుగా ఉన్న పత్రికని అందుకుని తిరగెయ్యడం మొదలుపెట్టాడు. ఏదో అలికిడి అయితే కుడిచేతి వైపుకి తలతిప్పి చూశాడు. గాలికి కదిలిన పరదాల చప్పుడు కాబోలు. దృష్టి తిప్పితే గుమ్మానికి ఎడం పక్కనే గోడకి ఉన్న ఫొటోఫ్రేమ్‌లో ఒక పదేళ్ల పాప నవ్వుతూ కనపడింది. అక్క కూతురు. ఎంత చక్కగా ఉందో. కళ్లల్లో ఒక
విధమైన పెంకితనం కూడా కనపడింది అతనికి. మరోపక్క గోడమీద చామనచాయ రంగు చెక్కలతో చేసిన చట్రానికి బిగించిన అద్దం లోపలి నుంచి కనబడుతున్న బొమ్మ.

ఆ! బొమ్మ కాదు అది. ఒక్కసారి వాడి ఊపిరి స్తంభించింది. అక్క వస్తున్నదేమోనని చూశాడు. అలికిడి లేదు. లేచి సోఫాలు దాటుకుంటూ వెళ్లి ఆ చట్రం ముందు నిలబడ్డాడు. పసుపుపచ్చని రంగు అట్టమీద ఒక వైపుకి
వాలుగా నెమలిపింఛం బిగించి ఉంది. గుమ్మం బయటి నుంచి హాలులోకి వస్తున్న వెలుతురు ఆ అద్దం మీద
గింగిరాలు తిరుగుతున్నది. నెమలి పురివిప్పుకుని అద్భుతమైన నాట్యాన్ని మొదలుపెట్టింది. అతని కళ్లు
చెమ్మగిల్లాయి. మసకబారిన ఆ కళ్లలోని తడి నెమ్మదిగా అతని మనసు లోపలి పొరలలోకి ఇంకుతోంది.

అతనే వాడు. వాడి మనసిప్పుడు గాలిపటంలాగా రివ్వున ఎగురుతోంది. మాంజా వేసిన దారం, పట్ట్టీలేసుకున్న
వేళ్ల మధ్య నుంచి సర్రున జారుతోంది. వాడి మనసు నిండా అక్కే! కళ్ల నిండా అక్కే. వాడి ఆలోచనల నిండా
అక్కే. అక్క ఈసారి ఎక్కడికి తీసుకెళుతుందో! అక్కని ఈసారి తప్పకుండా జూకి తీసుకెళ్లాలి.

సాయంత్రం స్నేహితులతో గోళీలు ఆడుతున్నా, వీధి మలుపు మీదే వాడి దృష్టి. కుడిచేతి చూపుడు వేలుని
ఎడమచేతి చూపుడు వేలుతో పూర్తిగా వెనక్కి లాగి, ఆరు జానలవతలున్న నీలం రంగు గోళీ మీదకి తన
పసుపురంగు గోళీని గురిచూస్తున్నా, వాడి చెవులిక్కడ లేవు. అక్క ఫియట్ కారు హార్న్ చప్పుడు వినడం
కోసం ఎదురు చూస్తున్నవి. వాడి దృష్టి నీలం రంగు గోళీ మీదున్నా, పక్కన చెవిపోగు గాడి చెమట కంపు
నాసికల ద్వారా అందుతున్నా, అక్క పూసుకునే కునేగా సెంటుతో వాడి బుర్ర నిండిపోయింది. వాడి దృష్టికిప్పుడు అక్క కనబడుతోంది!

వాడి కుడి భుజం మీద చెలికాడి అరిచేయి స్పర్శ వాడికి అక్క నునువెచ్చని స్పర్శనే గుర్తుచేస్తోంది. కుడిచేతి
బొటనవేలు నెమ్మదిగా, మెత్తగా అప్పుడే మొలుస్తున్న గడ్డి మొలకల మధ్య నుండి చల్లగా ఉన్న ఆ నేలలోకి
దిగబడుతోంది. ఇక చూపుడి వేలుకున్న గోళీకాయ విడివడడమే ఆలస్యం. నీలం రంగు గోళీకాయ పగిలిపోవాలి. వాడి ఏకాగ్రత అంతా దానిమీదే ఉంది. వాడి సావాసగాళ్ల కళ్లన్నీ కూడా వాడి చూపుడువేలుకి ఉన్న పసుపురంగు గోళీకాయ మీదే ఉన్నాయి. పగులుద్దా! వాళ్లందరూ ఊపిరి ఆపి బిగబట్టి చూస్తున్నారు.

వాడి ఎడమ చూపుడు వేలుతో నెమ్మదిగా కుడిచేతి చూపుడువేలు అంచుకు లాగుతున్నాడు. నేలలోకి పాతుకుపోయిన బొటనవేలు పూర్తిగా సాగిపోయింది. బొటనవేలు, చూపుడువేలు మధ్యనున్న కండ తెగుతుందా అన్నట్టుగా సాగింది.ఇక అయిపోయింది. నీలిరంగు గోళీకాయ పగిలిపోవడం తప్పదు! అక్క నవ్వు వినపడిన తరువాత వెనక్కి లాగిన చూపుడు వేలుని వదిలాడా, లేక నీలిరంగు గోళీకాయలో అక్క నవ్వు కనపడిన తరువాత వదిలాడా అన్నది వాడికిప్పటికీ తెలియదు. ఏదైతేనేం ఆ నీలిరంగు గోళీకాయ పగిలిపోలేదు. గోడకి తగిలి మరో యాభై జానల అవతల ప్లాట్‌ఫాం అంచునుండి కిందకి జారనా వద్దా అన్నట్టు వూగి, రోడ్డుమీదకి జారిపడిపోయింది.

అప్పుడు వినపడింది ఫియట్ కార్ హార్న్ వాడికి. కారు మలుపు తిరుగుతోంది. వెనక సీట్లో అక్క కనపడుతోంది.
బావగారికి డ్రైవర్ అడ్డంగా ఉన్నాడు. ఆయన సరిగ్గా కనపడ్డం లేదు. అటుపక్కనే ఉన్న చెవిపోగులు గాడిని,
ఇటువైపున్న గద్దముక్కుని తోసేసి ఉరుకు. లాగు నడుంపైకి లాక్కుంటూ ఉరుకు. ఇంటిగేటు వైపుకు
కారుకి ఎదురుగా ఉరుకు. కారు ఇంకా ఆగలేదు. వెనక తలుపు తెరుస్తూ తనవైపుకి లాక్కున్నాడు. అక్క
ముఖం నిండా నవ్వు. వాడి మొఖం నిండా నవ్వు. అక్క మీదకి దూకి. రెండు చేతులు అక్క మెడ చుట్టూ
వేసేశాడు. అక్క వాడిని వాటేసుకుని, హత్తుకుంది. వాడికి ఆ క్షణంలో ప్రపంచం గుర్తులేదు. వాడికి అక్కే
ప్రపంచం అయిపోయింది.

అక్క కదిలింది. వాడు కదిలాడు. అక్క కుడిపాదం జాపి నెమ్మదిగా కారులోంచి దిగింది. ఈలోపు అలికిడికి అమ్మ
బయట వసారాలోకి వచ్చింది. అక్కని కుడిచెయ్యి పట్టుకుని దాదాపుగా లాక్కుంటూ తీసుకువెళుతున్నాడు వాడు.అక్కను చూస్తున్న ఆనందంతో అమ్మ మొహం విప్పారింది. వెనక వస్తున్న బావగారిని చూసి పలకరింపుగానవ్వింది. వసారాలో గుమ్మం పక్కనే చెప్పులు విడిచింది అక్క. ఆమె కుడిచేతిని వాడు ఇంకా వదల్లేదు. అమ్మలోపల హాలులోకి వెళ్లింది. బావగారు కూడా వసారాలోకి వచ్చి, అక్క విడిచిన చెప్పుల పక్కనే తన చెప్పులు విడిచారు.

హాలు లోపలికి అక్క వెనకే అడుగులు వేశారు. హాలులో ఎడమచేతి వైపు విడిగా ఉన్న సోఫాలో బావగారు
కూర్చున్నారు. ఆయన పక్కనే ఉన్న చిన్న మోడా మీద కూర్చుంది. అక్క ఒడిలోకి జారిపోయాడు వాడు. డ్రైవరు హాలులోపల గుమ్మానికి కుడిపక్కన గోడపక్కనే సూటుకేసులని నిలబెట్టాడు. ఈలోపు పనిమనిషి స్టీలు ట్రేలో రెండు గాజు గ్లాసుల నిండా మంచినీళ్లు తెచ్చింది. బావగారు ఒక గ్లాసు అందుకున్నారు. వాడు ఆ రెండో గ్లాసుని అందుకుని అక్కకి ఇచ్చాడు. హాలులో గుమ్మం పక్కనే పొట్టి టేకు బల్లమీద నల్ల ఫోను అందుకుని అమ్మ ఫోను చేసింది నాన్నగారికి… ‘‘అమ్మాయి, అల్లుడుగారు వచ్చేశారు, తొందరగా వచ్చేయండి’’ అంటూ.

సూటుకేసులు అవీ పాప గదిలో పెట్టమని పనిపిల్లని పురమాయిస్తూ వచ్చిన జంటని స్నానం చేసి బట్టలు
మార్చుకోండి అని చెబుతూ నాన్నగారికి వారి రాకని తెలియజేశానని తొందరగా వచ్చేస్తారని అక్కకి చెప్పింది అమ్మ. వాడుఅక్కతో పాటు పడకగదిలోకి వెళ్లాడు. ఒక పక్కగా చిన్న బల్లమీద పెట్టి ఉన్నవి సూట్‌కేసులు. ఆ బల్ల పక్కనే రెండు టేకుతో చేసిన కుర్చీలు. సూట్‌కేసుని తెరిచింది అక్క. బట్టలపైనే ఉందది. కపిల వర్ణం కాగితంతో
ఉన్న చిన్న కట్ట. తెల్లని టై్వన్ దారంతో భద్రంగా కట్టారు. పక్కనే తనని ఆనుకుని నిలబడ్డ తమ్ముడికి
ఇచ్చింది అక్క. రెండు చేతులతో దానిని అందుకున్నాడు. పక్కనే ఉన్న కుర్చీమీద కూర్చుని దాని ముడి విప్పాడు.

లోపల రంగు రంగుల బొమ్మలతో అందంగా ఉన్న పుస్తకాలు. జానపద కథలు, కొన్ని విజ్ఞానానికి సంబంధించినవి.  పిల్లల గేయాలు. వాడి కళ్లల్లో ఆనందం చూసి అక్క మురుసుకుంది. కొద్దిగా వంగి, వాడి చెంపలని తన రెండు అరచేతుల మధ్య పట్టుకుని వాడి తలని తన ఒడిలోకి లాక్కుని గట్టిగా, చప్పుడు చేస్తూ వాడి నుదుటిమీద ముద్దుపెట్టుకుంది. అటుపక్కన తన సూట్‌కేసులో బట్టలు తీసుకుంటున్న బావగారు వాళ్లిద్దర్ని చూస్తూ, ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. క్రీగంటన అది చూసి వాడు సిగ్గుపడ్డాడు. గారంగా భుజాలూపుతూ వాడు అక్క ఒడిలోకి మరింతగా ఒదిగిపోయాడు. వీపు మీదకి చేతులు జార్చి చప్పుడయ్యేట్టు చరిచి వాడిని పక్కకి నెట్టేసింది అక్క.

అక్క, బావగారు ఒక వారం రోజులున్నారు. ఒకరోజు హాలులో భోజనాలు. ఒక సాయంత్రం బతికిన కాలేజీ. మరో
రోజు హోటల్లో. ఒకపూట అక్క చదువుకున్న స్కూలు. మరోరోజు ఉదయం వరండాలో పిట్టగోడమీద కూర్చుని
టిఫిన్లు. ఇంకో రోజు డాబామీద వెన్నెల రాత్రిలో భోజనాలు. అక్కతో కనీసం ఒక ముద్దన్నా పెట్టించుకోనిదే భోజనాల తరువాత చెయ్యి కడిగేవాడు కాదు. మరొకపూట ఉద్యానవనం. ఉయ్యాలలో అక్కతో పోటీ. బావగారితో సినిమాలు, షికార్లు.ఆ వారం రోజులు పండగే వాడికి.

ఆగమని అంటూ తుర్రుమని ఇంట్లోకి పరుగెత్తాడు. తన మేజా మీదనున్న లెక్కల నోటు పుస్తకం తెరిచి పేజీలు
తిరగేశాడు. మెరుస్తూ కనపడిందది. వాడి బెస్టుఫ్రెండ్ వాడి కోసం ఇచ్చిందది. దాన్ని జాగ్రత్తగా పట్టుకుని
మళ్లీ రివ్వున పరిగెత్తుకుంటూ కారు దగ్గిరకి వచ్చాడు. అక్కని చెయ్యి చాపమని అడిగాడు. కారు తలుపులో
నుంచి కుడిచేతిని చాపింది. అరచెయ్యి తెరిచి ఉంది.

నెమ్మదిగా అక్క అరచేతిలోకి జార్చాడు దానిని. మృదువుగా, మెత్తగా వాడి ప్రేమంత మధురంగా ఉంది ఆ నెమలిపింఛం. అందుకుంది అక్క. కళ్లు చెమర్చాయి. అమ్మ పక్కకి తిరిగి చీరకొంగుతో కళ్లు వత్తుకుంది. గేటు
దగ్గర నిలబడ్డ నాన్న కళ్లజోడు అద్దాలు కొంచెం మందమైనవి. ఆయన కళ్లు ఆ జోడులో నుంచి కనపడలేదు.
బావగారు చేతులూపారు. కారు కదిలింది. అక్క ఆయన భుజం మీదకి వాలిపోవడం కనపడింది. ఆయన ఆమె భుజం చుట్టూ చెయ్యి వేశారు. బహుశా ఓదార్చుతున్నారేమో!

‘‘ఏమిటి ఇక్కడ నిలబడ్డావు?’’ అని అడుగుతూ అక్క ఆ నెమలిపింఛాన్ని చూసి చిరునవ్వుతో, ‘‘నువ్వు
ఇచ్చిందే. బావగారు ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు’’ అంటూ సోఫా వైపుకు దారితీసింది. వాడికోసం టీతో పాటు కొన్ని
చేగోడీలు, చక్కిడాలు, పంచదార గవ్వలు ఉన్న పింగాణి పళ్లెం తెచ్చి సోఫా ముందున్న గాజు టేబుల్ మీద
పెట్టింది. అక్కకి మాత్రమే కాదు తనంటే ప్రేమ. బావగారికి కూడా తనంటే ఎంతో ఇష్టం అని మురుసుకున్నాడు.
ఎప్పుడెప్పుడా రాలిపోదాం అని చూస్తున్న కన్నీళ్లని అక్క చూడకుండా ఒడుపుగా అరచేతుల్తో గబుక్కున
తుడిచేసుకున్నాడు.

లోపలెక్కడో ఉన్న కుక్క మళ్లీ నెమ్మదిగా గారంగా మొరుగుతోంది. సోఫాలోకి కూలబడి, తలవంచుకునే తన చదువుగురించి, ఉద్యోగంలో ఇంటర్వ్యూ కోసం వచ్చిన సంస్థ గురించి, ఉద్యోగం ప్రాముఖ్యత గురించి చెబుతూ అక్క గుర్తుచేసినప్పుడల్లా ఒక గవ్వో, చేగోడో, చక్కిడమో అందుకుని తింటూ, ఇక చాలన్నట్టుగా మంచినీళ్లు
అందుకుని తాగాడు. టీ కప్పున్న సాసర్‌ని అందుకున్నాడు కుడిచేతితో. ఎడమచేతితో సాసర్‌ని పట్టుకుని
కుడిచేతితో కప్పు చెవిని చూపుడువేలు, బొటన వేళ్ల మధ్య పట్టుకుని పెదవుల దగ్గరికి తీసుకువెళ్లాడు
నెమ్మదిగా. పెదవులకి ఆనించి, ఒక గుక్క జాగ్రత్తగా నోట్లోకి లాగాడు చప్పుడుచేయకుండా. కాలలేదు. తనకి
సరిపోయే వేడితోనే ఉందా టీ. పంచదార కూడా సరిపోయింది. అక్క టీ చెయ్యడంలో మార్పేమీ లేదు. అప్పుడు తలెత్తి అక్కని చూశాడు. దేవత.

ఫోను మోగింది. బావగారేమో? అక్క లేచి వెళ్లి ఫోనులో ఏదో మాట్లాడుతోంది. టీని మరో గుటక వేశాడు. అక్క కలిపిన టీ. ఎంత బాగుందో. నెమ్మదిగా గొంతులో నుంచి జారుతూ ఉంటే ఎంత హాయిగా ఉందో! అక్క తనకోసం చేసింది.  అక్కకి తనమీద ప్రేమ తగ్గలేదు. పనిమనిషిని చెయ్యనివ్వలేదు. తనే చేసి తనే తీసుకువచ్చి ఇచ్చింది. అక్కకి తనమీద ప్రేమ ఏమీ తగ్గలేదు. లోపలి నుంచి ఇందాక ఫొటోలో చూసిన పాప సుడిగాలిలా గదిలోకి వచ్చింది. తెల్ల రంగు ఫ్రాక్. ఎర్రని అంచులతో. బొద్దుగా, ఆరోగ్యంగా చక్కగా ఉంది. హాలులో ఎవరో కొత్తమనిషి ఉన్నారన్నది గుర్తించింది. ఒక్క క్షణం. అలా అక్కడే ఆగిపోయింది. ‘‘ఎవరో గుర్తుపట్టావా?’’ అని అక్క పాపని అడిగితే, లేదంటూ అడ్డంగా, కొంచెం విసురుగానే తలని తిప్పినట్టుంది. అక్క నవ్వుతూ, ‘గుర్తుతెచ్చుకో’ అంటోంది.

ముందుకు వంగి గాజు టేబుల్‌మీద టీకప్పుని అందుకుని, అక్క ఎంతో ప్రేమగా తనకోసం చేసిన టీ మరో గుటక
వేసుకోవడానికి నోట్లోకి వంపుకున్నాడు. అది గొంతులోకి జారి అక్కడి నుంచి నెమ్మదిగా, అతి నెమ్మదిగా అతని
గుండెల్లోకి ఆమె ప్రేమని వొంచి నింపుకుంటున్నాడు. పాప అప్పుడు గమనించినట్టుంది అతను టీ తాగడం.
అక్కవైపు చూస్తూ, ‘‘టామీకి పాలు లేవు మమ్మీ. చూశావా?’’ అని అడుగుతూ, కొత్తగా కనబడుతున్న
అతనివైపు చూసింది.

పాప దృష్టి ఇప్పుడు అతని చేతిలోని టీ కప్పు మీద పడింది. ఆ మరుక్షణం ఆ కళ్లలో ఒక వెలుగు. ఒక
మెరుపు. తనకి అర్థమై తెలిసిపోయిందన్న అమాయకపు గర్వంతో కూడిన వెలుగు. ఒక్క క్షణమే ఆ మెరుపు.
అప్పుడు ఆ కళ్లలోని అర్థమైన మెరుపుని ఆ ‘పక్కింటి’ తమ్ముడు ఎప్పటికీ మరిచిపోడు. ‘‘మమ్మీ, టామీ పాలతో టీ కలిపిచ్చావా? చీ యాఖ్… ఆ పాలు కుక్కకోసం ఉంచినవి’’ అంటూ ప్రపంచంలోని అసహ్యాన్నంతా ఆ పదాలలోకి ఒంపి, నింపి బయటకు విసిరేసింది.

ఈ కథ , సాక్షి దిన పత్రిక వారి ఆదివారం అనుబంధం ఫన్‌డే జూన్ 21, 2015 లో ప్రచురితం.

కోపం వచ్చి వ్రాసిన కథ ‘అదితి’

అదితి - aditi - telugu short story by Anil Atluri

మొన్న అంటే మార్చ్ పదిహేనో తారీఖున, ఆంధ్రజ్యోతివారి ఆదివారం అనుబంధం లో, నేను తెలుగులో వ్రాసుకున్న కథని తొలిసారిగా ప్రచురించారు.  దాని పేరు అదితి.  మీరు అదితి చదవకపోతే ఇక్కడ చదువుకోవచ్చు.

ఆ కథ మీద పాఠకులనుండి వచ్చిన స్పందనల గురించి ఈ టపా.ఈ స్పందనలను ఇక్కడ నమోదు చెయ్యడానికి ప్రేరణ వి వి న మూర్తి గారు తమ కథ “ఒక రేపిస్టు ప్రేమలేఖ” (ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం – ఫిబ్రవరి 1,2015, ప్రచురణ) మీద ఫేస్‌బుక్‌లోని కథ సమూహంలో వారికి వచ్చిన స్పందనలని పంచుకోవడమే.  అలాగని వారితో కాని మరెవ్వరితోకాని నన్ను కాని నా రచనలని కాని నేను పోల్చుకోవడం లేదు.

మరొక ముఖ్యమైన కారణం –  భవిష్యత్తులో ఈ అదితి గురించి పాఠకులు నాకు చేరవేసిన తమ అభిప్రాయాలు వ్రాసుకున్న ఈ కొన్ని, నా జ్ఞాపకాలుగా ఉండిపోతాయి.  కథ చదువుకున్న తరువాత మీరు ముందుకు సాగితే బాగుంటుందని నా అభిప్రాయం.  కథ చదవకుండా దానిమీద పాఠకుల స్పందన తెలుసుకున్న తరువాత కథ చదివితే మీ అభిప్రాయంలో మార్పుకి అవకాశం ఉండవచ్చు.  ఉండకపోనూవచ్చు.

ఈ పాఠకుల స్పందనలకి గణాంకాలు కాని సంఖ్యాక వివరాలు కాని లేవు.  జ్ఞాపకం ఉన్నంతమేరకు ఇక్కడ పంచుకుంటున్నాను. గమనించగలరు.  ఫోన్లు చేసిన పాఠకుల పేర్లు నేను అడగలేదు.  వారి ఏ ఊరు నుంచి చేస్తున్నారన్నది తెలుసుకోవడానికి మాత్రమే వారి ఊరి పేరు అడిగాను.

అదితి ని స్త్రీలూ పురుషులు ఇద్దరూ చదివారు.  ఫోన్లు చేసారు, ఎస్ ఎమ్ ఎస్ లు పంపారు.  చాట్ లో చెప్పారు.

ఫోన్లు చేసిన వారి సంఖ్యని నేను మొదట్లో లెఖ్ఖ పెట్టడానికి ప్రయత్నించాను కాని తరువాత విరమించుకున్నాను, నాకు అంత ఓపికాలేదు, ఆ ఆసక్తి లేకుండా పోయింది. ఉజ్జాయింపుగా ఒక అంచనా అయితే ఉంది.

అదితి కథ చదివిన తరువాత, నా గురించి తెలిసిన వారు, నా గురించి విన్నవారు చాలా ఆసక్తిగా అడిగిన ప్రశ్న.  “ఇదేనా మీరు వ్రాసిన తొలి కథ?” అని. ముఖ్యంగా సాహిత్యకారులు.  రచయితలు, కొంత మంది సంపాదకులు కూడా.  ఆ ప్రశ్నని నేను అసలు ఎదురుచూడలేదు.  బహుశ నన్ను నేను ఆ కోణంలోనుంచి (ఒక తెలుగు రచయితగా) చూసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ కలగలేదు. అందుకనేమో మరి!

ఇక వారి ప్రశ్నకి జవాబు;
తెలుగులో నేను వ్రాసిన కథలలో ఆఫ్‌లైన్‌లో అంటే (అచ్చు) పత్రికలలో ప్రచురణకి నోచుకున్న తొలి కథ ఇదే.

 పోతే ఇందాక అనుకున్న పాఠకులలో రచయితలు, సంపాదకులూ ఉన్నారన్నాను కదా!  వారందరి ఏకాభిప్రాయం: “ఇది మీ తొలికథ లాగా లేదు.”

గోక్కోవడం
“దురద” ని మెచ్చని వారు కూడా ఉన్నారు.  కనీసం ముగ్గురున్నారు.  ఒకరు స్వయంగా నాకు తన అభిప్రాయం తెలియజేస్తే మరొకరు ఫేస్‌బుక్‌ కథ సమూహంలో ఆ మాటలే కాకున్న అటువంటి అర్ధం వచ్చే మాటలే వాడారు.  ఒకరు సందేశం పంపారు.

అదితి - aditi - telugu short story by Anil Atluri
అదితి కథలో లంకేష్

ఒకరిద్దరు “శిల్పాన్ని ఇంకా చక్కగా engineer చేసి ఉంటే బాగుండేది,” అన్నవారున్నారు. కథని గతం – వర్తమానం మధ్య నడిపిస్తూ “మీరు కొత్తగా ఏమి  చేసారు?” అని నిలదీసినవారున్నారు.  అడిగిన వారికి నా అప్రకటిత (కనీసం వారి దృష్టిలో) రచనా సామర్థ్యం మీద వారికున్న నమ్మకానికి ఆశ్చర్యమేసింది.
శైలిని కూడ దాదాపు అందరూ మెచ్చుకున్నారు.  భాష విషయానికి వస్తే, “మరి అంత ఇంగ్లిష్ అవసరమా?” అని అడిగినవారు కూడా ఉన్నారు.  “మీరు ఎన్నుకున్న నేపధ్యానికి మీరు వాడిన బాషే సరిపోయింది,” అని మెచ్చుకున్నవారున్నారు.

దాదాపు అందరూ “…నట్లు కొట్టకుండా, ఆపకుండా చదివించింది మీ కథ,” అని చెప్పారు.

మీ కథని తెలుగు పాఠకులు మెచ్చుకోవడం అనుమానమే,” అని అభిప్రాయాన్ని వెల్లడించిన ఇద్దరు పాఠకులు రచయితలే!  వారిద్దరూ నా శ్రేయోభిలాషులే.

“మీ ఈ కథలని తెలుగు పాఠకులు అందుకోలేరండి.  తొందరగా మీ కథలని కూడా నాకివ్వండి.  అనువదిస్తాను,” అని అంటే ముక్కున వేలేసుకోవడం నా వంతైయ్యింది.

కాస్త చదువుకున్నవారు ( సాహిత్యం ), లోకజ్ఞానమున్నవారు కథ ముగింపుని హర్షించలేదు.  సైకోసొమాటిక్ డిజార్డర్ అని మీరు చెప్పకపోయినా అది పాఠకులకి అర్ధం ఆయ్యేది అని వారు అభిప్రాయపడ్దారు.  వీరందరూ పట్టణ ప్రాంతాలలో జీవిస్తున్న విద్యాధికులే! రచయితలందరూ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
కథకి పాత్ర పేరు అదితి కాకుండా మరోక మకుటం పెట్టిఉంటే బాగుండేది అన్నపాఠక, సంపాదక వర్గ,  రచయితలున్నారు.
  • అదితి కథ అర్ధం కాలేదు అని సందేశాలు పంపినవారు ఇద్దరు.
  • బోర్ కొట్టిందని సందేశం పంపుతూ “ఇంకా మంచి కథలుమీరు వ్రాయలి!” అని ప్రోత్సహించిన వారు ఒకరు.
  • సైకోసొమాటిక్ డిజార్డర్ అనే లక్షణం నిజంగా ఉందా అని అడిగిన వారు కొందరు.
  • దాదాపు ఒక పదిమంది దాకా తమ కుటుంబంలోనో , స్నేహితులలోనే ఇటువంటివి చూసినవారున్నారు.  వివరంగా నాతో వారి అనుభవాన్ని పంచుకున్నారు.
  • అదితి చదివిన తరువాత ఆ దురద లాంటి ఇతర అలవాట్లని గుర్తించిన పాఠకులు కథని విపరీతంగా  మెచ్చుకున్నారు.

అదితి  ఒక ప్రమాదాన్ని కూడా తెచ్చిపెట్టింది.  కుటుంబ సమస్యలకి నన్ను పరిష్కారం కోరుతూ పాఠకులు ఫోను చేసారు.  మరీ ముఖ్యంగా వైవాహిక జీవితంలో భార్యా భర్తల మధ్య వచ్చిన అవగాహానాలేమి.  ఫోన్లు  చేసిన వారందరూ స్త్రీలే!

పాత్రల పేర్లు మీద కూడా స్పందించారు.  “ఆ పేర్లు ఏమిటి?  అన్ని కృతకంగా ఉన్నాయి!  ఆ భాష ఏంటి?” అని అన్నవారు కూడా ఉన్నారు.

ఈ టపా సమయానికి ప్రవాసాంధ్ర పాఠకులెవరి స్పందనా నాకు అందలేదు.
కథలతో పాటు రచయిత ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు ప్రచురణకర్తలకు అభిప్రాయాలు అందటం లేదట!
– ౦ –
నా పరిశీలనలోనూ, నా అధ్యయనంలో తెలిసిన రెండు ముఖ్యమైన విషయాలు చెప్తాను.
1 – స్థూలంగా 40ల లోపున్న వారికి ఈ కథ అంతగా నచ్చలేదు.
2 – 40 లు దాటిన వారందరికీ ఈ కథ చాలా బాగా నచ్చింది.
3 – ఈ నలభైలలోపు ఉన్నవారికి ఈ కథ:
శోభన్ బాబు లాంటి పల్లెటూరి మొగుడు, పట్నం పెళ్లాం, కొత్త దేవత లాంటి భార్య ఇందులో కొత్తేముంది?” అని అడిగినవారు ఉన్నారు.  మరో అడుగు ముందుకేసి ఇల్లాలు సినిమా కి మీ కథకి పెద్ద తేడా ఏముంది అనికూడా అడిగేసారు. 🙂
4 – లంకేష్ ఒక “చచ్చెధవ, సౌమ్య భలే పని చేసింది,” అని ఆ పాత్రని మెచ్చుకున్న స్త్రీ లు కూడా ఉన్నారు.  🙂

ఫేస్ బుక్ కథ సమూహంలో కథని పంచుకున్న సాయి పద్మ కి, సోదరుడు అట్లూరి శ్రీ కి, అబ్బిగారి రాజేంద్ర ప్రసాద్ , వ్యవస్థాపక అధ్యక్షులు రాష్త్ర కధానిలయం, నందలూరు వారికి మప్పిదాలు.ఇక ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం సంపాదక వర్గం సభ్యులకి, బొమ్మలు వేసిన అక్బర్ గారికి నా నెనర్లు.

గమనిక

  • ఈ కథని ఏ ఒక్క పత్రికనో దాని పాఠకులనో దృష్టిలో ఉంచుకుని వ్రాసింది కాదు.  కథని వ్రాసుకున్న తరువాత ఒకే ఒకరితో పంచుకున్నాను.  వారి అభిప్రాయాన్ని విన్నాను.  ఆ అభిప్రాయంతో నా కథలో మార్పులు చేర్పులు చెయ్యలేదు.  అది వారి అభిప్రాయంగానే తీసుకున్నాను.    అంతే.
  • ఈ కథకి నేపధ్యం ఉందా అంటే ఉంది.
    ఒకటి అప్పుడెప్పుడో నేనేదో వ్రాస్తే దాన్ని చదివి ఒకానొకరు “మీరే వ్రాసారా?  ఎవరైనా ఎడిట్ చేసారా?” అని అడిగితే ఆ ప్రశ్నకి కోపంవచ్చింది.  అంతేకాదు మరొక distant cousin కూడా ఎక్కడో “…వ్రాసేవాళ్ళెవరూ లేరు నేను తప్ప,” అని అంటే అది గుచ్చుకుంది.  అప్పుడు వ్రాసుకున్న కథలలో ఇది ఒకటి.  అందుకోసమే వ్రాసిన దాన్ని ప్రచురణకి పంపాను.  నాకు కోపం తెప్పించిన వారిద్దరికి కూడ మప్పిదాలు. 🙂 రెండు నా దృష్టికి వచ్చిన కొన్ని అనుభవాలని ఏర్చి కూర్చి ఒక కథగా మలిచాను.  ఆ అనుభవాలు కూదా దాదాపుగా మూడు దశాబ్దాలమేరా విస్తరించిన అనుభవాల సమాహారం.

నీ సాహిత్యానికి అదే ఎక్కువ!

puraskar - felicitation - award

దాదాపు ఒక రెండు దశాబ్దాల క్రితం అనుకుందాం. పడవల్లాంటి కార్లు,  ఆరడగుల ఆజానుబాహువు, నుదుటి మీద ముంగుర్లు  సర్దుకుంటూ ఏ ఫెమినానో, డికెన్సు పుస్తకాన్ని చదువుకుంటున్న ఆమె, తో, ప్రేమ, ఆఖరి పేజిలో కధానాయిక కోరుకున్న ఆసుపత్రి ప్రారంభోత్సవం లాంటి ఆకాశంలో విహరించడానికి కావల్సిన అందమైన కలలతో వెలువడే నవలా శకం అది.
ShadowShadowByMadhuBaabuTulasidalamByYandamoori PracticalJokerByKommuriSambasivaRao secretaryByYaddanapudiSulochanaRani
ఒక ఒంటరి వాడు, ఒక యువతి, ఏ పల్లెటూరు నుంచో ఒక మహా నగరానికి వచ్చి ప్రపంచాన్ని జయించే క్రమంలో ఇచ్చే వాల్యుబుల్ కోట్స్ తో మరో వైపునుంచి పర్సనాలిటి డెవలెప్మెంట్ ఇత్రివృత్తాలతో వెలువెడుతున్న సో కాల్డ్ ‘క్షుద్ర సాహిత్యం’ నవలా యుగం అది.

బెంగాలి నవలల అనుసృజనలతో హోరెత్తి పోతున్న సమయంలో, రాబిన్ కుక్నిక్ కార్టర్ కిల్ మాస్టర్, ఆర్ధర్ హెయిలి, అలిస్టర్ మెక్లెయిన్, హారోల్డ్ రాబిన్స్, స్టాన్లి గార్డ్‌నెర్ , ఫోర్స్‌త్, డేవిడ్ సెల్జర్ ల రచనల / పాత్రల కిచిడి తో సీరియస్‌గా సీరియల్స్ తో వార పత్రికల అమ్మకాలు లక్షల్లోకి  చేరుకున్న శకం అది.

puraskar - felicitation - award
పురస్కారం – బహుమతి

బ్లాంక్ చెక్‌లతో తన ఇంటి వసారాలో ప్రచురణ కర్తలు కూర్చుని ఉంటే రచయిత/త్రు లు వారిని గుర్తించని రోజులు, అవి.

ఆలాంటి రోజులలో రచయితకు సాంఘిక బాధ్యత ఉన్నదన్న నిర్దుష్టమైన అభిప్రాయంతో ఉండి రచనలు చేస్తున్న ఒకానొక రచయితకు ప్రభుత్వం గుర్తింపుతో బాటు కొంత నగదు కూడ అందింది.

కమర్షియల్ రైటర్‌గా డబ్బుకు డబ్బుకు, పేరు, గుర్తింపు పొందిన ఒకానొక రచయిత , ఈనాడు గ్రూప్‌‌లో మేగజైన్స్  ఎడిటర్ చలసాని ప్రసాద రావు గారిని కలిసాడు.  పిచ్చాపాటి మాటల్లో, ఆ రచయిత “ఆయ్యా, ఇన్ని పత్రికలలో, నా కథ గాని, నవలగాని, సీరియల్ గాని, ప్రచురించనివి ఒకటి కూడ లేవు.  మరి నన్ను గుర్తించదేమి ఈ ప్రభుత్వం?” అని తన అవేదనని, ఆక్రోశాన్ని, అక్కస్సుని వెళ్లబుచ్చాడు.

ఠకీ మని ఆయన అన్నాడు కదా, ” నీకు గుర్తింపు ఎందుకు?  డబ్బు సంపాదించుకుంటున్నావు కదా?  నీకు గ్లామర్ ఉంది కదా?  ఆయనకి అవి రెండు లేవు కదా!  అందుకనే ఆయన్ని ప్రభుత్వం గుర్తించింది.  పురస్కారమిచ్చి గౌరవించింది.  నీకున్న దానితో నువ్వు తృప్తి పడు.  నీ సాహిత్యానికి అదే ఎక్కువ!”

ఈ సందర్భంగా
మీకు,
మీ అప్తులకు,
మీ ఆత్మీయులందరికి
సంక్రాంతి
శుభాకాంక్షలు

తెలియజేసుకుంటున్నాను.

సౌజన్యం ఆ మధ్య ఏవో మాటల మధ్య దాసరి అమరేంద్ర, నేను, కథ నవీన్ కలిసి మాట్లాడుకుంటుంటే బయటపడ్డ విషయం అది. రచయిత/త్రి పేరు మాత్రం నన్ను అడగవద్దు.   😉

వెలగా వెంకటప్పయ్య

మొన్న మళ్ళీ కాళీపట్నం రామారావు మాస్టారి నవతీతరణం అభినందన ప్రత్యేక సంచిక చదివినప్పుడు వెలగా వారి వ్యాసం చదివాను.  చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వారి వయస్సుకి అంతర్జాలం గురించి ఆ మాత్రం అవగాహన ఉండటం.  అంతే కాదు ఆ ఏడు పేజీల సాహితీ వ్యాసం చివరి పేరగ్రాఫ్ లో వారన్న మాట: “ఇంటర్‌నెట్ ఉంటే ప్రతి ఇల్లు ఒక కథానిలయం అవుతుంది…కారా మాస్టారు సేకరించిన అపూర్వ కథా సంపదను అధికంగా ఉపయోగించినా, అసలు ఉపయోగించకపోయినా శిధిలమౌవుతుంది.  శిధిలం మాట మరిపించేది, మురిపించేది అంతర్జాల మాయాజాలం.”

Dr Velaga Venkatappaiah, Tenali
డా. వెలగా వెంకటప్పయ్య (1930 – 29 Dec 2014)

సాక్షి దిన పత్రిక లో నేను వ్రాసిన గూగుల్ నెట్‌లో e బుక్స్ చదివి వెంటనే నాకు ఫోన్ చేసి అభినందించిన వారిలో ఆయన ఒకరు.  ఆ వ్యాసాన్ని ఆయన ఆంధ్రా యూనివర్సిటి కి సమర్పించిన ఒక పత్రంలో ప్రస్తావించానని, అక్కడి విద్యార్ధులకి అందజేసానని కూడ తెలియజేసారు.

తెలుగునాట గ్రంధాలయాల ఏర్పాటు కోసం ఆయన చేసిన కృషి చాల గొప్పది.

కవిరాజు త్రిపురనేని రామస్వామి అంటే వారికి అభిమానం.  కవిరాజు మనుమడిగా ఆ అభిమానం నా మీద కూడ కొంత చూపించారనుకుంటాను.  మేము మద్రాసులో ఉన్నప్పుడు ఆక్కడికి వచ్చినప్పుడల్లా మా అమ్మ ‘కవిరాజు’ కుమార్తె చౌదరాణి ని తప్పక కలిసేవారు.

ఆదివారం మే 6, 2012 న కేంద్ర సాహిత్య అకాడెమి కవిరాజు త్రిపురనేని రామస్వామి సాహిత్యం మీద గుడివాడ లో నిర్వహించిన సదస్సులో వారు కూడ పాల్గొన్నారు.

Seminar on Kaviraju Tripuraneni Ramaswamy
The invitation to the seminar on ‘Kaviraju’ Tripuraneni Ramaswamy.

వెలగా వారు ఈ రోజు ఉదయం విజయవాడలో ఆయుష్ హాస్పిటల్స్ లో ఆఖరి శ్వాస తీసుకున్నారని తెలిసినప్పుడు బాధవేసింది. మరో స్థంభం నేల కూలింది.

రచనలు
వారి రచనలలో కొన్ని, వాటి  ముఖచిత్రాలు ఇక్కడున్నవి.  సాహిత్యాభిమాని – ఆర్ బి రావ్ సౌజన్యం.
https://www.facebook.com/media/set/?set=a.10155009212985385.1073741875.624985384&type=1&l=1ce9757082

నేనైన నీకు నీవైన నేను

“నేనైన నీకు నీవైన నేను”  అని  2006 లో అన్నాడామాట. పైగా అతి రమణీయం గాను.
రాయడం ఒక దురద,” అని కూడ అన్నాడు.
“ఆ మాట చాలా చీప్ గా ఉంది,” అని ఒకానొక పాఠకుడి ఒక వ్యాఖ్య.
“నా కథల్లో అంతర్లీనంగా తార్కికత, తాత్వికత కనిపించడానికి నా చిన్నప్పటి అధ్యయనం కారణం కావచ్చు,” అని నిన్న అన్నాడు.
ఇంకా ఆరుపదులకి ఆమడ దూరంలోనే ఉన్నా..ఒక ఆరుపదులవరకు రాసేసాడు, కథలు.
ట్విన్నవలలు.  అసలు ఆ మాట విన్నారా? ఇవిగో ఇక్కడున్నవి.

<img class="wp-image-19 size-full" src="https://telugu.anilatluri.com/wp-content/uploads/sites/3/2014/12/TwinnavalaluByAnaamakuduRamasastri_Anil_Atluri.jpg?w=656" alt="ట్విన్నవలలు " originalw="656" width="808" height="1220" scale="2">
ట్విన్నవలలు – రాతగాడు అనామకుడు

పోయినేడాది…దాదాపు ఇవే రోజుల్లో…వాళ్ళిద్దరు కలిసి ఒకొళ్ళపుస్తకాన్ని మరొకరికి అంకితం ఇచ్చుకున్నారు.
పరిణయం చేసుకుని పాతికేళ్ళే..కాని అంతకుముందే పరిచయం అనొచ్చా?  అనకూడదేమో! బంధుత్వం ఉందిగా మరి.

మరి విముక్తి మూలంగా ఈ ప్రత్యేకత వచ్చిందో..లేక విముక్తి కి జనార్ధన మహర్షి, నవ్య సంయుక్తంగా ఇచ్చిన బహుమతి వల్లవచ్చిందో కాని నవ్య కళ్ళకి ఇతని రూపు ప్రత్యేకం గా కనపడింది.  ఆ ప్రత్యేకం ఇక్కడ చదువుకోండి.

చాలా మందికి తెలియని మరొక విషయం.  ఇతను ఆంగ్లంలో కూడ కథలు వ్రాసాడు. ఇదిగో ఇక్కడుంది ఒకటి చదువుకోండి.

నవ్య వార పత్రిక. తేది డిసెంబరు 10, 2014.  పుటలు 15 నుంచి 20 దాకా.