వెండి తెర నవలలు – అట్లూరి పిచ్చేశ్వరరావు

సినిమా చూడటానికి ఎడ్ల బళ్ళు కట్టుకుని వెళ్ళిన వాళ్ళున్నారు.  వైజాగ్ నుంచి మద్రాసుకి ఒకరాత్రంతా ప్రయాణం చేసి వచ్చి సినిమా చూపించమని నన్ను వేధించుకుని తిని సినిమా చూసి అటునుంఛి అటే సెంట్రల్ స్టేష‌న్‌లో పొగబండికి రిజర్వేషన్ కూడా నాతో చేయించుకుని వెళ్ళిపోయినవారున్నారు.

అటువంటి అవకాశం లేని వారికి అప్పట్లో ఆకాశవాణి వారి సంక్షిప్త శబ్ద చిత్రాలే గతి.  ఒకటికి పది సార్లు చూడటానికి అవకాశం లేని వారు,  ఎన్టీవోడి డవిలాగు, ఏ ఎన్ ఆర్ ఎస్‌వీఆర్ డవిలాగు కాకుండా అసలు కథ ని ఓల్‌మొత్తం అర్ధం చేసుకోవడానికి, చదివి చూడలేని తోటివారికి చదివి వినిపించడానికి వెండితెర నవలలు భలే పనిచేసేవి.  అంతే కాకుండా ఆ వెండి తెర నవల ద్వారా తమ సినిమాలకి కొంత అదనపు ఆకర్షణ ని కూడ తెచ్చుకోవడానికి వాటిని వాడుకున్నారు ఆనాటి చలనచిత్ర నిర్మాతలు, పంపిణీదారులు.

Pitcheswara Rao Atluri (1924 - 1966)

తెలుగు లో వెండితెరనవలకు ఆద్యులు అట్లూరి పిచ్చేశ్వర రావు (12th April 1925 – 26th Sept 1966).  వారి తొలి తెలుగు ప్రక్రియ కి తెరతీసినది గౌతమ బుద్ధ లఘుచిత్రం.  ఆ బాటనే పయనించినవారు రామచందర్, ముళ్ళపూడి వెంకటరమణ, రావి కొండలరావు, నేటి చలన చిత్ర దర్శకులు వంశీ తదితరులు.

వెండితెర నవలల మీద TV 5 ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తమ “Favorite Five” శీర్షికన ప్రసారం చేసింది.  సుమారు పదిహేను నిముషాలు నిడివి ఉన్న ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు.

గమనిక:
ఈ ప్రసార కార్యక్రమం పూర్తి హక్కులు TV5 కే చెందుతాయి. నాకు ఎటువంటి సంబంధం హక్కులు లేవు.
All rights to this program whether implied or otherwise belong to TV5 or to their respective entities.

చిటికెన వేలు పట్టుకుని…

చిటికెన వేలు పట్టుకుని అప్పుడు నడిచాను, తెల్లవారు ఝామున.

భుజం భుజం రాసుకుంటూ నడిచి ఉంటే ఎంత బాగుండేదో, మిట్ట మధ్యాహ్నం ,చెట్ల నీడ కింద.

నా అరిచేతితో ఆయన అరిచేతిని పట్టుకుని, ఆ పార్కులోనో , మెరినా ఒడ్డునో అడుగులో అడుగు వేసుకుంటూ, నడుస్తూంటే ఎంత హాయిగా ఉండేదో, ఈ రోజు సాయంత్రనా !

**  ఉండి వుంటే 90 లోకి అడుగుపెట్టసివుండేవారు.  
వెళ్ళిపోయి నలభై ఎనిమిది  ఏళ్ళు, ఈ పూటకి.

నాలుగు అక్షరాలు – మూడు కథలు

ఆ మధ్య ఒక రచయితని అడిగాను, “మీరు ఎందుకు వ్రాస్తున్నారు?” అని.
ఠకీమని చెప్పాడాయన “డబ్బుల కోసం” అని.
మరొకరిని అడిగాను.  “అయ్ ఆమ్ ఎక్స్‌ప్రెసివ్” అని జవాబు.
ఆంధ్రులు కాదు తెలుగు వారందరూ అభిమానించే (సినవారు కూడా ఉన్నారు) జవాబు, “రాయక పోతే చచ్చిపోతా”.
సముద్రంలోనుంచి బయటపడి, చెట్టుమీదకి ఎక్కి కిందకి దిగాడు. అన్ని వందల వేల సంవత్సరాలలో, వాడికి శబ్దం చెయ్యడం వచ్చింది.  దానికి ఒక లయ ఏర్పచుకున్నాడు.  భాష అయ్యింది అది.  కథలు చెప్పుకోవడం మొదలయ్యింది.  అనుకుందాం! సరే మౌఖికంగా కథలు చెప్పుకుంటున్ననాటి నుంచి బూతులు, అసభ్యపదజాలం వాడుక దేశ కాల పరిస్థితులని బట్టి మారుతునే ఉన్నవి.  రోజు ఇంటా బయటా వింటున్నవేకదా?
ఫ్రీడ్‌మన్ అన్నట్టు,  డాల్ఫిన్స్ కి , వేల్స్ కీ కూడా భాష ఉంది.  మాట్లాడుకుంటాయి.  ఏనుగులు, కాకులు, కుక్కలు, పిల్లులు, పాములు అన్నింటికి ఒక భాష వుంది.  అన్ని ప్రేమించుకుంటాయి, కాట్లాడు కుంటాయి, తిట్టుకుంటాయి, ఆడుకుంటాయి అన్ని పనులు చేసుకుంటాయి.
“దిద్దుబాటు” తెలుగులో తొలి కథ అని అన్నారు. అబ్బే లేదు..ఇంకా చాలా కథలున్నవి  (దాదాపు ఒక తొంభై దాకా అని ఒక అంచనా!) దానికి ముందే అని తెల్ఛేసారు. రేపో, మాపో అవి మనచేతుల్లోకి రానున్నవి. (బహుశ ఈ  2014 లోనే రావచ్చు).దిద్దుబాటు ని షార్ట్‌ఫిల్మ్‌గా కూడా తీసాడు అట్టాడ అప్పల్నాయుడు గారి అబ్బాయి సృజన్.
సరే, దిద్దుబాటుతోనే మొదలు పెడదాం.
మరి ఆ రోజే సాని కొంపలున్నవిగా?
మగాడు తిరుగుతునే ఉన్నాడుగా?  ఆవిడ ఇంట్లోనే ఉందిగా?
“కన్యాశుల్కం” నుంచి, ఈ రోజు “వాడి పాకేజి నాకంటే తక్కువలేవే..వాడ్ని నేనెలాచేసుకుంటానే మమ్మీ?” అని ఈ రోజు చదువుకుని,ఉద్యోగంచేసుకున్న యువతి గారాలు పోతోంది.దిద్దుబాటు వెలువడిన సాంఘిక నేపధ్యం ఏమిటి?  దేశ కాల పరిస్థితులేమిటి?  ఈ రోజు దేశ కాల  పరిస్థితులేమిటి?  ఎరుపు రోజుల్లో కథకి ఒక సాంఘిక బాధ్యత ఉంది అని అనుకుని వాళ్ళు కథలు, నవలలు, కవితలు, నాటికలు గట్రా వ్రాసుకున్నారు.  అవి “గర్జించు రష్యా” రోజులనుకుంటే ఇవి “గాండ్రించు అమెరికా ” రోజులనుకోవచ్చు.  మరి మార్పు రాలేదా?మూలింటామె లో లాగా పందొసంత లాంటి వ్యక్తులు లేరా? అంటే ఉన్నారు! ఇప్పుడు కాదు..అనగనగా అప్పుడెప్పుడోనే ఉన్నారు.  ఈ రోజు బయటికి వచ్చిందా?  కాదే?  పల్లెటూళ్ల లో పాలేర్లు, రైతులు, రైతు కూలీలు అయితే, పట్టణాలలో సేల్స్ గరల్స్, ఆఫీసులో క్లెర్క్‌లు వాళ్ళ రాసలీలల మీద ఎన్ని కథలు రాలేదు!
మరి “అరుంధతి” (ఉన్నంతలో – రాజారామ్మోహనరావు – 2012 స్వాతి మాస పత్రికలో) రామారావు పక్కలోకి వెళ్ళలేదేం? (కథ 2012 సంకలనం – సం:  వాసిరెడ్డి నవీన్, శివశంకర్ పాపినేని)
కాబట్టి ఆ మార్పుని ఒప్పుకున్నవాళ్ళు ఈ మార్పులని కూడా అంగీకరించాలి.
అలాగే చదవతగ్గ రచన ఏదైనా సరే చదువుతారు.  దానికి భాష అడ్డం రాకూడదు.  కాని వచ్చేసిందిగా?!
భాషే కాదు.  వస్తువులో కూడా మార్పులు వచ్చేసినవి.

* * *

ఈ మధ్య వచ్చిన కథ ఒకటి.
ఎబినేజర్ అనబడే ఒక మాదిగ నింబోడి కథ ని వ్రాసింది కాశీభట్ల వేణుగోపాల్.
ఈయన “F” నాలుగు అక్షరాల పదాన్ని ఆంగ్లంలోనే అయినా వాడారు.  (ఈ నాలుగు అక్షరాల ఎఫ్ పదం ఏమిటని అడగేవారి కోసం కాదు ఇది వ్రాస్తుంట!)  అందులో ఎబినేజర్ పాత్రకి కళ్ళలో ఒక దానికి శుక్లం వచ్చింది.  శుక్లాన్ని ఆంగ్లంలో కాటరాక్ట్ అంటారు. కాటరాక్ట్‌ని కొన్ని ప్రాంతలలో కొంత మంది “కన్ను పూసింది” అని అంటారు. శుక్లం ని “కన్ను లో పూత” అని కూడ చెప్పుకుంటారు.   అంటే ఈ కథలో ఎబినీజర్ అనే పాత్ర కన్నుపూచింది.  కన్నులో పూవు.    కన్నులో పూవు ఉంది కాబట్టి ఆ వ్యక్తికి  *పూకంటోడు అనే మారుపేరు (నిక్‌నేమ్) ఎగతాళిగా పిలుచుకునే పేరు పెట్టారు.ఆ మారుపేరు తన పాఠకులకు అమోదయోగ్యంకాదని ఒకరో ఇద్దరో సంపాదకులు అభిప్రాయపడ్డారు.  ఆ మారుపేరులో వారికి బూతు వినపడింది.  అంతే కాదు వారికి అసభ్యంగాను అభ్యంతరకరంగాను తోచింది.  రచయితకి ఒక సూచన చేసారు.  ఎబినేజర్ “మారుపేరు” (nickname) మార్చండి. ఆ కథని మేము ప్రచురిస్తామని.  రచయిత ఒప్పుకోలేదు.  రచయిత “మా ప్రాంతంలో అలా కన్నులో పూత అంటే శుక్లాలున్నవాడిని అదే పేరుతో పిలుస్తారు.  అది జనబాహుళ్యంలో ప్రచారంలో ఉంది కాబట్టి నేను మీ సూచనను అంగీకరించను.  మీరు కథని ప్రచురించకపోయినా ఫరవాలేదు” అంటూ వివరణ ఇచ్చారు.
ఆ పత్రిక సంపాదకులు అంగీకరించలేదు.  కాబట్టి ఆ కథని అచ్చులో చదువుకునే అదృష్టం కొంత మంది పాఠకులకి దక్కలేదు.  కొంతమంది జాలపాఠకులకి (online readers)  ఆ దురదృష్టం కలిగింది.  అవును,  ఎవరు దీన్ని గురించి మాట్లడుకున్నట్టు కనపడలేదే!?

 F word and Telugu stories
నాలుగు అక్షరాలు – మూడు కథలు

మరో కథ

వాకిలి *వెబ్‌జైన్ లో పునీత కథ.
ఇందులో లచ్చుమమ్మ మొగుడు కామేశ్వరరావు.  ఆ లచ్చుమమ్మ వయసు  దాదాపు 39 ఏళ్ళు.  కాలేజిలో చదువుకునే సరయు ఈ దంపతుల కూతురు. మురళి లచ్చుమమ్మ మేనల్లుడు. డాక్టరి చదువుకుంటున్నాడు.  వాడి దృష్టి తన మీదకు “మళ్ళించుకోవడానికి సరయు తిప్పలు. దానిని వదిలి నా పక్క చేరడానికి వాడి చిరాకులు.” అని ఆ తల్లి స్వగతం.  మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా?  మురళీ తన మేనత్త తో గడపటానికే వాళ్ళింటికి  వెళ్ళడం. ఎందుకని అంటే ఆమెకి “చేతనైంది చెప్తే చచ్చిపోతావ్రా మగడా. కావాలంటే మురళిని అడుగు. నెలకు మూడుసార్లు ఇంత దూరం ఎందుకొస్తాడో తెలుస్తుంది” అనుకుంటుంది. లచ్చుమమ్మ  మళ్ళీ మరో మాట కూడా అనుకుంటుంది “అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?” అని.
ఎబనీజర్ పాత్ర వాడి పూకంటోడు అనే పేరు 2014 లోదే.
అరుంధతి పాత్ర 2012 లోదే
పునీత పాత్ర 2014 లోదే.
ఈ మూడు కథలని చదువుకున్నవారు ఉన్నారు.
మరో కథ
కీమో ఈ కథ వ్రాసింది వంశీధర్ రెడ్డి.  వైద్యుడు.
“కీమో” కథలో ఆరు చోట్ల *F* పదం వాడారు రచయిత. అది ఆంగ్ల పదం అయినా సంభాషణలు ఇంగ్లిష్‌లో కాబట్టి ట్రాన్స్‌లిటరేటేడ్ పదం అది. మరి ఇందాక భాష అనుకున్నామే?!  మరి ఇక్కడ ఇది కూడా వచ్చేసిందిగా?!

మరో సందర్భం;
ఈ సారి ఏకంగా ఒక వెబ్‌జైన్ సంపాదకుడే వాడేసుకున్నారు F పదాన్ని!
ఆయన మాటల్లోనే “I fucked up so many relationships. I want us to be a success“.
మరి దీనికేమంటారు ?

మరి మంచుపూవు లోని కావేరి కూతురు ప్రియ లో భార్యని చూసుకున్న తండ్రి ఆలోచనలని వెలికి తెచ్చిన రచయిత ని ఏంచెయ్యాలి?మొన్న వేదిక సమావేశం లో ఒక ఆంగ్ల కధని పరిచయం చేసాను.  Ba-Boon – థామస్ పియర్సన్ వ్రాసిన కథ అది. 2014 లొనే వచ్చిందా కథ.  అన్ని తనే అయిన సోదరుడు ఒకానొక దుర్ఘటనకి గురైన తరువాత అతని చెల్లెలు అతనికి తోడై ఉండాల్సిన పరిస్థితి.  తన బాయ్‌ఫ్రెండ్‌తో ఒకానొక సందర్భంలో ఒక compromising situation లో వీడియో షూట్ లో పాల్గొంటుంది.  ఆ టేప్ తెచ్చుకోవాలి.  కొన్ని వందల వీడియో టేపులన్నింటిని చూస్తేగానీ ఏది తనది అన్నది తెలియదు.  మరి సొంత అన్నతోనే ఆ వీడియో చూడాలా?  ఈ అంశాన్ని ప్రంపంచంలోని ప్రతి ఆంగ్ల పాఠకుడు అంగీకరిస్తాడా?
కొవ్వలి నవలలని  జాకెట్లలలో, లంగాలలో, ఓణీలలో దాచుకుని చదువుకునే వారు ఒకనాటి చదువుకున్న స్త్రీలు. అలాగే మధు పుస్తకాలని కూడా దాచుకుని చదువుకునేవారు ఈ జాలం అవతరించకముందు.ఇప్పుడు వస్తున్న ఈ కథలమీద,  ఆ కథల కోసం తీసుకున్న వస్తువు మీద, ఆ పాత్రలు వాడిన భాషమీద  కొంత మంది పాఠకుల అభిప్రాయాలని చదివిన తరువాత, ఇవన్నీ కూడా సెక్సు అంటే బూతు పదాలు వాడినందుకు వచ్చిన విమర్శలు అనే అనిపిస్తోంది.  కొంత మంది అనుకునే బూతు ఆలోచనలు, అవి  బయట పెట్టినందుకు వచ్చిన విమర్శలు గానే మిగిలిపోతాయి తప్ప మరొకటి కాదు.
మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా అంతర్జాలం లోనే వెబ్‌జైన్‌లలోనే వెలువడ్డవి. అంతర్జాలానికి ఎల్లలు లేవు.  అలాగే అక్కడ స్వేచ్చమీద కట్టడి లేదు.కా రా మాస్టారు అన్నట్టు:  ”  చీకటిలో ఉన్నా కొందరందులో వెలుగుని గురించి రాస్తారు.  వెలుగులో ఉంటూ జీవితం లోని చీకటి గురించి రాస్తారు.  వెలుగే తప్ప చీకటిని ఎరుగని వారు అందులోని నీలి నీడలనే చీకటిగాను, మరి కొందరు చీకటి చీకటి కాదని, వెలుగే చీకటి, చీకటే వెలుగని రాస్తారు”          ( కా రా రచనలు పుట 379).
ఆయన వ్రాసిన సందర్భం వేరైనా ఈనాటి కథకులకి, పాఠకులకి తెలియాల్సి ఉంది.

ఆంక్షలు పెట్టకండి.వచ్చేవి ఎలాగు వస్తాయి.  పొయ్యేవి ఎలాగూ పోతాయి.
మంచి ముత్యాలని ఏరుకోవడమే మీరు చేయగలిగింది!
ఏది మంచి?  మీకు ఏది మంచి అని తోస్తే అదే మంచి!!

డేంజరస్ కథకుడు

నిండా డేంజరస్ మనుషులుండారు ఈ ప్రపంచంలో. అతి ప్రమాదకారులు వీరు.  మాటలతో మనల్ని మాయజేస్తారు.  ఇదిగో అంటారు.  అదిగో అంటారు.  వీళ్ళు మన నోటికి వినిపిస్తారు.  చెవులకి చూపిస్తారు. చొంగ కారుతుంటుంది ఒక పక్క. చేతులూపుకుంటూ, కళ్ళు తెరుచుకుని వాళ్ల మాయమాటల దారెంట వెళ్ళిపోయి వాళ్ళు చూపించే ఆ మరో ప్రపంచాన్ని కంటాం! చిన్నపిల్లల్లగా!!

Sa Vem Ramesh
సా వెం రమేశ్

డబల్ ఢమాకా అంటారనుకుంటా..ఒక కథతో మొదలుపెడతాడు, మరో కథ మొదలుపెడతాడు.  వాటి చుట్టూ మరో ప్రపంచాన్ని సృష్టిస్తాడు.  ఆ మూడింటీతో పాటు మరో కొత్త అంశం ప్రవేశపెడతాడు. త్రీ డి అంటారే.  అలా! కళ్ళు తిరుగుతాయి.  ఆ సుడిగుండంలో పడిపోతాం.  గిరా గిరా తిరుగుతాం,  పడి కొట్టుకుపోతాం.  మన లోపలికి నీళ్ళేళ్ళిపోతాయి. మరో కొత్త భాష! మరో కొత్త కోణం.  మరో కొత్త మూలం అవిష్కరింపజేస్తాడు.  ఎక్కడో తెల్తాం.  అక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది..కాని ఉండలేం కదా! ఒక జీవితం ఉంది కదా?  ఒక జీవనం చెయ్యాలి కదా?  ఒక జీవిక కావాలి కదా?

కాని అతనికి అదే జీవితం, అదే జీవనం, అదే జీవిక అయ్యింది. సిగ్గు ఎవరికి ఉండాలో మరి?

భగ, భగా, ధగ ధగా మెరుస్తూ కళ్ళు మిరిమిట్లు గొలుపుతుంది., సిడిమొయిలు.  అలాంటి లోకం ఒకటి ఉందా?  తెలుసుకోవాలంటే వివరాలకు కథ 2013 ని కొనుక్కుని చదువుకోండి! కథకి అద్భుతమైన బొమ్మ గీసినవారు ఏలే లక్షణ్.

sidimoyilu katha
Illustraton by Lakshman Aelay

ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు

మొన్న ఎలక్షన్‌లో గెలిచిన నరేంద్రమోడి గెలుపుకి పుస్తకాలకి సంబంధం ఏమిటా?  అంతర్జాలం.  సోషల్ మిడియా!

తొలి ముద్రణ 2013.  మలి ముద్రణ 2013.  అమ్మకాలు దాదాపు ముప్పై ఐదు వేలు.  పుస్తకం ఆవిష్కరణ సభ భాగ్యనగరం లో పెద్ద హోటలు. ఐదువందల రూపాయలు నోట్లు ఇచ్చిన వారు, చేతికి అందిన ప్రతులు అందుకున్నారు. చిల్లర అడగలేదు.  తెలుగు పుస్తకమే.  ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు..

మరో మంచి హోటల్ లో పుస్తక ఆవిష్కరణ.  తొలి ముద్రణ ఆగస్టు 2013.  అమ్మకానికి ప్రతులు లేవు. మలి ముద్రణ డిసెంబరు 2013. కథకుడు మరో ముద్రణ గురించి ఆలోచిస్తున్నాడు.

తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు.

మరో పుస్తకం. మూడవ ముద్రణ.  కొన్ని వేల ప్రతులు. తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు.

పైన నేను ఉదహరించిన తెలుగు పుస్తకాలన్నింటిని చదవాలని, కావాలని పాఠకులు కొనుకున్నారు.

మూడు పుస్తకాలు తెలుగులోనే ఐనా వాటిలోని విషయాలు విభిన్నమైనవి.  ఒకటి కధా సంకలనం.  ఒకటి జీవిత చరిత్ర. మరొకటి సాహిత్య పురస్కారం అందుకున్నది.

మొన్న ఏప్రిల్ లో నెల్లూరులో మరో పుస్తకం ఆవిష్కరణ.  వేదిక దగ్గిర ప్రతులు అమ్ముడైపోయినవి.  పుస్తకాలు కావాలి.  ప్రతులు లేవు. తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు…కొనుక్కున్నారు.  కొంతమంది పదుల ప్రతులు కొనుకున్నారు.

నేనిక్కడ ఉదహరించినవి నా దృష్టికి వచ్చిన వాటిల్లో మూడో నాలుగో పునర్ముద్రణలు మాత్రమే!  ఇవి కాక ఇతర ప్రాంతాల్లో పునర్ముద్రణలకు నోచుకున్న పుస్తకాలు అనేకం! ఇవికాక ప్రచురణకర్తలు పునర్ముద్రించుకుంటున్నవి అనేకం ఉన్నవి!  ప్రవాసాంధ్రుల ప్రచురణలు?

అనంతరామ్ పేరు విన్నారా?  మొన్నామధ్య ఏప్రిల్‌లో పెళ్ళి చేసుకున్న అనంతరామ్ కొంతమంది బ్లాగర్లకి మాత్రమే తన బ్లాగు ద్వారా పరిచయం. రెండువేల పదమూడులో రామ్@శ్రుతిడాట్‌కామ్ అనే శీర్షికతో ఈ నవ యువ రచయిత  తన తొలి ప్రేమకధా నవలని ఈబుక్ గా ప్రచురించుకున్నాడు.  తొలుత అది ఈబుక్‌గానే వెలువడింది. ఆ  నవల తొలుత అచ్చులో వెలువడలేదు.  ఈబుక్‌ అమ్మకాల మీద వచ్చిన రాయల్టీలతో తన పుస్తకం అచ్చువేసుకున్నాడు.  తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు. కొనుక్కున్నారు.  (పాఠకమహాశయా! ఈ యువ నవ రచయితని ఈ వ్యాసకర్త ఇప్పడిదాక కలవలేదు.  కనీసం ఆ రచయిత వివాహానికి ఆహ్వాన పత్రిక అందుకున్న గుర్తు కూడా లేదు).

ఒకప్పుడు రచయితలకి సిగరెట్ల పాకెట్టిచ్చి,  తేనిరు పోసి, హ్విస్కి లు తాగించి, పుస్తకాలు వ్రాయించి, డబ్బు పెట్టుబడి పెట్టి, ఆ పుస్తకాన్ని ప్రచురించి, లాభాలార్జించి , భవంతులు కట్టుకున్న ప్రచురణకర్తలున్నకాలం తెలిసినవారుండేవుంటారు మీ పాఠకులలో.  అవి ఆ రోజులు.

తన పుస్తకాల అమ్మకాల మీద వచ్చిన రాయల్టీలతో పిల్లలకి చదువులు చెప్పించుకుంటూ, విదేశాలలో ఉద్యోగాలకు పంపించుకుంటూ, భవంతులు కట్టించుకుని, కారులలో షికారులు చేస్తూన్నాడు ఈ రోజు రచయిత. ఇవి ఈ రోజులు.

శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాక.. అదిలాబాదు నుండి తిరుపతి దాక ఉన్న తెలుగు రచయితల సాహిత్యం ఈ రోజు అంతర్జాలం ద్వారా అందరికి అందుబాటులోకి వచ్చింది.  ఆక్‌లాండ్ నుండి, ఆసియా నుండి, ఆఫ్రికానుండి, అమెరికా సంయుక్త రాష్ట్రాల దాక కాక వాటిమధ్యనున్న దేశాలలోని తెలుగు పాఠకుడు ఈ రోజు తెలుగు పుస్తకాలు కొనుక్కుంటున్నాడు.  చదువుకుంటున్నాడు.  లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాడు.  ఏటా, అనధికార గణాంకాల ప్రకారం సుమారు గా పదిహేను కోట్ల రూపాయల విలువగల పుస్తక క్రయ విక్రయాలు జరుగుతున్నవీ.  ఈ లెఖ్ఖలలో జాలం ద్వార అమ్మిన అచ్చు పుస్తకాలు కాని డిజిటల్ పుస్తకాలు కాని కలపలేదు.  అలాగే విదేశాలలో ముద్రిణపొంది అమ్ముడవుతున్న పుస్తకాల గణాంకాలు లేవు!  ఐనా ఇవన్నీ తెలుగు భాషవి మాత్రమే సుమా!  తెలుగు వారెంతమంది?  ఆ మధ్య పదిహేను / పదహారు కోట్లమంది ఉన్నారని అన్నారుగా.  ఆ మాటే ప్రామాణికంగా తీసుకుంటే ప్రతి తెలుగువాడు తెలుగు పుస్తకం కోసం ఒక రూపాయి వెచ్చించినట్టే!

ఎన్నికల లెక్కల్లో కొంచెం అటు ఇటుగా ఎనిమిది కోట్ల మంది అని తేలిందా?  పోని అదే లెఖ్ఖ వేసుకుందాం!  ఆ లెఖ్ఖన సగటున ప్రతి తెలుగువాడు తెలుగు పుస్తకం కోసం రెండు రూప్యంబులు వెచ్చించెనన్నమాట!  ఇప్పుడు చెప్పమనండి..తెలుగు ఎలా చచ్చిపోతుందో, తెలుగు భాష ఎలా చచ్చిపోతుందో, తెలుగు పుస్తకం ఎలా అవసాన దశకి చేరుకుందో రుజువు చెయ్యమనండి!! చూసే వాడి చూపులో ఉంటుంది అందం అన్న చందానా,.పచ్చ కామెర్లవాడికి ప్రపంచం అంతా పచ్చగానే కనపడుతుంది.

అది నేటి సాహిత్యం పరిస్థితి.  ఇక తెలుగు చచ్చిపోయింది. చచ్చి పోతోంది.  ఇక తెలుగు చదివేవారు లేరు అనేది ఎవరో మీరే నిర్ణయించుకోండి.

ఒక యువ నవ కథా రచయిత, ఒక సాయంత్రం ఒక సాహిత్య సభ దగ్గిర నా బుర్ర తిని (తినిపించుకునేవాడుంటే బుర్రలు తినడం నాకు చాలా ఇష్టం) ఒకటో రెండో సంవత్సరాలు ఆలోచించుకుని మొన్నిమధ్య అచ్చు పత్రికలలో వెలువడ్డ తన కధలన్నింటిని గుదిగుచ్చి ఒక సంకలనంగా వెలువరించాడు.  ఆవిష్కరణ సభకు ముందే తనకు తెలిసిన పుస్తకాల దుకాణాలలో పాఠకులకు అవి అందుబాటులో ఉండే ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే జాలంలో ఈబుక్‌గా దేశవిదేశాలలో అవిష్కరణ సమయానికి వెలువడేటట్టుగా ఏర్పాట్లు చేసుకున్నాడు.  అంతర్జాలంలో అంటే ఆన్‌లైనులో  సాహిత్యానికి, తెలుగు భాషకి, తెలుగుకి సంబంధించిన దాదాపు ప్రతి సమూహంలోను తన పుస్తక ఆవిష్కరణ గురించి పదిమందికి తెలిసేటట్టు ముఖపత్రాల రూపురేఖలు, రంగులు, అక్షరాల ఎంపిక  దగ్గిరనుండి ప్రచారం చేసాడు.

పది పత్రికల కార్యాలయా మెట్లు, లిప్ట్‌లు ఎక్కాడు.  తెలిసిన పదిమంది పాత్రికేయ మిత్రులని తన పుస్తకం గురించి సమీక్షో, పరిచయమో, స్వీకారమో, కనీసం ఒక వాక్యమో, ఏదో ఒకటి వ్రాయమని అడగడమో, బతిమాలడమో చేస్తూ తలా రెండు ప్రతులు అందించాడు. తెలియని వారిని పరిచయం చేసుకుని వారి చేతికి తన ప్రతిని అందించి సవినయంగా మరీ అడిగాడు.

నిర్మొహమాటంగా, నిస్సిగ్గుగా తనకు తెలిసిన బ్లాగర్లని, జాలపత్రికల సంపాదకులని, తోటి రచయితలని అందరిని తన పుస్తకం గురించి తమ పత్రికలలో, బ్లాగులలో, పేజిలలో, కాలంలలో, వెబ్‌సైటులలో వెబ్‌జైనలలో వ్రాయమని అడిగాడు.

ముందే నిర్ణయించుకున్న ఒకానొక సాయంత్రాన ఆవిష్కరణ సభ కావించాడు. సభ పేలింది. అమ్మకానికి ఆవిష్కరణ సభలోనే కొన్ని ప్రతులని అందుబాటులో ఉంచాడు.  అమ్మినవి అమ్మగా..ఉచితంగా ఇచ్చినవి కూడ ఉన్నవి.  (నాకు ఇంకా ప్రతి ఇంకా అందిలేదు. పైగా నేను ఆ ఆవిష్కరణ సభలో పాల్గొనలేదు. అది వేరే విషయం). ఇంత వివరంగా మీకు ఎందుకు తెలియజేయవలసి వచ్చినదంటే..దమ్ముంటే నా పుస్తకం అమ్ముడవుతుంది అని అనుకోరాదని.  ఆ రోజులు చెల్లిపోయినవని మీకు తెలియజేయడానికే.  బంగారు పళ్ళేనికైనా గోడ చేర్పు కావాలి!

పొద్దున లేచినప్పటినుంచి ఫోను‌లో ఎస్ ఎమ్ ఎస్‌లు, దినపత్రికలు తెరిస్తే వార్తల సంగతి తరువాత, ముందు ప్రకటనలు.  దిన పత్రికల వారు సొమ్ము పుచ్చుకుని వేసే ప్రకటనల మధ్య మళ్ళీ లీఫ్‌లెట్లు, కరపత్రాలు.  ఇంటి గేటుకి ప్లేటులు, కారు బంపర్ మీద స్టికరు, బైకు నెంబరు ప్లేటు మీద ప్రకటన, బస్సు సీటు మీద ప్రకటన, రహాదారికి అటూ, ఇటూ హోర్డింగులు. ఇది గాక స్కూలు ఫీజులు, ఫేర్‌వెల్ పార్టి చందాలు, హాస్పిటల్ బిల్లులు,  కట్టవలసిన కిస్తీలు, ఈఎమ్‌ఐలూ ఇలా సవాలక్ష సమస్యలు ఈ జీవికి.  వీటన్నింటి మధ్య మీ పుస్తకం కనపడాలి.  కుదిరే పనేనా?

అందుకనే అనేది ఇందాక చెప్పానే ఈ నవశకం యువ రచయిత చేసిన పనులన్ని చెయ్యాలి!  నా పుస్తకం దమ్ముంది అనుకుంటే చాలదు.  దమ్ముంది అని ఆ చదువరికి చెప్పాలి.  ఉన్నది లేనిది పాఠకుడు నిర్ణయిస్తాడు.

కాబట్టి ఓ రచయితా, నీ డబ్బుతో ప్రచురించుకున్న నీ పుస్తకం పదిమందికి అందాలంటే ముందు దానిని గురించి వారికి తెలియజేయి.  అంతేగాని ఉచితంగా ఇచ్చేయ్యకు.  అదేదో సామెతుంది.  ఉచితంగా వస్తే ఫినాయిలు కూడా తాగే మనుషులుంటారని!

అన్వర్ కి ధాంక్స్‌తో..

ఆదివారం.  మార్చ్ 2, 2014. మళ్ళీ SMS.  ఆర్టిస్ట్ మోహన్ గారి పిలుపు.  మనవాళ్లందరూ వస్తున్నారు.  మీరు కూడా రావాలి.  మన శేఖర్ కి మనం చెయ్యాలి! సందర్భం శేఖర్ కార్టూనిస్ట్‌గా గోల్డెన్ జూబిలి సెలబ్రేషన్.

శేఖర్ కార్టూనిస్ట్ గా నే పరిచయం అయ్యాడు  ఆంధ్రజ్యోతి లో.  కె.పి డెస్క్ పక్కనే.  కె.పి ని దాటుకుని శేఖర్ డెస్క్‌కి వెళ్ళాలి.  ఆ పక్కనే వసంతలక్ష్మి గారి డెస్క్.

కినిగె కి తన కార్టూన్ పుస్తకాన్ని ఇచ్చిన తొలి కార్టూనిస్టు శేఖర్.  అదొక అభిమానం.  తరువాత ఎప్పుడో ఒకసారి నా మీద కోపగించుకున్నాడు కూడా!  “నాకు మీరు పిచ్చేశ్వరరావు గారి అబ్బాయని ఎందుకు చెప్పలేదు.  ఆయనంటే మా తరానికి ఎంత ఇష్టమో, మీకు తెలియదు. అటువంటి వాళ్ళు అంత త్వరగా వెళ్ళిపోవాడనికి హడావుడి ఏమిటో?” అనుకున్నడు స్వగతంగా.

అమెరికా సంయుక్త రాష్ట్రాలకి వెళ్లబోయేముందు, వెళ్ళి వచ్చిన తరువాత తన పుస్తకాన్ని డిజిటల్ బుక్‌గా ఎలా డిజైన్‌చేస్తే బాగుంటుందో అని కలిసినప్పుడు మాట్లాడుకునేవాళ్ళం.  కలవనప్పుడు ఫోన్ చేసేవాడు.  ఫోనులో “తింటున్నాన్నా?” అని అడిగి నవ్వేవాడు.

“సార్, మీ ఇంటికి దగ్గిర్లోకి మారుతున్నాను. మనం ఇక రోజు కలుసుకోవచ్చు.  బహుశ నేనే మీ ఇంటికి వస్తాను.  కలిసి టీ తాగోచ్చు,” అని ఎంతో సంతోషంగా నవ్వుతూ చెప్పినప్పుడు ఆనందమేసింది.

తరువాత ఎప్పుడో తెలిసింది..ఆరోగ్యం బాగోలేదని.  ఇంటికి వెళ్ళి పలకరించాలని అనుకునేటప్పడికి ఇల్లు మారడం కూడా ఐపోయింది.

Cartoonist Chandrasekher
Cartoonist Chandrasekher (Jul 16, 1965 – 19 May 2014)

ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ ‌క్లబ్‌లో అతని కోసం చూసాను.  కొంచెం ఆలస్యం అయ్యింది నేను వెళ్ళేటప్పటికి.  మనిషి కనబడలేదు.  వెతుకున్నాను.  కాప్..నోటికి మాస్క్ అడ్డం ఉంది.  ఆ మాస్క్ పైన కళ్ళు. నవ్వు.  ఉగ్గబట్టుకున్న ఆనందం.  సంతోషం.  ప్రెస్‌క్లబ్ నిండిపోయింది.  కాని మనిషిని చూసిన నేను ఖంగు తిన్నాను.  నాకు తెలిసిన శేఖర్ రూపు కాదది.  మనిషి మొఖంలో విపరీతమైన అలసట. సగం అయిపొయ్యాడు.  ఎందుకో ఉండబుద్ది కాలేదక్కడ.  తనతో మాట్లాడడానికి తగిన ప్రదేశమూ కాదు..సందర్భమూ కాదు.  ఈ లోపు ఒకటికి రెండు సార్లు ఫోను చేసిన అన్వర్, sms లు గుప్పించిన ఇతర మిత్రులని పలకరించాను.

హడావుడిగా పరిచయుస్థుడొకాయన వచ్చాడు.  పక్కనే శ్రీమతి అనుకుంటాను.  పేద్ద పూలమాల.  ఒక పుష్ఫగుచ్చం.  హడావుడి హడావుడిగా వేదిక దగ్గిరకు దాదాపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపొయ్యారు.  ఆఖరి చూపు.  పార్ధివ శరీరాన్ని పుష్పమాలంకృతాన్ని చెయ్యాలన్న తాపత్రయం కనపడింది ఆ వేగంలో, ఆ మాటల్లో, ఆ గమనంలో.  విరక్తి పుట్టింది.

విజయవాడలో “మో” హాస్పిటల్‌లో ఉంటే..”సార్,  ఐపోయ్యిందా?  డిక్లేర్ చేసేద్దామా”?   అని స్ట్రింగర్స్ శ్రీ శ్రీ విశ్వేశ్వరావు గారిని పీక్కు తిన్న వైనం గుర్తోచ్చింది.  మనసు రోసింది. అసహ్యం వేసింది. రోత పుట్టింది.

వెళ్ళిపోదామని వెనక్కి తిరుగుతుంటే..అన్వర్ ఎదురువచ్చాడు.  “సార్, వెళ్ళిపోతున్నారా?” అంటూ. ఔనన్నట్టుగా తలూపూతూ గేటు వైపుకి కదులుతుంటే..”వుండండి సార్..రెండు మాటలు మాట్లాడి వెళ్లండి”  అని అన్నాడు.  వాళ్ళ మధ్య నేనేమి మాట్లాడుతాను అనుకుంటూ నిలబడిపొయ్యాను.  “ఉండండి సార్.  ఒక్క రెండు మాటలు మాట్లాడండి.  తనుకూడా వింటాడు కదా?”అని అన్నాడు. ఇక ఆ మాటకు తిరుగులేదు.  సరే అని ఆగి పొయ్యాను.

ఈ లోపు మాట్లాడేవాళ్ళున్నారు.  వాళ్ళ తరువాత..అన్వర్ నాకు మైకు ఇప్పించాడు.  శేఖర్ వెనకకి చేరుకున్నాను.  శేఖర్ భుజం మీద చెయ్యి వేసాను.  శేఖర్ నా ముఖంలోకి చూసాడు.  మా ఇద్దరి కళ్ళు కలిసినవి.  He knows.  He knew, I knew. He also knew that my heart is with him. I wished him all the best with all my heart.  I expressed my good wishes to all his frineds for supporting him at that time. లేచి నిలబడ్డాడు.  కౌగలించుకున్నాడు.  That was the parting embrace. I knew.

మైక్ ఆర్టిస్టు మోహన్ గారికిచ్చాను.  అన్వర్ కి థాంక్స్ చెప్పాను.  వచ్చేసాను.

మా అమ్మ పోయినప్పుడు చలసాని ప్రసాదరావు గారు రాలేదు.  దానికి ఆయన చెప్పిన కారణం.  “నాకు మీ అమ్మ చక్కగా సంతోషం గా నవ్వుతూ ఉన్నప్పుడు చూసిన జ్ఞాపకం.  నాకు అదే గుర్తుంచుకోవాలని ఉంది” అని.
చంద్రశేఖర్ విషయం లో నాది అదే ఉద్దేశం. అందుకే కొడుకు పెళ్ళికి వెళ్ళలేక పొయ్యాను.  ఈ రోజు వెళ్ళడం లేదు.  ఫోటో కూడ తను నవ్వుతున్నదే పెట్టాను.

ఆ రోజున అన్వర్ నన్ను గుర్తుపెట్టుకుని పిలవకపొతే..నాకు శేఖర్ చిరు దరహసం అందేది కాదు.

గుడ్‌బై శేఖర్.  You are a good friend.  I shall remember your smile.  Always.

ఇది వ్యాపారం కాదు.  నేను ఇప్పుడు కినిగె లో లేను కూడా!  శేఖర్ పుస్తకాలు ఇవి కొన్ని అని చెప్పడానికి మాత్రమే:  http://kinige.com/author/Shekar

ప్రశ్న

పోయిన సంవత్సరం అంటే 2013 లో ఒక పెద్ద రచయిత (“మాకు తెలియకుండా ఎప్పుడు పెద్దవాడైపొయ్యాడు” అని ఒక మరో పెద్దాయన సభాముఖంగానే అడిగాడు అనుకొండి, అది వేరే విషయం!) నన్నో ప్రశ్న అడిగాడు.

Open Smile
How do you like my dentures> 😉

“సార్, మీరేప్పుడు ఇలా అందరితోను నవ్వుతూ, ఫ్రెండ్లిగానే ఉంటారా?” అని. వ్యంగంగా అన్నాడో, వెట ‘కారం’ గా అడిగాడో, స్నేహంగా అనేసాడో, నవ్వు పులుముకుని అడిగాడో నేనైతే అర్ధాలు, కారాలు, మిరియాలు వెతుక్కోలేదు.

కాని నా జవాబు మాత్రం, “నాకు మరో విధంగా ఉండటం చేతకాదు” అని.  ఈ ప్రస్థావన ఇప్పుడెండుకంటారా..ఎందుకో గుర్తు వచ్చింది..అద్దంలో నా దంతాలు చూసుకుంటూఉంటే..the last smile is always mine.

btw how do you like my teeth?  😉

కుక్క బిస్కత్తులు

కుక్క బిస్కత్తులు కుక్కలు తింటాయ్.
యజమాని బిస్కత్తులు ఎప్పుడు విసురుతాడా అని ఎదురుచూస్తూ ఉంటాయ్.
అచ్చం మనుషుల్లాగానే, నక్కలు, తోడేళ్ళు కూడా ఉంటాయి, కుక్కల్లాగా తింటాయి!
కాని సింహం అలా కాదు.
ఎవరో వొచ్చి పెడతారని ఎదురు చూడదు.
ఆకలి వేస్తేనే వేటాడుతుంది.
ఆకలి వేసినప్పుడు సింహాం పంజా విసురుతుంది.
మెడని విరిచి, చంపి తాపీగా తింటుంది.
తను తినగా మిగిలితే వదిలేస్తుంది.
కడుపునిండినా  కుక్కుకుంటూ కూర్చుని తినదు.
నక్కలకి తోడేళ్ళకి, రాబందులకి, డేగలకి ఇతర ప్రాణకోటికి వదిలేస్తుంది.
కుక్కలాగా మనిషి కాళ్ల దగ్గిర కూర్చుని దేబిరిస్తూ ఉండదు, సింహం.
సింహం మృగరాజు.  రారాజు.
ఏనుగులాగా చచ్చినా బ్రతికిఉన్నా దాని విలువ దానిదే!
జీవించినంత కాలం సింహం లా జీవించాలి!

బాలూ..వెండితెర మీద మరో కోకిల

నాకు గుర్తున్న బాలు మహేంద్ర ఈ క్రింది బొమ్మలో ఉన్నట్టు ఉండేవాడు.అప్పటికే మూండ్రాం పిరై విడుదలై పోయింది.  సఫైర్ కాంప్లెక్స్ లోని ఎమరాల్డ్ లో చూసాను ఆ సినిమాని.  సెకండ్ షో.  తరువాత సత్యం ధియేటర్స్‌లో చూసాను.  శివం లో అనుకుంటాను. తెలుగు సినిమాలలో కెమరా ఒకటి ఉంది, దానితో సినిమాని మనకి చూపించేవాడు కెమరమెన్ అని తెలియజేసిన అద్బుతమైన కెమరామెన్ వి ఎస్ ఆర్ స్వామి అని అనుకునేవాళ్లం నేను నా స్నేహితులం.  అలాగే తమిళ సినిమాలకి బాలు.

Balu Mahendra, the cinematographer
Balu Mahendra, the cinematographer

కూర్చుని ఏదో చదువుకుంటున్నాను.  నీడ, తరువాత అలికిడి.  చదువుతున్న పుస్తకంలోనుండి తలెత్తి చూస్తే పొడుగ్గా  ..నాకంటే ఎత్తు.. అదిగో ఆ బొమ్మలో లాగా ఆలివ్ గ్రీన్ కాప్ తో బాలు.  నవ్వుతూ.  మామూలుగా సినిమా రంగం వాళ్ళతో వాళ్ల సినిమా గురించి పబ్లిక్ గా ప్రస్తావించేవాడిని కాదు.  ఆ రోజున మేమిద్దరమే ఉన్నాం.  “మూండ్రాం పిరై బాగుంది.  మీ కెమరా అద్భుతం”, అని అన్నాను.  చిరునవ్వు తో సమాధానమిచ్చాడాయన.  “నేను కూడా చాలా హాపి.  అందరికి నచ్చింది.  నాకూ నచ్చింది” అన్నాడాయన. తెలుగులో అదే “వసంత కోకిల” గా విడుదలైనది.

One of the best films of Balu Mahendra.
One of the best films of Balu Mahendra.

ఒక రెండు నిముషాలు అవి ఇవి మాట్లాడుకున్న తరువాత.. “తెలుగు లో గొప్ప సాహిత్యం ఉందంట కదా?  ఏమైన మంచి పుస్తకాలు సజెస్ట్ చెయ్యండి అన్నాడాయన.  “మీకు తెలుగు చదవడం వచ్చా?” అని ఆశ్చర్యంగా అడిగాను.  “ఏం తెలుగు చదవడం నాకు రాకపోతే ఏం?  ఎవరితోనైనా చదివించుకుంటానుగా!”  అని అన్నాడాయన”.

అలా తెలుగు సాహిత్యం తో ఆయనకి పరిచయం.  తెలుగు సాహిత్యం ద్వారా నాకు పరిచయం.  ఆయన సినిమాలు అన్ని చూసాను.  గొప్ప కెమెరామెన్.  నిన్న #pepperspray కథ లేకుండా ఉంటే..బహుశ మన మిడియా వాళ్ళూ ఆయన క్లిప్‌లతో మోత మోగించేవారనుకుంటా!

ఏమైనా మరో మంచి కళాకారుడు వెళ్ళిపొయ్యాడు.

పాఠకుడే రారాజు

కా రా మాస్టారు ని అడిగాను, “చదవగలుగుతున్నారా?” అని. “ఇబ్బందిగానే ఉంది.  ఇదివరకటిలాగా ఏకధాటిగా చదవలేక పోతున్నాను.  ఐనా మధ్య మధ్య ఆపి కళ్ళకి కాస్త విశ్రాంతినిస్తూ చదువుతూనే ఉన్నాను. చదవకపోతే ఎలా? ఊపిరి ఆడదుగా?! మీకు తెలియందేముంది ?” అని అన్నారు.  అప్పటికి వారికి సుమారు 86 ఏళ్ళు అనుకుంటాను.  ఐనా చిన్న స్టూలు లాక్కుని దానిమీద కెక్కి నిలబడి, అటక మీదున్న కొన్ని పుస్తకాలని అందుకుని, దిగి తీసుకువచ్చి మీరు చదవాలని నాకు అందజేసారు.  చదవడం మీద ప్రేమ అది.

“అదిగో, దానితో చదువుతున్నాను” అంటూ టేబుల్ మీదున్న భూతద్దాన్ని చూపించారు త్రిపుర, అదే ప్రశ్నని వారిని అడిగినప్పుడు.    అది చూసినప్పుడు, “సమగ్ర ఆంధ్ర సాహిత్యం” కోసం భూతద్దం తో కుస్తీపడుతున్న  ఆరుద్ర గుర్తు వచ్చారు.  “చెక్కుల మీద సంతకాలు పెట్టగలుగుతున్నారా?” అని అడిగాను.  “నా కోడి కెలుకుడిని మా బాంక్ వాళ్ళు సంతకం క్రిందే భావిస్తున్నారు.  ఐ యాం థాంక్‌ఫుల్ టు దెం” అని అన్నారు త్రిపుర నవ్వుతూ. చదవకుండా, రాయకుండా ఎలా ఉండగలరు ఎవరైనా అన్నది వారి ప్రశ్న. చదవడం మీద ప్రేమ అది.

“నేను బయటకు వెళ్లడం తగ్గింది.  కాని మీ బోటి మిత్రులు,  నాకు పుస్తకాలని అందజేస్తున్నారు.  ఇంకా చదవగలుగుతున్నాను.  మనకి అంతకంటే కావాల్సిందేముంది” అన్నారు పెద్దిభొట్ల గారు. చదవడం మీద ప్రేమ అది.”స్క్రిఫ్ట్‌ని స్కాన్ చేసి పంపిస్తున్నాను.  నా దస్తూరి కాని నేను వాడిన పదం కాని అర్ధం కాక పొరబాటున మరో పదం కంపోజ్ చేసే సందర్భాలు వచ్చేస్తున్నవి.  ఇక నా రచనలని నేనే తెలుగులో టైప్ చేసుకోవడం   తప్పదు.  మనకి తెలిసిందే రాయడం, చదవడం!  అవి రెండూ లేకపోతే పిచ్చెక్కిపోదు? ” అని అన్నారు అశేష ఆంద్రపాఠకుల అభిమాన రచయిత , షాడో సృష్టికర్త మధుబాబు. చదవడం మీద ప్రేమ అది.

“ప్రతిరోజు నెట్ ని ఎప్పుడో ఒకప్పుడు చూస్తూనే ఉంటాను.  కంప్యూటర్ మీద, నా రచనలన్నింటిని నేనే టైప్ చేసుకుంటాను   నాకు ఇబ్బంది ఏమి లేదు.  ఇంటర్నెట్‌ లో చదువుకుంటాను కూడా”, అని అన్నారు మొన్న “పెద్ధిభొట్ల సాహితీ పురస్కారం” అందుకున్న రచయిత్రి సత్యవతి పోచిరాజు.  చదవడం మీద ప్రేమ అది.

“టాంక్ బండ్ మీద వెళ్తున్నప్పుడు వచ్చింది..ఒక ఫ్లాష్ లాంటి ఆలోచన.  బండి అపేసి, పక్కనే లాన్‌లో కూర్చుని లాప్‌టాప్ మీద అప్పటికప్పుడు వ్రాసిన కధ “వర్డ్ కాన్సర్‌” అని తెలియజేసిన పాత్రికేయురాలు – వర్ధమాన రచయిత్రి అరుణ పప్పు. వ్రాయడం, చదవడం మీద ప్రేమ అది.

తెలుగు ఆచార్యులు. మల్లీశ్వరి గారు ఆన్‌లైన్‌లో వ్రాసుకున్న బ్లాగులను ఏర్చి కూర్చి “జాజిమల్లి” బ్లాగు కథలు గా ప్రచురించింది పర్‌స్పెక్టివ్ ప్రచురణ సంస్థ.

ఆ మధ్య ఒక పుస్తక ఆవిష్కరణ సభకి హైద్రాబాదు నుండి సకాలంలో అచ్చు పుస్తకాలు అమెరికాలో  అందకపోతే,  “ప్రింట్ ఆన్ డిమాండ్”  సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడే తెలుగు పుస్తకాలన్ని అచ్చొంతించి ఆ ఆవిష్కరణ సభని నిర్విఘ్నంగా, విజయవంతంగా నిర్వహించుకున్నారు.

కేంద్ర సాహిత్య అకాడెమి లాంటి ప్రచురణ సంస్థలు కూడా ఈ నాడు రచయితలు తమకు పంపే రచనలను సాఫ్ట్‌కాపీలుగానే పంపమని కోరుతున్నవని గమనించాలి.

ఈ రోజు అదిలాబాదు లో తను రాసిన రచన ని ఆన్‌లైన్‌లో తన లాప్‌టాప్‌నుండే  ఈపబ్లిష్ చేసుకుంటున్నాడు తెలుగు రచయిత.

అది ఈ రోజు రచనా వ్యాసంగంలో ఉన్న తెలుగు రచయితలు, వారి రచనలు, ప్రచురణల పరిస్థితి.
Logo of Rani Book Centre - courtesy Chalasani Prasada Rao - Eenaduఒకప్పుడు హైద్రాబాదులోని కోఠీలోనో, కాచీగూడాలోనో, వైజాగు గుప్తా బ్రదర్స్‌లోనో, విజయవాడ ఏలూరు రోడ్డులోని నవోదయలో నో, మద్రాసు పాండి బజారులోని రాణి బుక్ సెంటర్‌ లోనో, తెలుగు పుస్తకాలు కొనుక్కుని, మద్రాసు ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్టు నుంచి వెళ్ళే వారు ప్రవాసాంధ్ర పాఠకులు.   కాని ఇప్పటి పరిస్థితి వేరు.

ఇల్లినాయ్‌లో ఉంటున్న అన్నయ్య, అదిలాబాదులో తన తమ్ముడికి కావల్సిన పుస్తకాన్ని ఆన్‌లైన్‌లో ఈబుక్ రూపంలో కొని ఈమైల్ ద్వారా పంపిస్తే  దానిని డవు‌న్‌లోడ్ చేసుకుని చదువుకుంటున్నాడు ఆ విద్యార్ధి.  ఫ్రాన్స్ లో తెలుగు పదాన్ని ఉపయోగించడంలో సంధిగ్ధం ఎదురైతే ఆన్‌లైన్ లో ఆంధ్రబారతికి వెళ్ళి అర్ధం తెలుసుకుంటున్నాడు తెలుగు భాషాభిమాని.

ఇంటర్నెట్ పుణ్యామా అని పుస్తకాలకోసం ఇది వరకటిలాగా గంటల సేపు ప్రయాణాలు, రోజుల తరబడి  విలువైన సమయాన్ని  వెచ్చించి వెతుక్కోవడం తగ్గింది.  ఆన్‌లైన్ లో ఈబుక్స్ మాత్రమే కాదు, అచ్చు పుస్తకాలు కూడా కొనుక్కోవచ్చు, బంగారం, బస్సు, టికెట్లు లాగా.  కొనుక్కోవడమే కాదు, అద్దెకి కూడా తీసుకోవచ్చు.  ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల మీద దాడికి అమెరికా ఉపయోగించిన “డ్రోన్‌‌” ల గురించి మీకు తెలిసే ఉంటుంది.  ఆ సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్న నవతరం “డ్రోన్‌” తో పాఠకుడు కోరుకున్న అచ్చు పుస్తకాన్ని అతని ఇంటికే అతి తక్కువ ఖర్చుతో  అందే ఏర్పాట్లు చక చకా సాగుతున్నవి.

మనవడితో మాట్లాడుకోవడానికి బామ్మ “టాబ్‌లెట్” తో కుస్తీ పడుతోంది.  మనవరాలికి తెలుగు నేర్పడానికి “స్మార్ట్‌ఫోన్” ఆప్స్‌ని ఆశ్రయిస్తున్నాడు తాత గారు.  సీరియల్స్ వచ్చి తెలుగు పుస్తకాలని పక్కకి నెట్టేసింది అనడం ఫాషన్ అయి’పోయింది‌’.

ఈ రోజున సాంకేతిక ప్రగతి విద్యుత్‌స్థంభాల చెయ్యి పట్టుకుని గ్రామాలలోకి వ్యాపిస్తున్నది.  లేని చోట మొబైల్ టెలిఫోని వాడుకుంటున్నది.  ఇంటర్నెట్, మొబైల్ టెలిఫోన్, టెలివిజన్ పరస్పర కరచాలనం చేసుకుంటూ నేటి పాఠకుడికి, ‘చదువు‌’ ని ఒక అద్బుతమైన దృష్టికోణం నుండి ఆవిష్కరించి చూపుతున్నది.  అచ్చు, దృశ్య, శ్రవణ మాధ్యమాల అనుసంధానం ద్వారా ఒక “ఇమ్మెర్స్‌వ్ రీడింగ్” ని పాఠకుడి అనుభవంలోకి తెస్తున్నది నేటి చదువు.వేనవేల ఘనపు చదరపు అడుగులలో నిర్మించిన పుస్తక భాండాగారాలలోని లక్షల పుస్తకాలని ఈ రోజ పాఠకుడుకి తన డెస్క్‌టాప్ కంప్యూటర్ లో, లాప్‌టాపు, టాబ్లెట్, ఈబుక్‌రీడర్, స్మార్ట్‌పోన్ ద్వారా కాక అంతర్జాల విహరిణి (ఇంటర్నెట్ బ్రౌజర్) ద్వారా చదువుకునే వీలు కలిపిస్తున్నది ఈ ఆధునిక విజ్ఞానం.  ఈ సాంకేతిక పరికరాలు అభివృద్దిచెందిన పాశ్చ్యాత దేశాలలోనే ఉందన్న భ్రమ వద్దు.  ఇది మన తెలుగు పాఠకుడికికూడా అందుబాటులో ఈ రోజున వుంది.  వాటి రూపమే నేటి మన వెబ్‌జైన్ (వెబ్+(మాగ) జైన్)లు.  అక్షరాలతో స్క్రోలింగ్ వార్తలతో పాటు, టెలివిజన్ క్లిప్పులను ప్రదర్శిస్తున్నవి నేటి వార్తాపత్రికల జాలగూళ్ళు (వెబ్‌సైట్లు).ఈ రోజున సగటు తెలుగు పాఠకుడికి విస్తారమైన తెలుగు సాహిత్య సంపద అతని అరచేతిలొ పెడుతున్నది ఈ ఆధునిక విజ్ఞానం. పురాణాల నుంచి, ఇతిహాసలనుంచి నేటి తెలుగు హైకూల వరకు.  చదువుకున్న వాడికి చదువుకున్నంత మహదేవా అన్నట్టు!  ఐతే పాఠకుడు చదవడం కోసం వెచ్చించే వ్యవధిలోను మార్పులు వచ్చినవి.  వేయి పేజీల నవలలు చదివే సమయం అతనికి లేదు.  కాబట్టి నవల పరిమాణం ఇప్పుడు 200 లేదు 300 పేజిల పరిమాణానికి కుంచించుకుపోయింది.  నవలికలు పెరిగినవి.  కథలు పెరిగినవి.  స్వకీయ ప్రచురణలు కూడ ఎక్కువైనవి.
మొన్నటికి మొన్న తమ వైవాహిక జీవితం పాతిక వసంతాలు చూసిన సందర్భాన ఆ భార్య భర్తల రచయితల ద్వయం తమలో తామే ఒకరి పుస్తకాన్ని ఒకరికి ఆన్‌లైన్‌లో అంకితమిచ్చుకున్నారు!  వారే “అనామకుడు” రామశాస్త్రి, డా. గాయత్రీదేవి దంపతులు.  రచయితలు, పాఠకులు దగ్గిరవుతున్న సందర్భం ఇది.  పాఠకులు, రచయితల మధ్య గీత చిన్నదవుతున్న నేపధ్యం ఇది.  ప్రచురణకర్త, రచయిత మధ్య ఉన్న భేదం తగ్గిపోతున్న కాలం ఇది.

తెలుగు పాఠక ప్రపంచం దినదినాభివృద్ధి చెందుతున్నది.  అంది పుచ్చుకోవలసిన వారు, రచయితలు, ప్రచురణ కర్తలే!  వారిదే ఆలస్యం! పాఠకుడే రారాజు, ఈ రోజున!