బాలాంత్రపు – గోపీచంద్

Balantrapu Rajanikanta Rao

ఈ బాలాంత్రపు గోపీచంద్ ఎవరు?  
బాలాంత్రపు రజనీకాంతరావు గారంటే తెలుగువారిని తన లలిత సంగీతంతో అలరించినవాడు.  గేయకర్త.  స్వరకర్త.  ఇన్ని మాటలెందుకు, బహుముఖ ప్రజ్ఞాశాలి.  

Tripuareneni Gopichand
(8 September 1910 – 2 November 1962)

గోపీచంద్ అంటే సినిమాల్లో హీరో వేశాలేస్తుంటాడు. అతనేగా?  కాదు.  మరి?
ఈయన ఇంటిపేరు త్రిపురనేని.   కవి, సంఘసంస్కర్త, హేతువాది ‘కవిరాజు‘ బిరుదాంకితుడు, బార్-ఎట్‌-లా చదివినవాడు, త్రిపురనేని రామస్వామి కుమారుడు, ఈ త్రిపురనేని గోపీచంద్
తెలుగువారికి తొలి మనోవైజ్ఞానిక నవల అసమర్ధుని జీవయాత్ర  ని అందించి తెలుగు సాహిత్య చరిత్రలో అజరామరంగా నిలిచిపోయినవాడు.  చలన చిత్ర దర్శకుడు.  కొన్నింటికి కధలు కూడా అందించిన వాడు.  

మరి ఈ బాలంత్రపు వారికి, ఈ గోపిచంద్ కి ఏమిటి సంబంధం?  చలనచిత్రాలలో సంగీతం ఉంటుందిగా!  మరీ ముఖ్యంగా మన భారతీయ చలన చిత్రాలలో నృత్యాలు కూడా ఉంటాయికదా!  అలా…గోపీచంద్ కి బాలాంత్రపు వారికి సంబంధం ఉంది.  వారిద్దరు మిత్రులు.  గోపీచంద్ సినిమాలలో పాటలకి స్వరకర్త, బాలాంత్రపు.  

Balantrapu Rajanikanta Rao
బాలాంత్రపు రజనీకాంతరావు

 

వారిద్దరిమధ్య జరిగిన ఒక హాస్య సంఘటనే ఈ బ్లాగ్ పోస్ట్ కి నేపధ్యం.  బాలంత్రపు రజనీకాంతరావు గారి కుమారుడు హేమచంద్ర నాకు మంచి మిత్రుడు.  ఆ మధ్యేప్పుడో, ఫేస్ బుక్ లో తన తండ్రిగారికి, గోపీచంద్ కి మధ్య జరిగిన ఒక సున్నితమైన హాస్య సంఘటన గురించి తెలియజేసాడు.   రజనీకాంతరావు గారు మద్రాసులో మా అమ్మ స్థాపించి నిర్వహించిన రాణీ బుక్ సెంటర్ కి వచ్చిన గుర్తు నాకుంది.  ఆయనికి  గోపీచంద్ కి ఉన్న సాన్నిహిత్యం తెలిసి ఉండటం వల్ల వారివురి మధ్య జరిగిన ఆ హాస్య సంఘటనని తెలుగువారి సాంస్కృతక చరిత్రలో పొందుపరిస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను.  


Hemachandra Balantrapu
బాలాంత్రపు హేమచంద్ర

 సాక్షి దిన పత్రికలో  ప్రతి సోమవారం సాహిత్యానికంటూ ఒక పుటని కేటాయిస్తుంది.  అందులో మరమరాలు  మకుటంతో, సంగీత, సాహిత్యమనే కాకుండా ఇతర కళకారుల జీవితాలలోని ఆసక్తికరమైన సంఘటనలని ప్రచురించడం తెలుసు.  మొన్న గురువారం అంటే మే 8 న, హేమచంద్రతో కొన్ని చిన్న చిన్న సందేహాలుంటే తీర్చుకుని, ఈ కధనం ప్రచురించడానికి (వీలుంటే ఏదేని పత్రికలో) అనుమతి తీసుకుని, రాసి, శుక్రవారం మే 9న, సాక్షి దినపత్రిక కి పంపాను.  వాళ్ళు కూడా ప్రచురిస్తామని తెలియజేసారు. 



సాక్షి పత్రికకి పంపిన కధనానికి  నేను  కాలక్షేపం – బఠాణీలు అని పేరు పెట్టాను.  దానికి ఒక కారణం ఉంది.  దాసు వామనరావు గారనే హాస్య రచయిత ఒకాయన ఉండేవారు.  ఆయన ఆ రోజుల్లో ఒక కాలం రాసేవారు. దానిపేరు ‘కాలక్షేపం‘ అన్నట్టు గుర్తు. ఆయన్ని నేను గుర్తు  చేసుకున్నట్టూ ఉంటుందని ఆ పేరుతో  పంపాను.  (ప్రస్తుతం మద్రాసు, టీ. నగర్ లో దండపాణి వీధిలో ఉంటున్న ష్రైన్ వేలాంగణ్ణి సీనియర్ సెకండరీ స్కూల్, ఆ రోజుల్లో వామనరావు గారిదే!  )అంతే కాదు, హేమచంద్ర జ్ఞాపకాన్ని, నా మాటల్లో చెప్పానని కూడా సాక్షి వారికి తెలియజేసాను.  కాని ఏం లాభం!  రాసిన వారికే బైలైన్ క్రెడిట్ ఇవ్వటం వారి సాంప్రదాయమనుకుంటాను, అలానే చేసారు. 

ఇక కధలోకి వెళ్దాం!

రచయిత త్రిపురనేని గోపీచంద్ ‌– చదువుకున్న అమ్మాయిలు, ధర్మదేవత, ప్రియురాలు చిత్రాలకు కథ, మాటలు అందించారు; పేరంటాలు, లక్షమ్మ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. గాయకుడు, స్వరకర్త అయిన బాలాంత్రపు రజనీకాంతరావు, గోపీచంద్‌ మంచి స్నేహితులు. మద్రాసులో ఒకరోజు వీళ్ళిద్దరు కలిసి కారులో ప్రయాణం చేస్తున్నారు. గోపీచంద్‌ తీయబోతున్న చిత్రానికి బాలాంత్రపు గేయ రచన, సంగీత దర్శకత్వం వహించబోతున్నారు. ఒకానొక ఘట్టంలో కావల్సిన పాటకి కావాల్సిన మాటల కోసం ఆలోచనలో పడ్డారు గోపీచంద్‌. ఆ పాటకి సంగీతం గురించి ఆలోచిస్తున్న రజనీకి కాలుమీద దురద పుట్టి, పరధ్యానంగా గోక్కోవడం మొదలుపెట్టిన కాసేపటికి గాభరా పడుతూ, ‘‘నా కాలు స్పర్శ కోల్పోయింది. నేను గోక్కుంటుంటే తెలీటం లేదు. అర్జంటుగా డాక్టరు దగ్గరకి వెళ్ళి చూపించుకోవాలి’’ అన్నారు. తలతిప్పి ఆయన వంక చూసిన గోపీచంద్, ‘‘డాక్టరు, గీక్టరు అక్కర్లేదు. ఇందాకటి నుంచి మీరు గోక్కుంటున్నది మీ కాలు కాదు, నా కాలు’’ అన్నారు. దాంతో అసలు విషయం అర్థమై ఇద్దరు మిత్రులు పగలబడి నవ్వుకున్నారు.
అనిల్‌ అట్లూరి

సాక్షి సాహిత్యం పేజికి లంకె ఇక్కడ
ఇక ఆ సాహిత్యం పేజిలో కధనం జెపెగ్ ఈ దిగువునః

Sakshi LIterature page Gopichand and Balantrapu by Hemachandra and Anil Atluri
బాలాంత్రపు – గోపిచంద్ హాస్యం

ఎంజాయ్ చేసారా?  చి న

కవన శర్మ జ్ఞాపకాలతో…ఒక సాయంత్రం

KaVaNa Sarma

మొన్న (ఆదివారం, 4 నవంబరున, Hyderabad Study Circle లో )  జరిగిన కవన శర్మ జ్ఞాపకాల సభలో సాహితీ మిత్రులందించిన మూడు సందేశాలు వ్యవధి లేక జారిపొయ్యాయి.
ఒక నిర్వాహకుడిగా అది నా తప్పిదమే.  మిత్రులను క్షమాపణలు కోరుకుంటూ,  వాటిని ఇక్కడ అందరితో పంచుకుంటున్నాను.

రావు, వేమూరి – University of California, Davis విశ్రాంత ఆచార్యులు (అమెరికా)

Dr Vemuri Venkateswara Rao
ఆచార్య వేమూరి వెంకటేశ్వర రావు – అమెరికా

వేమూరి వెంకటేశ్వర రావు గారి సందేశంః
ఏనాటి మాటో! కవన శర్మ గారుట. బోస్టన్ నుండి ఫోనులో పిలచేరు – నేను తెలుగు భాషా పత్రికలో రాస్తూన్న వ్యాసాలు బావున్నాయని చెప్పడానికి. తరువాత పది సంవత్సరాల కాలం గడచిపోయింది. నేను హైదరాబాదు వచ్చేను. శర్మ గారు ఊళ్లో ఉన్నారని తెలసి పలకరించడానికి వెళ్లి పరిచయం చేసుకోబోయాను. “అయ్యో! మీరు తెలియకపోవడం ఏమిటి? కించిత్ భోగో కథ రాసింది మీరే కదూ?” అంటూ స్వాగతించేరు. తరువాత వైజాగులో వారింట్లో ఒక సారి కలుసుకున్నాను. నేను రాసిన మహాయానం కథల పుస్తకానికి అడిగిన వెంటనే ముందుమాట రాసి ఇచ్చారు. రెండేళ్ల క్రితం బెంగుళూరు శివార్లలో నేను ఉన్నానని తెలిసి ప్రత్యేకం నన్ను చూడడానికి వచ్చేరు. ఆయన్ని కలుసుకున్నది కేవలం మూడు సార్లు. ప్రతి సారి మా సమావేశం గంటకి మించలేదు. అయినా సరే, ఆయన నా మనస్సులో ఒక ముద్ర వేసుకుని కూర్చున్నారు. ఇటీవలి కాలంలో – ఆయన ఇక లేరని తెలిసిన తరువాత – ఫేస్ బుక్ ని తెరచి చూడబుద్ధి కావటం లేదు. కవన శర్మ గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ
— వేమూరి వేంకటేశ్వరరావు.


తులసీ జలంధర చంద్రమోహన్ – రచయిత్రి ( చెన్నై )
జలంధర గారు ఆడియో ఫైల్ పంపారు.  క్రింద ఆడియో ఫైల్ లో వారి
“కవన శర్మ గారికి పుష్పాంజలి” వినవచ్చు.

Smt Tulasi Jalandhara Chandramohan
శ్రీమతి తులసి జలంధర చంద్రమోహన్


K N Malleeswari
కె ఎన్ మల్లీశ్వరి – రచయిత్రి,, జాతీయ కార్యదర్శి – ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక.

గ్రీకువీరునికి వీడ్కోలు

కవనశర్మగారి గురించి నాలుగు మాటలు పంచుకోమని అనిల్ అడిగారు.

రచయితలుగా మన పరిచయంలో ఉన్నవారి గురించి మాట్లాడటం కొద్దిగా సులువు. సాహిత్య లోకానికి వారి తోడ్పాటుని మన అవగాహన లోనుంచి చెప్పవచ్చు. కానీ వారు మనకి వ్యక్తులుగా కూడా తెలిసినపుడు, వారి అభిమానాన్ని పొందిన స్నేహితులం అయినపుడు మాట్లాడటం కొద్దిగా కష్టం. వ్యక్తిగతం, సాహిత్యం కలగలిసిపోతాయి. విడదీసుకుని నిబ్బరంగా వ్యాఖ్యానించడానికి, వారి సాహిత్య కృషిని మదింపు చేయడానికి నాకైతే సాధ్యం కాదు. ఆమె ఇల్లు, విడాకులు చదివినపుడు స్త్రీల సమస్యల మీద ఆయనకి ఉన్న సహానుభూతికి సంతోషపడ్డాను. పరిధి చదివినపుడు అతిక్రమణల గురించి తెలుసుకున్నాను. రచన పత్రికలో సాహిత్య నిర్మాణ సూత్రాల గురించి రాసినపుడు ఆ దీర్ఘ వ్యాసానికి ఉన్న శాస్త్రీయ దృష్టికి ఆశ్చర్యపడ్డాను. వ్యంగ్య కవనాలకి నవ్వుకున్నాను.

నచ్చింది రాయడం తప్ప నచ్చనిదాని గురించి మాట్లాడను, మౌనమే విమర్శ అన్నపుడు అంగీకరించలేకపోయాను. ఏ రచనకైనా మానవ స్పర్శ అంటుకుని ఉండాలని చెప్పినపుడు ప్రేమించాను. రెండునెలల కిందట కలిసినపుడు, “ప్రత్యేకించి వైద్యం తీసుకోనని, రాబోయే వారికోసం చోటు ఖాళీ చేసేయాలని చెప్పినపుడు బాధతో వాదించాను. నిక్కచ్చితనాన్ని మృదువుగా చూపేపుడు అబ్బురపడ్డాను. సమయపాలనకి పెట్టింది పేరైన కవనశర్మ గారు, మొదటిసారి సమయం తప్పారు. 29 వ తారీఖున విశాఖ వెళ్లాలని, తన ఇంటిలోని నల్లబల్ల మీద రాసుకున్న ఆయన దానిని మర్చేపోయారు. విశాఖ వచ్చినపుడు మాట్లాడాల్సిన విషయాలున్నాయని రెండు మెయిల్స్ పెట్టారు. ఆయన నాతో ఏం మాట్లాడాలనుకున్నారో వివినమూర్తి గారికి తెలుసు, కుందుర్తి రజనికాంత్ గారికి తెలుసు. మీరు నాకు చెపితే కవనశర్మ గారు నాకు చెప్పేసినట్లే.
మల్లీశ్వరి కె ఎన్ – రచయిత్రి (విశాఖపట్నం)


కోరిన వెంటనే తమ తమ సందేశాలను పంపినందుకు శ్రీమతి తులసీ జలంధర చంద్రమోహన్, వేమూరి వెంకటేశ్వర రావు, కె.ఎన్ మల్లీశ్వరి గారలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, జరిగిన పొరబాటుకి మన్నించగలరని ఆశిస్తున్నాను.

అసిఫా! అసిఫా!

LT metro rail

ఆ మధ్య ఒక సాయంత్రం జుబిలీ హిల్స్‌, మహాప్రస్థానం లో ఎవరికో వీడ్కోలు పలికి వస్తుంటే, దారిలో ఆ పాప, తమ్ముడు, వాళ్ళ నాన్నతో కనిపించారు. చలాకిగా నవ్వుతూ, తుళ్ళుతూ, హుషారుగా, సంతోషంగా దాదాపుగా పరిగెడుతున్నారు. వాళ్ల వెనుక వాళ్ళ నాన్న అనుకుంటా, భుజం నుంచి వాటర్ బాటిల్ తగిలించుకుని వాళ్ళ అడుగులో అడుగు వేసుకుంటూ హాయిగా నవ్వుతూ వెళ్తున్నాడు. అమీర్ పేట మెట్రో స్టేషన్. నేను వాళ్లతో పాటే, స్టేషన్ వైపుకి అడుగేసాను. ఆ పాప ఎస్కలేటర్ ఎక్కడానికి సందేహిస్తూ ఆగి పోయింది. తమ్ముడు, ఒక గెంతు, గెంతి ఎస్కలేటర్ మీదికి చేరుకున్నాడు. అప్పుడు గమనించాను. వాళ్ళ తండ్రి, ఎడం చేతివైపు మెట్లమీద, మాకంటే ముందుండి తన పిల్లల్ని మొబైల్‌ కెమెర ఫోటోలతో జ్ఞాపకాలని దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని.

“ఫరవాలేదమ్మా, ముందుకొక అడుగెయ్యి, వెనక నేనున్నాగా!” అంటూ వెనక నుంచి నాకు అందుబాటులో ఉన్న పాప కుడి భుజం మీద తట్టాను. అప్పటిదాక నన్ను చూడని పాప వెనక్కి తిరిగి చూసింది. బిగుతుగా కట్టిన రెండు జడలు ఒక్కసారిగా వెనక్కి తిరిగాయి. చక్కగా నవ్వుతున్న పెద్ద కళ్ళు. వాళ్ళమ్మ కాటుకతో దిద్దిన కళ్ళు. వాటి మధ్య ఎర్రటి బొట్టు. అమాయకంగా నవ్వుతున్న పెదవులు! ఆ నవ్వు పాపకళ్ళలో కూడా జర్రున పాకింది! ఎంత అమాయకంగా, ఆనందంగా ఉందో! ఆ మొహం! గబుక్కున మరో పాప మొహం గుర్తోఛ్హింది!

తమ్ముడు ఎస్కలేటర్ మీద రెండు మెట్లు ముందుకు దూకాడు.
పాప ఎస్కలేటర్ మీదకి అడుగేసింది.
అవతల తండ్రి మెట్ల మీద మరో రెండడుగులేసి, రెండు మెట్లు దాటి వాటి పైకి చేరుకున్నాడు. ఫోటో తియ్యడానికి వాళ్ళూ, వీళ్లు అడ్డం వస్తున్నారు.

“నువ్వు దూకు ముందుకి. మెట్లెక్కినట్టు ఎక్కెయ్. ఏమి కాదు. నీ వెనక నేనున్నానుగా!” అంటుంటే విని, నేను భుజం తట్టేలోపు, ఒక మెట్టేక్కింది. మళ్ళీ మరొకటి. ఈ సారి రెండు. రైలింగ్‍ని పట్టుకుని వడివడిగా, హుషారుగా! అందరం పైకి చేరుకున్నారు. నేను పైకి వెళ్ళేటప్పడికి, పిల్లల్నిద్దర్ని ఒక వైపు నుంచో బెట్టి తండ్రి ఫోటోలు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. పశ్చిమాన దిగుతున్న సూర్యుడు, తండ్రి మొఖం మీద. అక్కడున్న సైన్‌బోర్డ్‌ నీడలో పిల్లలిద్దరు.

“Go, stand with them, I will help you with the pictures,” అని నేను ముందుకు వెళ్తే, ఆ తండ్రి “థాంక్ యూ సార్” అంటూ మొబైల్ ఫోన్ నాకందించాడు.

ఇప్పుడు సైన్‍బోర్డ్‌ నీడలో తండ్రి, పాప, తన తమ్ముడు. రెర్ కెమెరా లో వాళ్ల బొమ్మలు ప్రస్ఫుటంగా కనబడటం లేదు. వెలుతురు సరిపోవడం లేదు.  జూమ్ చేసాను. పాప జూమ్‍లో ఉంది. అమాయకంగా నవ్వుతున్న కళ్ళు. నవ్వుతున్న పెదాలు. గబుక్కున మరో పాప మొహం గుర్తోఛ్హింది.  కళ్ళు అలుక్కుపొయ్యాయి.

రెండో, మూడో టక టక మని క్లిక్ మనిపించాను. వాళ్ల ముగ్గురుని గ్రూప్ లోకి తీసుకుని మరో రెండో, మూడో క్లిక్ చేసాను. తరువాత, వాళ్ళ ముగ్గుర్ని దిగుతున్న సూర్యుడికి అభిముఖంగా, టికెట్ కౌంటర్స్ బాక్ డ్రాప్‍ తో తీస్తుంటే, తమ్ముడు పెదవులు బిగించి చూస్తున్నాడు. “Say cheese and smile,” అని అంటుంటే వాడు, వాడి అక్క #అసిఫా, వాళ్ల నాన్న నవ్వుతుంటే రాపిడ్‍గా మరో అయిదో, ఆరో క్లిక్ చేసాను.

“Say thanks to uncle,” ఆంటూ వాళ్ళ తండ్రి నేనందించిన తన మొబైల్ ని అందుకున్నాడు. పాప దగ్గిరకొఛ్హి, కుడి చెయ్య సాచి, “థాంక్స్ అంకుల్,” అంది. తమ్ముడు అక్కడే నిలబడి నా వంక చూస్తున్నాడు. “It’s OK”, అంటూ నేను వెను తిరిగాను.

ఆ పాపలో నాకు Asifa కనపడింది.  అప్పట్నించి నా చుట్టూ నాకు ప్రతి బాలికలోను అసిఫా కనబడుతోంది.

ఆ ఉగాది రోజున…

Bapu drawing

స్క్రిప్ట్ ఆర్ట్శ్ శాస్త్రిగారు ‘బాపు‘ బొమ్మలతో తెలుగువారి పండగలకి కొత్త శోభలిఛ్హిన రోజులవి.  ఉగాదికి, సంక్రాంతికి, వివాహాలకనేమిటి ప్రతి సందర్భానికి ఒక బాపు కార్డ్.  ఒక పాకెట్లో పది కార్డులు.  పది కవరులు వాటికి సరిపడా!  బొమ్మలాయనివి.  లోపల మాటలు.  బొమ్మకి తగినట్టుగా పదాలు. కొన్ని కావ్యాలలోనుంచి.  కొన్ని ఆరుద్ర లాంటి కవుల కలాలనుండి.

ఒకటి రెండూ కాదు.  కొంటే అదొక పాకెట్టు.  ఇదొక పాకెట్టు.  తలా ఒకటి అసార్టెడ్.  బావకి మరదలు.  చెల్లెలికి అన్నయ్య.  భార్యకి భర్త.  మామ్మకి మనవడు.  ఆఫ్రికాకి.  అట్లాంటాకి.  ఆస్ట్రేలియాకి. అబుదభికి.  గవర్నర్ గారేంటి.  సి ఎమ్ గారేంటి.  సినిమా తారలేంటి.  గుమస్తా ఏమిటి? ఎమ్ డి ఏవిటి?  ఒకడేవిటి?  ఒక నెలరోజుల ముందే కొనేసి రిజిస్టర్డ్ పోస్ట్‌లో పంపేవాళ్ళు కొందరు.  స్పీడ్‍పోస్ట్ లో పంపేవాళ్ళు కొందరు.

సర్కార్ ఎక్స్ ప్రెస్ ఎక్కి, బీచీ స్టేషన్‍లో దిగి, మద్రాసులో సి ఎ చదివేసి,  పనిలో పనిగా సినిమా తారలందర్ని ఒక లుక్కేసి మళ్ళీ ఏ హౌరా మెయిలో, కోరమాండలో ఎక్కేసే రోజులవి.
అలాంటి రోజుల్లో…

ఒక ఉగాది.

Bapu drawing
బాబు బొమ్మ నమస్కారం

పొద్దున్నే.
నీరసంగా వఛ్హారు ఇద్దరు కుర్రాళ్ళు.
బాపు గ్రీటింగ్స్ కావాలంటూ.  అన్ని అయిపోగా మిగిలిన వాటిల్లో నుంచి తలాఒకటి కార్డ్లు  తీసుకున్నారు.  ఆంధ్రపత్రిక వారి పంచాగం ఒకటి. నేమాని వారి పంచాంగం ఒకటి.  మొహాలు వేలాడేసుకుని చిల్లర ఇస్తున్నారు అమ్మకి.

“ఏంటయ్యా, పండగరోజు ఇలా నిరుత్సాహంగా ఉన్నారు?” అని అడిగింది అమ్మ.

“ఉగాది రోజండి.  ఎప్పుడు ఇల్లు వదిలి లేమండి. అమ్మ చేత్తో ఉగాది పఛ్హడి తినేవాళ్ళం.  ఈ సంవత్సరం ఆ గతి లేదు.  ఇక్కడెక్కడా ఉగాది పచ్చడి పెట్టేవాళ్ళెవరూ లేరు.  ఇంక ఇలా ఉండక ఎలా ఉంటామండి?” అని అన్నాడు అందులో ఒకడు చెమర్చిన కళ్ళతో.  ఏదో కంపెనిలో ఇంటర్నల్ ఆడిట్ కని వఛ్హారట.  పండక్కి ఇంటికి వెళ్ళడానికి  కుదర్లేదు.  “వెళ్ళొస్తామండి”  అని వాళ్ళు వెళ్లబోతుంటే  అమ్మ వాళ్ళని మాటల్లో దింపింది.  నేను కలగజేసుకున్నాను.  ఏలూరు వైపు వాళ్ళు.  అమ్మ వాళ్ళతో మాట్లాడుతూనే ఉంది.  మధ్యలో ఫోన్ చేసింది ఇంటికి.  నా భార్యకి ఏదో చెప్పింది.  నాతో ‘కరుప్పయ్య’ ని ఒక్కసారి వెంటనే ఇంటికి వెళ్ళి రమ్మనమని చెప్పు అంది.

కరుప్పయ్యన్ రిక్షాతను.  కొత్తగా అప్పట్లో రిక్షాలకి మోటర్లుండేవి.  పోస్టాఫిసు మూలమీద రిక్షా స్టాండ్.  అక్కడుంటాడు.  స్టాండ్ లోనే ఉన్నాడు.   “ఒకసారి అర్జెంటుగా ఇంటికి వెళ్ళిరా,” అని పంపాను.  ఇదిగో ఇక్కడున్నటు వస్తాను అని బుర్రు మని వెళ్ళాడు.  గట్టిగా నడిస్తే పది నిముషాలు పట్టదు ఇంటికి చేరుకోవడానికి.

పది నిముషాలలో వఛ్హాడు వెనక్కి.  చేతిలో చిన్న సంచి.  అందుకుని అమ్మకిచ్చాను.  సంచి తీసుకుని అమ్మలోపలికి వెళ్ళింది.  పుస్తకాల రాక్‍ల వెనుక కొంత ఖాళీ ఉంటుంది.  ఈ కుర్రాళ్ళ మూడు బాగోలేదుగా!  “వెళ్ళొస్తామండి” అని కుర్చిల్లో కూర్చున్నవారు లేచారు.  (అప్పట్లో ‘ఆంటి’ లు ‘అంకుల్స్’ లేరు.  అక్కయ్య గారు,  బాబయ్, పిన్ని గార్లే. ఎక్కువ.  లేదు “అండి”!)

“ఆగండాగండి,” ఆంటూ అమ్మ ముందుకు వఛ్హింది.  అమ్మ చేతిలో స్టీలు పళ్ళెం.  అందులో రెండు గిన్నెలు. గెన్నెలో స్పూన్.  ఆ రెండిట్లోను ఉగాది పఛ్హడి.

అవి చూడగానే  వాళ్ళ ముఖాలు విప్పారి ఇంతింతైనవి.  కళ్ళలో ఆనందం.  అమ్మ  వాళ్ళ అరిచేతిల్లోకి గిన్నెలో నుంచి స్పూన్ తో తీసి ఆ ఉగాది పచ్చడిని అందించింది.  లొట్టలేసుకుంటూ తినేసారు.  అందులో ఒకతను అరి చెయ్యి నాకేసుకున్నాడు.  బయటపెట్టిన బకెట్ నీళ్లతో చేతులు కడుకున్నారు ఇద్దరూ.  మాటల్లేవు.  పాంట్ జేబులోంచి హాంకిలు తీసుకుని మూతులు తుడుచుకున్నారు.  చేతులు తుడుచుకున్నారు.  ” తినండమ్మా ఇంకా కావాలంటే,” అని అమ్మ ఆ పళ్ళెం టేబుల్ మీద పెట్టింది, టేబుల్ వెనక్కి వెళ్ళి  కూచోబోతూ.

“ఉండండుండండి,” అంటూ అందులో ఒకరు  అమ్మ కాళ్ళమీదకి పడిపోయ్యి ” మా అమ్మ అంతటివారు, మిమ్మల్ని మరిచిపోలేమమ్మా, మమ్మల్ని ఆశీర్వదించండి” అని అపేశారు.  అందంతా అయిపోయింది.  వెళ్లలేక వెళ్ళారిద్దరూ!  కళ్ళు తుడుచుకుంటూ!

ఆ ఉగాది మొదలు ప్రతి ఉగాది రోజున అడిగిన వారికి ఉగాది పచ్చడి వడ్డించడం ఆనవాయితి అయిపోయింది రాణీ బుక్ సెంటర్ కి.  తరువాత తరువాత ‘రాణమ్మ’  చేతి ఉగాది పచ్చడి కోసమే పాండిబజారులోని రాణీ బుక్ సెంటర్ కి వచ్చేవారు కొంతమంది.  వాళ్ల ఇళ్ళల్లో చేసుకుని తిన్నా!

But today, it is a different story.  Neither is Rani Book Center there, nor my mother!  What an irony!  But that is life I guess.

అమ్మ   = చౌదరాణి
ఇక్కడ వాడిన బాపు బొమ్మకి హక్కుదార్లుః https://te.wikipedia.org/w/index.php?curid=78744

స్త్రీ వాదంతో ఓ సాయంత్రం!

Telugu author Volga at Vedika Literary Meet

స్త్రీ వాదంతో ఓ సాయంత్రం!

స్త్రీ వాదము, స్త్రీత్వము, స్త్రీ ఆలోచనా విధానము.. వీటి గురించి ఎన్నిసార్లు విన్నా, ఎంతమంది చెప్పినా, ఎంత చదివినా ఎప్పుడూ నాకు ఓ సరైన సమాధానం వచ్చేది కాదు. అసలు సమాధానమే వచ్చేది కాదా?

అంటే అలా అనేం లేదు. సమాధానమైతే వచ్చేది కానీ, నా వయసుకు, నా స్థాయికి సరిపడే ఆలోచనకు ఆ సమాధానాన్ని పోల్చుకుని చూసేప్పటికి అది ఎక్కడో తేలిపోయినట్లు కనిపించేది.

సరే, ఈ ప్రశ్నలా ఉండనీ, పూర్తి సమాధానం ఏదో ఒకరోజు దొరక్కపోదా అనుకుంటూనే నన్ను నేను అఫీషియల్‌గా ఫెమినిస్ట్‌నని ఎప్పుడో ప్రకటించుకున్నా. ప్రకటించుకోవడం వరకూ బాగానే ఉంది. నా ఆలోచనా
స్థాయిలో స్త్రీ వాదినని చెప్పుకోవడమూ బాగానే ఉంది. మరి పూర్తి సమాధానం ఎప్పుడు దొరకాలి? ఎలా దొరకాలి? ఉఫ్..

మోగిందండీ.. ‘నీకీ విషయం చెప్పడానికే వేదిక గ్రూపు ఓల్గా గారితో ఓ సమావేశం ఏర్పాటు చేసింద’న్న సమాచారంతో ఓ ఫోన్ కాల్.

13 ఫిబ్రవరి 2016. సరిగ్గా 5 అయిందప్పుడు (అంటే మన టైమ్ ప్రకారం నాలుగున్నరే అనుకుందాం!)

అప్పటికే వచ్చినవారంతా సమావేశం కోసం ఆసక్తి ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఆ రోజు సమావేశంలో సాహిత్యంతో తన ప్రయాణం గురించి చెప్పేందుకు ఓల్గా గారు సిద్ధంగా ఉన్నారు. నా మెదడులో ఒక్కటే
తిరుగుతోంది, సమాధానం దొరుకుతుంది కదా?

మెల్లిగా సమావేశం ప్రారంభమైంది. ఓల్గా గారు సాహిత్యంతో తన ప్రయాణాన్ని, తన సాహిత్య ప్రయాణాన్ని, స్త్రీ వాదాన్ని, స్త్రీ ఆలోచన విధానాన్ని లోతుగా ప్రస్తావిస్తూ వెళుతున్నా కొద్దీ, ఈ విషయంపై నాకు  కావాల్సిన సమాధానం కూడా దొరుకుతున్నట్లనిపించింది. ఇక్కడ ఆ ముందు మాటలు కొన్ని ఓల్గా స్వరంతోనే

కొన్ని పుటోలు ఇక్కడ.

చిన్నతనం నుంచే పుస్తకాలతో స్నేహం పెంచుకోవడం, కాలేజీ రోజుల్లో చిన్న చిన్న కవితలు రాయడం, సాహితీ వేత్తలను, రచయితలను కలుసుకోవడం, వాళ్ళ దగ్గర్నుంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, రాజకీయాలు, స్త్రీ ఆలోచనా, స్త్రీని సమాజం అర్థం చేసుకున్న విధానం, స్త్రీ వాదం అనే ఆలోచన, స్త్రీ వాదం అనే ఆలోచనను సమాజం అర్థం చేసుకున్న విధానం.. ఇలా ఓల్గా గారు ఒక్కో విషయాన్ని చెబుతూ పోతూ ఉంటే నీదనే ఆలోచన బలపడాలంటే నీదైన ప్రయాణం ఒకటి చేయాల్సి ఉంటుందని, ఆ ప్రయాణం మొదలుపెట్టడం దగ్గర్నుంచి, ఆ ప్రయాణం మనకు అర్థమయ్యే వరకూ ధైర్యంగా ముందుకెళ్ళడం ఒక్కటే మనముందున్న కర్తవ్యమని ఆమె మాటల్లో అర్థం అర్థమవుతూ పోయింది.

స్త్రీ వాదం అంటే ఏంటో అర్థమయ్యాక, దాన్ని తానుగా ఈ ప్రపంచానికి ఎలా అర్థమయ్యేలా చెప్పడానికి చేసిన రచనలే తన సాహిత్య ప్రయాణమని చెప్పినపుడు ఒక వ్యక్తి, ఒక వాదాన్ని అర్థం చేసుకొని, దానికోసమే శ్రమిస్తే ఎంతదూరం వెళ్ళగలరో ఓల్గా గారు నిరూపించి చూపినట్లనిపించింది.

“స్త్రీ వాదమంటే.. స్త్రీ తన శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచనను ప్రపంచానికి చెప్పడమే. స్త్రీ వాదమంటే స్త్రీ ధైర్యంగా తన సొంతంగా, తానుగా నిలబడి ముందుకెళ్ళడమన్న ఒక ఆలోచనే. అంతేకానీ, స్త్రీ వాదమంటే
పురుషుడిని ధ్వేషించడమో, మరోటో కాదు” అని స్త్రీ వాదానికి ఓల్గా గారిచ్చిన నిర్వచనం చాలా స్పష్టంగా అర్థమయ్యేలా ఉంది. స్త్రీ వాదంలో మళ్ళీ ఇంకా చాలా ఆలోచనలున్నాయని, వాటిని వేరు చేసి చూడడం అన్న ఆలోచనను పక్కనబెడితే, వాటి గురించి కూడా ఇంకా లోతైన చర్చ జరిగి ఒక అభిప్రాయం బలపడాల్సిన అవసరం ఉందని ఓల్గా గారు ఈ సందర్భంగా తన ఆలోచనను పంచుకున్నారు.

ఓల్గా గారి కథల సంపుటి ‘విముక్త‘కు కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడమనేది ఒక వాదాన్ని చెప్పడంతో పాటు, ఆ వాదాన్ని చెప్పడానికి ఎంచుకున్న ఒక సరైన సాహితీ ప్రక్రియ వల్లే సాధ్యమైందని భావిస్తున్నట్లు ఒక అభిప్రాయం వినిపించింది. దాంతో పాటు ఈ సాహితి ప్రక్రియలో మీదైనా ముద్రను తేవడానికి ఎలాంటి కృషి చేశారు? అన్న ప్రశ్నకు ఓల్గా గారు సమాధానమిస్తూ.. “ఒక వాదాన్ని చెప్పేందుకు ఎంచుకునే భాషలో కూడా ప్రయోగం, కొత్తదనం చూపాలి. అప్పుడే అందరికీ ఆ ఆలోచన చేరడంతో పాటు దానికి ఒక అర్థం వస్తుంది. నా వరకూ నేను నా భాష పరంగా ఎదగడం ఎప్పటికప్పుడు సాహిత్యంతో స్నేహం వల్లే సాధ్యమైంది” అన్నారు.

ఇలా చాలా ప్రశాంతంగా మొదలైన సమావేశం, అంతే ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రశాంత సమావేశానికి ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఓ అందాన్ని, అర్థాన్ని తెచ్చిపెట్టింది.

ఇలాంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన వేదికకు, ఆలంబనకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆలంబనలో చిన్నారులు నాకైతే తెగ నచ్చేశారు. గొడవ పడే స్థాయి చర్చలు జరిగినా, ఈ పిల్లలు నవ్వులు ఆ ఆలోచనను కూడా తేనివ్వవేమో అన్నంత అందంగా ఉన్నాయి.

రమణ మూర్తి గారు సమావేశం మొదలయ్యే ముందు The Story of an Hour అనే కథ గురించి ప్రస్తావించారు. ఆ కథను వీలైతే (వీలైతే కాదు, తప్పక) చదవండి.
ఈ నివేదిక ని అందించినవారు వర్ధమాన రచయిత – వి మల్లికార్జున్.

నీ సాహిత్యానికి అదే ఎక్కువ!

puraskar - felicitation - award

దాదాపు ఒక రెండు దశాబ్దాల క్రితం అనుకుందాం. పడవల్లాంటి కార్లు,  ఆరడగుల ఆజానుబాహువు, నుదుటి మీద ముంగుర్లు  సర్దుకుంటూ ఏ ఫెమినానో, డికెన్సు పుస్తకాన్ని చదువుకుంటున్న ఆమె, తో, ప్రేమ, ఆఖరి పేజిలో కధానాయిక కోరుకున్న ఆసుపత్రి ప్రారంభోత్సవం లాంటి ఆకాశంలో విహరించడానికి కావల్సిన అందమైన కలలతో వెలువడే నవలా శకం అది.
ShadowShadowByMadhuBaabuTulasidalamByYandamoori PracticalJokerByKommuriSambasivaRao secretaryByYaddanapudiSulochanaRani
ఒక ఒంటరి వాడు, ఒక యువతి, ఏ పల్లెటూరు నుంచో ఒక మహా నగరానికి వచ్చి ప్రపంచాన్ని జయించే క్రమంలో ఇచ్చే వాల్యుబుల్ కోట్స్ తో మరో వైపునుంచి పర్సనాలిటి డెవలెప్మెంట్ ఇత్రివృత్తాలతో వెలువెడుతున్న సో కాల్డ్ ‘క్షుద్ర సాహిత్యం’ నవలా యుగం అది.

బెంగాలి నవలల అనుసృజనలతో హోరెత్తి పోతున్న సమయంలో, రాబిన్ కుక్నిక్ కార్టర్ కిల్ మాస్టర్, ఆర్ధర్ హెయిలి, అలిస్టర్ మెక్లెయిన్, హారోల్డ్ రాబిన్స్, స్టాన్లి గార్డ్‌నెర్ , ఫోర్స్‌త్, డేవిడ్ సెల్జర్ ల రచనల / పాత్రల కిచిడి తో సీరియస్‌గా సీరియల్స్ తో వార పత్రికల అమ్మకాలు లక్షల్లోకి  చేరుకున్న శకం అది.

puraskar - felicitation - award
పురస్కారం – బహుమతి

బ్లాంక్ చెక్‌లతో తన ఇంటి వసారాలో ప్రచురణ కర్తలు కూర్చుని ఉంటే రచయిత/త్రు లు వారిని గుర్తించని రోజులు, అవి.

ఆలాంటి రోజులలో రచయితకు సాంఘిక బాధ్యత ఉన్నదన్న నిర్దుష్టమైన అభిప్రాయంతో ఉండి రచనలు చేస్తున్న ఒకానొక రచయితకు ప్రభుత్వం గుర్తింపుతో బాటు కొంత నగదు కూడ అందింది.

కమర్షియల్ రైటర్‌గా డబ్బుకు డబ్బుకు, పేరు, గుర్తింపు పొందిన ఒకానొక రచయిత , ఈనాడు గ్రూప్‌‌లో మేగజైన్స్  ఎడిటర్ చలసాని ప్రసాద రావు గారిని కలిసాడు.  పిచ్చాపాటి మాటల్లో, ఆ రచయిత “ఆయ్యా, ఇన్ని పత్రికలలో, నా కథ గాని, నవలగాని, సీరియల్ గాని, ప్రచురించనివి ఒకటి కూడ లేవు.  మరి నన్ను గుర్తించదేమి ఈ ప్రభుత్వం?” అని తన అవేదనని, ఆక్రోశాన్ని, అక్కస్సుని వెళ్లబుచ్చాడు.

ఠకీ మని ఆయన అన్నాడు కదా, ” నీకు గుర్తింపు ఎందుకు?  డబ్బు సంపాదించుకుంటున్నావు కదా?  నీకు గ్లామర్ ఉంది కదా?  ఆయనకి అవి రెండు లేవు కదా!  అందుకనే ఆయన్ని ప్రభుత్వం గుర్తించింది.  పురస్కారమిచ్చి గౌరవించింది.  నీకున్న దానితో నువ్వు తృప్తి పడు.  నీ సాహిత్యానికి అదే ఎక్కువ!”

ఈ సందర్భంగా
మీకు,
మీ అప్తులకు,
మీ ఆత్మీయులందరికి
సంక్రాంతి
శుభాకాంక్షలు

తెలియజేసుకుంటున్నాను.

సౌజన్యం ఆ మధ్య ఏవో మాటల మధ్య దాసరి అమరేంద్ర, నేను, కథ నవీన్ కలిసి మాట్లాడుకుంటుంటే బయటపడ్డ విషయం అది. రచయిత/త్రి పేరు మాత్రం నన్ను అడగవద్దు.   😉

వెలగా వెంకటప్పయ్య

మొన్న మళ్ళీ కాళీపట్నం రామారావు మాస్టారి నవతీతరణం అభినందన ప్రత్యేక సంచిక చదివినప్పుడు వెలగా వారి వ్యాసం చదివాను.  చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వారి వయస్సుకి అంతర్జాలం గురించి ఆ మాత్రం అవగాహన ఉండటం.  అంతే కాదు ఆ ఏడు పేజీల సాహితీ వ్యాసం చివరి పేరగ్రాఫ్ లో వారన్న మాట: “ఇంటర్‌నెట్ ఉంటే ప్రతి ఇల్లు ఒక కథానిలయం అవుతుంది…కారా మాస్టారు సేకరించిన అపూర్వ కథా సంపదను అధికంగా ఉపయోగించినా, అసలు ఉపయోగించకపోయినా శిధిలమౌవుతుంది.  శిధిలం మాట మరిపించేది, మురిపించేది అంతర్జాల మాయాజాలం.”

Dr Velaga Venkatappaiah, Tenali
డా. వెలగా వెంకటప్పయ్య (1930 – 29 Dec 2014)

సాక్షి దిన పత్రిక లో నేను వ్రాసిన గూగుల్ నెట్‌లో e బుక్స్ చదివి వెంటనే నాకు ఫోన్ చేసి అభినందించిన వారిలో ఆయన ఒకరు.  ఆ వ్యాసాన్ని ఆయన ఆంధ్రా యూనివర్సిటి కి సమర్పించిన ఒక పత్రంలో ప్రస్తావించానని, అక్కడి విద్యార్ధులకి అందజేసానని కూడ తెలియజేసారు.

తెలుగునాట గ్రంధాలయాల ఏర్పాటు కోసం ఆయన చేసిన కృషి చాల గొప్పది.

కవిరాజు త్రిపురనేని రామస్వామి అంటే వారికి అభిమానం.  కవిరాజు మనుమడిగా ఆ అభిమానం నా మీద కూడ కొంత చూపించారనుకుంటాను.  మేము మద్రాసులో ఉన్నప్పుడు ఆక్కడికి వచ్చినప్పుడల్లా మా అమ్మ ‘కవిరాజు’ కుమార్తె చౌదరాణి ని తప్పక కలిసేవారు.

ఆదివారం మే 6, 2012 న కేంద్ర సాహిత్య అకాడెమి కవిరాజు త్రిపురనేని రామస్వామి సాహిత్యం మీద గుడివాడ లో నిర్వహించిన సదస్సులో వారు కూడ పాల్గొన్నారు.

Seminar on Kaviraju Tripuraneni Ramaswamy
The invitation to the seminar on ‘Kaviraju’ Tripuraneni Ramaswamy.

వెలగా వారు ఈ రోజు ఉదయం విజయవాడలో ఆయుష్ హాస్పిటల్స్ లో ఆఖరి శ్వాస తీసుకున్నారని తెలిసినప్పుడు బాధవేసింది. మరో స్థంభం నేల కూలింది.

రచనలు
వారి రచనలలో కొన్ని, వాటి  ముఖచిత్రాలు ఇక్కడున్నవి.  సాహిత్యాభిమాని – ఆర్ బి రావ్ సౌజన్యం.
https://www.facebook.com/media/set/?set=a.10155009212985385.1073741875.624985384&type=1&l=1ce9757082

…అమెరికా పుస్తకాల మీద బ్రహ్మాండమైన దాడిని ప్రారంభించింది!

“బెర్నాడ్  షా వ్రాసిన ‘సీజర్ అండ్  క్లియోపాట్రా’ నాటకంలో థియోడాటస్ అనే అతను అలెగ్జాండ్రియా లైబ్రెరి తగలబడిపోతుంటే చూడలేక సీజర్ దగ్గిరకి వెళ్ళి బ్రతిమాలాతాడు. సైనికులని పంపి మంటలార్పమనీ, పుస్తకాలని కాపాడమనీ.  సీజరు ససేమిరా అంటాడు.

‘అక్కడాహుతౌతున్నది వట్టి కాగితాల కట్టలు కాదు.  మానవజాతి కష్టించి ఆర్జించుకున్న సంస్కృతీ, సంస్కార, సంప్రదాయాలు దగ్ధమౌతున్నాయి.  మానవజాతి సంపాదించుకున్న మధుర స్మృతులన్నీ మసైపోతున్నాయి’ అని అక్రోశిస్తాడు ధియోడాటస్.

‘నువ్వేమి చెయ్యకుండా కూర్చుంటే రాబొయ్యే తరాలవారు నిన్ను పుస్తకాల విలువ కూడా తెలుసుకోలేని మూర్ఖుడిగాను, ఆటవిక సైనికుడిగాను జమ కడతారు సుమా!’ అని సీజర్ని హెచ్చరిస్తాడు.

అలాంటి  సీజర్లింకా యీ యిరవయ్యో శతాబ్దంలో కూడా ఉన్నారా?  అని మనం సందేహించవల్సిన అగత్యం లేకుండా పోయింది: ‘ప్రజాస్వామ్యానికి, వ్యక్తి స్వాతంత్యానికి పట్టుకొమ్మ అని, భూతలస్వర్గం (God’s own country) అని పేరు మోసిన అమెరికా పుస్తకాల మీద బ్రహ్మాండమైన దాడిని ప్రారంభించింది.’ ”
అట్లూరి పిచ్చేశ్వర రావు వ్రాసిన విన్నవి – కన్నవి లో నుంచి.
నిన్న జరిగిన సంఘటన నాకు మా నాన్న వ్రాసిన పై పేరాగ్రాఫ్‌ని గుర్తు చేసింది.

కానీ దాని నేపధ్యం వేరు.

నిన్న సాయంత్రం యువ సాహితీ మిత్రుడు అనిల్ బత్తుల  (అతను ఈ భూమ్మిద పడకముందే ప్రచురించబడ్డ సోవియట్ పుస్తకాలు అతి ముఖ్యంగా వాటి తెలుగు అనువాదాలని ఇప్పుడు డిజిటల్ ఫార్మాట్ లో ఉచితంగానే అందరికి అందజేయాలనే ఒక ఆశయంతో ముందుకు సాగుతున్నవాడు) నాకు ఫోన్ చేసి, “సార్, పారిస్ పతనం మీ నాన్నగారే కదా అనువదించింది?  ఒక పాత ప్రతి ఒకటి ఈ హైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో ఎక్కడో ఉందట!  ఇందాక ఫలానా వారు ఫోన్ చేసారు.  ఒక్కసారి మిమ్మల్ని కనుక్కుని కన్ఫర్మ్ చేసుకుందామని చేసాను సార్,” అని అన్నాడు.

అతను అడిగింది నిజమే!  The Fall of Paris ని వ్రాసింది  ఇల్యా ఎహ్రెన్‌బర్గ్ (Ilya Ehrenburg).  ఆంగ్లంలో తొలి ప్రచురణ 1940 ప్రాంతాలలో.

Ilya Ehrenburg
Ilya Ehrenburg Soviet writer, journalist, translator.

దాని తెలుగులో కి అనువదించింది అట్లూరి పిచ్చేశ్వర రావు.  సుమారు 840 పేజిలు.  తెలుగులో ప్రచురణ కాలం మార్చ్ 1960.

సరే, ఇక బుక్ ఫైయిర్ లో పారిస్ పతనం దొరకడానికి, మీ నాన్న వ్రాసిన దానికి, సీజర్ కి ఆ లైబ్రేరి తగలబెట్టడానికి సంబంధం ఏవిటి అనే దానికి వస్తున్నాను.

పారిస్ పతనం
పారిస్ పతనం – తెలుగు
“ఫాల్ ఆఫ్ పారిస్” కి అనువాదం

1980  ప్రాంతాలలో తానా సభలకి వెళ్ళారనుకుంటాను డి. వి. నరసరాజు గారు.  తానా పత్రిక లో ఏదో వ్యాసం కోసం వారికి ఫోను చేసినప్పుడు “ఇస్తాను, రండి ఇంట్లోనే ఉన్నాను,” అని అన్నారు.  ఆ సందర్భాన్ని కూడ గుర్తు చేసింది నిన్నటి అనిల్ బత్తుల ఫోన్ కాల్.

నరసరాజు గారు అన్నారు కదా, “అనిల్, పుస్తకాలు మన దగ్గిరే ఉంటే లాభం ఏమి ఉంది?  అవి ముద్రించింది పది మంది చదవాలనే కదా! మీరు తీసుకు వెళ్లండి.  చదవండి.  మీ పని అయిపోయిన తరువాత  నాకు తెచ్చి ఇవ్వండి.  మీరు నాకు ఇవ్వక పోయినా ఫరవాలేదు.  ఇంకేవరైనా చదువుతానంటే వారికివ్వండి,” అని.

పదిమంది చదవడానికి పుస్తక భాండాగారాలు అంటే లైబ్రేరిలు ఏర్పడ్డాయి.  ఆ భాండాగారాలలోని పుస్తకాలు ఇప్పుడు పదిమందికి అందుబాటులోకి వెళ్లకుండా దొడ్డి గుమ్మంద్వారా ఇలా బజారులోకి వస్తున్నాయ్యా?  అది హర్షణీయమా అన్న ప్రశ్న తలెత్తింది నాలో.

మా నాన్న గారి సాహిత్యం పునర్ముద్రణ కోసం నాకు ప్రస్తుతం అందుబాటులోలేని పుస్తకాలకోసం వెతుక్కుంటున్నప్పుడు సాహిత్యాభిమానులలో ఒకరిద్దరు తాము చూసామని దొరికిన రెండు మూడు పుస్తాకాలు సుమారు నాలుగైదు దశాబ్దాల క్రితం ప్రచురితమైన వాటి ప్రతులు కొని పంపారు.

840 పుటల పారిస్ పతనం, 1960 మార్చి ప్రచురణ, (బవుండ్ ఎడిషన్ అనేవారు) ప్రతి ధర 10 రూపాయలు.  ఈ రోజు అదే పుస్తకాన్ని బహుశ ఏ 250/- కో 300/- కో అమ్మినా కొనుక్కునే వారున్నారు. ఎందుకంటే అంత ధర పెట్టి ఆ ప్రతిని కొన్నవారిని నేనెరుగుదును.

మనకి తెలుసో, తెలియకో ఇలాంటి అరుదైన పుస్తకాలని ఏదో ఒక విధంగా సంపాదించి ఇలా అమ్ముకోవడాన్ని మనం సమర్ధించాలా అన్నది నా ప్రశ్న.  ఏదో ఒక పుస్తకమే కదా అని సరిపుచ్చుకోమంటారా?  అలా ఒక పుస్తకంతో మొదలైనది మరి రేపు లైబ్రేరిలను కొల్లగొడితే?  పది మంది కి అందాల్సిన పుస్తకాలు ఏ ఒక్కరి అలమారకో పరిమితమైతే అప్పుడేమంటారు?

దయచేసి మీ అభిప్రాయాల్ని క్రింది వ్యాఖ్యలలో తెలియజేయగోర్తాను.

తా. కలంహైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో ప్రతి అమ్ముడైపోయింది !  చి న.

అలికిడి

అతను ముందు గదిలో తన కేన్ చెయిర్ లో కూర్చుని ఆ నాటి దినపత్రిక చదువుకుంటున్నాడు.  ఏదో అలికిడి.  పేపర్లోనుంచి తలెత్తి చప్పుడైన వైపు చూసాడు.  గుమ్మంలో నుంచి వీస్తున్న గాలికి హాలులోనుంచి లోపలి గదిలోకి వెళ్లే గుమ్మానికి వెళ్ళాడుతున్న కర్టెన్లు కదులుతున్నవి.  అతను మళ్ళీ తన తలని పేపర్లోకి దూర్చేసాడు.

మళ్ళీ అలికిడి.
అతను పట్టించుకోలేదు.

మళ్ళీ అలికిడి. ఈ సారి గుర్తు పట్టాడు.  తనెరిగిన శబ్దమే. నవ్వుకుంటూ పేపర్లోనుంచి తలెత్తాడు. ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయాడు.

తన కూతురు.  అక్కడ నిలబడి ఉంది.  గుమ్మం పక్కనే.  గుమ్మాన్ని తన కుడిచేత్తో పట్టుకుని.  నవ్వుతోంది. నవ్వుతూ తన వంక చూస్తోంది.

Annaమరో రెండు అడుగులు.
అతను పేపర్ని పక్కన పడేసాడు.
చేతులు చాపాడు.
గబ, గబ, గబ, గబ వచ్చి చేతుల్లో వాలిపోయింది.