ఈ దశాబ్దం నవలది, తెలుగు కథ ది!

ముందున్నది మూడు చెరువులు.  ఒడ్డున్న ఉన్నది అప్పుడే వాటిల్లో  మునిగి, ఈది, తేలి, గట్టుకు చేరిన సుశిక్షుతులైన గజ ఈతగాళ్ళు.  ఆ చెరువులు చెరువులేనా?.. ద్రోహ వృక్షం, నల్ల మిరియం చెట్టు, ఆకుపచ్చని దేశం.  ఒడ్డున్న ఉండి మళ్ళీ దూకడానికి ఉద్యుక్తుడవుతున్న నవయువకుడు శివారెడ్డి..కానీండి ఇంకా చూస్తారే?..నేనైతే  ‘జీవని‌’ లోకి దూకాను.  ‘ఐదు హంసలు‌’ని కూడా చూసాను.  దూకడమే..అలా ఒడ్డున నిలబడిపోతే  మీ జీవితంలో ఒక ఎపిక్ ప్రపోర్షన్‌ లో ఒక అనుభవాన్ని కోల్పోతారంటాడు.

ఇందులో ద్రోహవృక్షం కథల సంపుటి.  మిగతా రెండూ – నల్లమిరియం చెట్టు, ఆకుపచ్చని దేశం నవలలు. రచయిత డా॥ వి. చంద్రశేకఖర రావు.

Dr. v chandrasekhara Rao novels release function
డా: చంద్రశేఖర రావు నవలలు ఆవిష్కరణ సభ..మీ ఎడమవైపు నుండి..శ్రీ జగన్నాధ శర్మ, నవ్య సంపాదకులు – ఆకుపచ్చిని దేశం తో, కవి శివారెడ్డి అక్కుపచ్చిని దేశం లో నల్ల మిరియం చెట్టు తో, రచయిత డా॥ చంద్రశేఖర రావు వి, వారి ప్రక్కన విమర్శకులు సీతారాం.

ఆ పుస్తకాల పేర్లు చూడండి.  ఒక మార్మికత లేదూ వాటిల్లో?!  చిన్నప్పుడు మా నాన్న తెచ్చి ఇస్తే పుస్తకాలు, ఏది ముందు చదవాలో అర్ధం అయ్యేది కాదు.  అన్నింటిని ఒకే సారి చదవలేము.  సరే, పుస్తక పరిచయ సభకి వెళ్ళాం కదా..ఆ మహామహుల మాటలు విన్నాం కదా?  వాళ్ళందరూ ఏదో ఒక పుస్తకాన్ని ఆకాశానికెత్తేస్తే దాంతో మొదలు పెట్టవచ్చు. అసలు ఆ సాహితీవేత్తలు ఆ అవకాశం లేకుండా అన్నింటి గురించి చెప్పేసారు.  అసలు ముందు వాళ్ళ మాటలు వింటుంటే ఒక అయోమయం.

నల్లమిరియం చెట్టు గురించి మాట్లాడుతూ, ఆకుపచ్చని దేశం లోకి వెళ్ళిపోతారు.  పోనీ దాని గురించి మాట్లాడుతారా అంటే ఉహు మళ్ళీ ద్రోహవృక్షంలోకి వెళ్ళిపోతారు.  అక్కడ ఉంటారా అంటే ఆబ్బే సుందరం అంట..ఆదెమ్మ అంట,  చెంచులు అంట, నరసింహం ఆత్మహత్య, మొసళ్ళు వాటితో యుద్దమా లేదా తప్పించుకుని అవతలి ఒడ్డుకి చేరటమా అన్న ఆలోచనంట..ఇవేవి కావు అసలు ఈ చంద్రశేఖరం గారు కవిత్వం వ్రాస్తున్నాడంటున్నారు, నా దృష్టిలో అది కవిత్వం కాదు..ఈ రచయిత రచనల మీద నేను పరిశోధన చేస్తున్నాను అని మరో వక్త.  సరే!  వాళ్ళు పుస్తకాలు చదివారు కాబట్టి వేదిక మీద ఉన్నవాళ్ళందరికి రచయితతో సహా తాము ఏమి మాట్లాడుతున్నారో తెలుసు.

మరి పాఠకుడి పరిస్థితి.

సీరియల్‌ని చదివిన పెద్దాయన కవి శివారెడ్డి.  ప్రతి వారం ఒక వార పత్రికని కొని..ఒక ముక్క చదివి..మళ్ళీ వచ్చేవారం కోసం ఎదురుచూస్తు..ముక్కలు ముక్కలుగా చదవటానికి విముఖుడు.  అలా చదవాలంటే చెడ్డ చిరాకు ఈ కవికి.  కాని ఆయన ప్రతివారం ముక్కలు ముక్కలుగానే చదువుకున్నాడంట సీరియల్‌ని.  అంతగా ఆకర్షించింది ఆయన్ని.  ఇక్కడ గుర్తుంచుకోవలసింది ఒకటి ఉంది.  ఆయన కవి. కథకుడు కాదు.  నవలా కారుడు అంతకంటే కాదు.  అవంటే పెద్ద ప్రేమా, మోజు లేదాయనకి. ఆయనే చెప్పుకున్నాడా మాట ఆ వేదిక మీద నుంచి.  ఏకంగా 22 పేజీల ముందుమాట వ్రాసేయించింది ఆ నవల ఆ కవితో.

ఎవరూ ఏ పుస్తకాన్ని ఒక్క సారి చదివి నమిలి పిప్పిని పారేసిన వారు కాదు, బెకన్ అన్నట్టుగా.  మాట్లాడిన వారందరూ ఆ నవలలని..ఆ కథలని పరిచయం చేసిన వారందరు ప్రతి పుస్తకాన్ని ఆవాహన చేసుకున్నవారే.  ఆ పుస్తకాలు వారందర్నీ తమ ప్రపంచంలోకి రమ్మనమని సాదరంగా ఆహ్వానించినవి.  వీరు ఆ యా ప్రపంచాలలోకి వెళ్ళి ప్రతి పాత్రతోను పయనించి,  వారి జీవితాలని స్పృశించి, ఆ లోకాలను అనుభవిస్తూ వెలికి వచ్చారు.  మళ్ళీ అ సాహిత్యంలోకి వెళ్లాలనిపించి వెళ్ళారు.  వదలలేదు.  వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్లారు.  రేపు మరోసారి మళ్ళీ వెడతారు. వారి మాటలు వింటుంటే మళ్ళీ మళ్ళీ ఆ లోకాలలో విహరిస్తూనే ఉంటారనిపిస్తుంది.

నవీన్ వాసిరెడ్డి
సభకు అధ్యక్షుడు. నేను పోలీసుల చెకప్పులు, వినాయకుడి విగ్రహాలను తప్పించుకుంటూ హైద్రాబాదు ట్రాఫిక్కులోపడి ఈదుకుంటూ వెళ్ళేటప్పడికి ఆయన ఉపన్యాసం అయిపొయ్యి  వక్తలను ఆహ్వానిస్తున్నారు.

జగన్నాధ శర్మ  (నవ్య సంపాదకులు,) చాల క్లుప్తంగా మాట్లాడారు.
“సాహితీలోకంలో ఒక మాట ఉంది. 1910 నంచి 20/30 ల దాక తెలుగు సాహిత్యంలో అనువాద కాలం అని.  కాని నేను ఇప్పుడు చెబుతున్నాను.  2010 నుంచి  మళ్ళీ తెలుగు కధా సాహిత్యం, నవలా సాహిత్యం మొదలైనది.  భారతదేశంలోని ఇతర భాషలు తెలుగు భాష వైపు తెలుసు సాహిత్యం వైపు చూస్తుండాల్సిన తరుణం వచ్చేసింది.  దానికి కారణం చంద్రశేఖర రావు లాంటి రచయితలు.  నవల రూపు చూడకండి.  నవలలో వస్తున్న వస్తువుని చూడండి.  గొప్ప తెలుగు సాహిత్యం ఈ దశాబ్దం తో మొదలయ్యింది మళ్ళీ.  ఇంతకన్నా తెలుగు సాహిత్యం గురించి నేను చెప్పగలిగింది లేదు”.

కవి శివారెడ్డి
కవి శివారెడ్డి మూడు సార్లు చదివారు. ఆయన నల్ల మిరియం చెట్టు కి ముందుమాట(?) అందామా “ఒక గాధ గురించి” అని శీర్హిక పెట్టి..అంటారు కదా..తొలి వాక్యం లో.
” నేనిప్పుడో మహోపన్యాసం చెయ్యగలను డా॥ వి. చంద్రశేకఖర రావు గారి సాహిత్యం మీద”.

“Preconceived notions లేకుండా రచయిత దగ్గిరకు వెళ్ళే ఒక తరం పాఠకులొస్తారు. వచ్చారు.  విమర్శకులే రావాల్సింది.

ఊర్వశి అంటుంది పురూరవుడి తో,’ప్రేమ కావాలా..నీ అలంకారాలన్ని, ఆభరణాలన్నీ పక్కన బెట్టి దిగంబరంగా నా దగ్గిరకు రా,’ అని.  అలా పాఠకుడు అన్ని misconceived, wrong notions ని పక్కనబెట్టి – పరమ దిగంబరంగా వాచకం దగ్గిరకెళ్ళాలి –  ఆ పాల సముద్రం లో మునగాలి.”  అవి ఆయన మాటలు.

ఎ కె ప్రభాకర్ గారు
చంద్రశేఖర రావు సాహిత్యం గురించి సోదాహరణం గా వివరించారు. నల్ల మిరియం చెట్టుగురించి మాట్లాడుతూ వారి మిగతా సాహిత్యంలోకి సభికులను లాకెళ్ళారు.  ప్రత్యేకంగా ఆ నవల ముగింపుని పాజిటివ్ దృక్పధంతో నే చూడవచ్చు అని అన్నారు.

సీతారాం
చంద్రశేఖర రావు వచనం కవిత్వం కాదు.  ఆయన తన ఆవేదనని పరివేదని అలా వ్యక్తం చేస్తున్నాడు.  It is his expression of agony.  His form and content needs more critics. “ఆయన రచనలమీద పరిశోధన చేస్తున్నాను,” అని అన్నారు.  అంతగా కదిలించినవి చంద్రశేఖర రావు గారి సృజనలు ఆయనలోని విమర్శకుడిని.  నల్ల మిరియం చెట్టుగురించే తాను మాట్లాడు దాం అని అనుకున్నానని కాని..దాని పరిధి దాటి మాట్లాడారు.

గుడిపాటి
చంద్రశేఖర రావు గారి సాహిత్యం మీద చాల చర్చ జరగవలసి ఉంది.  ఇక్కడ కలిసిన ఈ రెండు మూడు వందల సాహితీవేత్తల మధ్య జరిగినదే కాదు.  ఇంకా జరగాలి.  వేదికలెక్కాలి.  పాఠకులు అందులో ఇన్వాల్ కావాలి.  ఇది ఇక్కడితో ఆగిపోదు.

రచయిత
నా కాల పరిస్థితులే నా రచనలని రూపొందించినవి. ఈ వేదిక మీద ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడం బాగుండదు.

జరిగిన సభ గుఱించి నా మాటలు:
ఎవరూ కూడా రచయిత వ్రాసిన ఏ ఒక్క కథకో ఏ ఒక్క నవలకో పరిమితం కాలేకపొయ్యారు.  కారణం రచయిత ఎన్నుకున్న వస్తువు, శిల్పం, శైలి, భాష.  ఒకరు దండోరా గుఱించి మాట్లాడితే, మరొకరు తెలంగాణా నేపధ్యంతో వ్రాసిన హె‌చ్ నరసింహం అత్మహత్య  గురించో లేక చెంచువుల గురించో..ఐదు హంసల గురించో మరో కథ గురించో మాట్లాడారు.  మధ్యలో కొ కు ఫోర్త్ డైమన్షన్ ని లాకొచ్చారు.

సాహిత్యం, పోకడలు, చంద్రశేఖర రావు రచనలు వారిమీద వారి ఆలోచనల మీద, ఆయన రచనలు తమ బుర్రకు పెట్టిన పనిమీద, పదునెక్కించిన రీతి..ఆ యా నవలల సాంఘిక, రాజకీయ, ఆర్ధిక, సామాజిక నేపధ్యాలు అధ్యయనం చెయ్యవలసిన అవసరం ఒకటేమిటి ఎన్నో అంశాలు..పరిపూర్ణమైన ఒక సాహితీ సభ అది.

కొత్త తరం పాఠకులు వచ్చారు!
కొత్త తరం పాఠకులు వచ్చారు. నేనంటున్నది కూడా అదే.  నవ్య సంపాదకులు అంటున్నది అదే!  కవి శివారెడ్డి అంటున్నది అదే.  ప్రభాకర్ గారు అన్నది అదే! సీతారాం చెబుతున్నది అదే!  గుడిపాటి చెప్పింది అదే! మీరందరూ చదవవలసిన పుస్తకాలు ఇవి.

చాలా రోజుల తరువాత సాహితీ మిత్రులను చాల మందిని కలుసుకున్నాను.  చాల సంతోషమేసింది.  ఎంత సాదరంగా అహ్వానించారో!  ఆదరంగా పలుకరించారో అందరూ.

ఇక మీరు చెయ్యవలసింది.
ఈ బ్లాగ్ పోస్ట్ చూసి ఇక్కడి దాకా చదివారంటే..మీకు అంతర్జాలంతో పరిచయం ఉండే ఉండాలి.  సాహిత్యం మీద అభిరుచు ఉండి ఉండాలి.  కాబట్టి ఈ మూడు పుస్తకాలు ముందు సంపాదించండి.తరువాత వీటిని కూడా సంపాదించి చదువుకోండి.

జీవని
లెనిన్ ప్లేస్
మాయా లాంతరు
ద్రోహవృక్షం..ఈవన్నీ ఈ రచయిత కధా సంకలనాలు.

నవలలు ఇవి:  ఐదు హంసలు, ఆకుపచ్చని దేశం, నల్ల మిరియం చెట్టు.
కినిగెలో ఈ ఒక కథా సంకలనం, రెండు నవలలు..ఈ బుక్స్ గాను ప్రింట్ బుక్స్ గాను ఉన్నవి.

దిష్టి చుక్క:
తెలుగు ప్రసార మాధ్యమాల ఫోటోగ్రాఫర్‌లు.  జరుగుతున్న సభ మధ్యలో దూరి, ఆ క్రమాన్ని ఆరాచకంగా ఆపేసి, తమ కెమరా ప్రలోభానికి కి లొంగనివాడెవ్వడూ లేడని చెప్పకుండా చెబుతూ దర్పంగా వచ్చినంత వేగంగా వెళ్ళిపోతారు.  వాళ్ళు అడ్డం రావడం కారణంగా గుడిపాటి, నవీన్, ఎ కె ప్రభాకర్ బొమ్మల్లో కనిపించకుండా పొయ్యారు.  తీసినవి సరిగ్గా  రాలేదు.  ఉన్నవి కాని ఇక్కడ పోస్ట్ చెయ్యలేదు.

గొప్ప సాహితీ సభ ఎందుకైనదంటే..ఎవరూ పక్కవారి చెవులు కొరకలేదు. గుస గుసలు లేవు.  ఫోన్లు మోగలేదు.  హాలు బయట కుహానా సాహితీవేత్తల అరుపులు, పెడబొబ్బలు లేవు. ఇక సభలో ఉన్నవారి సంగతంటారా!   అందర్ని ఆ వేదిక మీద వక్తలు తమ మాటలతో కట్టి పడేసారు.  ఇప్పుడు అర్థమయ్యిందా  ఆ రచయిత డా॥వి. చంద్రశేఖర రావు రచనా పటిమ?  పుస్తకాలు కొనుక్కుని చదువుకోండి.  చదువుకుని మీ బ్లాగుల ద్వారానో మరొక వెబ్‌సైట్ ద్వారానో మీ అభిప్రాయాలని పది మందితో పంచుకోండి! ఇక మొదలెట్టండి!

ఇలా అర్ధాంతరంగా వెళ్ళి పోతే ఎలా?

రాంకీ గారి మాటలతో సభ మొదలైనది.

ఎన్ వేణుగోపాల రావు,  వీక్షణం సంపాదకుడు , సభకు అధ్యకత వహించారు.  63 ఏళ్ళకే రోహిణి ప్రసాద్ గారి ఆకస్మిక నిష్క్రమణ విచారం కలిగిస్తున్నది. ఆయన ఒక అణు విజ్ఞాన శాస్త్రవేత్త. కాని తన ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త చూపించలేదేమోనని అభిప్రాయపడ్డారు.

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ సంస్మరణ సభ
వేదిక మీద వక్తలు: ఎడమ నుండి కుడికి
దివికుమార్ (ప్రజాసాహితి), నటుడు కాకరాల, ఎన్. వేణుగోపాల రావు, సభకు అధ్యక్షుడు..(సంపాదకుడు వీక్షణం మాస పత్రిక), వరవర రావు (సృజన సంపాదకుదు, విరసం సభ్యుడు) గీతా రామస్వామి ( హైద్రాబాద్ బూక్ ట్రస్ట్ సభ్యురాలు)

దివికుమార్, ప్రజాసాహితి.
“నేను టెలిఫోను డిపార్ట్‌మెంట్ వాడిని కనుక ఎవరితోనైనా మాట్లాడడానికి అవకాశం ఉండేది. అలాగే రోహిణి ప్రసాద్ గారితో నా మొదటి పరిచయం. వారు విజయవాడ వచ్చినప్పుడు వారి చెబితే కాని తెలియలేదు చందమామలో వారి తండ్రిగారి సమకాలీకులు దాసరి సుబ్రహ్మణ్యం గారు అని.  ఉద్యోగ విరమణాంతరం విజయవాడలోనే ఉంటున్నారని.అలాగ దాసరి గారిని కలవడానికి రోహిణి  ప్రసాద్ గారు కారణం.

రోహిణీ ప్రసాద్ గారు హైద్రాబాద్ వచ్చిన తరువాత తరచూ కలుస్తూ ఉండే వారం.  ‘మీరు వ్రాయాలి.  ఈ దిన పత్రికలలో కూడా మీ వ్యాసాలు అచ్చులో చూడాలి’ అని అనేవారు ఆయన.   ‘నా పేరు కనపడితేనే వెయ్యటం లేదండి’, అని అన్నప్పుడు, ‘మరో పేరుతో వ్రాసి పంపండి..ఏదో కలం పేరు పెట్టి పంపేయ్యండి’ అని అన్నారు.  ఆ పనే చేసాను.  విజ్ఞానాన్ని పది మందికి పంచాలి అన్నది రోహిణీ ప్రసాద్ గారి ప్రధానమైన ఆశయంగా ఉండేది.

కోపం వచ్చింది!
గీత రామస్వామి – హైద్రాబాద్ బుక్ ట్రస్ట్
”  ఆయన చాలా అర్ధాంతరంగా వెళ్ళిపొయ్యారు.  హైద్రాబాదు బుక్ ట్రస్ట్ తరఫున వారివి ఒక మూడు పుస్తకాలు ప్రచురించాము.  మరి కొన్ని పుస్తకాలకి ప్రణాళికలు కూడా వేసుకున్నాము.  కాని ఇలా వెళ్ళి పోతారని ఊహించనైనా ఊహించలేదు.

వారిలో ఒక గొప్ప సుగుణం ఉంది.  అది తెలుగులో వ్రాసేటప్పుడు తెలుగులో ఆలోచించేవారు.  ఇంగ్లిష్‌లో వ్రాసేటప్పుడు ఇంగ్లిష్‌లో వ్రాసేవారు.  అందుకనే వారి సైన్సు వ్యాసాలు సరళమైన తెలుగు లో అందరికి అర్ధమయ్యేవిధంగా ఉండేవి.  ఇప్పుడు ఆ వ్యాసాలు ఆ పుస్తకాలని ఏం చెయ్యాలి అన్నది ఆలోచించి చెయ్యవలసిఉంది. “

గోగినేని బాబు
“ఆయన మీద ఒక హీరో వర్షిప్ ఉండేది నాకు.
“పది మంది ఉంటే చాలు.  మనం కార్యక్రమం చెయ్యాలి. మన పిల్లలకి సైంటిఫిక్ టెంపర్  ఉండాలి. రావాలి. కావాలి.  ఈ మూఢ నమ్మకాలు కాదు. వీరిని చైతన్యవంతులని చెయ్యాలంటే మనం ముందుండి వారికి తెలియజెయ్యాలి. మీరు కార్యక్రమాలు చేపట్టండి.  నా ఖర్చులతో నేను వస్తాను’ అని అనేవారు.  ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతారని ఊహించలేదు. ఇక్కడందరితో పాటు నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను”, అని గోగినేని బాబు అన్నారు.

కాకరాల
” నిజానికి నాకు రోహిణి ప్రసాద్ గారితో పరిచయం చాల తక్కువ.  కుటుంబరావుగారి కుటుంబంతో ఎక్కువ. కాని కుటుంబరావు గారితో ఇంకా చాలా ఎక్కువ.  కాబట్టి రోహిణో ప్రసాద్ గారితో నాది గొప్ప పరిచయం కాదు.

ఇదేమిటి ఈ మనషి ఇలా మాట్లాడేస్తాడు.  ఇలా ఉరుకులు, పరుగులు పెట్టేస్తున్నాడు ఈయన.  వారి తండ్రిగారు కుటుంబ రావు గారు. నాలుగైదు దశాబ్దాల పాటు వ్రాసింది, ఈయన అంతకంటే త్వరలో ముగించేటట్టు ఉన్నాడు.  ఇదేదో ఆమెరికా జీవన సరళిని ఈయన  ఇక్కడ కూడా నడిపిస్తున్నట్టున్నాడు, కాని అది సరి కాదు అని అనుకునే వాడిని. అది ఆయన బ్రతికుండగా వున్న అభిప్రాయం.

Kakarala sharing his experiences with Rohini Prasad
నటుడు కాకరాల రోహిణీ ప్రసాద్‌తో తన అనుభవాలాను పంచుకుంటూ..

ఐనా వారు హైద్రాబాదు వచ్చిన తరువాతే వారితో పరిచయం పెరిగింది.  వారి జీవితంలోని వేగం, వారు పోయిన తరువాత అర్ధం అయ్యింది. తండ్రి గారి లాగే ఒక ప్రణాళిక ప్రకారం వారు తన జీవితాన్ని, తన రచనా వ్యాసంగాన్నీ, తన సాహిత్య ప్రస్థానాన్ని, తన సంగీతానికి ఒక గమ్యాన్ని నిర్దేశించుకున్నారు.  బహుశ వారికి తెలిసే ఉంటుంది ..వెళ్ళే లోపు చెయవలసిన పనులు చాల ఉన్నవి, అవన్నీ కూడా ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని.

వారి తల్లి గారికి కూడా ఫో‌న్ చేసి చెప్పాను. అమ్మా రోహిణీ ప్రసాద్ గారి గురించి నా అభిప్రాయం మార్చుకున్నాను.  ఆయన ఎన్నుకున్న దారే సరైనది.  మీరుకూడా మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలి అని కోరుకుంటున్నాను అని చెప్పాను”.

వరవర రావు
“సంగీతం గురించి నాకు అసలు తెలియదు. కానీ రోహిణి ప్రసాద్ సితార్ వాయిద్యం వినాలని పిలిచినప్పుడు వారి ఇంటికి వెళ్ళాను. బహశ అదేనేమో నేను సంగీతం కోసం ఒకరి ఇంటికి వెళ్ళి వినడం.
విరసం సభ్యుడు, వరవర రావు, సృజన సంపాదకుదు
వైజాగ్‌లో శ్రీశ్రీ  షష్టి పూర్తికి మేము మొదటి సారి కలిసాము.  కొ కు, చలసాని ప్రసాద్ రోహిణి ప్రసాద్ మరికొందరు మిత్రులు అక్కడ కలిసాము.  ఆ సభకి ఒక ప్రత్యేకత ఉంది.  విరసం ఆవిర్భావినికి అక్కడే కదా జరిగింది. ఆ నేపధ్యం లో ఆలోచిస్తే రోహిణి ప్రసాద్ చెయ్యవలసింది ఇంకా చాల ఉన్నా..ఇలా వెళ్ళిపోవడం చింతించవలసిన సందర్భమే.  వారిని గురించి నేను ఒక వ్యాసం ఆంధ్రజ్యోతి లో వ్రాసాను.  గడగడా మాట్లాడుతాడు అని.  ఆయన నొచ్చుకున్నాడేమో తెలీయదు కాని ఇప్పుడు అనిపిస్తున్నది అలా రాయాల్సింది కాదేమోనని.  ఆయన అలా మాట్లాడక పోతే పదిమందికి ఆయన అభిప్రాయాలు తెలియపరిచగలిగే వారు కాదు.

వారి పుస్తకానికి నన్ను ముందు మాట కూడ వ్రాయమని అడిగారు.  రాసాను.  అవి సైన్సు వ్యాసాలు. నాకు సైన్స్ గురించి కూడా పెద్ద తెలియదు.  తన పుస్తకం కాబట్టి చదివి కొంత సైన్స్ గురించి తెలుసుకుంటానన్న ఉద్దేశం తో నన్ను ఆయన రాయమని ఉంటాడు అని అనుకుంటున్నాను. ఆయనది ఒక ఆకస్మిక నిష్క్రమణ. చింతించవలసిన విషయం కూడా!”

Kodavati Ganti Rohini Prasad
Kodavati Ganti Rohini Prasad

** ఒక రచయిత చనిపోయినప్పుడు ప్రచురణ కర్తలు ముందుకు వచ్చి ఇలాంటి సభని ఏర్ఫాటు చెయ్యడం హర్షించ దగ్గ విషయం.  కాకరాల గారు వక్తగా వేదికనెక్కితే చాలా ఆవేశంగా మాట్లాడేవారు.  ఈ సభలో ఇదివరకున్న ఆవేశం లేదు.

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

మరో తరం వెళ్ళిపోవడం మొదలయ్యింది.

మద్రాసులో బాల్యంలో మా నాన్న గారితో వారింటికి వెళ్ళడం కుటుంబరావు గారు, నాన్న గారు సాహిత్యం, రాజకీయం మీద చర్చోపచర్చలు కబుర్లు చెప్పుకుంటూవుంటే ప్రసాద్ గారితో ఏదో కాలక్షేపం చెయ్యడం లీలగా గుర్తుంది.

వారి సాహిత్యం గురించి, వారి సంగీతం గురించి, వారి శాస్త్రీయ రచనల గురించి నా కంటే వివరంగా చెప్పేవాళ్ళూ, విశదీకరించే వారున్నారు కాబట్టి నేను వాటి జోలికి వెళ్లడం లేదు.

దాసరి సుబ్రహ్మణ్యం గారు ఒకరోజు సాయంత్రం  ప్రసాద్‌గారిని తీసుకునివచ్చి “మిమ్మల్నీ కలవడానికి వచ్చాడు’,  అని మా అమ్మకి పరిచయం చెయ్యడం నుంచి బాగా గుర్తు ఉంది. అప్పటికి ఆయన అమెరికాలోనే ఉన్నారు. దాదాపు ఒక గంట ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్న తరువాత..ఇంకేదో పనిమీద వెళ్ళిపొయ్యారు.  చాలా సీదాసాదాగా, సరదగా నవ్వుతూ ఉండేవారు.Kodavati Ganti Rohini Prasad

మా నాన్నగారిని బాగా అభిమానించేవారు. వారి రచనలన్నింటిని ఈ తరానికి పరిచయం చెయ్యాలని అంటూ ఉండేవారు.
I still remember his cheerful presence in our house and how badly my father took his untimely demise.
I feel your father’s excellent works should be reintroduced to today’s generation. If you have no objection you can get them posted in pranahita.org or prajakala.org and poddu.net. with introductory remarks. In case you are not familiar with typing in Unicode etc I can tell you.”

ఆ మధ్య డెట్రాయిట్‌లో త్రిపురనేని గోపిచంద్ జ్ఞాపకార్ధం జరిగిన సాహితీ సభలలో కూడా త్రిపురనేని సాయిచంద్ ని కలిసినప్పుడు:
In the Detroit meeting I requested Saichand to say a few words about Pitcheswara Rao garu after the discussion on Gopichand garu“, అని చెప్పాను అని కూడా అన్నారు.

అలాగే దాసరి సుబ్రహ్మణ్యం గారి స్మృత్యర్ధం విజయవాడ సభకి వెడుతున్నాను., అనగానే వారిమీద వ్రాసిన వ్యాసాన్ని పంపుతూ “మీరు అక్కడే ఎవరితోనైనా చదివించి వినిపించండి, ప్లీజ్“, అంటు కోరారు.  ప్రజాసాహితి రవిబాబు గారు ఆ సభలో దానిని చదివి వినిపించారు.
స్నేహాశీలి..చిన్నా పెద్దా తారతమ్యం లేదు. అందరితోను కలివిడిగా ఉండేవారు.  చేతనైన సహాయం చేసేవారు.

తరచూ ఈమైల్స్ తో పలకరించే వారు.

నా బాల్యం – సాహిత్యం – మద్రాసుకి ఒన్న మరో గుర్తు కాలగర్భంలో కి జారిపోయింది.

వారి బ్లాగులు:
http://rohiniprasadk.blogspot.in/
http://rohiniprasadkscience.blogspot.in/
కినిగెలో వారి పుస్తకాలు ఇక్కడ:
http://kinige.com/kbrowse.php?via=author&name=Kodavatiganti+Rohini+Prasad&id=122

అబ్బే లేదండి..నేను బతికే ఉన్నాను!

మొన్నామధ్య ఒక పెద్ద రసపోషకుడిగారిని కలిసాను. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉంటే..దురదుంది కదా..సాహిత్య దురద..పుట్టింది. గోక్కుంటూ అలనాటి భారతి గురించి, ఆ నాటి ఆంధ్రభూమి గురించి, అప్పటి అభ్యుదయ గురించి, ఆ రోజుల్లో కాగడ గురించి. కృష్ణాపత్రిక గురించి, సంవేదన, కళ ఈ నాటి సృజన గురించి ఆయన ఒక పది మాటలు మాట్లాడితే నేను ఒక పదం వొదుల్తు..పుసిక్కిన మిసిమి అని అన్నాను.

Misimi
మిసిమి Misimi One of the finest Telugu literary monthly magazine

ఆయన చాల లాఘవంగా దాన్ని ఒడిసి పట్టుకుని, దాన్నీ తిప్పి మళ్ళీ నా మీదకు వదిలాడు, “మిసిమి..సెక్‌సు పత్రికా అది..దాని పేరు వినలేదే ఎప్పుడూ?!” అంటూ. మీరందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది..అక్కడ నా పక్కన ఉన్నట్టైయితే..మీ అందరి ఆరోగ్య భీమా పధకాలన్నింటిని పరీక్షకి పంపాల్సి వచ్చేది. అబ్బే లేదండి..నేను బతికే ఉన్నాను! టపా కట్టేసి ఉంటే ఇక్కడ ఈ టపా ఉండేది కాదు కదా!

మిసిమి మాస పత్రిక ఇక్కడ లభిస్తుంది.

నాకు దేముడంటే ఇష్టం

“ఏవిటి మాస్టారు..చాలా రోజులకి.  ఎలా ఉన్నారు?”
“బాగానే ఉన్నానండి”.
“ఎలా వున్నవి సాహిత్య సభలు, మీ ఊళ్ళో”.
“బాగానే జరుగుతున్నవి”
“నేను ఇప్పుడు మీ ఊళ్ళోనే ఉన్నాను”
“ఈ రోజున ఫలానా చోట “@#$%‌” వాళ్ళ సభ ఉందంట. అక్కడికి  రారాదు.  మనం అక్కడ కలుసుకుందాం”.

తేనీరు
“నాకు దేముడంటే ఇష్టం”

“నేను రాలేనండి”.
“ఏందుకని?  పండితులున్నారంటకదా?”
“ఉన్నారండి..కాని నాకు దేముడంటే ఇష్టం అండి.”
“ఐతే..”
“వాళ్ళు దేముడ్ని తిడతారండి.  నాకది ఇష్టం ఉండదు.  పనిమాలా వెళ్ళి ఆవన్ని వినడం ఎందుకు?  కలవాలనుకుంటే  నేనే మీదగ్గిరకు వస్తాను. కాసేపు కబుర్లు చెప్పుకుందాం”
“రండి.  ఐతే చక్కగా టీలు తాగుతూ కబర్లు చెప్పుకుందాం”.

మంచి మిత్రుడితో స్నేహాం మరోక శిఖరం చేరింది.