మో “బ్రతికిన క్షణాలు” లో కొన్ని..

ఆరేళ్ళో అరవై ఏళ్ళో బ్రతుకుతాం.  ఆరేళ్ళముందెలా పుట్టామో ఎవడికి తెలీదు.  అరవై తర్వాత ఎలా చస్తామో మనకి తెలీదు.  తీసుకు తీసుకుని తడిసిన నులక మంచానికి తప్ప ఆరు నుంచి అరవైదాక ఈలోపల బేరామాడ్తాం. చివరకు గిట్టుబాటవుతుంది తప్పక.

ఒకే కవితకు ఆరు అర్థాలు ఒస్తాయని ఒకడు అమ్మ చూపుతాడు.  ఆరూ అనర్థాలే.  అసలు అర్థం అమ్మేవాడికే తెలీదు. కొనేవాడు నూరర్థాలు అడుగుతాడు – ఓ శతాధిక గ్రంధకర్తని.  శతపత్ర సుందరిని అరవై ఏళ్ళ ఆంధ్ర కవిత్వాన్ని ఆరు రూపాయలకే అచ్చెయ్యమంటాడు అరసున్నాలకి అమ్ముడు పోయేవాడు.

మో వీటిని ‘పద మూర్చన’ లన్నాడు. చచ్చిన తర్వాత చెప్పే మొదటి మాటలంట!  పైగా అంటాడు..”వాస్తవాన్ని అధివాస్తవికంగా మలుచుకునే ప్రయత్నంలో వచనం విరిగి ముక్కలయ్యి ఆ గాజు పెంకులు పద్యానికి గుచ్చుకొంటాయి”ట.

“ప్రతి నేనుకి ఒక మేనుంటుంది.  నేను లోంచి మేము, మనం అవటానికే ఏ రచన అయినా.  తారీఖులూ, దస్తావేజులూ ఏమిలేని అనామక స్వీయ జీవన చిత్రణ ఈ ‘బతికిన క్షణాలు‌’.  దృశ్యం అదృశ్యంగాను శబ్దం నిశ్శబ్దంగానూ రంగులు పులుముకుని మాటలుగా మ్రోగుతాయ్.

అంతాలో ఎంతో కొంత యిది.

ఎక్కువ మాట్లాడే వాడు ఏది చెప్పడు.

నిశ్శబ్ద క్షణంలో శాశ్వత శబ్దాన్ని పట్టుకోవాలని

ఈ నూత్న యత్నం”.

వెతకండి..ఎక్కడన్నా దొరికితే, దొరకబుచ్చుకుని చదవండి. చదివి ఆ “బతికిన క్షణాలు” మళ్ళీ బతకడానికి ప్రయత్నించండి.

ఎందుకంటే “మో” ఆ “బతికిన క్షణాలు” అన్నింటిని ఐదు వందల ప్రతులకి మాత్రమే పరిమితం చేసాడు..అది ఒక దశాబ్దం క్రితం!

మో “బ్రతికిన క్షణాలు” తొలి ముద్రణ 1990 – మలి ముద్రణ  2000

అశాశ్వత సత్యం; శాశ్వతం

కవిత నుండి కొన్ని పంక్తులు:

ఎన్ని బాడిలు అన్ని జన్మలు ఎన్నిక్షణాలు

నిల్చి సాగి తూలి జారి రాలి

నిలూనా చీలుస్తాయి నిన్నూ నన్నూ

రక్తాక్షరాలలో ఏ కవి రాసుకుంటాడు ఎన్నని

ఇన్ని సత్యాల్ని ఇన్ని ప్రేగుల్ని

బొమికెల్ని చర్మపు నునుపుల్ని

సౌందర్యపుటుంగరాల్ని కేశపాశపు మోహపు మెలికల్ని

మమతా మైత్రి పాశాలెన్నని తెంచుకుంటాడు

ఎన్ని రంగుల్ని ఉడుపుల్నిఒల్చుకుంటాడు

ఆయాసంతో

ఏ అసఫలీకృత కాంక్షల్ని

పాపం! ఎన్నిటినని పేర్చుకుంటాడు

దేహం గొప్పది దేహమే గొప్పదనకుండా!

ఆత్మలేదు

శరీరం అనాత్మ.

 చితిచింత లోని ఒక కవితలోని పై పంక్తులు “మో” వి.

మో ఇక లేరు.