దిద్దుబాటలు – దిద్దుబాటుకు ముందు కథలు 92

దిద్దుబాటు తొలి తెలుగు కథ అని అనుకున్నాం.  కాదు ఇంకా ముందే కథలున్నాయి అని అన్నారు.  సరే, దిద్దిబాటు కన్నా ముందు కథల సంగతి తేల్చుకుందాం అని అనుకున్నారు, వి వి న మూర్తి గారు.  ఇదేదో బాగానే ఉంది కదా?  రానున్న తరాల వారికి ఈ పుస్తకం ద్వారా ఆ కథలు వాటి నేపధ్యం గురించి తెలియజేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన నచ్చింది జంపాల చౌదరి గారికి.  జంపాల గారు తానా ప్రచురణ లకి అధ్యక్షులు.

కొన్ని ప్రశ్నలు – కొన్ని ఆలోచనలు
ప్ర:  ఏది కథ?
వ్రాసిన రచయిత గాని, అచ్చువేసిన పత్రికా సంపాదకులు గాని కథ అనడం.
ప్ర:  ఇంకా మన దృష్టికి రాని కథలు ఉండవచ్చా?
భవిష్యత్తులో బయటపడవచ్చు.
ప్ర:  తొలి కథ?
చిలక గురించిన సంభాషణ 1879 జనవరి జనవినోదిని
ప్ర:  తొలి కధా సంపుటం?
చిత్రమంజరి 1902 మే.  రచయిత రాయసం వెంకటశివుడు.
అయ్యా,  ఇంకా చాలా వివరాలున్నవి.  ప్రస్తుతానికి ఈ వివరాలు ఈ సేకరణ కి మాత్రమే పరిమితం.  ఇందాక అన్నట్టు.. మరి కొన్ని వివరాలు భవిష్యత్తులో బయటపడవచ్చు.

రచయిత , సాహితీవేత్త , కథానిలయం సారధి - వి వి న మూర్తి.
రచయిత, సాహితీవేత్త , కథానిలయం నిర్వాహకులలో ఒకరు – వి వి న మూర్తి.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) లక్షాలలో ప్రముఖమైనది తెలుగు భాష, సంస్కృతులను పోషించి, పరిరక్షించుకోవడం.  దాదాపు గత నాలుగు దశాబ్దాలుగా ఈ పని చేస్తూన్నది తానా.  అందులో ఒక పాత్రని పోషిస్తున్నది తానా ప్రచురణలు.  ప్రచురణలో లేని, ప్రచురణ కాని ముఖ్యమైన తెలుగు పుస్తకాలను ఉత్తమ ప్రమాణాలతో, ప్రచురించి  సాహిత్యాభిమానులకు అందుబాటులోఉండే ధరలకు అందిచడం తానా ఉద్దేశం.

రానున్న జూన్‌లో జంపాల చౌదరి 2015 జూన్ లో, తానా (TANA) కి అధ్యక్షుడిగాకూడా పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు.  ఇప్పుడు తానా ఆ పుస్తకాన్ని ప్రచురిస్తోంది.

Dr Jampala Choudaray - President Elect TANA
Dr. Jampala Chowdary, President – Elect TANA

రేపు అంటే శుక్రవారం, జనవరి 2, 2015 న విజయవాడ లో జరగనున్న తెలుగు పుస్తకాల పండుగ లో, దీనిని ఆవిష్కరించనున్నారు.  ఆవిష్కరించనున్నది ఆచార్య కడియాల రామ మోహన్ రాయ్ గారు.

Kadiyala Rama Mohan Roy
మే 1 న, విజయవాడలో కవిత 2012 ని (కీ శే. సి సుబ్బారావు గారు), కడియాల రామ మోహన్ రాయ్ గారు ఆవిష్కరించిన సందర్భం.

చిత్రకారుడు చంద్ర వేసిన ముఖచిత్రం తో వెలువడున్నది ఈ దిద్దుబాటలు.

దిద్దుబాటలు - diddubaaTalu
దిద్దుబాటలు – దిద్దుబాటకు ముందు కథలు 92. సంపాదకులు వి వి న మూర్తి
కధానిలయం, శ్రీ కాకుళం సౌజన్యంతో

496 పేజీలు, ధర 300.00 రూపాయలు. US $ – 25.

ప్రచురణ కర్తల కృతజ్ఞతలు
” శ్రీ కొడవళ్ళ హనుమంత రావు వితరణ, శ్రీ ‘నవోదయ’ రామ్మోహనరావు, శ్రీ వాసిరెడ్డి నవీన్ సహృదయత, శ్రమదానం, తానా కార్యవర్గం, తానా ఫౌండేషన్, మరెందరో హితోభిలాషుల సహకారం తో…”  ఈ పుస్తకం వెలువడుతోంది.

పుస్తకానికి ప్రూఫులు చూసిన ఎ.వి రమణమూర్తి గారికి, పుస్తకాన్ని అందంగా రూపొందించడంతో పాటు చదవడానికి వీలుగా పదవిభజన చేసిన అక్షర సీత గారికి అచ్చువేసిన చరిత ప్రెస్ పరుచూరి సుబ్బయ్య గారికి”  కూడా.

ఆంధ్రజ్యోతి లో వి వి న మూర్తి గారి దిద్దుబాటలు కి ముందు మాటలు ప్రచురించారు.  వాటిని మీరు ఇక్కడ చదువుకోవచ్చు.

ఒక చిన్న విషయం చెప్పుకోవాలి.  నా స్వార్ధం మరి.  తానా వారి ప్రచురణలు ప్రచురించిన కథ నేపధ్యం తొలి సంకలనం ఆవిష్కరణ 2012 జనవరి 3 న ఇదే విజయవాడలో అదే వేదిక మీద జరిగింది.  వేదిక మీద శ్రీమతి సత్యవతి పోచిరాజు, శ్రీరమణ, శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య, శ్రీ ‘నవోదయ’  రామ్మోహన రావు, శ్రీ తోటకూర ప్రసాద్ (అధ్యక్షులు తానా), తానా ప్రచురణల అధ్యఖులు శ్రీ జంపాల చౌదరి.  వారందరితోను నేను.

కథ నేపధ్యం 1 - katha - nepadhyaM 2012
కధ – నేపధ్యం. తొలి సంపుటి 2012. తానా ప్రచురణ

దయచేసి మీ ప్రతులకోసం వీరిని సంప్రదించండి.
ఇండియా లో:
AG – 2, ‘A’ Block, Mathrusri Apartments,
Hyderguda, Hyderabad 500029
Phone – 040 – 2324 4088.

USA
TANA Publications,20374, Buckthorn Court, Mundelein, Illinois 60060 USA

ప్రధాన విక్రేతలు;
ఆంద్ర ప్రదేశ్:
విశాలాంధ్ర ప్రబ్లిషింగ్ హవుస్, విజయవాడ (ఫోను 0866 -2572949) వారి బ్రాంచీలన్నింటిలోను.
నవోదయ పబ్లిషర్, ఏలూరు రోడ్డు, విజయవాడ – ఫోను 0866 – 2573500, 9849825204
ప్రభవ బుక్ సెంటర్, No- 16-2-157, Near Vijaya Hospital, Pogathota, Nellore, Andhra Pradesh 524 001 ఫోను:  ౦861- 2323 167 / 232 9567

తెలంగాణ:
నవచేతన పబ్లిషింగ్ హవుస్, హైదరాబాద్ వారి బ్రాంచీలన్నింటిలోను.
ప్రజాశక్తి బుక్ హౌస్, 1-1-187/1/2, Viveknagar, Chikkadpally, Chikkadpally, Hyderabad, Telangana 500020. ఫోను: 040 2760 8107
నవోదయ బుక్ హౌస్, 3, Kachiguda Station Road, Chappal Bazar, Kachiguda, Hyderabad, Telangana 500027 – 040 2465 2387

eBook:kinige.com /  కినిగె.కాం

కతల గంప – స వెం రమేశ్

ఇప్పుడే అందింది.  రమేశ్ పంపాడు.
ముఖచిత్రం చూస్తే ‘రయికముడి ఎరగని బతుకు’ (భూమిక, డిసెంబరు 2012) గుర్తు వచ్చింది.
అట్టమీద బొమ్మ వేసింది బి కిరణ్ కుమారి.  బాగుంది.  చూడగానే చేతిలోకి పుస్తకాన్ని తీసుకుని చదవాలనిపిస్తుంది…రమేశ్ ఎవరో,  రమేశ్ కతలేమిటో తెలియని వారికి కూడా!
ఆ నలుపు, తెలుపు రంగులలో ఒక అందం ఉంది.

పుస్తకం వెనుక తిప్పిచూస్తే…కొన్ని స్కెచెస్ ఉన్నాయి.  నలుపులో తెలుపు. అక్షరాలు కూడా తెలుపులో.
ఆ అక్షరాలతో మనం కూడ పరుగెడతాం!

రమేశ్ కళ్ళెదుట నిలిచిన కల లో కొన్ని మాటలు:
మళ్ళా ‘కతలమ్మో కతలు’ అనే నా గొంతు తెరువులో ఉలివింది.
తిరిగినాను, తిరిగినాను, తెరువంతా తిరిగినాను.  అది బాగా రూకలుండే తెరువే.  అంతకు ముందు నా కతల్ని అబ్బురంగా తీసుకున్నవాళ్ళు ఉండే తెరువే.  కాని నా కతలు వెలపోలేదు.
. . .
ఒక్కటీ నచ్చలేదు వాళ్లకు, ఒక్కటీ కతగా తోచలేదు వాళ్ళకు.
. . .
నాకు దిగులు కలిగింది.
. . .
అప్పుడు తిరుపతి ఉమన్న చెప్పినాడు, ‘పెద్దతెరువులోనే బండిని తిప్పితే ఎట్టాసామీ, సన్న సందుల్లో కూడా మణుసులు ఉంటారు.  అక్కడకూడ కతలంటే ఊపిరిచ్చేవాళ్ళు ఉంటారు.  ఒకసారి ఆ తట్టుకు పోయిరా పో’ అని.

పుస్తకాన్ని పూదోట శౌరీలు, మల్లవరపు విజయమరియదాస్ లకు అంకితం ఇచ్చాడు రమేశ్.

<img class="wp-image-19 size-full" src="https://telugu.anilatluri.com/wp-content/uploads/sites/3/2014/12/KathalaGampaBySaVeMRamesh_Anil_Atluri13thDec2014.jpg?w=808" alt=" kathala gaMpa" originalw="808" width="225" height="300" scale="2">
కతల గంప – తెలుగు కతలు కతకుడు స. వెం రమేశ్

పుస్తకం లో ఉన్న కతలు వాటి క్రమం:

తెలుగు సిన్నోడు తిమ్మరాయప్ప
మీసర వాన
ఊడల్లేని మర్రి
పదిమందికి పెట్టే పడసాల
ఆ అడివంచు పల్లె
కాకికి కడవడు పిచిక్కి పిడికిడు
రయికముడి ఎరగని బతుకు
చెట్లు చెప్పిన కత
సిడిమొ‌యిలు
బడకొడితి
వాడు గోపాలకృష్ణ కొటాయి
ఒంటినిట్టాడి గుడిసె
ఎందుండి వస్తీవి తుమ్మీదా
అబ్బిళింత
కతలగంప
మాదిగపుటక కాదు
మొ‌యిలు నొగులు
పాంచాలమ్మ పాట

ప్రతి కథ చివర అందులో తను వాడిన కొన్ని పదాలకి…మీకు, మీకేంటి నాకు కూడ అర్ధం అయ్యే తెలుగు పదాల అర్ధం ఇచ్చాడు.

ప్రతులకు మీరు పుస్తకం ధర రెండు వందలు పంపవలసింది ఇక్కడికి:
1-2-740, హనుమాన్ మందిరం దగ్గిర, రాకాసి పేట, బోధన్ 503 180
ఫోను: +91 90101 53505

గమనిక  పుస్తకంలో  ప్రతులకు “అన్ని ముఖ్యమైన పుస్తక కేంద్రాలు” అని ఉన్నా  అవి ఈ విషాదాంధ్రలో కాని, ప్రజాశ్రేయస్సులో కాని దొరుకుతాయన్న నమ్మకం లేదు.  కాబట్టి పై ప్రచురణకర్తలకి రొక్కం పంపండి.  అనుమానాలుంటే వారికి ఫోను చెయ్యండి.  చెబుతారు మీకు పుస్తకం ఎక్కడ దొరుకుతుందో.  వీలైతే వాళ్ళకి కొరియరు / పోస్ట్ ఖర్చులు పంపండి.  మరో పుస్తకం వాళ్ళు ప్రచురిస్తే మనకి మరో పుస్తకం అందుబాటులోకి వస్తుంది మరి!

నాలుగు అక్షరాలు – మూడు కథలు

ఆ మధ్య ఒక రచయితని అడిగాను, “మీరు ఎందుకు వ్రాస్తున్నారు?” అని.
ఠకీమని చెప్పాడాయన “డబ్బుల కోసం” అని.
మరొకరిని అడిగాను.  “అయ్ ఆమ్ ఎక్స్‌ప్రెసివ్” అని జవాబు.
ఆంధ్రులు కాదు తెలుగు వారందరూ అభిమానించే (సినవారు కూడా ఉన్నారు) జవాబు, “రాయక పోతే చచ్చిపోతా”.
సముద్రంలోనుంచి బయటపడి, చెట్టుమీదకి ఎక్కి కిందకి దిగాడు. అన్ని వందల వేల సంవత్సరాలలో, వాడికి శబ్దం చెయ్యడం వచ్చింది.  దానికి ఒక లయ ఏర్పచుకున్నాడు.  భాష అయ్యింది అది.  కథలు చెప్పుకోవడం మొదలయ్యింది.  అనుకుందాం! సరే మౌఖికంగా కథలు చెప్పుకుంటున్ననాటి నుంచి బూతులు, అసభ్యపదజాలం వాడుక దేశ కాల పరిస్థితులని బట్టి మారుతునే ఉన్నవి.  రోజు ఇంటా బయటా వింటున్నవేకదా?
ఫ్రీడ్‌మన్ అన్నట్టు,  డాల్ఫిన్స్ కి , వేల్స్ కీ కూడా భాష ఉంది.  మాట్లాడుకుంటాయి.  ఏనుగులు, కాకులు, కుక్కలు, పిల్లులు, పాములు అన్నింటికి ఒక భాష వుంది.  అన్ని ప్రేమించుకుంటాయి, కాట్లాడు కుంటాయి, తిట్టుకుంటాయి, ఆడుకుంటాయి అన్ని పనులు చేసుకుంటాయి.
“దిద్దుబాటు” తెలుగులో తొలి కథ అని అన్నారు. అబ్బే లేదు..ఇంకా చాలా కథలున్నవి  (దాదాపు ఒక తొంభై దాకా అని ఒక అంచనా!) దానికి ముందే అని తెల్ఛేసారు. రేపో, మాపో అవి మనచేతుల్లోకి రానున్నవి. (బహుశ ఈ  2014 లోనే రావచ్చు).దిద్దుబాటు ని షార్ట్‌ఫిల్మ్‌గా కూడా తీసాడు అట్టాడ అప్పల్నాయుడు గారి అబ్బాయి సృజన్.
సరే, దిద్దుబాటుతోనే మొదలు పెడదాం.
మరి ఆ రోజే సాని కొంపలున్నవిగా?
మగాడు తిరుగుతునే ఉన్నాడుగా?  ఆవిడ ఇంట్లోనే ఉందిగా?
“కన్యాశుల్కం” నుంచి, ఈ రోజు “వాడి పాకేజి నాకంటే తక్కువలేవే..వాడ్ని నేనెలాచేసుకుంటానే మమ్మీ?” అని ఈ రోజు చదువుకుని,ఉద్యోగంచేసుకున్న యువతి గారాలు పోతోంది.దిద్దుబాటు వెలువడిన సాంఘిక నేపధ్యం ఏమిటి?  దేశ కాల పరిస్థితులేమిటి?  ఈ రోజు దేశ కాల  పరిస్థితులేమిటి?  ఎరుపు రోజుల్లో కథకి ఒక సాంఘిక బాధ్యత ఉంది అని అనుకుని వాళ్ళు కథలు, నవలలు, కవితలు, నాటికలు గట్రా వ్రాసుకున్నారు.  అవి “గర్జించు రష్యా” రోజులనుకుంటే ఇవి “గాండ్రించు అమెరికా ” రోజులనుకోవచ్చు.  మరి మార్పు రాలేదా?మూలింటామె లో లాగా పందొసంత లాంటి వ్యక్తులు లేరా? అంటే ఉన్నారు! ఇప్పుడు కాదు..అనగనగా అప్పుడెప్పుడోనే ఉన్నారు.  ఈ రోజు బయటికి వచ్చిందా?  కాదే?  పల్లెటూళ్ల లో పాలేర్లు, రైతులు, రైతు కూలీలు అయితే, పట్టణాలలో సేల్స్ గరల్స్, ఆఫీసులో క్లెర్క్‌లు వాళ్ళ రాసలీలల మీద ఎన్ని కథలు రాలేదు!
మరి “అరుంధతి” (ఉన్నంతలో – రాజారామ్మోహనరావు – 2012 స్వాతి మాస పత్రికలో) రామారావు పక్కలోకి వెళ్ళలేదేం? (కథ 2012 సంకలనం – సం:  వాసిరెడ్డి నవీన్, శివశంకర్ పాపినేని)
కాబట్టి ఆ మార్పుని ఒప్పుకున్నవాళ్ళు ఈ మార్పులని కూడా అంగీకరించాలి.
అలాగే చదవతగ్గ రచన ఏదైనా సరే చదువుతారు.  దానికి భాష అడ్డం రాకూడదు.  కాని వచ్చేసిందిగా?!
భాషే కాదు.  వస్తువులో కూడా మార్పులు వచ్చేసినవి.

* * *

ఈ మధ్య వచ్చిన కథ ఒకటి.
ఎబినేజర్ అనబడే ఒక మాదిగ నింబోడి కథ ని వ్రాసింది కాశీభట్ల వేణుగోపాల్.
ఈయన “F” నాలుగు అక్షరాల పదాన్ని ఆంగ్లంలోనే అయినా వాడారు.  (ఈ నాలుగు అక్షరాల ఎఫ్ పదం ఏమిటని అడగేవారి కోసం కాదు ఇది వ్రాస్తుంట!)  అందులో ఎబినేజర్ పాత్రకి కళ్ళలో ఒక దానికి శుక్లం వచ్చింది.  శుక్లాన్ని ఆంగ్లంలో కాటరాక్ట్ అంటారు. కాటరాక్ట్‌ని కొన్ని ప్రాంతలలో కొంత మంది “కన్ను పూసింది” అని అంటారు. శుక్లం ని “కన్ను లో పూత” అని కూడ చెప్పుకుంటారు.   అంటే ఈ కథలో ఎబినీజర్ అనే పాత్ర కన్నుపూచింది.  కన్నులో పూవు.    కన్నులో పూవు ఉంది కాబట్టి ఆ వ్యక్తికి  *పూకంటోడు అనే మారుపేరు (నిక్‌నేమ్) ఎగతాళిగా పిలుచుకునే పేరు పెట్టారు.ఆ మారుపేరు తన పాఠకులకు అమోదయోగ్యంకాదని ఒకరో ఇద్దరో సంపాదకులు అభిప్రాయపడ్డారు.  ఆ మారుపేరులో వారికి బూతు వినపడింది.  అంతే కాదు వారికి అసభ్యంగాను అభ్యంతరకరంగాను తోచింది.  రచయితకి ఒక సూచన చేసారు.  ఎబినేజర్ “మారుపేరు” (nickname) మార్చండి. ఆ కథని మేము ప్రచురిస్తామని.  రచయిత ఒప్పుకోలేదు.  రచయిత “మా ప్రాంతంలో అలా కన్నులో పూత అంటే శుక్లాలున్నవాడిని అదే పేరుతో పిలుస్తారు.  అది జనబాహుళ్యంలో ప్రచారంలో ఉంది కాబట్టి నేను మీ సూచనను అంగీకరించను.  మీరు కథని ప్రచురించకపోయినా ఫరవాలేదు” అంటూ వివరణ ఇచ్చారు.
ఆ పత్రిక సంపాదకులు అంగీకరించలేదు.  కాబట్టి ఆ కథని అచ్చులో చదువుకునే అదృష్టం కొంత మంది పాఠకులకి దక్కలేదు.  కొంతమంది జాలపాఠకులకి (online readers)  ఆ దురదృష్టం కలిగింది.  అవును,  ఎవరు దీన్ని గురించి మాట్లడుకున్నట్టు కనపడలేదే!?

 F word and Telugu stories
నాలుగు అక్షరాలు – మూడు కథలు

మరో కథ

వాకిలి *వెబ్‌జైన్ లో పునీత కథ.
ఇందులో లచ్చుమమ్మ మొగుడు కామేశ్వరరావు.  ఆ లచ్చుమమ్మ వయసు  దాదాపు 39 ఏళ్ళు.  కాలేజిలో చదువుకునే సరయు ఈ దంపతుల కూతురు. మురళి లచ్చుమమ్మ మేనల్లుడు. డాక్టరి చదువుకుంటున్నాడు.  వాడి దృష్టి తన మీదకు “మళ్ళించుకోవడానికి సరయు తిప్పలు. దానిని వదిలి నా పక్క చేరడానికి వాడి చిరాకులు.” అని ఆ తల్లి స్వగతం.  మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా?  మురళీ తన మేనత్త తో గడపటానికే వాళ్ళింటికి  వెళ్ళడం. ఎందుకని అంటే ఆమెకి “చేతనైంది చెప్తే చచ్చిపోతావ్రా మగడా. కావాలంటే మురళిని అడుగు. నెలకు మూడుసార్లు ఇంత దూరం ఎందుకొస్తాడో తెలుస్తుంది” అనుకుంటుంది. లచ్చుమమ్మ  మళ్ళీ మరో మాట కూడా అనుకుంటుంది “అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?” అని.
ఎబనీజర్ పాత్ర వాడి పూకంటోడు అనే పేరు 2014 లోదే.
అరుంధతి పాత్ర 2012 లోదే
పునీత పాత్ర 2014 లోదే.
ఈ మూడు కథలని చదువుకున్నవారు ఉన్నారు.
మరో కథ
కీమో ఈ కథ వ్రాసింది వంశీధర్ రెడ్డి.  వైద్యుడు.
“కీమో” కథలో ఆరు చోట్ల *F* పదం వాడారు రచయిత. అది ఆంగ్ల పదం అయినా సంభాషణలు ఇంగ్లిష్‌లో కాబట్టి ట్రాన్స్‌లిటరేటేడ్ పదం అది. మరి ఇందాక భాష అనుకున్నామే?!  మరి ఇక్కడ ఇది కూడా వచ్చేసిందిగా?!

మరో సందర్భం;
ఈ సారి ఏకంగా ఒక వెబ్‌జైన్ సంపాదకుడే వాడేసుకున్నారు F పదాన్ని!
ఆయన మాటల్లోనే “I fucked up so many relationships. I want us to be a success“.
మరి దీనికేమంటారు ?

మరి మంచుపూవు లోని కావేరి కూతురు ప్రియ లో భార్యని చూసుకున్న తండ్రి ఆలోచనలని వెలికి తెచ్చిన రచయిత ని ఏంచెయ్యాలి?మొన్న వేదిక సమావేశం లో ఒక ఆంగ్ల కధని పరిచయం చేసాను.  Ba-Boon – థామస్ పియర్సన్ వ్రాసిన కథ అది. 2014 లొనే వచ్చిందా కథ.  అన్ని తనే అయిన సోదరుడు ఒకానొక దుర్ఘటనకి గురైన తరువాత అతని చెల్లెలు అతనికి తోడై ఉండాల్సిన పరిస్థితి.  తన బాయ్‌ఫ్రెండ్‌తో ఒకానొక సందర్భంలో ఒక compromising situation లో వీడియో షూట్ లో పాల్గొంటుంది.  ఆ టేప్ తెచ్చుకోవాలి.  కొన్ని వందల వీడియో టేపులన్నింటిని చూస్తేగానీ ఏది తనది అన్నది తెలియదు.  మరి సొంత అన్నతోనే ఆ వీడియో చూడాలా?  ఈ అంశాన్ని ప్రంపంచంలోని ప్రతి ఆంగ్ల పాఠకుడు అంగీకరిస్తాడా?
కొవ్వలి నవలలని  జాకెట్లలలో, లంగాలలో, ఓణీలలో దాచుకుని చదువుకునే వారు ఒకనాటి చదువుకున్న స్త్రీలు. అలాగే మధు పుస్తకాలని కూడా దాచుకుని చదువుకునేవారు ఈ జాలం అవతరించకముందు.ఇప్పుడు వస్తున్న ఈ కథలమీద,  ఆ కథల కోసం తీసుకున్న వస్తువు మీద, ఆ పాత్రలు వాడిన భాషమీద  కొంత మంది పాఠకుల అభిప్రాయాలని చదివిన తరువాత, ఇవన్నీ కూడా సెక్సు అంటే బూతు పదాలు వాడినందుకు వచ్చిన విమర్శలు అనే అనిపిస్తోంది.  కొంత మంది అనుకునే బూతు ఆలోచనలు, అవి  బయట పెట్టినందుకు వచ్చిన విమర్శలు గానే మిగిలిపోతాయి తప్ప మరొకటి కాదు.
మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా అంతర్జాలం లోనే వెబ్‌జైన్‌లలోనే వెలువడ్డవి. అంతర్జాలానికి ఎల్లలు లేవు.  అలాగే అక్కడ స్వేచ్చమీద కట్టడి లేదు.కా రా మాస్టారు అన్నట్టు:  ”  చీకటిలో ఉన్నా కొందరందులో వెలుగుని గురించి రాస్తారు.  వెలుగులో ఉంటూ జీవితం లోని చీకటి గురించి రాస్తారు.  వెలుగే తప్ప చీకటిని ఎరుగని వారు అందులోని నీలి నీడలనే చీకటిగాను, మరి కొందరు చీకటి చీకటి కాదని, వెలుగే చీకటి, చీకటే వెలుగని రాస్తారు”          ( కా రా రచనలు పుట 379).
ఆయన వ్రాసిన సందర్భం వేరైనా ఈనాటి కథకులకి, పాఠకులకి తెలియాల్సి ఉంది.

ఆంక్షలు పెట్టకండి.వచ్చేవి ఎలాగు వస్తాయి.  పొయ్యేవి ఎలాగూ పోతాయి.
మంచి ముత్యాలని ఏరుకోవడమే మీరు చేయగలిగింది!
ఏది మంచి?  మీకు ఏది మంచి అని తోస్తే అదే మంచి!!

వ్యాపారస్తుడు దొంగ.

అప్పట్లో ఇంటర్‌నెట్ లేని రోజుల్లో గ్రీటింగ్ కార్డులతో పుట్టిన రోజులకి శుభాకాంక్షలు, గిట్టిన రోజులకి సందేశాలు కూడా పంపుకునేవారు.  ఆ రోజుల్లో కొంచెం చదువుకున్నవారు, మహానగరాలలో ఉండేవారు (భారతదేశంలో)  వకీల్స్ వారి గ్రీటింగ్ కార్డులు కొనుక్కుని పంపేవారు.  చక్కని సందేశాలతో, ముచ్చటైన బొమ్మలతో కళాత్మకంగా ఉండేవి అవి. గ్రీటింగ్ కార్డులు కూడా కళాత్మకంగా ఉంటాయా అని అడిగేవారితో నాకు అస్సలు పేచి లేదు.  అందుకని వారి జోలికి వెళ్ళను.  వకీల్స్, ఎలార్ రోజుల్లో వారికి పోటిగా ఆర్చీస్ అనే సంస్థ  బయలుదేరింది.

ఆనాటి నవతరం, యువతరం కోసం వాళ్ళు కార్డ్లు మొదలుపెట్టారు.  ఆ తరువాత పెన్నులు, గన్నులు, బొమ్మల అమ్మకాలన్నింటిలోకి ప్రవేశించారు.  మొదట్లో ఈ గ్రీటింగ్ కార్డులమీద ధరల వివరాలుండేవి కాదు.  దుకాణందారు తనకిష్టం వచ్చిన ధరకి అమ్మేవాడు.  కొనుక్కునేవాడు..మనసులోనే నిక్కినా నిలిగినా కొనుక్కునేవాడు.  తప్పదు.  కొంత పీర్ ప్రెజర్ కూడా ఉండేది.  రీడర్స్ డైజెస్ట్ చేతిలో లేకపోతే వాడొక వెధవాయ్ అన్నటైపులో అన్నమాట!  ఇప్పుడు “చే” బొమ్మతో ఉన్న కాలర్‌లెస్ టీ వేసుకున్నట్టు.  (“చే” ఎవరు అని ఆడిగితే, “చీ, చీ..నన్నే అడుగుతావా  అని తన తెలియని తనాన్ని దాచుకునే వెధవలున్నట్టు).

వ్యాపారస్థులందరూ దొంగలు కాదు!
వ్యాపారస్థులందరూ దొంగలు కాదు!

అలాంటి రోజుల్లో బ్రతక నేర్చిన మిత్రుడు (వాడు బ్రతకనేర్చినవాడని అంతకుముందే తెలిసింది..అది మరొక కథ) ఎవరి బర్త్‌డేకో గ్రీటింగ్ కార్డ్ కావాలని రావడం..(నాతో సెలక్ట్ చేయించుకోవాలని అప్పట్లో తాంబరం నుంచి బెసెంట్ నగర్ నుండి, పరశువాక్కం లాంటి దూరప్రాంతలనుండి వచ్చేవారు)  ఒక చక్కని కార్డుని అసలు ధరకే (లాభాలు లేకుండా..మిత్రుడు కదా?) తీసుకోవడం అయిపోయింది.  పాపం డబ్బులిద్దామని పర్సుతీస్తే అందులో అన్ని వంద రూపాయల నోట్లే!

“అలా రా బాస్,  టీ తాగి, దమ్ము కొడదాం. హోటల్ వాడు చిల్లర ఇస్తాడులే” అని నన్ను లాక్కువెళ్ళాడు.  గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్, టెన్స్ పాకెట్ ఆ రోజుల్లో అక్షరాల ముప్పై రూపాయలు.  నా షర్ట్ జేబు ఎప్పుడు దానితో నిండుగా ఉండేది.  (కొందరిలాగా పాంట్ జేబులో పెట్టుకుని దాచుకోవడం నాకు తెలీదు).  సరే, ఒకటి మనవాడికిచ్చాను..నేను ఒకటి అంటిచ్చుకున్నాను.  స్పేషల్ టీ ఆ రోజుల్లో మూడు రూపాయలు.  ఇద్దరికి ఐతే రెండుకప్పుల నిండా వచ్చేది.  ఆ స్పెషల్ టీ తెచ్చిన బేరర్ కి చిల్లరలేక..పావలా టిప్పు.  బిల్లు పే చెద్దామనుకున్న మిత్రుడు మళ్ళీ వంద రూపాయల నోటు ఇస్తే..హోటల్ యజమాన్ నవ్వుతూ నా వంక చూశాడు.  ఆ మూడు రూపాయలు నేనే ఇచ్చాను. (ఇందాకటి పావలా టిప్పు కూడా నాదే!)

ప్లాట్‌ఫార్మ్ మీద నిలబడి కబుర్లు చెప్పుకున్నాం.  ఒక రెండు నిముషాలు.  గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్ కదా అనేమో మిత్ర గురువు  దమ్ము లాగుతున్నాడు..ఫిల్టర్ కూడా కాలిపొయ్యేటట్టుంది.  అప్పుడు దానిని చూపుడు వేలు మధ్యవేలు మధ్యన పెట్టుకుని చమత్కారంగా విసిరేసాడు.  అది హోటల్ పక్కనే ఉన్న బడ్డికొట్టుముందు వీధిలాంతరు స్థంభానికి తగిలి కింద పడింది.

“సరే బాసు, మళ్ళీ కలుద్దాం”, అంటూ నేను రోడ్డు దాటడానికి కదులుతూ..అతనికి షేక్‌హాండిచ్చి రాబోతుంటే..చెయ్య్ పట్టుకుని ఆపేసి అన్నాడు కదా..”బాసు రెండు రూపాయల కార్డు కొని, మూడు రూపాయల సిగరెట్టు, ఒక స్పెషల్ టీ కొట్టేసాడేంటి వీడు అని అనుకుంటున్నావా?”

అతను అనేదాక ఆ ఆలోచన నా ఊహలోకి కూడ రాలేదు.  అప్పుడు వచ్చింది.  కార్డు కొన్నానంటాడు అది కూడా ఫ్రీ గానే తీసుకున్నాడు గా అని.  అదేమి లేదులే అని నవ్వేసి, చెయ్యి వదిలించుకుని వచ్చేసాను.

అఫ్‌కోర్సు..ఏదో ప్రభుత్వ సంస్థలో లంచం ఇచ్చి ఉద్యోగం సంపాయించుకున్నాడు.  ఇద్దరు కూతుళ్ళకి అమెరికా సంబంధాలు చేసాడు.  కోట్ల రూపాయల విలువగల భవంతుల యజమాని ఈ రోజు.

ఇదంతా ఎందుకు చెప్పానంటే..ప్రతి వ్యాపారస్థుడు దొంగ కాదు, చీట్ కాదు. వాడికి స్నేహాలు, బంధువులు, ప్రేమలు, అభిమానాలు, నైతిక విలువలుంటాయి!  నిన్న ఎవరో ఫేస్‌బుక్‌లో వ్యాపారస్థుడుకి అలాంటివి ఉండవన్న అర్ధం వచ్చే మాటన్నారు, అందుకని ఈ ఏడుపు!

డేంజరస్ కథకుడు

నిండా డేంజరస్ మనుషులుండారు ఈ ప్రపంచంలో. అతి ప్రమాదకారులు వీరు.  మాటలతో మనల్ని మాయజేస్తారు.  ఇదిగో అంటారు.  అదిగో అంటారు.  వీళ్ళు మన నోటికి వినిపిస్తారు.  చెవులకి చూపిస్తారు. చొంగ కారుతుంటుంది ఒక పక్క. చేతులూపుకుంటూ, కళ్ళు తెరుచుకుని వాళ్ల మాయమాటల దారెంట వెళ్ళిపోయి వాళ్ళు చూపించే ఆ మరో ప్రపంచాన్ని కంటాం! చిన్నపిల్లల్లగా!!

Sa Vem Ramesh
సా వెం రమేశ్

డబల్ ఢమాకా అంటారనుకుంటా..ఒక కథతో మొదలుపెడతాడు, మరో కథ మొదలుపెడతాడు.  వాటి చుట్టూ మరో ప్రపంచాన్ని సృష్టిస్తాడు.  ఆ మూడింటీతో పాటు మరో కొత్త అంశం ప్రవేశపెడతాడు. త్రీ డి అంటారే.  అలా! కళ్ళు తిరుగుతాయి.  ఆ సుడిగుండంలో పడిపోతాం.  గిరా గిరా తిరుగుతాం,  పడి కొట్టుకుపోతాం.  మన లోపలికి నీళ్ళేళ్ళిపోతాయి. మరో కొత్త భాష! మరో కొత్త కోణం.  మరో కొత్త మూలం అవిష్కరింపజేస్తాడు.  ఎక్కడో తెల్తాం.  అక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది..కాని ఉండలేం కదా! ఒక జీవితం ఉంది కదా?  ఒక జీవనం చెయ్యాలి కదా?  ఒక జీవిక కావాలి కదా?

కాని అతనికి అదే జీవితం, అదే జీవనం, అదే జీవిక అయ్యింది. సిగ్గు ఎవరికి ఉండాలో మరి?

భగ, భగా, ధగ ధగా మెరుస్తూ కళ్ళు మిరిమిట్లు గొలుపుతుంది., సిడిమొయిలు.  అలాంటి లోకం ఒకటి ఉందా?  తెలుసుకోవాలంటే వివరాలకు కథ 2013 ని కొనుక్కుని చదువుకోండి! కథకి అద్భుతమైన బొమ్మ గీసినవారు ఏలే లక్షణ్.

sidimoyilu katha
Illustraton by Lakshman Aelay

అన్వర్ కి ధాంక్స్‌తో..

ఆదివారం.  మార్చ్ 2, 2014. మళ్ళీ SMS.  ఆర్టిస్ట్ మోహన్ గారి పిలుపు.  మనవాళ్లందరూ వస్తున్నారు.  మీరు కూడా రావాలి.  మన శేఖర్ కి మనం చెయ్యాలి! సందర్భం శేఖర్ కార్టూనిస్ట్‌గా గోల్డెన్ జూబిలి సెలబ్రేషన్.

శేఖర్ కార్టూనిస్ట్ గా నే పరిచయం అయ్యాడు  ఆంధ్రజ్యోతి లో.  కె.పి డెస్క్ పక్కనే.  కె.పి ని దాటుకుని శేఖర్ డెస్క్‌కి వెళ్ళాలి.  ఆ పక్కనే వసంతలక్ష్మి గారి డెస్క్.

కినిగె కి తన కార్టూన్ పుస్తకాన్ని ఇచ్చిన తొలి కార్టూనిస్టు శేఖర్.  అదొక అభిమానం.  తరువాత ఎప్పుడో ఒకసారి నా మీద కోపగించుకున్నాడు కూడా!  “నాకు మీరు పిచ్చేశ్వరరావు గారి అబ్బాయని ఎందుకు చెప్పలేదు.  ఆయనంటే మా తరానికి ఎంత ఇష్టమో, మీకు తెలియదు. అటువంటి వాళ్ళు అంత త్వరగా వెళ్ళిపోవాడనికి హడావుడి ఏమిటో?” అనుకున్నడు స్వగతంగా.

అమెరికా సంయుక్త రాష్ట్రాలకి వెళ్లబోయేముందు, వెళ్ళి వచ్చిన తరువాత తన పుస్తకాన్ని డిజిటల్ బుక్‌గా ఎలా డిజైన్‌చేస్తే బాగుంటుందో అని కలిసినప్పుడు మాట్లాడుకునేవాళ్ళం.  కలవనప్పుడు ఫోన్ చేసేవాడు.  ఫోనులో “తింటున్నాన్నా?” అని అడిగి నవ్వేవాడు.

“సార్, మీ ఇంటికి దగ్గిర్లోకి మారుతున్నాను. మనం ఇక రోజు కలుసుకోవచ్చు.  బహుశ నేనే మీ ఇంటికి వస్తాను.  కలిసి టీ తాగోచ్చు,” అని ఎంతో సంతోషంగా నవ్వుతూ చెప్పినప్పుడు ఆనందమేసింది.

తరువాత ఎప్పుడో తెలిసింది..ఆరోగ్యం బాగోలేదని.  ఇంటికి వెళ్ళి పలకరించాలని అనుకునేటప్పడికి ఇల్లు మారడం కూడా ఐపోయింది.

Cartoonist Chandrasekher
Cartoonist Chandrasekher (Jul 16, 1965 – 19 May 2014)

ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ ‌క్లబ్‌లో అతని కోసం చూసాను.  కొంచెం ఆలస్యం అయ్యింది నేను వెళ్ళేటప్పటికి.  మనిషి కనబడలేదు.  వెతుకున్నాను.  కాప్..నోటికి మాస్క్ అడ్డం ఉంది.  ఆ మాస్క్ పైన కళ్ళు. నవ్వు.  ఉగ్గబట్టుకున్న ఆనందం.  సంతోషం.  ప్రెస్‌క్లబ్ నిండిపోయింది.  కాని మనిషిని చూసిన నేను ఖంగు తిన్నాను.  నాకు తెలిసిన శేఖర్ రూపు కాదది.  మనిషి మొఖంలో విపరీతమైన అలసట. సగం అయిపొయ్యాడు.  ఎందుకో ఉండబుద్ది కాలేదక్కడ.  తనతో మాట్లాడడానికి తగిన ప్రదేశమూ కాదు..సందర్భమూ కాదు.  ఈ లోపు ఒకటికి రెండు సార్లు ఫోను చేసిన అన్వర్, sms లు గుప్పించిన ఇతర మిత్రులని పలకరించాను.

హడావుడిగా పరిచయుస్థుడొకాయన వచ్చాడు.  పక్కనే శ్రీమతి అనుకుంటాను.  పేద్ద పూలమాల.  ఒక పుష్ఫగుచ్చం.  హడావుడి హడావుడిగా వేదిక దగ్గిరకు దాదాపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపొయ్యారు.  ఆఖరి చూపు.  పార్ధివ శరీరాన్ని పుష్పమాలంకృతాన్ని చెయ్యాలన్న తాపత్రయం కనపడింది ఆ వేగంలో, ఆ మాటల్లో, ఆ గమనంలో.  విరక్తి పుట్టింది.

విజయవాడలో “మో” హాస్పిటల్‌లో ఉంటే..”సార్,  ఐపోయ్యిందా?  డిక్లేర్ చేసేద్దామా”?   అని స్ట్రింగర్స్ శ్రీ శ్రీ విశ్వేశ్వరావు గారిని పీక్కు తిన్న వైనం గుర్తోచ్చింది.  మనసు రోసింది. అసహ్యం వేసింది. రోత పుట్టింది.

వెళ్ళిపోదామని వెనక్కి తిరుగుతుంటే..అన్వర్ ఎదురువచ్చాడు.  “సార్, వెళ్ళిపోతున్నారా?” అంటూ. ఔనన్నట్టుగా తలూపూతూ గేటు వైపుకి కదులుతుంటే..”వుండండి సార్..రెండు మాటలు మాట్లాడి వెళ్లండి”  అని అన్నాడు.  వాళ్ళ మధ్య నేనేమి మాట్లాడుతాను అనుకుంటూ నిలబడిపొయ్యాను.  “ఉండండి సార్.  ఒక్క రెండు మాటలు మాట్లాడండి.  తనుకూడా వింటాడు కదా?”అని అన్నాడు. ఇక ఆ మాటకు తిరుగులేదు.  సరే అని ఆగి పొయ్యాను.

ఈ లోపు మాట్లాడేవాళ్ళున్నారు.  వాళ్ళ తరువాత..అన్వర్ నాకు మైకు ఇప్పించాడు.  శేఖర్ వెనకకి చేరుకున్నాను.  శేఖర్ భుజం మీద చెయ్యి వేసాను.  శేఖర్ నా ముఖంలోకి చూసాడు.  మా ఇద్దరి కళ్ళు కలిసినవి.  He knows.  He knew, I knew. He also knew that my heart is with him. I wished him all the best with all my heart.  I expressed my good wishes to all his frineds for supporting him at that time. లేచి నిలబడ్డాడు.  కౌగలించుకున్నాడు.  That was the parting embrace. I knew.

మైక్ ఆర్టిస్టు మోహన్ గారికిచ్చాను.  అన్వర్ కి థాంక్స్ చెప్పాను.  వచ్చేసాను.

మా అమ్మ పోయినప్పుడు చలసాని ప్రసాదరావు గారు రాలేదు.  దానికి ఆయన చెప్పిన కారణం.  “నాకు మీ అమ్మ చక్కగా సంతోషం గా నవ్వుతూ ఉన్నప్పుడు చూసిన జ్ఞాపకం.  నాకు అదే గుర్తుంచుకోవాలని ఉంది” అని.
చంద్రశేఖర్ విషయం లో నాది అదే ఉద్దేశం. అందుకే కొడుకు పెళ్ళికి వెళ్ళలేక పొయ్యాను.  ఈ రోజు వెళ్ళడం లేదు.  ఫోటో కూడ తను నవ్వుతున్నదే పెట్టాను.

ఆ రోజున అన్వర్ నన్ను గుర్తుపెట్టుకుని పిలవకపొతే..నాకు శేఖర్ చిరు దరహసం అందేది కాదు.

గుడ్‌బై శేఖర్.  You are a good friend.  I shall remember your smile.  Always.

ఇది వ్యాపారం కాదు.  నేను ఇప్పుడు కినిగె లో లేను కూడా!  శేఖర్ పుస్తకాలు ఇవి కొన్ని అని చెప్పడానికి మాత్రమే:  http://kinige.com/author/Shekar

నో

“నాన్న”.
“ఊ..”

“రిటైర్..అయిపోయింతరువాత, ఏం చేద్దామనుకుంటున్నావు?”
“ఇక్కడే ఉంటాను”.

No  నో

“అలా కాదు, ఒంటరిగా ఇక్కడెందుకు?  మా దగ్గిరకు వచ్చి ఉండవచ్చుగా?”
“ఉహూ”.
“ఎందుకని?”

“మీ ఇంటికి వస్తే, నేను మీ హౌజ్ రూల్స్ పాటించాలి.  అదే నా ఇంట్లో ఐతే నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను.  ఇన్ని సంవత్సరాలు నేను, మీ అమ్మ అందరం అలానే ఉన్నాం.  మీ ఇంట్లో అలా ఉండటానికి కుదరదు. అందుకని, నో!”

కొత్త వంతెన

“కొత్త వంతెన”

నిన్న సాయంత్రం “కొత్తవంతెన” పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది.  “ఆంధ్రజ్యోతి” దిన పత్రిక సంపాదకుడు.  కె.శ్రీనివాస్, ఈ వ్యాసాలను తొలుత “ప్రజాతంత్ర” పత్రికలో దాదాపు ఒక దశాబ్దం క్రితం ప్రచురించారు.  వాటన్నింటిని ఇప్పుడు మళ్ళీ ఒక సంకలనం కింద “అనేక పబ్లికేషన్స్” ప్రచురించింది.

ఘంటా చక్రపాణి నిర్వహించిన ఈ సభలో “కొత్తవంతెన‌” అచ్చు పుస్తకాన్ని టిజాక్ అధ్యక్షులు కోదండరామ్ ఆవిష్కరించగా,  “కినిగె‌” ఈబుక్ ని ఆచార్యులు జి హరగోపాల్ ఆవిష్కరించారు. రచయిత కె శ్రీనివాస్ కోరిక మేరకు “గొంతు బాగొలె”దంటునే “జై తెలంగాణ” పాటని పాడి ప్రముఖ గాయకుడు అందెశ్రీ సభికులను అలరించారు.

"కొత్త వంతెన‌" - కె శ్రీనివాస్ వ్యాస సంకలనం ఆవిష్కరణ సభ
“కొత్త వంతెన‌” – కె శ్రీనివాస్ వ్యాస సంకలనం ఆవిష్కరణ సభ

వేదికని అలంకరించినవారిలో షాజహాన, జూపాక సుభద్ర, “నమస్తే తెలంగాణ” సంపాదకుడు అల్లం నారాయణ ఉన్నారు.

విరసం సభ్యులు వరవరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సభలో మరో విశేషం ఏమిటంటే, రచయిత శ్రీనివాస్ తండ్రి శ్రీ సింగరాచార్యులు పాల్గొని ప్రసంగించడం.

చిల్లర

రెండు పదుల నోట్లు ఇచ్చినప్పుడు  చాకలి..’చిల్లర‌’ అని గొణుకున్నప్పుడు మంగళ రావు దృష్టి బట్టల ఇస్త్రీ లెక్ఖల మీద పడింది.  ఈ లోపు అతను చిల్లర తేవడానికి పూరి పాకలోని గది లోపలికి వెళ్ళాడు.

మూడు షర్ట్లూ.  ఒకొక్క దానికి నాలుగు రూపాయలు. మూడు నాలుగులు పన్నెండు రూపాయలు.  తను ఒక పది రూపాయల నోటు, ఒక రెండు రూపాయల బిళ్ళ ఇస్తే సరి పోయేది అనుకుంటూ, పాంటు జేబులో చెయ్యి పెట్టి చూసుకున్నాడు.  నాణేలు లేవు.  తన దగ్గిర అవి ఉండవు కదా!
రెండు నిముషాలు ఐనవి.

చిల్లర

చాకలి వెతుక్కుంటున్నట్టు న్నాడు.

చిల్లర లేదేమో..ఉంచుకోమని అందామనేలోపు అతను చిల్లరున్న కుడి జేతిని జాపుతూ ముందుకి వచ్చాడు. “ఉంచుకో తరువాత తీసుకుంటాలే,”  అని అంటూ మంగళరావు చెయ్యి జాపాడు. “ఉన్నాయ్ సారు”, అంటూ అతను మూడు నాణేలు మంగళరావు చేతిలో బెట్టాడు.  “నేన్నది చిల్లర..డబ్బులు కాదు”, అంటు మంగళరావు డబ్బు అందుకున్నాడు.లెక్ఖబెట్టకుండానే పాంట్ జేబులోకి వదిలాడు వాటిని.

#ghatana

కవులు గుర్రపు డెక్కలు కారు..కవి శివారెడ్డి

నిన్న రవీంద్ర భారతిలో జరిగిన కిన్నెర వారి తెలుగు వెన్నెల కవిత మహోత్సవాల సందర్భంలో కొందరు కవులు తమ తమ కవితలతో సదస్యులను రంజింపజేసారు. నిన్నటి సభలో కీలకోన్యాసం ఇచ్చిన శ్రీ కె. శివారెడ్డి గారి ఉపన్యాసం కూడా మీరు ఇక్కడ విన వచ్చు.

కవులు గుర్రపు డెక్కలు కారు

 

మొదటి భాగం

రెండవ భాగం

మూడవ భాగం

శివారెడ్డి కవిత ఆయనే ఆలాపించాడు.

గమనిక

మనవాళ్ళు వొట్టి వెధావాయలోయ్
ఇది నా దగ్గిర ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో స్ప్రీకర్ అనే అప్‌ తో రికార్డ్ చేసింది.  మధ్యలో వచ్చిన ఫోన్ కాల్సు మూలంగా రికార్డింగ్ దెబ్బతిన్నది.  సాంకేతిక కారణాలు నా నియంత్రణలో లేవు. అందుకని ప్రసంగంలో కొన్ని భాగాలు మీకు అందివ్వలేక పోతున్నాను. మిగతా కవులందరి కవితలను వారి గొంతులతోనే మీకు వినిపించే అవకాశం కలిగించాలి అన్నది కూడ నా ఉద్దేశం.  ఈ రెండు మూడు రోజులలో ఆ పని కూడా ముగిస్తాను.