వెలగా వెంకటప్పయ్య

మొన్న మళ్ళీ కాళీపట్నం రామారావు మాస్టారి నవతీతరణం అభినందన ప్రత్యేక సంచిక చదివినప్పుడు వెలగా వారి వ్యాసం చదివాను.  చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వారి వయస్సుకి అంతర్జాలం గురించి ఆ మాత్రం అవగాహన ఉండటం.  అంతే కాదు ఆ ఏడు పేజీల సాహితీ వ్యాసం చివరి పేరగ్రాఫ్ లో వారన్న మాట: “ఇంటర్‌నెట్ ఉంటే ప్రతి ఇల్లు ఒక కథానిలయం అవుతుంది…కారా మాస్టారు సేకరించిన అపూర్వ కథా సంపదను అధికంగా ఉపయోగించినా, అసలు ఉపయోగించకపోయినా శిధిలమౌవుతుంది.  శిధిలం మాట మరిపించేది, మురిపించేది అంతర్జాల మాయాజాలం.”

Dr Velaga Venkatappaiah, Tenali
డా. వెలగా వెంకటప్పయ్య (1930 – 29 Dec 2014)

సాక్షి దిన పత్రిక లో నేను వ్రాసిన గూగుల్ నెట్‌లో e బుక్స్ చదివి వెంటనే నాకు ఫోన్ చేసి అభినందించిన వారిలో ఆయన ఒకరు.  ఆ వ్యాసాన్ని ఆయన ఆంధ్రా యూనివర్సిటి కి సమర్పించిన ఒక పత్రంలో ప్రస్తావించానని, అక్కడి విద్యార్ధులకి అందజేసానని కూడ తెలియజేసారు.

తెలుగునాట గ్రంధాలయాల ఏర్పాటు కోసం ఆయన చేసిన కృషి చాల గొప్పది.

కవిరాజు త్రిపురనేని రామస్వామి అంటే వారికి అభిమానం.  కవిరాజు మనుమడిగా ఆ అభిమానం నా మీద కూడ కొంత చూపించారనుకుంటాను.  మేము మద్రాసులో ఉన్నప్పుడు ఆక్కడికి వచ్చినప్పుడల్లా మా అమ్మ ‘కవిరాజు’ కుమార్తె చౌదరాణి ని తప్పక కలిసేవారు.

ఆదివారం మే 6, 2012 న కేంద్ర సాహిత్య అకాడెమి కవిరాజు త్రిపురనేని రామస్వామి సాహిత్యం మీద గుడివాడ లో నిర్వహించిన సదస్సులో వారు కూడ పాల్గొన్నారు.

Seminar on Kaviraju Tripuraneni Ramaswamy
The invitation to the seminar on ‘Kaviraju’ Tripuraneni Ramaswamy.

వెలగా వారు ఈ రోజు ఉదయం విజయవాడలో ఆయుష్ హాస్పిటల్స్ లో ఆఖరి శ్వాస తీసుకున్నారని తెలిసినప్పుడు బాధవేసింది. మరో స్థంభం నేల కూలింది.

రచనలు
వారి రచనలలో కొన్ని, వాటి  ముఖచిత్రాలు ఇక్కడున్నవి.  సాహిత్యాభిమాని – ఆర్ బి రావ్ సౌజన్యం.
https://www.facebook.com/media/set/?set=a.10155009212985385.1073741875.624985384&type=1&l=1ce9757082

ఇంద్రజాలికుడు

వరండాలో నుంచి హాలు గుమ్మందగ్గిరకి వెళ్ళి లోపలికి తొంగి చూడ్డం.  అమ్మ కనపడుతుంది శూన్యంలోకి చూస్తూ.    తన పక్కన అందరూ స్త్రీలే.  అమ్మ కి అటువైపు చాప మీద నాన్న కదలకుండా.  ఎవరి దుఃఖంలో వారు.

నేను బేరుమని ఏడవడం.  ఇవతలికి రావడం. వరండాలో పేము కుర్చిలో కూలబడటం. ఏడుపు.  చూట్టూ ఉన్నవాళ్లలో ఎవరో ఒకళ్ళో ఇద్దరో దగ్గిరకి తీసుకోవడానికి ప్రయత్నించడం.  నేను వాళ్ళని దూరంగా నెట్టివేయడం. కాసేపటికి వెక్కిళ్ళు ఆపుకోవడం.  ఈ లోపు మరెవరో హాలులోకి వెళ్ళడం.  మళ్ళీ లోపలినుండి సన్నగా రోదన మొదలవ్వడం.

అది విని నేను మళ్ళీ బిగ్గరగా ఏడవడం.  వెక్కిళ్ళు.  నా స్నేహితులు ఎవరూ పక్కన లేరు.  ఒంటరిని.  ఎవరి దగ్గిరకి వెళ్ళకుండా నేను ఆ పేము కుర్చిలో కూర్చుని ఏడుస్తున్నాను.  చుట్టూ తెలిసినవాళ్ళు, తెలియని వాళ్ళు, బంధువులు, పరిచయస్తులు అందరూ పెద్దవాళ్ళే.

నా స్నేహితులు ఎవరూ లేరు.
వెనక ఎక్కడో నా మోతి ఏడుపు.

ఆ రాత్రి విలపిస్తూ, రోదిస్తున్నప్పుడు వచ్చాడు ఆయన.  ఏవో వాళ్ళతో గుసగుసలు.  లోపల హాల్లోకి వెళ్ళివచ్చాడు. ఆయన్ని గుర్తు పట్టాను.  ఏమి మాట్లాడలేదు. నేను ఏడుస్తున్నాను.  ఎవరో నా పక్కనే ఒక ఫోల్డింగ్ చెయిర్ వేసారు.  కూర్చున్నాడు, ఆయన.  గుర్తుపట్టాను ఆయన్ని. అంతకుముందు ఏవో స్టూడియోలలో షూటింగులలో చూసాను.  ఆయనంటే ఇష్టం కూడా.  నెమ్మదిగా నా ఎడమరెక్క పట్టుకుని దగ్గిరకు తీసుకున్నాడు.  ఒళ్ళోకి తీసుకున్నాడు.  కళ్ళు తుడిచాడు.  ఏవో అవి ఇవి మాటలు చెపుతున్నాడు.  నేను వినడం మొదలుపెట్టాను.  చేతులు కదిలిస్తున్నాడు.  ఖాళీ అరచేతులు.  గబుక్కున అందులో ఒక కలం కనపడింది.  గుప్పెట మూసాడు. తెరిచాడు.  అరచేతిలో ఏమిలేదు.  మళ్ళీ ఖాళీ.  మరో చెయ్యి చూపించాడు.  అందులో ఉంది కలం.  ఈ సారి నాణేలు.  గుప్పిట్లో చూపించి మూసి తెరిచాడు.  లేవు.  తన షర్ట్ జేబులోకి వెళ్ళిపోయినవి.

నా ఏడుపు ఆగిపోయింది.  మళ్ళీ నాకు ఏవో కబుర్లు చెప్పాడు.  తల నిమిరాడు.  బుగ్గలు నిమిరాడు.  కళ్ళు తుడిచాడు.  నా స్నేహితుడి లాగా బుజ్జగించాడు.

లేచి నిలబడ్డాడు.  ఎవరినో పిలిచాడు. వారికేదో చెప్పాడు.  హాలులో నుంచి ఎవరో వచ్చారు.  వరండా లోనుంచి నన్ను హాల్ లోకి, అటునుంచి పడకగదిలోకి తీసుకెళ్ళారు.  నా మంచం మీద పడుకోబెట్టారు.  దుప్పటి కప్పారు.  నేను అలాగే నిద్రపొయ్యాను.

ఆ తరువాత కూడ ఆయన అప్పుడప్పుడు వచ్చేవారు. అమ్మని నన్ను పలకరించేవారు. కాసేపు కూర్చుని కబుర్లు చెప్పేవారు.  ఆయనే రమణా రెడ్డి.

వ్యాపారస్తుడు దొంగ.

అప్పట్లో ఇంటర్‌నెట్ లేని రోజుల్లో గ్రీటింగ్ కార్డులతో పుట్టిన రోజులకి శుభాకాంక్షలు, గిట్టిన రోజులకి సందేశాలు కూడా పంపుకునేవారు.  ఆ రోజుల్లో కొంచెం చదువుకున్నవారు, మహానగరాలలో ఉండేవారు (భారతదేశంలో)  వకీల్స్ వారి గ్రీటింగ్ కార్డులు కొనుక్కుని పంపేవారు.  చక్కని సందేశాలతో, ముచ్చటైన బొమ్మలతో కళాత్మకంగా ఉండేవి అవి. గ్రీటింగ్ కార్డులు కూడా కళాత్మకంగా ఉంటాయా అని అడిగేవారితో నాకు అస్సలు పేచి లేదు.  అందుకని వారి జోలికి వెళ్ళను.  వకీల్స్, ఎలార్ రోజుల్లో వారికి పోటిగా ఆర్చీస్ అనే సంస్థ  బయలుదేరింది.

ఆనాటి నవతరం, యువతరం కోసం వాళ్ళు కార్డ్లు మొదలుపెట్టారు.  ఆ తరువాత పెన్నులు, గన్నులు, బొమ్మల అమ్మకాలన్నింటిలోకి ప్రవేశించారు.  మొదట్లో ఈ గ్రీటింగ్ కార్డులమీద ధరల వివరాలుండేవి కాదు.  దుకాణందారు తనకిష్టం వచ్చిన ధరకి అమ్మేవాడు.  కొనుక్కునేవాడు..మనసులోనే నిక్కినా నిలిగినా కొనుక్కునేవాడు.  తప్పదు.  కొంత పీర్ ప్రెజర్ కూడా ఉండేది.  రీడర్స్ డైజెస్ట్ చేతిలో లేకపోతే వాడొక వెధవాయ్ అన్నటైపులో అన్నమాట!  ఇప్పుడు “చే” బొమ్మతో ఉన్న కాలర్‌లెస్ టీ వేసుకున్నట్టు.  (“చే” ఎవరు అని ఆడిగితే, “చీ, చీ..నన్నే అడుగుతావా  అని తన తెలియని తనాన్ని దాచుకునే వెధవలున్నట్టు).

వ్యాపారస్థులందరూ దొంగలు కాదు!
వ్యాపారస్థులందరూ దొంగలు కాదు!

అలాంటి రోజుల్లో బ్రతక నేర్చిన మిత్రుడు (వాడు బ్రతకనేర్చినవాడని అంతకుముందే తెలిసింది..అది మరొక కథ) ఎవరి బర్త్‌డేకో గ్రీటింగ్ కార్డ్ కావాలని రావడం..(నాతో సెలక్ట్ చేయించుకోవాలని అప్పట్లో తాంబరం నుంచి బెసెంట్ నగర్ నుండి, పరశువాక్కం లాంటి దూరప్రాంతలనుండి వచ్చేవారు)  ఒక చక్కని కార్డుని అసలు ధరకే (లాభాలు లేకుండా..మిత్రుడు కదా?) తీసుకోవడం అయిపోయింది.  పాపం డబ్బులిద్దామని పర్సుతీస్తే అందులో అన్ని వంద రూపాయల నోట్లే!

“అలా రా బాస్,  టీ తాగి, దమ్ము కొడదాం. హోటల్ వాడు చిల్లర ఇస్తాడులే” అని నన్ను లాక్కువెళ్ళాడు.  గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్, టెన్స్ పాకెట్ ఆ రోజుల్లో అక్షరాల ముప్పై రూపాయలు.  నా షర్ట్ జేబు ఎప్పుడు దానితో నిండుగా ఉండేది.  (కొందరిలాగా పాంట్ జేబులో పెట్టుకుని దాచుకోవడం నాకు తెలీదు).  సరే, ఒకటి మనవాడికిచ్చాను..నేను ఒకటి అంటిచ్చుకున్నాను.  స్పేషల్ టీ ఆ రోజుల్లో మూడు రూపాయలు.  ఇద్దరికి ఐతే రెండుకప్పుల నిండా వచ్చేది.  ఆ స్పెషల్ టీ తెచ్చిన బేరర్ కి చిల్లరలేక..పావలా టిప్పు.  బిల్లు పే చెద్దామనుకున్న మిత్రుడు మళ్ళీ వంద రూపాయల నోటు ఇస్తే..హోటల్ యజమాన్ నవ్వుతూ నా వంక చూశాడు.  ఆ మూడు రూపాయలు నేనే ఇచ్చాను. (ఇందాకటి పావలా టిప్పు కూడా నాదే!)

ప్లాట్‌ఫార్మ్ మీద నిలబడి కబుర్లు చెప్పుకున్నాం.  ఒక రెండు నిముషాలు.  గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్ కదా అనేమో మిత్ర గురువు  దమ్ము లాగుతున్నాడు..ఫిల్టర్ కూడా కాలిపొయ్యేటట్టుంది.  అప్పుడు దానిని చూపుడు వేలు మధ్యవేలు మధ్యన పెట్టుకుని చమత్కారంగా విసిరేసాడు.  అది హోటల్ పక్కనే ఉన్న బడ్డికొట్టుముందు వీధిలాంతరు స్థంభానికి తగిలి కింద పడింది.

“సరే బాసు, మళ్ళీ కలుద్దాం”, అంటూ నేను రోడ్డు దాటడానికి కదులుతూ..అతనికి షేక్‌హాండిచ్చి రాబోతుంటే..చెయ్య్ పట్టుకుని ఆపేసి అన్నాడు కదా..”బాసు రెండు రూపాయల కార్డు కొని, మూడు రూపాయల సిగరెట్టు, ఒక స్పెషల్ టీ కొట్టేసాడేంటి వీడు అని అనుకుంటున్నావా?”

అతను అనేదాక ఆ ఆలోచన నా ఊహలోకి కూడ రాలేదు.  అప్పుడు వచ్చింది.  కార్డు కొన్నానంటాడు అది కూడా ఫ్రీ గానే తీసుకున్నాడు గా అని.  అదేమి లేదులే అని నవ్వేసి, చెయ్యి వదిలించుకుని వచ్చేసాను.

అఫ్‌కోర్సు..ఏదో ప్రభుత్వ సంస్థలో లంచం ఇచ్చి ఉద్యోగం సంపాయించుకున్నాడు.  ఇద్దరు కూతుళ్ళకి అమెరికా సంబంధాలు చేసాడు.  కోట్ల రూపాయల విలువగల భవంతుల యజమాని ఈ రోజు.

ఇదంతా ఎందుకు చెప్పానంటే..ప్రతి వ్యాపారస్థుడు దొంగ కాదు, చీట్ కాదు. వాడికి స్నేహాలు, బంధువులు, ప్రేమలు, అభిమానాలు, నైతిక విలువలుంటాయి!  నిన్న ఎవరో ఫేస్‌బుక్‌లో వ్యాపారస్థుడుకి అలాంటివి ఉండవన్న అర్ధం వచ్చే మాటన్నారు, అందుకని ఈ ఏడుపు!

మాలతీ చందూర్ – మద్రాసు – ఒక స్మృతి

Malati and N R Chendur, Madras

మొన్న జనవరి లో కలిసాను మాలతీ చందూర్ గారిని.  వారింట్లోనే.  కచేరి రోడ్డు లో, మైలాపూర్‌లో శాంధోమ్ చర్చి కి దగ్గిర్లో.  వారింటి పక్కనే ఒక కేరళ వైద్యశాల ఉంటుంది.  శ్యామలాంబ గారు వారి సోదరి.  నేను, ఆరుద్ర రామలక్షి గారి పిల్లలు, దాశరధి గారి పిల్లలందరం కలిసి చదువుకున్న చిల్డ్ర్‌న్స్ గార్డెన్ స్కూలో లో వారు ఉపాధ్యాయురాలు.  దాదాపు మా కుంటుబాలు అన్ని కూడా 4 దశాబ్దాలుగా కలుస్తునే ఉన్నాయి. సాహిత్య సభలు కానివ్వండి, సినిమా ప్రీవ్యూలు కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, వివాహాలు కానివ్వండి మరొహటి కానివ్వండి.

చందూరు గారు వచ్చేవారు, హెరాల్డ్ కారులో. మాలతీ గారు కూడ వారితో బాటే. సినిమా సెన్సార్ బోర్డ్ కి వేసే సెన్సార్ షో కి నేను కూడ వెళ్ళేవాడిని. సినిమా నటుడు, ఛంద్రమోహన్ మామగారు, రచయిత్రి తులసి జలంధర గారి తండ్రి , డా గాలి బాలసుందర రావు గారు అద్దెకుండే ఇంట్లో ఒక పక్కగా ఖాళీ స్థలం ఉండేది. దానిలో సాహితీ సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. వాటికి కూడా భార్యా భర్తలు ఇద్దరూ వస్తుండేవారు.

1996 లో మా అమ్మ చనిపోయిన తరువాత ఫోనులో పలకరించుకోవడమే గాని, నేను వెళ్ళి కలిసింది లేదు. కాని మొన్న జనవరిలో వెళ్ళినప్పుడు కలిసాను. సాయంత్రం కలుద్దామనుకుంటే, మరుసరి రోజు ఉదయం కలుద్దామని అన్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో వెళ్ళాను. దాదాపు గంటో గంటన్నరో గడిపాను. మద్రాసులో తెలుగు వాతావరణం, తెలుగు సాహిత్య సభలు, సమావేశాలు, ఆ వాతావరణం, ఆంధ్ర రాష్ట్రం లో సాహిత్యం, సాహిత్య రంగంలో రాజకీయాలు వగైరాలు సాహితి మిత్రుల గురించి వాకబులు, కబుర్లు.
“జగతి”  గురించి ప్రస్తావన వచ్చింది.  చందూర్ గారు పోగానే “జగతి” ప్రచురణ ని ఆపేసానని చెప్పారు. ఇంతలో నేను వద్దని వారిస్తున్నా వినకుండా “కాఫీ చేసి తెస్తానుండు”, అంటూ మా టీచర్ గారు లోపలికి వెళ్ళారు.  “అనిల్ తో మామయ్య గురించి మాట్లాడవచ్చు అంటావా?” అంటూ మాలతి గారు మా టీచర్ గారిని అడగటం..వారు “తనేమన్నా బయట వాడా నువ్వు మాట్లాడకుండా ఉండటానికి” అంటుండగానే..లోపలికి వెళ్ళి ఇంతలావు బైండ్ చేసిన పుస్తకం తీసుకువచ్చారు. అదే “జగతి డైరి”. జగతి నుంచి ఏరి కూర్చిన వ్యాస సంకలనం. చందూరు గారి వ్రాసినవి. ఎంతొ ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో ఆ పుస్తకాన్ని నాకు చూపించారు ఆవిడ. దాదాపు ఒక సంవత్సర కాలం “జగతి” లన్ని ముందేసుకుని వాటిలో ఏరి కూర్చిన సంకలనం అది.  అంత పెద్ద పుస్తకానికి ధర కూడ తక్కువే పెట్టారు.

నా భార్య గతించిన విషయం తనకి తెలిసిందని అంటూ తను వ్రాసిన శిశిరవసంతం నవల లో “సంధ్య” గురించి చెబుతూ ఆ నవలని తప్పకుండా చదవమని కోరారు.  ఆ నవలలో “సంధ్య” కి కాన్సర్.  కాన్సర్ తో చేసిన యుద్దంలో సంధ్య గెలుస్తుంది ఆ నవలలో.

పాత్రికేయురాలు అరుణ పప్పు వ్రాసిన కథా సంపుటి “చందనపు బొమ్మ“కి ఒక పరిచయ సభని మద్రాసులో ఏర్పాటు చేసినప్పుడు ఆ నాటి సాయంత్రం వక్తలలో ఆమె ఒకరు. సినీ రచయిత, కవి భువనచంద్ర, నటి లక్ష్మి, నిర్మాత కాట్రగడ్డ మురారి, ఘంటసాల రత్నకుమార్ తదితరులు ఆ సభలో పాల్గొన్నారు.  ఆ సందర్భంలో తన కోసం ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళి వారితో సంతంకం చేయించుకున్న జ్ఞాపకంగా మిగిలి పోయిన “శిశిర వసంతం” నవల ఇది. కాని నిజ జీవితంలో గెలిచిన మాలతీ చందూర్ కాన్సర్ తో చేసిన యుద్దంలో పరాజిత.

శిశిరవసంతం, సంధ్య నాయిక

నా కోసం

లక్షాలాది మంది ఆయన పాడగా వినాలని,
ఆయనతో ఒక కరచాలనం చెయ్యాలని,
వారి ఆశిస్సులుంటే చాలని కోరుకునేవారు.

ఆయనేమో అక్కడెక్కడో బెంగుళూరు బేకరిలో ఏ పాస్ట్రీ యో, బిస్కట్టో బాగుందని కొని తీసుకువచ్చేవారు.
నాకోసం.
అడయారు నుంచి  టీ నగర్ దాకా. (http://goo.gl/maps/6Z7xu ) దాదాపు ఓ పది కిలోమీటర్లు.  నన్ను గుర్తు పెట్టుకుని మరీ.  వారికి నేనేమి బంధువును కాను.  ఐనా.

ఆదివారం సాయంత్రాలు  ఆరు ఏడు ఆ ప్రాంతాల్లొను,  రాత్రి ఐతే 8 ఏ ప్రాంతాల్లొ వచ్చేవారు.    మేమిద్దరం ఆయన కారులో కూర్చునో, కారుకి ఆనుకునో నిలబడి కబుర్లు చెప్పుకుంటూ గంటల కొద్ది కాలం గడిపేవారం.

“ఫరవాలేదు..నేనిమి అనుకోను..మీ స్మోకింగ్ మీది” అని ముందే అనేసేవారు. మాములుగా మా కబుర్లు సంగీతం, సాహిత్యం మీదే ఉండేది.ఘజల్స్ మీద వారికి ఆసక్తి మెండు.  కొత్తగా వ్రాసింది తీసుకువచ్చేవారు.  రాగయుక్తంగా చదివి వినిపించేవారు.  నాకు అర్థం కాని చోట వివరంగా విడమరిచి చెప్పేవారు.

P B Srinivas ( 22 Sept 1930 - 14 Apr 2013)
P B Srinivas
( 22 Sept 1930 – 14 Apr 2013)

ఆ జేబులో కనీసం ఒక ఐదారు పెన్నులు,  ఆ చేతిలో పుస్తకాలు లేకుండా కనపడేవారు కాదు.  తనని ఆహ్వానించిన ప్రతి సభకి హాజరయ్యేవారు.  ఒక ప్రశంసా పత్రమో, ఒక కవితో చదివి వినిపించి దాన్ని ఆ నాటి కర్త కి అందించి వెళ్ళేవారు. వాటిని సేకరించి ప్రచురిస్తే బాగుంటుంది.  కాని అదేమి సామాన్యమైన విషయం కాదు!  ఆయన అలా వ్రాసిచ్చింది తక్కువేమి కాదు.

వయస్సుతో నిమిత్తం లేకుండా ఎంతో స్నేహంగా ఉండేవారు.  చెరగని చిరునవ్వు!
మొన్నామధ్య మద్రాసు వెళ్ళినప్పుడు కూడా అనుకున్నాను.  వెళ్ళి కలవాలని.
చాలమందిని కోల్పొయ్యాను.
కోల్పోతున్నాను కూడా!