దిద్దుబాటలు – దిద్దుబాటుకు ముందు కథలు 92

దిద్దుబాటు తొలి తెలుగు కథ అని అనుకున్నాం.  కాదు ఇంకా ముందే కథలున్నాయి అని అన్నారు.  సరే, దిద్దిబాటు కన్నా ముందు కథల సంగతి తేల్చుకుందాం అని అనుకున్నారు, వి వి న మూర్తి గారు.  ఇదేదో బాగానే ఉంది కదా?  రానున్న తరాల వారికి ఈ పుస్తకం ద్వారా ఆ కథలు వాటి నేపధ్యం గురించి తెలియజేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన నచ్చింది జంపాల చౌదరి గారికి.  జంపాల గారు తానా ప్రచురణ లకి అధ్యక్షులు.

కొన్ని ప్రశ్నలు – కొన్ని ఆలోచనలు
ప్ర:  ఏది కథ?
వ్రాసిన రచయిత గాని, అచ్చువేసిన పత్రికా సంపాదకులు గాని కథ అనడం.
ప్ర:  ఇంకా మన దృష్టికి రాని కథలు ఉండవచ్చా?
భవిష్యత్తులో బయటపడవచ్చు.
ప్ర:  తొలి కథ?
చిలక గురించిన సంభాషణ 1879 జనవరి జనవినోదిని
ప్ర:  తొలి కధా సంపుటం?
చిత్రమంజరి 1902 మే.  రచయిత రాయసం వెంకటశివుడు.
అయ్యా,  ఇంకా చాలా వివరాలున్నవి.  ప్రస్తుతానికి ఈ వివరాలు ఈ సేకరణ కి మాత్రమే పరిమితం.  ఇందాక అన్నట్టు.. మరి కొన్ని వివరాలు భవిష్యత్తులో బయటపడవచ్చు.

రచయిత , సాహితీవేత్త , కథానిలయం సారధి - వి వి న మూర్తి.
రచయిత, సాహితీవేత్త , కథానిలయం నిర్వాహకులలో ఒకరు – వి వి న మూర్తి.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) లక్షాలలో ప్రముఖమైనది తెలుగు భాష, సంస్కృతులను పోషించి, పరిరక్షించుకోవడం.  దాదాపు గత నాలుగు దశాబ్దాలుగా ఈ పని చేస్తూన్నది తానా.  అందులో ఒక పాత్రని పోషిస్తున్నది తానా ప్రచురణలు.  ప్రచురణలో లేని, ప్రచురణ కాని ముఖ్యమైన తెలుగు పుస్తకాలను ఉత్తమ ప్రమాణాలతో, ప్రచురించి  సాహిత్యాభిమానులకు అందుబాటులోఉండే ధరలకు అందిచడం తానా ఉద్దేశం.

రానున్న జూన్‌లో జంపాల చౌదరి 2015 జూన్ లో, తానా (TANA) కి అధ్యక్షుడిగాకూడా పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు.  ఇప్పుడు తానా ఆ పుస్తకాన్ని ప్రచురిస్తోంది.

Dr Jampala Choudaray - President Elect TANA
Dr. Jampala Chowdary, President – Elect TANA

రేపు అంటే శుక్రవారం, జనవరి 2, 2015 న విజయవాడ లో జరగనున్న తెలుగు పుస్తకాల పండుగ లో, దీనిని ఆవిష్కరించనున్నారు.  ఆవిష్కరించనున్నది ఆచార్య కడియాల రామ మోహన్ రాయ్ గారు.

Kadiyala Rama Mohan Roy
మే 1 న, విజయవాడలో కవిత 2012 ని (కీ శే. సి సుబ్బారావు గారు), కడియాల రామ మోహన్ రాయ్ గారు ఆవిష్కరించిన సందర్భం.

చిత్రకారుడు చంద్ర వేసిన ముఖచిత్రం తో వెలువడున్నది ఈ దిద్దుబాటలు.

దిద్దుబాటలు - diddubaaTalu
దిద్దుబాటలు – దిద్దుబాటకు ముందు కథలు 92. సంపాదకులు వి వి న మూర్తి
కధానిలయం, శ్రీ కాకుళం సౌజన్యంతో

496 పేజీలు, ధర 300.00 రూపాయలు. US $ – 25.

ప్రచురణ కర్తల కృతజ్ఞతలు
” శ్రీ కొడవళ్ళ హనుమంత రావు వితరణ, శ్రీ ‘నవోదయ’ రామ్మోహనరావు, శ్రీ వాసిరెడ్డి నవీన్ సహృదయత, శ్రమదానం, తానా కార్యవర్గం, తానా ఫౌండేషన్, మరెందరో హితోభిలాషుల సహకారం తో…”  ఈ పుస్తకం వెలువడుతోంది.

పుస్తకానికి ప్రూఫులు చూసిన ఎ.వి రమణమూర్తి గారికి, పుస్తకాన్ని అందంగా రూపొందించడంతో పాటు చదవడానికి వీలుగా పదవిభజన చేసిన అక్షర సీత గారికి అచ్చువేసిన చరిత ప్రెస్ పరుచూరి సుబ్బయ్య గారికి”  కూడా.

ఆంధ్రజ్యోతి లో వి వి న మూర్తి గారి దిద్దుబాటలు కి ముందు మాటలు ప్రచురించారు.  వాటిని మీరు ఇక్కడ చదువుకోవచ్చు.

ఒక చిన్న విషయం చెప్పుకోవాలి.  నా స్వార్ధం మరి.  తానా వారి ప్రచురణలు ప్రచురించిన కథ నేపధ్యం తొలి సంకలనం ఆవిష్కరణ 2012 జనవరి 3 న ఇదే విజయవాడలో అదే వేదిక మీద జరిగింది.  వేదిక మీద శ్రీమతి సత్యవతి పోచిరాజు, శ్రీరమణ, శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య, శ్రీ ‘నవోదయ’  రామ్మోహన రావు, శ్రీ తోటకూర ప్రసాద్ (అధ్యక్షులు తానా), తానా ప్రచురణల అధ్యఖులు శ్రీ జంపాల చౌదరి.  వారందరితోను నేను.

కథ నేపధ్యం 1 - katha - nepadhyaM 2012
కధ – నేపధ్యం. తొలి సంపుటి 2012. తానా ప్రచురణ

దయచేసి మీ ప్రతులకోసం వీరిని సంప్రదించండి.
ఇండియా లో:
AG – 2, ‘A’ Block, Mathrusri Apartments,
Hyderguda, Hyderabad 500029
Phone – 040 – 2324 4088.

USA
TANA Publications,20374, Buckthorn Court, Mundelein, Illinois 60060 USA

ప్రధాన విక్రేతలు;
ఆంద్ర ప్రదేశ్:
విశాలాంధ్ర ప్రబ్లిషింగ్ హవుస్, విజయవాడ (ఫోను 0866 -2572949) వారి బ్రాంచీలన్నింటిలోను.
నవోదయ పబ్లిషర్, ఏలూరు రోడ్డు, విజయవాడ – ఫోను 0866 – 2573500, 9849825204
ప్రభవ బుక్ సెంటర్, No- 16-2-157, Near Vijaya Hospital, Pogathota, Nellore, Andhra Pradesh 524 001 ఫోను:  ౦861- 2323 167 / 232 9567

తెలంగాణ:
నవచేతన పబ్లిషింగ్ హవుస్, హైదరాబాద్ వారి బ్రాంచీలన్నింటిలోను.
ప్రజాశక్తి బుక్ హౌస్, 1-1-187/1/2, Viveknagar, Chikkadpally, Chikkadpally, Hyderabad, Telangana 500020. ఫోను: 040 2760 8107
నవోదయ బుక్ హౌస్, 3, Kachiguda Station Road, Chappal Bazar, Kachiguda, Hyderabad, Telangana 500027 – 040 2465 2387

eBook:kinige.com /  కినిగె.కాం

కొత్త వంతెన

“కొత్త వంతెన”

నిన్న సాయంత్రం “కొత్తవంతెన” పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది.  “ఆంధ్రజ్యోతి” దిన పత్రిక సంపాదకుడు.  కె.శ్రీనివాస్, ఈ వ్యాసాలను తొలుత “ప్రజాతంత్ర” పత్రికలో దాదాపు ఒక దశాబ్దం క్రితం ప్రచురించారు.  వాటన్నింటిని ఇప్పుడు మళ్ళీ ఒక సంకలనం కింద “అనేక పబ్లికేషన్స్” ప్రచురించింది.

ఘంటా చక్రపాణి నిర్వహించిన ఈ సభలో “కొత్తవంతెన‌” అచ్చు పుస్తకాన్ని టిజాక్ అధ్యక్షులు కోదండరామ్ ఆవిష్కరించగా,  “కినిగె‌” ఈబుక్ ని ఆచార్యులు జి హరగోపాల్ ఆవిష్కరించారు. రచయిత కె శ్రీనివాస్ కోరిక మేరకు “గొంతు బాగొలె”దంటునే “జై తెలంగాణ” పాటని పాడి ప్రముఖ గాయకుడు అందెశ్రీ సభికులను అలరించారు.

"కొత్త వంతెన‌" - కె శ్రీనివాస్ వ్యాస సంకలనం ఆవిష్కరణ సభ
“కొత్త వంతెన‌” – కె శ్రీనివాస్ వ్యాస సంకలనం ఆవిష్కరణ సభ

వేదికని అలంకరించినవారిలో షాజహాన, జూపాక సుభద్ర, “నమస్తే తెలంగాణ” సంపాదకుడు అల్లం నారాయణ ఉన్నారు.

విరసం సభ్యులు వరవరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సభలో మరో విశేషం ఏమిటంటే, రచయిత శ్రీనివాస్ తండ్రి శ్రీ సింగరాచార్యులు పాల్గొని ప్రసంగించడం.

మాలతీ చందూర్ – మద్రాసు – ఒక స్మృతి

Malati and N R Chendur, Madras

మొన్న జనవరి లో కలిసాను మాలతీ చందూర్ గారిని.  వారింట్లోనే.  కచేరి రోడ్డు లో, మైలాపూర్‌లో శాంధోమ్ చర్చి కి దగ్గిర్లో.  వారింటి పక్కనే ఒక కేరళ వైద్యశాల ఉంటుంది.  శ్యామలాంబ గారు వారి సోదరి.  నేను, ఆరుద్ర రామలక్షి గారి పిల్లలు, దాశరధి గారి పిల్లలందరం కలిసి చదువుకున్న చిల్డ్ర్‌న్స్ గార్డెన్ స్కూలో లో వారు ఉపాధ్యాయురాలు.  దాదాపు మా కుంటుబాలు అన్ని కూడా 4 దశాబ్దాలుగా కలుస్తునే ఉన్నాయి. సాహిత్య సభలు కానివ్వండి, సినిమా ప్రీవ్యూలు కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, వివాహాలు కానివ్వండి మరొహటి కానివ్వండి.

చందూరు గారు వచ్చేవారు, హెరాల్డ్ కారులో. మాలతీ గారు కూడ వారితో బాటే. సినిమా సెన్సార్ బోర్డ్ కి వేసే సెన్సార్ షో కి నేను కూడ వెళ్ళేవాడిని. సినిమా నటుడు, ఛంద్రమోహన్ మామగారు, రచయిత్రి తులసి జలంధర గారి తండ్రి , డా గాలి బాలసుందర రావు గారు అద్దెకుండే ఇంట్లో ఒక పక్కగా ఖాళీ స్థలం ఉండేది. దానిలో సాహితీ సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. వాటికి కూడా భార్యా భర్తలు ఇద్దరూ వస్తుండేవారు.

1996 లో మా అమ్మ చనిపోయిన తరువాత ఫోనులో పలకరించుకోవడమే గాని, నేను వెళ్ళి కలిసింది లేదు. కాని మొన్న జనవరిలో వెళ్ళినప్పుడు కలిసాను. సాయంత్రం కలుద్దామనుకుంటే, మరుసరి రోజు ఉదయం కలుద్దామని అన్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో వెళ్ళాను. దాదాపు గంటో గంటన్నరో గడిపాను. మద్రాసులో తెలుగు వాతావరణం, తెలుగు సాహిత్య సభలు, సమావేశాలు, ఆ వాతావరణం, ఆంధ్ర రాష్ట్రం లో సాహిత్యం, సాహిత్య రంగంలో రాజకీయాలు వగైరాలు సాహితి మిత్రుల గురించి వాకబులు, కబుర్లు.
“జగతి”  గురించి ప్రస్తావన వచ్చింది.  చందూర్ గారు పోగానే “జగతి” ప్రచురణ ని ఆపేసానని చెప్పారు. ఇంతలో నేను వద్దని వారిస్తున్నా వినకుండా “కాఫీ చేసి తెస్తానుండు”, అంటూ మా టీచర్ గారు లోపలికి వెళ్ళారు.  “అనిల్ తో మామయ్య గురించి మాట్లాడవచ్చు అంటావా?” అంటూ మాలతి గారు మా టీచర్ గారిని అడగటం..వారు “తనేమన్నా బయట వాడా నువ్వు మాట్లాడకుండా ఉండటానికి” అంటుండగానే..లోపలికి వెళ్ళి ఇంతలావు బైండ్ చేసిన పుస్తకం తీసుకువచ్చారు. అదే “జగతి డైరి”. జగతి నుంచి ఏరి కూర్చిన వ్యాస సంకలనం. చందూరు గారి వ్రాసినవి. ఎంతొ ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో ఆ పుస్తకాన్ని నాకు చూపించారు ఆవిడ. దాదాపు ఒక సంవత్సర కాలం “జగతి” లన్ని ముందేసుకుని వాటిలో ఏరి కూర్చిన సంకలనం అది.  అంత పెద్ద పుస్తకానికి ధర కూడ తక్కువే పెట్టారు.

నా భార్య గతించిన విషయం తనకి తెలిసిందని అంటూ తను వ్రాసిన శిశిరవసంతం నవల లో “సంధ్య” గురించి చెబుతూ ఆ నవలని తప్పకుండా చదవమని కోరారు.  ఆ నవలలో “సంధ్య” కి కాన్సర్.  కాన్సర్ తో చేసిన యుద్దంలో సంధ్య గెలుస్తుంది ఆ నవలలో.

పాత్రికేయురాలు అరుణ పప్పు వ్రాసిన కథా సంపుటి “చందనపు బొమ్మ“కి ఒక పరిచయ సభని మద్రాసులో ఏర్పాటు చేసినప్పుడు ఆ నాటి సాయంత్రం వక్తలలో ఆమె ఒకరు. సినీ రచయిత, కవి భువనచంద్ర, నటి లక్ష్మి, నిర్మాత కాట్రగడ్డ మురారి, ఘంటసాల రత్నకుమార్ తదితరులు ఆ సభలో పాల్గొన్నారు.  ఆ సందర్భంలో తన కోసం ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళి వారితో సంతంకం చేయించుకున్న జ్ఞాపకంగా మిగిలి పోయిన “శిశిర వసంతం” నవల ఇది. కాని నిజ జీవితంలో గెలిచిన మాలతీ చందూర్ కాన్సర్ తో చేసిన యుద్దంలో పరాజిత.

శిశిరవసంతం, సంధ్య నాయిక

ఈ దశాబ్దం నవలది, తెలుగు కథ ది!

ముందున్నది మూడు చెరువులు.  ఒడ్డున్న ఉన్నది అప్పుడే వాటిల్లో  మునిగి, ఈది, తేలి, గట్టుకు చేరిన సుశిక్షుతులైన గజ ఈతగాళ్ళు.  ఆ చెరువులు చెరువులేనా?.. ద్రోహ వృక్షం, నల్ల మిరియం చెట్టు, ఆకుపచ్చని దేశం.  ఒడ్డున్న ఉండి మళ్ళీ దూకడానికి ఉద్యుక్తుడవుతున్న నవయువకుడు శివారెడ్డి..కానీండి ఇంకా చూస్తారే?..నేనైతే  ‘జీవని‌’ లోకి దూకాను.  ‘ఐదు హంసలు‌’ని కూడా చూసాను.  దూకడమే..అలా ఒడ్డున నిలబడిపోతే  మీ జీవితంలో ఒక ఎపిక్ ప్రపోర్షన్‌ లో ఒక అనుభవాన్ని కోల్పోతారంటాడు.

ఇందులో ద్రోహవృక్షం కథల సంపుటి.  మిగతా రెండూ – నల్లమిరియం చెట్టు, ఆకుపచ్చని దేశం నవలలు. రచయిత డా॥ వి. చంద్రశేకఖర రావు.

Dr. v chandrasekhara Rao novels release function
డా: చంద్రశేఖర రావు నవలలు ఆవిష్కరణ సభ..మీ ఎడమవైపు నుండి..శ్రీ జగన్నాధ శర్మ, నవ్య సంపాదకులు – ఆకుపచ్చిని దేశం తో, కవి శివారెడ్డి అక్కుపచ్చిని దేశం లో నల్ల మిరియం చెట్టు తో, రచయిత డా॥ చంద్రశేఖర రావు వి, వారి ప్రక్కన విమర్శకులు సీతారాం.

ఆ పుస్తకాల పేర్లు చూడండి.  ఒక మార్మికత లేదూ వాటిల్లో?!  చిన్నప్పుడు మా నాన్న తెచ్చి ఇస్తే పుస్తకాలు, ఏది ముందు చదవాలో అర్ధం అయ్యేది కాదు.  అన్నింటిని ఒకే సారి చదవలేము.  సరే, పుస్తక పరిచయ సభకి వెళ్ళాం కదా..ఆ మహామహుల మాటలు విన్నాం కదా?  వాళ్ళందరూ ఏదో ఒక పుస్తకాన్ని ఆకాశానికెత్తేస్తే దాంతో మొదలు పెట్టవచ్చు. అసలు ఆ సాహితీవేత్తలు ఆ అవకాశం లేకుండా అన్నింటి గురించి చెప్పేసారు.  అసలు ముందు వాళ్ళ మాటలు వింటుంటే ఒక అయోమయం.

నల్లమిరియం చెట్టు గురించి మాట్లాడుతూ, ఆకుపచ్చని దేశం లోకి వెళ్ళిపోతారు.  పోనీ దాని గురించి మాట్లాడుతారా అంటే ఉహు మళ్ళీ ద్రోహవృక్షంలోకి వెళ్ళిపోతారు.  అక్కడ ఉంటారా అంటే ఆబ్బే సుందరం అంట..ఆదెమ్మ అంట,  చెంచులు అంట, నరసింహం ఆత్మహత్య, మొసళ్ళు వాటితో యుద్దమా లేదా తప్పించుకుని అవతలి ఒడ్డుకి చేరటమా అన్న ఆలోచనంట..ఇవేవి కావు అసలు ఈ చంద్రశేఖరం గారు కవిత్వం వ్రాస్తున్నాడంటున్నారు, నా దృష్టిలో అది కవిత్వం కాదు..ఈ రచయిత రచనల మీద నేను పరిశోధన చేస్తున్నాను అని మరో వక్త.  సరే!  వాళ్ళు పుస్తకాలు చదివారు కాబట్టి వేదిక మీద ఉన్నవాళ్ళందరికి రచయితతో సహా తాము ఏమి మాట్లాడుతున్నారో తెలుసు.

మరి పాఠకుడి పరిస్థితి.

సీరియల్‌ని చదివిన పెద్దాయన కవి శివారెడ్డి.  ప్రతి వారం ఒక వార పత్రికని కొని..ఒక ముక్క చదివి..మళ్ళీ వచ్చేవారం కోసం ఎదురుచూస్తు..ముక్కలు ముక్కలుగా చదవటానికి విముఖుడు.  అలా చదవాలంటే చెడ్డ చిరాకు ఈ కవికి.  కాని ఆయన ప్రతివారం ముక్కలు ముక్కలుగానే చదువుకున్నాడంట సీరియల్‌ని.  అంతగా ఆకర్షించింది ఆయన్ని.  ఇక్కడ గుర్తుంచుకోవలసింది ఒకటి ఉంది.  ఆయన కవి. కథకుడు కాదు.  నవలా కారుడు అంతకంటే కాదు.  అవంటే పెద్ద ప్రేమా, మోజు లేదాయనకి. ఆయనే చెప్పుకున్నాడా మాట ఆ వేదిక మీద నుంచి.  ఏకంగా 22 పేజీల ముందుమాట వ్రాసేయించింది ఆ నవల ఆ కవితో.

ఎవరూ ఏ పుస్తకాన్ని ఒక్క సారి చదివి నమిలి పిప్పిని పారేసిన వారు కాదు, బెకన్ అన్నట్టుగా.  మాట్లాడిన వారందరూ ఆ నవలలని..ఆ కథలని పరిచయం చేసిన వారందరు ప్రతి పుస్తకాన్ని ఆవాహన చేసుకున్నవారే.  ఆ పుస్తకాలు వారందర్నీ తమ ప్రపంచంలోకి రమ్మనమని సాదరంగా ఆహ్వానించినవి.  వీరు ఆ యా ప్రపంచాలలోకి వెళ్ళి ప్రతి పాత్రతోను పయనించి,  వారి జీవితాలని స్పృశించి, ఆ లోకాలను అనుభవిస్తూ వెలికి వచ్చారు.  మళ్ళీ అ సాహిత్యంలోకి వెళ్లాలనిపించి వెళ్ళారు.  వదలలేదు.  వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్లారు.  రేపు మరోసారి మళ్ళీ వెడతారు. వారి మాటలు వింటుంటే మళ్ళీ మళ్ళీ ఆ లోకాలలో విహరిస్తూనే ఉంటారనిపిస్తుంది.

నవీన్ వాసిరెడ్డి
సభకు అధ్యక్షుడు. నేను పోలీసుల చెకప్పులు, వినాయకుడి విగ్రహాలను తప్పించుకుంటూ హైద్రాబాదు ట్రాఫిక్కులోపడి ఈదుకుంటూ వెళ్ళేటప్పడికి ఆయన ఉపన్యాసం అయిపొయ్యి  వక్తలను ఆహ్వానిస్తున్నారు.

జగన్నాధ శర్మ  (నవ్య సంపాదకులు,) చాల క్లుప్తంగా మాట్లాడారు.
“సాహితీలోకంలో ఒక మాట ఉంది. 1910 నంచి 20/30 ల దాక తెలుగు సాహిత్యంలో అనువాద కాలం అని.  కాని నేను ఇప్పుడు చెబుతున్నాను.  2010 నుంచి  మళ్ళీ తెలుగు కధా సాహిత్యం, నవలా సాహిత్యం మొదలైనది.  భారతదేశంలోని ఇతర భాషలు తెలుగు భాష వైపు తెలుసు సాహిత్యం వైపు చూస్తుండాల్సిన తరుణం వచ్చేసింది.  దానికి కారణం చంద్రశేఖర రావు లాంటి రచయితలు.  నవల రూపు చూడకండి.  నవలలో వస్తున్న వస్తువుని చూడండి.  గొప్ప తెలుగు సాహిత్యం ఈ దశాబ్దం తో మొదలయ్యింది మళ్ళీ.  ఇంతకన్నా తెలుగు సాహిత్యం గురించి నేను చెప్పగలిగింది లేదు”.

కవి శివారెడ్డి
కవి శివారెడ్డి మూడు సార్లు చదివారు. ఆయన నల్ల మిరియం చెట్టు కి ముందుమాట(?) అందామా “ఒక గాధ గురించి” అని శీర్హిక పెట్టి..అంటారు కదా..తొలి వాక్యం లో.
” నేనిప్పుడో మహోపన్యాసం చెయ్యగలను డా॥ వి. చంద్రశేకఖర రావు గారి సాహిత్యం మీద”.

“Preconceived notions లేకుండా రచయిత దగ్గిరకు వెళ్ళే ఒక తరం పాఠకులొస్తారు. వచ్చారు.  విమర్శకులే రావాల్సింది.

ఊర్వశి అంటుంది పురూరవుడి తో,’ప్రేమ కావాలా..నీ అలంకారాలన్ని, ఆభరణాలన్నీ పక్కన బెట్టి దిగంబరంగా నా దగ్గిరకు రా,’ అని.  అలా పాఠకుడు అన్ని misconceived, wrong notions ని పక్కనబెట్టి – పరమ దిగంబరంగా వాచకం దగ్గిరకెళ్ళాలి –  ఆ పాల సముద్రం లో మునగాలి.”  అవి ఆయన మాటలు.

ఎ కె ప్రభాకర్ గారు
చంద్రశేఖర రావు సాహిత్యం గురించి సోదాహరణం గా వివరించారు. నల్ల మిరియం చెట్టుగురించి మాట్లాడుతూ వారి మిగతా సాహిత్యంలోకి సభికులను లాకెళ్ళారు.  ప్రత్యేకంగా ఆ నవల ముగింపుని పాజిటివ్ దృక్పధంతో నే చూడవచ్చు అని అన్నారు.

సీతారాం
చంద్రశేఖర రావు వచనం కవిత్వం కాదు.  ఆయన తన ఆవేదనని పరివేదని అలా వ్యక్తం చేస్తున్నాడు.  It is his expression of agony.  His form and content needs more critics. “ఆయన రచనలమీద పరిశోధన చేస్తున్నాను,” అని అన్నారు.  అంతగా కదిలించినవి చంద్రశేఖర రావు గారి సృజనలు ఆయనలోని విమర్శకుడిని.  నల్ల మిరియం చెట్టుగురించే తాను మాట్లాడు దాం అని అనుకున్నానని కాని..దాని పరిధి దాటి మాట్లాడారు.

గుడిపాటి
చంద్రశేఖర రావు గారి సాహిత్యం మీద చాల చర్చ జరగవలసి ఉంది.  ఇక్కడ కలిసిన ఈ రెండు మూడు వందల సాహితీవేత్తల మధ్య జరిగినదే కాదు.  ఇంకా జరగాలి.  వేదికలెక్కాలి.  పాఠకులు అందులో ఇన్వాల్ కావాలి.  ఇది ఇక్కడితో ఆగిపోదు.

రచయిత
నా కాల పరిస్థితులే నా రచనలని రూపొందించినవి. ఈ వేదిక మీద ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడం బాగుండదు.

జరిగిన సభ గుఱించి నా మాటలు:
ఎవరూ కూడా రచయిత వ్రాసిన ఏ ఒక్క కథకో ఏ ఒక్క నవలకో పరిమితం కాలేకపొయ్యారు.  కారణం రచయిత ఎన్నుకున్న వస్తువు, శిల్పం, శైలి, భాష.  ఒకరు దండోరా గుఱించి మాట్లాడితే, మరొకరు తెలంగాణా నేపధ్యంతో వ్రాసిన హె‌చ్ నరసింహం అత్మహత్య  గురించో లేక చెంచువుల గురించో..ఐదు హంసల గురించో మరో కథ గురించో మాట్లాడారు.  మధ్యలో కొ కు ఫోర్త్ డైమన్షన్ ని లాకొచ్చారు.

సాహిత్యం, పోకడలు, చంద్రశేఖర రావు రచనలు వారిమీద వారి ఆలోచనల మీద, ఆయన రచనలు తమ బుర్రకు పెట్టిన పనిమీద, పదునెక్కించిన రీతి..ఆ యా నవలల సాంఘిక, రాజకీయ, ఆర్ధిక, సామాజిక నేపధ్యాలు అధ్యయనం చెయ్యవలసిన అవసరం ఒకటేమిటి ఎన్నో అంశాలు..పరిపూర్ణమైన ఒక సాహితీ సభ అది.

కొత్త తరం పాఠకులు వచ్చారు!
కొత్త తరం పాఠకులు వచ్చారు. నేనంటున్నది కూడా అదే.  నవ్య సంపాదకులు అంటున్నది అదే!  కవి శివారెడ్డి అంటున్నది అదే.  ప్రభాకర్ గారు అన్నది అదే! సీతారాం చెబుతున్నది అదే!  గుడిపాటి చెప్పింది అదే! మీరందరూ చదవవలసిన పుస్తకాలు ఇవి.

చాలా రోజుల తరువాత సాహితీ మిత్రులను చాల మందిని కలుసుకున్నాను.  చాల సంతోషమేసింది.  ఎంత సాదరంగా అహ్వానించారో!  ఆదరంగా పలుకరించారో అందరూ.

ఇక మీరు చెయ్యవలసింది.
ఈ బ్లాగ్ పోస్ట్ చూసి ఇక్కడి దాకా చదివారంటే..మీకు అంతర్జాలంతో పరిచయం ఉండే ఉండాలి.  సాహిత్యం మీద అభిరుచు ఉండి ఉండాలి.  కాబట్టి ఈ మూడు పుస్తకాలు ముందు సంపాదించండి.తరువాత వీటిని కూడా సంపాదించి చదువుకోండి.

జీవని
లెనిన్ ప్లేస్
మాయా లాంతరు
ద్రోహవృక్షం..ఈవన్నీ ఈ రచయిత కధా సంకలనాలు.

నవలలు ఇవి:  ఐదు హంసలు, ఆకుపచ్చని దేశం, నల్ల మిరియం చెట్టు.
కినిగెలో ఈ ఒక కథా సంకలనం, రెండు నవలలు..ఈ బుక్స్ గాను ప్రింట్ బుక్స్ గాను ఉన్నవి.

దిష్టి చుక్క:
తెలుగు ప్రసార మాధ్యమాల ఫోటోగ్రాఫర్‌లు.  జరుగుతున్న సభ మధ్యలో దూరి, ఆ క్రమాన్ని ఆరాచకంగా ఆపేసి, తమ కెమరా ప్రలోభానికి కి లొంగనివాడెవ్వడూ లేడని చెప్పకుండా చెబుతూ దర్పంగా వచ్చినంత వేగంగా వెళ్ళిపోతారు.  వాళ్ళు అడ్డం రావడం కారణంగా గుడిపాటి, నవీన్, ఎ కె ప్రభాకర్ బొమ్మల్లో కనిపించకుండా పొయ్యారు.  తీసినవి సరిగ్గా  రాలేదు.  ఉన్నవి కాని ఇక్కడ పోస్ట్ చెయ్యలేదు.

గొప్ప సాహితీ సభ ఎందుకైనదంటే..ఎవరూ పక్కవారి చెవులు కొరకలేదు. గుస గుసలు లేవు.  ఫోన్లు మోగలేదు.  హాలు బయట కుహానా సాహితీవేత్తల అరుపులు, పెడబొబ్బలు లేవు. ఇక సభలో ఉన్నవారి సంగతంటారా!   అందర్ని ఆ వేదిక మీద వక్తలు తమ మాటలతో కట్టి పడేసారు.  ఇప్పుడు అర్థమయ్యిందా  ఆ రచయిత డా॥వి. చంద్రశేఖర రావు రచనా పటిమ?  పుస్తకాలు కొనుక్కుని చదువుకోండి.  చదువుకుని మీ బ్లాగుల ద్వారానో మరొక వెబ్‌సైట్ ద్వారానో మీ అభిప్రాయాలని పది మందితో పంచుకోండి! ఇక మొదలెట్టండి!

ఇలా అర్ధాంతరంగా వెళ్ళి పోతే ఎలా?

రాంకీ గారి మాటలతో సభ మొదలైనది.

ఎన్ వేణుగోపాల రావు,  వీక్షణం సంపాదకుడు , సభకు అధ్యకత వహించారు.  63 ఏళ్ళకే రోహిణి ప్రసాద్ గారి ఆకస్మిక నిష్క్రమణ విచారం కలిగిస్తున్నది. ఆయన ఒక అణు విజ్ఞాన శాస్త్రవేత్త. కాని తన ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త చూపించలేదేమోనని అభిప్రాయపడ్డారు.

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ సంస్మరణ సభ
వేదిక మీద వక్తలు: ఎడమ నుండి కుడికి
దివికుమార్ (ప్రజాసాహితి), నటుడు కాకరాల, ఎన్. వేణుగోపాల రావు, సభకు అధ్యక్షుడు..(సంపాదకుడు వీక్షణం మాస పత్రిక), వరవర రావు (సృజన సంపాదకుదు, విరసం సభ్యుడు) గీతా రామస్వామి ( హైద్రాబాద్ బూక్ ట్రస్ట్ సభ్యురాలు)

దివికుమార్, ప్రజాసాహితి.
“నేను టెలిఫోను డిపార్ట్‌మెంట్ వాడిని కనుక ఎవరితోనైనా మాట్లాడడానికి అవకాశం ఉండేది. అలాగే రోహిణి ప్రసాద్ గారితో నా మొదటి పరిచయం. వారు విజయవాడ వచ్చినప్పుడు వారి చెబితే కాని తెలియలేదు చందమామలో వారి తండ్రిగారి సమకాలీకులు దాసరి సుబ్రహ్మణ్యం గారు అని.  ఉద్యోగ విరమణాంతరం విజయవాడలోనే ఉంటున్నారని.అలాగ దాసరి గారిని కలవడానికి రోహిణి  ప్రసాద్ గారు కారణం.

రోహిణీ ప్రసాద్ గారు హైద్రాబాద్ వచ్చిన తరువాత తరచూ కలుస్తూ ఉండే వారం.  ‘మీరు వ్రాయాలి.  ఈ దిన పత్రికలలో కూడా మీ వ్యాసాలు అచ్చులో చూడాలి’ అని అనేవారు ఆయన.   ‘నా పేరు కనపడితేనే వెయ్యటం లేదండి’, అని అన్నప్పుడు, ‘మరో పేరుతో వ్రాసి పంపండి..ఏదో కలం పేరు పెట్టి పంపేయ్యండి’ అని అన్నారు.  ఆ పనే చేసాను.  విజ్ఞానాన్ని పది మందికి పంచాలి అన్నది రోహిణీ ప్రసాద్ గారి ప్రధానమైన ఆశయంగా ఉండేది.

కోపం వచ్చింది!
గీత రామస్వామి – హైద్రాబాద్ బుక్ ట్రస్ట్
”  ఆయన చాలా అర్ధాంతరంగా వెళ్ళిపొయ్యారు.  హైద్రాబాదు బుక్ ట్రస్ట్ తరఫున వారివి ఒక మూడు పుస్తకాలు ప్రచురించాము.  మరి కొన్ని పుస్తకాలకి ప్రణాళికలు కూడా వేసుకున్నాము.  కాని ఇలా వెళ్ళి పోతారని ఊహించనైనా ఊహించలేదు.

వారిలో ఒక గొప్ప సుగుణం ఉంది.  అది తెలుగులో వ్రాసేటప్పుడు తెలుగులో ఆలోచించేవారు.  ఇంగ్లిష్‌లో వ్రాసేటప్పుడు ఇంగ్లిష్‌లో వ్రాసేవారు.  అందుకనే వారి సైన్సు వ్యాసాలు సరళమైన తెలుగు లో అందరికి అర్ధమయ్యేవిధంగా ఉండేవి.  ఇప్పుడు ఆ వ్యాసాలు ఆ పుస్తకాలని ఏం చెయ్యాలి అన్నది ఆలోచించి చెయ్యవలసిఉంది. “

గోగినేని బాబు
“ఆయన మీద ఒక హీరో వర్షిప్ ఉండేది నాకు.
“పది మంది ఉంటే చాలు.  మనం కార్యక్రమం చెయ్యాలి. మన పిల్లలకి సైంటిఫిక్ టెంపర్  ఉండాలి. రావాలి. కావాలి.  ఈ మూఢ నమ్మకాలు కాదు. వీరిని చైతన్యవంతులని చెయ్యాలంటే మనం ముందుండి వారికి తెలియజెయ్యాలి. మీరు కార్యక్రమాలు చేపట్టండి.  నా ఖర్చులతో నేను వస్తాను’ అని అనేవారు.  ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతారని ఊహించలేదు. ఇక్కడందరితో పాటు నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను”, అని గోగినేని బాబు అన్నారు.

కాకరాల
” నిజానికి నాకు రోహిణి ప్రసాద్ గారితో పరిచయం చాల తక్కువ.  కుటుంబరావుగారి కుటుంబంతో ఎక్కువ. కాని కుటుంబరావు గారితో ఇంకా చాలా ఎక్కువ.  కాబట్టి రోహిణో ప్రసాద్ గారితో నాది గొప్ప పరిచయం కాదు.

ఇదేమిటి ఈ మనషి ఇలా మాట్లాడేస్తాడు.  ఇలా ఉరుకులు, పరుగులు పెట్టేస్తున్నాడు ఈయన.  వారి తండ్రిగారు కుటుంబ రావు గారు. నాలుగైదు దశాబ్దాల పాటు వ్రాసింది, ఈయన అంతకంటే త్వరలో ముగించేటట్టు ఉన్నాడు.  ఇదేదో ఆమెరికా జీవన సరళిని ఈయన  ఇక్కడ కూడా నడిపిస్తున్నట్టున్నాడు, కాని అది సరి కాదు అని అనుకునే వాడిని. అది ఆయన బ్రతికుండగా వున్న అభిప్రాయం.

Kakarala sharing his experiences with Rohini Prasad
నటుడు కాకరాల రోహిణీ ప్రసాద్‌తో తన అనుభవాలాను పంచుకుంటూ..

ఐనా వారు హైద్రాబాదు వచ్చిన తరువాతే వారితో పరిచయం పెరిగింది.  వారి జీవితంలోని వేగం, వారు పోయిన తరువాత అర్ధం అయ్యింది. తండ్రి గారి లాగే ఒక ప్రణాళిక ప్రకారం వారు తన జీవితాన్ని, తన రచనా వ్యాసంగాన్నీ, తన సాహిత్య ప్రస్థానాన్ని, తన సంగీతానికి ఒక గమ్యాన్ని నిర్దేశించుకున్నారు.  బహుశ వారికి తెలిసే ఉంటుంది ..వెళ్ళే లోపు చెయవలసిన పనులు చాల ఉన్నవి, అవన్నీ కూడా ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని.

వారి తల్లి గారికి కూడా ఫో‌న్ చేసి చెప్పాను. అమ్మా రోహిణీ ప్రసాద్ గారి గురించి నా అభిప్రాయం మార్చుకున్నాను.  ఆయన ఎన్నుకున్న దారే సరైనది.  మీరుకూడా మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలి అని కోరుకుంటున్నాను అని చెప్పాను”.

వరవర రావు
“సంగీతం గురించి నాకు అసలు తెలియదు. కానీ రోహిణి ప్రసాద్ సితార్ వాయిద్యం వినాలని పిలిచినప్పుడు వారి ఇంటికి వెళ్ళాను. బహశ అదేనేమో నేను సంగీతం కోసం ఒకరి ఇంటికి వెళ్ళి వినడం.
విరసం సభ్యుడు, వరవర రావు, సృజన సంపాదకుదు
వైజాగ్‌లో శ్రీశ్రీ  షష్టి పూర్తికి మేము మొదటి సారి కలిసాము.  కొ కు, చలసాని ప్రసాద్ రోహిణి ప్రసాద్ మరికొందరు మిత్రులు అక్కడ కలిసాము.  ఆ సభకి ఒక ప్రత్యేకత ఉంది.  విరసం ఆవిర్భావినికి అక్కడే కదా జరిగింది. ఆ నేపధ్యం లో ఆలోచిస్తే రోహిణి ప్రసాద్ చెయ్యవలసింది ఇంకా చాల ఉన్నా..ఇలా వెళ్ళిపోవడం చింతించవలసిన సందర్భమే.  వారిని గురించి నేను ఒక వ్యాసం ఆంధ్రజ్యోతి లో వ్రాసాను.  గడగడా మాట్లాడుతాడు అని.  ఆయన నొచ్చుకున్నాడేమో తెలీయదు కాని ఇప్పుడు అనిపిస్తున్నది అలా రాయాల్సింది కాదేమోనని.  ఆయన అలా మాట్లాడక పోతే పదిమందికి ఆయన అభిప్రాయాలు తెలియపరిచగలిగే వారు కాదు.

వారి పుస్తకానికి నన్ను ముందు మాట కూడ వ్రాయమని అడిగారు.  రాసాను.  అవి సైన్సు వ్యాసాలు. నాకు సైన్స్ గురించి కూడా పెద్ద తెలియదు.  తన పుస్తకం కాబట్టి చదివి కొంత సైన్స్ గురించి తెలుసుకుంటానన్న ఉద్దేశం తో నన్ను ఆయన రాయమని ఉంటాడు అని అనుకుంటున్నాను. ఆయనది ఒక ఆకస్మిక నిష్క్రమణ. చింతించవలసిన విషయం కూడా!”

Kodavati Ganti Rohini Prasad
Kodavati Ganti Rohini Prasad

** ఒక రచయిత చనిపోయినప్పుడు ప్రచురణ కర్తలు ముందుకు వచ్చి ఇలాంటి సభని ఏర్ఫాటు చెయ్యడం హర్షించ దగ్గ విషయం.  కాకరాల గారు వక్తగా వేదికనెక్కితే చాలా ఆవేశంగా మాట్లాడేవారు.  ఈ సభలో ఇదివరకున్న ఆవేశం లేదు.

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

మరో తరం వెళ్ళిపోవడం మొదలయ్యింది.

మద్రాసులో బాల్యంలో మా నాన్న గారితో వారింటికి వెళ్ళడం కుటుంబరావు గారు, నాన్న గారు సాహిత్యం, రాజకీయం మీద చర్చోపచర్చలు కబుర్లు చెప్పుకుంటూవుంటే ప్రసాద్ గారితో ఏదో కాలక్షేపం చెయ్యడం లీలగా గుర్తుంది.

వారి సాహిత్యం గురించి, వారి సంగీతం గురించి, వారి శాస్త్రీయ రచనల గురించి నా కంటే వివరంగా చెప్పేవాళ్ళూ, విశదీకరించే వారున్నారు కాబట్టి నేను వాటి జోలికి వెళ్లడం లేదు.

దాసరి సుబ్రహ్మణ్యం గారు ఒకరోజు సాయంత్రం  ప్రసాద్‌గారిని తీసుకునివచ్చి “మిమ్మల్నీ కలవడానికి వచ్చాడు’,  అని మా అమ్మకి పరిచయం చెయ్యడం నుంచి బాగా గుర్తు ఉంది. అప్పటికి ఆయన అమెరికాలోనే ఉన్నారు. దాదాపు ఒక గంట ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్న తరువాత..ఇంకేదో పనిమీద వెళ్ళిపొయ్యారు.  చాలా సీదాసాదాగా, సరదగా నవ్వుతూ ఉండేవారు.Kodavati Ganti Rohini Prasad

మా నాన్నగారిని బాగా అభిమానించేవారు. వారి రచనలన్నింటిని ఈ తరానికి పరిచయం చెయ్యాలని అంటూ ఉండేవారు.
I still remember his cheerful presence in our house and how badly my father took his untimely demise.
I feel your father’s excellent works should be reintroduced to today’s generation. If you have no objection you can get them posted in pranahita.org or prajakala.org and poddu.net. with introductory remarks. In case you are not familiar with typing in Unicode etc I can tell you.”

ఆ మధ్య డెట్రాయిట్‌లో త్రిపురనేని గోపిచంద్ జ్ఞాపకార్ధం జరిగిన సాహితీ సభలలో కూడా త్రిపురనేని సాయిచంద్ ని కలిసినప్పుడు:
In the Detroit meeting I requested Saichand to say a few words about Pitcheswara Rao garu after the discussion on Gopichand garu“, అని చెప్పాను అని కూడా అన్నారు.

అలాగే దాసరి సుబ్రహ్మణ్యం గారి స్మృత్యర్ధం విజయవాడ సభకి వెడుతున్నాను., అనగానే వారిమీద వ్రాసిన వ్యాసాన్ని పంపుతూ “మీరు అక్కడే ఎవరితోనైనా చదివించి వినిపించండి, ప్లీజ్“, అంటు కోరారు.  ప్రజాసాహితి రవిబాబు గారు ఆ సభలో దానిని చదివి వినిపించారు.
స్నేహాశీలి..చిన్నా పెద్దా తారతమ్యం లేదు. అందరితోను కలివిడిగా ఉండేవారు.  చేతనైన సహాయం చేసేవారు.

తరచూ ఈమైల్స్ తో పలకరించే వారు.

నా బాల్యం – సాహిత్యం – మద్రాసుకి ఒన్న మరో గుర్తు కాలగర్భంలో కి జారిపోయింది.

వారి బ్లాగులు:
http://rohiniprasadk.blogspot.in/
http://rohiniprasadkscience.blogspot.in/
కినిగెలో వారి పుస్తకాలు ఇక్కడ:
http://kinige.com/kbrowse.php?via=author&name=Kodavatiganti+Rohini+Prasad&id=122

డా.వింజమూరి తో సరదాగా కాసేపు RainBow FM లో

వైద్యులు వింజమూరి సూర్య ప్రకాశ్ గారు రేపు అంటే

20th, శుక్రవారం2012 రోజున,
Rainbow (Radio channel) AIR FM 101.9 లో

Spreading Lights

కార్యక్రమం గురించి శ్రోతలతో

సరదాగా కాసేపు

పంచుకుంటారు.

మధ్యహ్నాం

1.30 కి

ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.

సరే.  ఇక ఈ డా. వింజమూరి ఎవరు?
Vinjamuri
డాక్టరు గారు.  వైద్యం చేసే డాక్టరు గారు.  కాని వైద్యం కాదు మన సంఘానికి కావల్సింది విజ్ఞానం.  అది పుస్తకాలలో ఉంది కాబట్టి దానిని ముందు ప్రజల మస్తిష్కాలలోకి ఇంజెక్ట్ చేస్తే సంఘం బాగు పడుతుంది అని నమ్మి డాక్టరిని వదిలేసి ఇదిగో ఈ పస్తకాల పూజతో ప్రజలని సేవించుకుంటున్నారు.  ఒక్క రూపాయి అడగరు. నిస్వార్ధంగా చేస్తున్నారు ఈ డాక్టరు వింజమూరి గారు.

Spreading Lights
వారు మొదలుపెట్టిన “Spreading Lights” కార్యక్రమలో ఒక భాగమే పుస్తకాలను చదువుకోవడం. రచయిత తన పుస్తకాన్ని కాని, పాఠకుడు తనకు నచ్చిన పుస్తకాన్ని కాని పది మంది తో ను పంచుకోవడం ఈ కార్యక్రమం విశేషం. భాగ్యనగరం లో ఐతే ప్రకాశ్ చొరవ,కృషి, పట్టుదల పుణ్యమా అంటూ ఇప్పుడు కనీసం పది చోట్ల ప్రతి వారం ఏదో ఒక దరోజున ఈ Spreading Lights కార్యక్రమం జరుగుతున్నది.  నేను కూడా వీటిలో పాల్గొన్నాను.

మీరు కూడా మీ ప్రాంతంలో ఈ Spreading Lights కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు.  మీరు ముగ్గురే ఐనా ఫరవాలేదు.  ముప్పై మంది ఐతే మరీ సంతోషం.  🙂

సరదాగా కాసేపు

ఇక  రేపటి సరదాగా కాసేపు ప్రతి సాహిత్యాభిమాని తప్పక వినదగ్గ రేడియో కార్యక్రమం. నిజమే,ఏ సాయంత్రమో ఐతే బాగుండేది, ఆఫీసులకి వెళ్ళేవాళ్ళకి ఇబ్బందే.

ఐనా వినడానికి ప్రయత్నించండి.

ఇక్కడ పైన ఉన్న చాయచిత్రంలో మీ ఎడమవైపు నుండి రెండో వారు శ్రీ వింజమూరి సూర్య ప్రకాశ్ గారు. (భుజానికి సంచీ తగిలించుకుని ఉన్నారే వారే)

‘మో’ ఎవరు?

అని నిన్న నన్నొకరు అడిగారు.

ఎక్కడ?

రవీంద్రభారతి, భాగ్యనగరం.

సందర్భం:

తనికెళ్ళ భరణి సాహితి పురస్కార ప్రదానం.

కూర్చోడానికి ఖాళీ కుర్చీ కనపడక అడిగినట్టున్నాడు.  అడిగిందెవరా అని వెనక్కి తిరిగి చూసాను.  కళ్ళజోడు. నెరిసిన జుత్తు. “సభ మొదలైన తరువాత తెలుస్తుందండి మీకు”, అని  మళ్ళీ నా దృష్టిని వేదిక మీదకి సారించాను.

అవధానం జరుగుతున్నది. అప్రస్తుత ప్రశ్న ; ” అత్యంత లోభి కూడ దానం చెయ్యలేనిది ఏది?”.  అవధాని గారు జవాబిచ్చే లోపే, నా చుట్టూ ఉన్న ప్రేక్షకులు ” కాలధర్మం” అని ఘొల్లుమన్నారు.

అధ్యక్షుడు సి. నారాయణ రెడ్డి గారు, నిషాదం అంటే సంగీతంలో సప్తమ స్వరం అని  వివరిస్తూ.. మో పుస్తకం నిషాదం చదవడం మొదలుపెట్టినప్పుడు..”ఏమో‌” అని అనుకున్నానని కాని “అమ్మో” అని అనిపిస్తుందని అన్నారు.

గవర్నమెంట్ ఎలిమెంటరి స్కూల్ళో చదువుకున్న తనకు, “మో‌” నిషాదం మీద మాట్లాడేంత పరిజ్ఞానం లేదని, నటుడు భరణి ఇలాంటి సత్కార్యాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అందజేసారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య.

ఇక తెలుగు భాష బోధకుడిగా కొన్నాళ్ళు ఉద్యోగం చేసినా, చలన చిత్ర నటుడుగా బ్రహ్మాండంగా సాగిపోతున్న బ్రహ్మానందం,

“అది గది

దాని అద్దె పది”

అనే కవితలోస్తూన ఈ రోజుల్లో, మో నిషాదం చదివి, అర్ధం చేసుకుని, జీర్ణం చేసుకునే అవకాశం ఆ భగవంతుడు తనకివ్వలేదని, తన ఫేసుకి ఆయన ఒక స్టఫ్ ని ఇచ్చి ప్రజలని రంజింపజెయ్యమన్నాడని చెప్పుకొచ్చారు.

ప్రేక్షకులతో పాటూ గా కూర్చోవలసిన తనను, వేదిక మీద కూర్చోపెట్టిన భరణి, తన అభిమానాన్ని చాటుకున్నాడే కాని తనకి ఆ అర్హత లేదని, వినమ్రంగా విన్నవించుకున్నాడు నటుడు ప్రకాశ్ రాజ్.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ‘మో‌’ మీద కోపం వచ్చింది.  ఔను, దర్శకుడు శ్రీనివాసే! ‘మో‌’ చదివినంత తను చదవలేదు కాబట్టి, తన కోపం.  ఆ కోపంతో ఆ సాహిత్యం అంతా చదివేస్తానంటాడియన.  అసలు తనకి రవింద్ర భారతి కార్ పార్కింగ్‌లో నిలబడే అర్హత కూడా లేదని కాని భరణి మాట తీసెయ్యలేక వేదిక మీద దాక్కోడం కుదరక కూర్చున్నాని నవ్వుల మధ్య చెప్పాడు.

న్యాయనిర్ణేతలు శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు, ఆచార్య మృణాళిని, కవి శివారెడ్డి.  తాము ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నుకున్న కవితా సంపుటి “నిషాదం” అని తమకు అందిన 108 కవితా సంపుటాలలో దానిని ఎన్నుకోవడానికి గల కొన్ని కారణాలని వివరించారు, కవి శివారెడ్డి.

తనికెళ్ళ భరణి, చక్కని చామరం క్రింద ‘మో‌’ అని  మనం పిలుచుకునే వేగుంట మోహన ప్రసాద్ ని సుఖాసీనుడిని చేసి, వేద పండితుల మంత్రోచ్హారణల మధ్య  స్వర్ణ పుష్పాభిషేకం చేసారు. వేదికనలంకరించిన పెద్దలలో చలన చిత్ర కథకులు, సంభాషణ కర్త పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన వేంకటేశ్వర రావు గారితో సహా అందరూ ‘‌మో’ కి తమ శుభాకాంక్షలు అందజేసారు.

‘మో‌’ తన దైన శైలిలో..ముందే వ్రాసుకుని తెచ్చుకున్న పాఠం నుంచి కొంత మేరకు చదివి వినిపించారు.

బర్త్ డే బాయ్ భరణికి కొంత మంది మిత్రులు తమ శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు.

జాతీయ గీతం జనగణ మణతో సభ ముగిసింది.

ఎటువంటి హడావిడి లేకుండా, వెకిలి ప్రసంగాలు, అనవసరపు డప్పాలు లేకుండా సాఫీగా, హాయిగా జరిగిన గొప్ప సాహిత్య సభ ఇది.  తెలుగు కవి కి తెలుగు కవిత్వానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే పండుగ రోజులకి ఇది తొలి రోజు మాత్రమే.

భరణి తన మాటల్లో చెప్పిన “గద్వాల్ సంస్థానం వారి ఆచారం” మళ్ళీ మొదలవ్వాలని..తెలుగు భాష బ్రతకడానికి ఇటువంటి సాహిత్య కార్యక్రమాలు విరివిగా జరగాలని మనమందరం కోరుకోవాలి.

వీలైతే ‘మో‌’ ప్రసగం పూర్తి పాఠం, అలాగే మితృడు నరేశ్ నున్న ‘మో‌’ మీద వ్రాసి, అచ్చొత్తంచి, ఉచితంగా పంచిన ఒక చిన్న పుస్తకాన్ని మీకు ఇక్కడ అందించడానికి ప్రయత్నిస్తాను.

ఈ తనికెళ్ళ భరణి సాహితి పురస్కారం జరిగినది కళా ఫౌండేషన్ ఆధ్యర్యంలో..కనకధార వెంచర్స్ సహాయంతో..

కినిగె.కాం లో

తనికెళ్ళ భరణి సాహిత్యం ఇక్కడ  ..  ‘మో’ నిషాదం ఇక్కడ  లభ్యం.

విదేశాలలో ‘కవిరాజు‌’ త్రిపురనేని 125వ జయంతి కార్యక్రమాలు

విదేశాలలో కూడా ‘కవిరాజు‌’ 125 జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారని నేటి ఆంధ్రజ్యోతి ద్వారా వారి మనుమడు, త్రిపురనేని గోపిచంద్ గారి పుత్రుడూ, లఘు / చలన చిత్ర నిర్మాత, దర్శకుడు, ప్రముఖ నటుడు  త్రిపురనేని సాయిచంద్ తెలియజేస్తున్నారు.

ఈ పత్రికా ప్రకటన మూలంగా కొంత  సమాచారం అందినా, సభా వేదిక, సంప్రదించవలసిన వారి వివరాలు తెలియడం లేదు.  బహుశ స్థలాభావం వల్ల పత్రికలు ఆ వివరాలను ఇవ్వలేక పోయినవేమో! ఆయా ప్రాంతాలలోని తెలుగు వారికి, ‘కవిరాజు’ అభిమానులకి ఆ వివరాలు అందిస్తే బాగుంటుంది. మీలో ఎవరికైన ఆ వివరాలు తెలిస్తే నాకు అందించ గలరు.  అందరికి అందుబాటులో ఇక్కడ పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ పత్రికా ప్రకటనలో ఉన్న వివరాలతో మీరు ప్రయత్నించ గలరు.

వివిధ దేశాలలో కార్యక్రమం వివరాలు

అమెరికాలోని డల్లస్ నగరంలో మే 14 న  – శ్రీ తోటకూర ప్రసాద్ ఆధ్వ్యర్యంలో,

న్యూ యార్క్‌ నగరంలో మే 15న – శ్రీ త్రిపురనేని తిరుమల రావు ఆధ్వర్యంలో,

సెయింట్ లూయి నగరంలో మే 20 న – శ్రీ దండమూడి ఆధ్వర్యంలోను జరగనున్నాయి.

అలాగే,

ఇంగ్లండ్ లో మే 28 న – శ్రీ చదలవాడ సుబ్బారావు ఆధ్వర్యంలోను,

లండన్ నగరం లో మే 28 న – శ్రీ దాసోజు రాములు ఆధ్వర్యంలోను ఈ సభలను నిర్వహించడానికి ఏర్పాటులు జరిగినవి.

kaviraju anniversary in USA, Canada, UK
అమెరికా,కెనడ, ఐరోపాలలో కవిరాజు త్రిపురనేని రామస్వామి 125 జయంతి ఉత్సవాలు

నేటి ఆంధ్రజ్యోతిలో పత్రికా ప్రకటన