వ్యాపారస్తుడు దొంగ.

అప్పట్లో ఇంటర్‌నెట్ లేని రోజుల్లో గ్రీటింగ్ కార్డులతో పుట్టిన రోజులకి శుభాకాంక్షలు, గిట్టిన రోజులకి సందేశాలు కూడా పంపుకునేవారు.  ఆ రోజుల్లో కొంచెం చదువుకున్నవారు, మహానగరాలలో ఉండేవారు (భారతదేశంలో)  వకీల్స్ వారి గ్రీటింగ్ కార్డులు కొనుక్కుని పంపేవారు.  చక్కని సందేశాలతో, ముచ్చటైన బొమ్మలతో కళాత్మకంగా ఉండేవి అవి. గ్రీటింగ్ కార్డులు కూడా కళాత్మకంగా ఉంటాయా అని అడిగేవారితో నాకు అస్సలు పేచి లేదు.  అందుకని వారి జోలికి వెళ్ళను.  వకీల్స్, ఎలార్ రోజుల్లో వారికి పోటిగా ఆర్చీస్ అనే సంస్థ  బయలుదేరింది.

ఆనాటి నవతరం, యువతరం కోసం వాళ్ళు కార్డ్లు మొదలుపెట్టారు.  ఆ తరువాత పెన్నులు, గన్నులు, బొమ్మల అమ్మకాలన్నింటిలోకి ప్రవేశించారు.  మొదట్లో ఈ గ్రీటింగ్ కార్డులమీద ధరల వివరాలుండేవి కాదు.  దుకాణందారు తనకిష్టం వచ్చిన ధరకి అమ్మేవాడు.  కొనుక్కునేవాడు..మనసులోనే నిక్కినా నిలిగినా కొనుక్కునేవాడు.  తప్పదు.  కొంత పీర్ ప్రెజర్ కూడా ఉండేది.  రీడర్స్ డైజెస్ట్ చేతిలో లేకపోతే వాడొక వెధవాయ్ అన్నటైపులో అన్నమాట!  ఇప్పుడు “చే” బొమ్మతో ఉన్న కాలర్‌లెస్ టీ వేసుకున్నట్టు.  (“చే” ఎవరు అని ఆడిగితే, “చీ, చీ..నన్నే అడుగుతావా  అని తన తెలియని తనాన్ని దాచుకునే వెధవలున్నట్టు).

వ్యాపారస్థులందరూ దొంగలు కాదు!
వ్యాపారస్థులందరూ దొంగలు కాదు!

అలాంటి రోజుల్లో బ్రతక నేర్చిన మిత్రుడు (వాడు బ్రతకనేర్చినవాడని అంతకుముందే తెలిసింది..అది మరొక కథ) ఎవరి బర్త్‌డేకో గ్రీటింగ్ కార్డ్ కావాలని రావడం..(నాతో సెలక్ట్ చేయించుకోవాలని అప్పట్లో తాంబరం నుంచి బెసెంట్ నగర్ నుండి, పరశువాక్కం లాంటి దూరప్రాంతలనుండి వచ్చేవారు)  ఒక చక్కని కార్డుని అసలు ధరకే (లాభాలు లేకుండా..మిత్రుడు కదా?) తీసుకోవడం అయిపోయింది.  పాపం డబ్బులిద్దామని పర్సుతీస్తే అందులో అన్ని వంద రూపాయల నోట్లే!

“అలా రా బాస్,  టీ తాగి, దమ్ము కొడదాం. హోటల్ వాడు చిల్లర ఇస్తాడులే” అని నన్ను లాక్కువెళ్ళాడు.  గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్, టెన్స్ పాకెట్ ఆ రోజుల్లో అక్షరాల ముప్పై రూపాయలు.  నా షర్ట్ జేబు ఎప్పుడు దానితో నిండుగా ఉండేది.  (కొందరిలాగా పాంట్ జేబులో పెట్టుకుని దాచుకోవడం నాకు తెలీదు).  సరే, ఒకటి మనవాడికిచ్చాను..నేను ఒకటి అంటిచ్చుకున్నాను.  స్పేషల్ టీ ఆ రోజుల్లో మూడు రూపాయలు.  ఇద్దరికి ఐతే రెండుకప్పుల నిండా వచ్చేది.  ఆ స్పెషల్ టీ తెచ్చిన బేరర్ కి చిల్లరలేక..పావలా టిప్పు.  బిల్లు పే చెద్దామనుకున్న మిత్రుడు మళ్ళీ వంద రూపాయల నోటు ఇస్తే..హోటల్ యజమాన్ నవ్వుతూ నా వంక చూశాడు.  ఆ మూడు రూపాయలు నేనే ఇచ్చాను. (ఇందాకటి పావలా టిప్పు కూడా నాదే!)

ప్లాట్‌ఫార్మ్ మీద నిలబడి కబుర్లు చెప్పుకున్నాం.  ఒక రెండు నిముషాలు.  గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్ కదా అనేమో మిత్ర గురువు  దమ్ము లాగుతున్నాడు..ఫిల్టర్ కూడా కాలిపొయ్యేటట్టుంది.  అప్పుడు దానిని చూపుడు వేలు మధ్యవేలు మధ్యన పెట్టుకుని చమత్కారంగా విసిరేసాడు.  అది హోటల్ పక్కనే ఉన్న బడ్డికొట్టుముందు వీధిలాంతరు స్థంభానికి తగిలి కింద పడింది.

“సరే బాసు, మళ్ళీ కలుద్దాం”, అంటూ నేను రోడ్డు దాటడానికి కదులుతూ..అతనికి షేక్‌హాండిచ్చి రాబోతుంటే..చెయ్య్ పట్టుకుని ఆపేసి అన్నాడు కదా..”బాసు రెండు రూపాయల కార్డు కొని, మూడు రూపాయల సిగరెట్టు, ఒక స్పెషల్ టీ కొట్టేసాడేంటి వీడు అని అనుకుంటున్నావా?”

అతను అనేదాక ఆ ఆలోచన నా ఊహలోకి కూడ రాలేదు.  అప్పుడు వచ్చింది.  కార్డు కొన్నానంటాడు అది కూడా ఫ్రీ గానే తీసుకున్నాడు గా అని.  అదేమి లేదులే అని నవ్వేసి, చెయ్యి వదిలించుకుని వచ్చేసాను.

అఫ్‌కోర్సు..ఏదో ప్రభుత్వ సంస్థలో లంచం ఇచ్చి ఉద్యోగం సంపాయించుకున్నాడు.  ఇద్దరు కూతుళ్ళకి అమెరికా సంబంధాలు చేసాడు.  కోట్ల రూపాయల విలువగల భవంతుల యజమాని ఈ రోజు.

ఇదంతా ఎందుకు చెప్పానంటే..ప్రతి వ్యాపారస్థుడు దొంగ కాదు, చీట్ కాదు. వాడికి స్నేహాలు, బంధువులు, ప్రేమలు, అభిమానాలు, నైతిక విలువలుంటాయి!  నిన్న ఎవరో ఫేస్‌బుక్‌లో వ్యాపారస్థుడుకి అలాంటివి ఉండవన్న అర్ధం వచ్చే మాటన్నారు, అందుకని ఈ ఏడుపు!

ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు

మొన్న ఎలక్షన్‌లో గెలిచిన నరేంద్రమోడి గెలుపుకి పుస్తకాలకి సంబంధం ఏమిటా?  అంతర్జాలం.  సోషల్ మిడియా!

తొలి ముద్రణ 2013.  మలి ముద్రణ 2013.  అమ్మకాలు దాదాపు ముప్పై ఐదు వేలు.  పుస్తకం ఆవిష్కరణ సభ భాగ్యనగరం లో పెద్ద హోటలు. ఐదువందల రూపాయలు నోట్లు ఇచ్చిన వారు, చేతికి అందిన ప్రతులు అందుకున్నారు. చిల్లర అడగలేదు.  తెలుగు పుస్తకమే.  ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు..

మరో మంచి హోటల్ లో పుస్తక ఆవిష్కరణ.  తొలి ముద్రణ ఆగస్టు 2013.  అమ్మకానికి ప్రతులు లేవు. మలి ముద్రణ డిసెంబరు 2013. కథకుడు మరో ముద్రణ గురించి ఆలోచిస్తున్నాడు.

తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు.

మరో పుస్తకం. మూడవ ముద్రణ.  కొన్ని వేల ప్రతులు. తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు.

పైన నేను ఉదహరించిన తెలుగు పుస్తకాలన్నింటిని చదవాలని, కావాలని పాఠకులు కొనుకున్నారు.

మూడు పుస్తకాలు తెలుగులోనే ఐనా వాటిలోని విషయాలు విభిన్నమైనవి.  ఒకటి కధా సంకలనం.  ఒకటి జీవిత చరిత్ర. మరొకటి సాహిత్య పురస్కారం అందుకున్నది.

మొన్న ఏప్రిల్ లో నెల్లూరులో మరో పుస్తకం ఆవిష్కరణ.  వేదిక దగ్గిర ప్రతులు అమ్ముడైపోయినవి.  పుస్తకాలు కావాలి.  ప్రతులు లేవు. తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు…కొనుక్కున్నారు.  కొంతమంది పదుల ప్రతులు కొనుకున్నారు.

నేనిక్కడ ఉదహరించినవి నా దృష్టికి వచ్చిన వాటిల్లో మూడో నాలుగో పునర్ముద్రణలు మాత్రమే!  ఇవి కాక ఇతర ప్రాంతాల్లో పునర్ముద్రణలకు నోచుకున్న పుస్తకాలు అనేకం! ఇవికాక ప్రచురణకర్తలు పునర్ముద్రించుకుంటున్నవి అనేకం ఉన్నవి!  ప్రవాసాంధ్రుల ప్రచురణలు?

అనంతరామ్ పేరు విన్నారా?  మొన్నామధ్య ఏప్రిల్‌లో పెళ్ళి చేసుకున్న అనంతరామ్ కొంతమంది బ్లాగర్లకి మాత్రమే తన బ్లాగు ద్వారా పరిచయం. రెండువేల పదమూడులో రామ్@శ్రుతిడాట్‌కామ్ అనే శీర్షికతో ఈ నవ యువ రచయిత  తన తొలి ప్రేమకధా నవలని ఈబుక్ గా ప్రచురించుకున్నాడు.  తొలుత అది ఈబుక్‌గానే వెలువడింది. ఆ  నవల తొలుత అచ్చులో వెలువడలేదు.  ఈబుక్‌ అమ్మకాల మీద వచ్చిన రాయల్టీలతో తన పుస్తకం అచ్చువేసుకున్నాడు.  తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు. కొనుక్కున్నారు.  (పాఠకమహాశయా! ఈ యువ నవ రచయితని ఈ వ్యాసకర్త ఇప్పడిదాక కలవలేదు.  కనీసం ఆ రచయిత వివాహానికి ఆహ్వాన పత్రిక అందుకున్న గుర్తు కూడా లేదు).

ఒకప్పుడు రచయితలకి సిగరెట్ల పాకెట్టిచ్చి,  తేనిరు పోసి, హ్విస్కి లు తాగించి, పుస్తకాలు వ్రాయించి, డబ్బు పెట్టుబడి పెట్టి, ఆ పుస్తకాన్ని ప్రచురించి, లాభాలార్జించి , భవంతులు కట్టుకున్న ప్రచురణకర్తలున్నకాలం తెలిసినవారుండేవుంటారు మీ పాఠకులలో.  అవి ఆ రోజులు.

తన పుస్తకాల అమ్మకాల మీద వచ్చిన రాయల్టీలతో పిల్లలకి చదువులు చెప్పించుకుంటూ, విదేశాలలో ఉద్యోగాలకు పంపించుకుంటూ, భవంతులు కట్టించుకుని, కారులలో షికారులు చేస్తూన్నాడు ఈ రోజు రచయిత. ఇవి ఈ రోజులు.

శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాక.. అదిలాబాదు నుండి తిరుపతి దాక ఉన్న తెలుగు రచయితల సాహిత్యం ఈ రోజు అంతర్జాలం ద్వారా అందరికి అందుబాటులోకి వచ్చింది.  ఆక్‌లాండ్ నుండి, ఆసియా నుండి, ఆఫ్రికానుండి, అమెరికా సంయుక్త రాష్ట్రాల దాక కాక వాటిమధ్యనున్న దేశాలలోని తెలుగు పాఠకుడు ఈ రోజు తెలుగు పుస్తకాలు కొనుక్కుంటున్నాడు.  చదువుకుంటున్నాడు.  లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాడు.  ఏటా, అనధికార గణాంకాల ప్రకారం సుమారు గా పదిహేను కోట్ల రూపాయల విలువగల పుస్తక క్రయ విక్రయాలు జరుగుతున్నవీ.  ఈ లెఖ్ఖలలో జాలం ద్వార అమ్మిన అచ్చు పుస్తకాలు కాని డిజిటల్ పుస్తకాలు కాని కలపలేదు.  అలాగే విదేశాలలో ముద్రిణపొంది అమ్ముడవుతున్న పుస్తకాల గణాంకాలు లేవు!  ఐనా ఇవన్నీ తెలుగు భాషవి మాత్రమే సుమా!  తెలుగు వారెంతమంది?  ఆ మధ్య పదిహేను / పదహారు కోట్లమంది ఉన్నారని అన్నారుగా.  ఆ మాటే ప్రామాణికంగా తీసుకుంటే ప్రతి తెలుగువాడు తెలుగు పుస్తకం కోసం ఒక రూపాయి వెచ్చించినట్టే!

ఎన్నికల లెక్కల్లో కొంచెం అటు ఇటుగా ఎనిమిది కోట్ల మంది అని తేలిందా?  పోని అదే లెఖ్ఖ వేసుకుందాం!  ఆ లెఖ్ఖన సగటున ప్రతి తెలుగువాడు తెలుగు పుస్తకం కోసం రెండు రూప్యంబులు వెచ్చించెనన్నమాట!  ఇప్పుడు చెప్పమనండి..తెలుగు ఎలా చచ్చిపోతుందో, తెలుగు భాష ఎలా చచ్చిపోతుందో, తెలుగు పుస్తకం ఎలా అవసాన దశకి చేరుకుందో రుజువు చెయ్యమనండి!! చూసే వాడి చూపులో ఉంటుంది అందం అన్న చందానా,.పచ్చ కామెర్లవాడికి ప్రపంచం అంతా పచ్చగానే కనపడుతుంది.

అది నేటి సాహిత్యం పరిస్థితి.  ఇక తెలుగు చచ్చిపోయింది. చచ్చి పోతోంది.  ఇక తెలుగు చదివేవారు లేరు అనేది ఎవరో మీరే నిర్ణయించుకోండి.

ఒక యువ నవ కథా రచయిత, ఒక సాయంత్రం ఒక సాహిత్య సభ దగ్గిర నా బుర్ర తిని (తినిపించుకునేవాడుంటే బుర్రలు తినడం నాకు చాలా ఇష్టం) ఒకటో రెండో సంవత్సరాలు ఆలోచించుకుని మొన్నిమధ్య అచ్చు పత్రికలలో వెలువడ్డ తన కధలన్నింటిని గుదిగుచ్చి ఒక సంకలనంగా వెలువరించాడు.  ఆవిష్కరణ సభకు ముందే తనకు తెలిసిన పుస్తకాల దుకాణాలలో పాఠకులకు అవి అందుబాటులో ఉండే ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే జాలంలో ఈబుక్‌గా దేశవిదేశాలలో అవిష్కరణ సమయానికి వెలువడేటట్టుగా ఏర్పాట్లు చేసుకున్నాడు.  అంతర్జాలంలో అంటే ఆన్‌లైనులో  సాహిత్యానికి, తెలుగు భాషకి, తెలుగుకి సంబంధించిన దాదాపు ప్రతి సమూహంలోను తన పుస్తక ఆవిష్కరణ గురించి పదిమందికి తెలిసేటట్టు ముఖపత్రాల రూపురేఖలు, రంగులు, అక్షరాల ఎంపిక  దగ్గిరనుండి ప్రచారం చేసాడు.

పది పత్రికల కార్యాలయా మెట్లు, లిప్ట్‌లు ఎక్కాడు.  తెలిసిన పదిమంది పాత్రికేయ మిత్రులని తన పుస్తకం గురించి సమీక్షో, పరిచయమో, స్వీకారమో, కనీసం ఒక వాక్యమో, ఏదో ఒకటి వ్రాయమని అడగడమో, బతిమాలడమో చేస్తూ తలా రెండు ప్రతులు అందించాడు. తెలియని వారిని పరిచయం చేసుకుని వారి చేతికి తన ప్రతిని అందించి సవినయంగా మరీ అడిగాడు.

నిర్మొహమాటంగా, నిస్సిగ్గుగా తనకు తెలిసిన బ్లాగర్లని, జాలపత్రికల సంపాదకులని, తోటి రచయితలని అందరిని తన పుస్తకం గురించి తమ పత్రికలలో, బ్లాగులలో, పేజిలలో, కాలంలలో, వెబ్‌సైటులలో వెబ్‌జైనలలో వ్రాయమని అడిగాడు.

ముందే నిర్ణయించుకున్న ఒకానొక సాయంత్రాన ఆవిష్కరణ సభ కావించాడు. సభ పేలింది. అమ్మకానికి ఆవిష్కరణ సభలోనే కొన్ని ప్రతులని అందుబాటులో ఉంచాడు.  అమ్మినవి అమ్మగా..ఉచితంగా ఇచ్చినవి కూడ ఉన్నవి.  (నాకు ఇంకా ప్రతి ఇంకా అందిలేదు. పైగా నేను ఆ ఆవిష్కరణ సభలో పాల్గొనలేదు. అది వేరే విషయం). ఇంత వివరంగా మీకు ఎందుకు తెలియజేయవలసి వచ్చినదంటే..దమ్ముంటే నా పుస్తకం అమ్ముడవుతుంది అని అనుకోరాదని.  ఆ రోజులు చెల్లిపోయినవని మీకు తెలియజేయడానికే.  బంగారు పళ్ళేనికైనా గోడ చేర్పు కావాలి!

పొద్దున లేచినప్పటినుంచి ఫోను‌లో ఎస్ ఎమ్ ఎస్‌లు, దినపత్రికలు తెరిస్తే వార్తల సంగతి తరువాత, ముందు ప్రకటనలు.  దిన పత్రికల వారు సొమ్ము పుచ్చుకుని వేసే ప్రకటనల మధ్య మళ్ళీ లీఫ్‌లెట్లు, కరపత్రాలు.  ఇంటి గేటుకి ప్లేటులు, కారు బంపర్ మీద స్టికరు, బైకు నెంబరు ప్లేటు మీద ప్రకటన, బస్సు సీటు మీద ప్రకటన, రహాదారికి అటూ, ఇటూ హోర్డింగులు. ఇది గాక స్కూలు ఫీజులు, ఫేర్‌వెల్ పార్టి చందాలు, హాస్పిటల్ బిల్లులు,  కట్టవలసిన కిస్తీలు, ఈఎమ్‌ఐలూ ఇలా సవాలక్ష సమస్యలు ఈ జీవికి.  వీటన్నింటి మధ్య మీ పుస్తకం కనపడాలి.  కుదిరే పనేనా?

అందుకనే అనేది ఇందాక చెప్పానే ఈ నవశకం యువ రచయిత చేసిన పనులన్ని చెయ్యాలి!  నా పుస్తకం దమ్ముంది అనుకుంటే చాలదు.  దమ్ముంది అని ఆ చదువరికి చెప్పాలి.  ఉన్నది లేనిది పాఠకుడు నిర్ణయిస్తాడు.

కాబట్టి ఓ రచయితా, నీ డబ్బుతో ప్రచురించుకున్న నీ పుస్తకం పదిమందికి అందాలంటే ముందు దానిని గురించి వారికి తెలియజేయి.  అంతేగాని ఉచితంగా ఇచ్చేయ్యకు.  అదేదో సామెతుంది.  ఉచితంగా వస్తే ఫినాయిలు కూడా తాగే మనుషులుంటారని!

అన్వర్ కి ధాంక్స్‌తో..

ఆదివారం.  మార్చ్ 2, 2014. మళ్ళీ SMS.  ఆర్టిస్ట్ మోహన్ గారి పిలుపు.  మనవాళ్లందరూ వస్తున్నారు.  మీరు కూడా రావాలి.  మన శేఖర్ కి మనం చెయ్యాలి! సందర్భం శేఖర్ కార్టూనిస్ట్‌గా గోల్డెన్ జూబిలి సెలబ్రేషన్.

శేఖర్ కార్టూనిస్ట్ గా నే పరిచయం అయ్యాడు  ఆంధ్రజ్యోతి లో.  కె.పి డెస్క్ పక్కనే.  కె.పి ని దాటుకుని శేఖర్ డెస్క్‌కి వెళ్ళాలి.  ఆ పక్కనే వసంతలక్ష్మి గారి డెస్క్.

కినిగె కి తన కార్టూన్ పుస్తకాన్ని ఇచ్చిన తొలి కార్టూనిస్టు శేఖర్.  అదొక అభిమానం.  తరువాత ఎప్పుడో ఒకసారి నా మీద కోపగించుకున్నాడు కూడా!  “నాకు మీరు పిచ్చేశ్వరరావు గారి అబ్బాయని ఎందుకు చెప్పలేదు.  ఆయనంటే మా తరానికి ఎంత ఇష్టమో, మీకు తెలియదు. అటువంటి వాళ్ళు అంత త్వరగా వెళ్ళిపోవాడనికి హడావుడి ఏమిటో?” అనుకున్నడు స్వగతంగా.

అమెరికా సంయుక్త రాష్ట్రాలకి వెళ్లబోయేముందు, వెళ్ళి వచ్చిన తరువాత తన పుస్తకాన్ని డిజిటల్ బుక్‌గా ఎలా డిజైన్‌చేస్తే బాగుంటుందో అని కలిసినప్పుడు మాట్లాడుకునేవాళ్ళం.  కలవనప్పుడు ఫోన్ చేసేవాడు.  ఫోనులో “తింటున్నాన్నా?” అని అడిగి నవ్వేవాడు.

“సార్, మీ ఇంటికి దగ్గిర్లోకి మారుతున్నాను. మనం ఇక రోజు కలుసుకోవచ్చు.  బహుశ నేనే మీ ఇంటికి వస్తాను.  కలిసి టీ తాగోచ్చు,” అని ఎంతో సంతోషంగా నవ్వుతూ చెప్పినప్పుడు ఆనందమేసింది.

తరువాత ఎప్పుడో తెలిసింది..ఆరోగ్యం బాగోలేదని.  ఇంటికి వెళ్ళి పలకరించాలని అనుకునేటప్పడికి ఇల్లు మారడం కూడా ఐపోయింది.

Cartoonist Chandrasekher
Cartoonist Chandrasekher (Jul 16, 1965 – 19 May 2014)

ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ ‌క్లబ్‌లో అతని కోసం చూసాను.  కొంచెం ఆలస్యం అయ్యింది నేను వెళ్ళేటప్పటికి.  మనిషి కనబడలేదు.  వెతుకున్నాను.  కాప్..నోటికి మాస్క్ అడ్డం ఉంది.  ఆ మాస్క్ పైన కళ్ళు. నవ్వు.  ఉగ్గబట్టుకున్న ఆనందం.  సంతోషం.  ప్రెస్‌క్లబ్ నిండిపోయింది.  కాని మనిషిని చూసిన నేను ఖంగు తిన్నాను.  నాకు తెలిసిన శేఖర్ రూపు కాదది.  మనిషి మొఖంలో విపరీతమైన అలసట. సగం అయిపొయ్యాడు.  ఎందుకో ఉండబుద్ది కాలేదక్కడ.  తనతో మాట్లాడడానికి తగిన ప్రదేశమూ కాదు..సందర్భమూ కాదు.  ఈ లోపు ఒకటికి రెండు సార్లు ఫోను చేసిన అన్వర్, sms లు గుప్పించిన ఇతర మిత్రులని పలకరించాను.

హడావుడిగా పరిచయుస్థుడొకాయన వచ్చాడు.  పక్కనే శ్రీమతి అనుకుంటాను.  పేద్ద పూలమాల.  ఒక పుష్ఫగుచ్చం.  హడావుడి హడావుడిగా వేదిక దగ్గిరకు దాదాపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపొయ్యారు.  ఆఖరి చూపు.  పార్ధివ శరీరాన్ని పుష్పమాలంకృతాన్ని చెయ్యాలన్న తాపత్రయం కనపడింది ఆ వేగంలో, ఆ మాటల్లో, ఆ గమనంలో.  విరక్తి పుట్టింది.

విజయవాడలో “మో” హాస్పిటల్‌లో ఉంటే..”సార్,  ఐపోయ్యిందా?  డిక్లేర్ చేసేద్దామా”?   అని స్ట్రింగర్స్ శ్రీ శ్రీ విశ్వేశ్వరావు గారిని పీక్కు తిన్న వైనం గుర్తోచ్చింది.  మనసు రోసింది. అసహ్యం వేసింది. రోత పుట్టింది.

వెళ్ళిపోదామని వెనక్కి తిరుగుతుంటే..అన్వర్ ఎదురువచ్చాడు.  “సార్, వెళ్ళిపోతున్నారా?” అంటూ. ఔనన్నట్టుగా తలూపూతూ గేటు వైపుకి కదులుతుంటే..”వుండండి సార్..రెండు మాటలు మాట్లాడి వెళ్లండి”  అని అన్నాడు.  వాళ్ళ మధ్య నేనేమి మాట్లాడుతాను అనుకుంటూ నిలబడిపొయ్యాను.  “ఉండండి సార్.  ఒక్క రెండు మాటలు మాట్లాడండి.  తనుకూడా వింటాడు కదా?”అని అన్నాడు. ఇక ఆ మాటకు తిరుగులేదు.  సరే అని ఆగి పొయ్యాను.

ఈ లోపు మాట్లాడేవాళ్ళున్నారు.  వాళ్ళ తరువాత..అన్వర్ నాకు మైకు ఇప్పించాడు.  శేఖర్ వెనకకి చేరుకున్నాను.  శేఖర్ భుజం మీద చెయ్యి వేసాను.  శేఖర్ నా ముఖంలోకి చూసాడు.  మా ఇద్దరి కళ్ళు కలిసినవి.  He knows.  He knew, I knew. He also knew that my heart is with him. I wished him all the best with all my heart.  I expressed my good wishes to all his frineds for supporting him at that time. లేచి నిలబడ్డాడు.  కౌగలించుకున్నాడు.  That was the parting embrace. I knew.

మైక్ ఆర్టిస్టు మోహన్ గారికిచ్చాను.  అన్వర్ కి థాంక్స్ చెప్పాను.  వచ్చేసాను.

మా అమ్మ పోయినప్పుడు చలసాని ప్రసాదరావు గారు రాలేదు.  దానికి ఆయన చెప్పిన కారణం.  “నాకు మీ అమ్మ చక్కగా సంతోషం గా నవ్వుతూ ఉన్నప్పుడు చూసిన జ్ఞాపకం.  నాకు అదే గుర్తుంచుకోవాలని ఉంది” అని.
చంద్రశేఖర్ విషయం లో నాది అదే ఉద్దేశం. అందుకే కొడుకు పెళ్ళికి వెళ్ళలేక పొయ్యాను.  ఈ రోజు వెళ్ళడం లేదు.  ఫోటో కూడ తను నవ్వుతున్నదే పెట్టాను.

ఆ రోజున అన్వర్ నన్ను గుర్తుపెట్టుకుని పిలవకపొతే..నాకు శేఖర్ చిరు దరహసం అందేది కాదు.

గుడ్‌బై శేఖర్.  You are a good friend.  I shall remember your smile.  Always.

ఇది వ్యాపారం కాదు.  నేను ఇప్పుడు కినిగె లో లేను కూడా!  శేఖర్ పుస్తకాలు ఇవి కొన్ని అని చెప్పడానికి మాత్రమే:  http://kinige.com/author/Shekar

అక్షరాలకి ఐదు లక్షలు

నడుస్తున్న పోటీలు - గడువు తేదీలు
 నది సినిమా కథల పోటీ – 31 జనవరి 2014
 స్వాతి సరసమైన కథల పోటీ – 1 ఫిబ్రవరి 2014
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, భాషా సాంస్కృతిక శాఖ, నవల-నాటక రచన పోటీ – 28 ఫిబ్రవరి 2014
 అమెరికా తెలుగు సంఘం రచనల పోటీ (కథ, కవిత, వ్యాసం మొ..) - 30 మార్చి 2014
 ఆటా నవ్య నవలల పోటీ – 12 ఏప్రియల్ 2014
 కినిగె (http://kinige.com/) అక్షర లక్షల నవలా పోటీ – 6 జూన్ 2014
 తెలుగు రచయితలకి స్వర్ణయుగమే! పోటీలూ, పురస్కారాలు, బహుమతుల జల్లుల్లో తడిసి ముద్దైపోతున్నారు. ఒకానొక అంచనా ఒక "ల"కారం అటూ, ఇటుగా దాదాపు ఐదు లక్షలు బహుశ ఈ ఒక్క సంవత్సరమేలోనే వారు గెలుచుకొనబోతున్నారు!
 నిన్న ఎవరో అంటున్నారు..ఒక నవలకి ఐదు లక్షల బహుమతి ఇద్దామా అని!
 ఏమో నవలకి ఐదు లక్షలే ఖర్మ, పది లక్షలు కూడా ఇవ్వోచ్చు!

తాజా కలం: అప్పుడెప్పుడో వ్రాద్దామని మొదలుపెట్టి వదిలేసిన చిత్తు ప్రతి ఇది.   
ఇప్పుడు ఇలా మీ ముందు!

ప్రశ్న

పోయిన సంవత్సరం అంటే 2013 లో ఒక పెద్ద రచయిత (“మాకు తెలియకుండా ఎప్పుడు పెద్దవాడైపొయ్యాడు” అని ఒక మరో పెద్దాయన సభాముఖంగానే అడిగాడు అనుకొండి, అది వేరే విషయం!) నన్నో ప్రశ్న అడిగాడు.

Open Smile
How do you like my dentures> 😉

“సార్, మీరేప్పుడు ఇలా అందరితోను నవ్వుతూ, ఫ్రెండ్లిగానే ఉంటారా?” అని. వ్యంగంగా అన్నాడో, వెట ‘కారం’ గా అడిగాడో, స్నేహంగా అనేసాడో, నవ్వు పులుముకుని అడిగాడో నేనైతే అర్ధాలు, కారాలు, మిరియాలు వెతుక్కోలేదు.

కాని నా జవాబు మాత్రం, “నాకు మరో విధంగా ఉండటం చేతకాదు” అని.  ఈ ప్రస్థావన ఇప్పుడెండుకంటారా..ఎందుకో గుర్తు వచ్చింది..అద్దంలో నా దంతాలు చూసుకుంటూఉంటే..the last smile is always mine.

btw how do you like my teeth?  😉

కుక్క బిస్కత్తులు

కుక్క బిస్కత్తులు కుక్కలు తింటాయ్.
యజమాని బిస్కత్తులు ఎప్పుడు విసురుతాడా అని ఎదురుచూస్తూ ఉంటాయ్.
అచ్చం మనుషుల్లాగానే, నక్కలు, తోడేళ్ళు కూడా ఉంటాయి, కుక్కల్లాగా తింటాయి!
కాని సింహం అలా కాదు.
ఎవరో వొచ్చి పెడతారని ఎదురు చూడదు.
ఆకలి వేస్తేనే వేటాడుతుంది.
ఆకలి వేసినప్పుడు సింహాం పంజా విసురుతుంది.
మెడని విరిచి, చంపి తాపీగా తింటుంది.
తను తినగా మిగిలితే వదిలేస్తుంది.
కడుపునిండినా  కుక్కుకుంటూ కూర్చుని తినదు.
నక్కలకి తోడేళ్ళకి, రాబందులకి, డేగలకి ఇతర ప్రాణకోటికి వదిలేస్తుంది.
కుక్కలాగా మనిషి కాళ్ల దగ్గిర కూర్చుని దేబిరిస్తూ ఉండదు, సింహం.
సింహం మృగరాజు.  రారాజు.
ఏనుగులాగా చచ్చినా బ్రతికిఉన్నా దాని విలువ దానిదే!
జీవించినంత కాలం సింహం లా జీవించాలి!

చెప్పండయ్యా! చెప్పండి! అమ్మాలారా చెప్పండి! బంగారు తల్లూలారా చెప్పండి!!

మీ సర్వెంట్ మెయిడ్‌కి, రిక్షా అంకుల్‌కి, బెగ్గర్ అంకులుకి, మిల్క్‌మాన్‌కి, గాసబ్బాయికి, పేపర్‌బోయికి, పూలమ్మికి, వాచీమేన్‌కి, అతని పెళ్ళానికి,  వాళ్ళ బాబులకి, అమ్మలకి, టైర్ పంక్చరోడికి, మిఠాయోడికి, సోడాఅబ్బికి..అందరికి చెప్పండి.  చెవులు తూట్లూ పడేలాగా చెప్పండి.  పాకి వాడికి చెప్పండి.
కమ్మాడికి చెప్పండి.
కూలోడికి చెప్పండి.
కాపోడికి చెప్పండి.
బెపనాడినికి చెప్పండి.
రాజుకి చెప్పండి.
మాదిగోడికి చెప్పండి.
మాలోడికి చెప్పండి.

Use NOTA for Voting
ఈ బొమ్మ మీద హాక్కులు ఎవరివో వారివే. అంతేకాదు అవి నావి కాదు. ఇక్కడీ బొమ్మ తీసెయ్యమంటే తీసేస్తాను.

రెడ్డి కి చెప్పండి.
మతంపుచ్చుకున్నవాడికి చెప్పండి.
పుచ్చుకోని వాడికి చెప్పండి.
రిక్షావోడికి చెప్పండి.
జట్కావోడికి చెప్పండి.
పూలోడికి చెప్పండి.
నల్లోడికి చెప్పండి.
ఎర్రోడికి చెప్పండి.
గుడ్డోడికి చెప్పండి.
కుంటోడికి చెప్పండి.
చెవిటోడికి చెప్పండి.
పొట్టొడికి చెప్పండి.
పొడుగోడికి చెప్పండి.
తాగిన వాడికి చెప్పండి.
తాగని వాడికి చెప్పండి.
సాలీకి చెప్పండి.
సాయిబుకి చెప్పండి.
దూదేకుల సాయిబుకి చెప్పండి.
అడగనివాడికి చెప్పండి.
అడిగినవాడికి చెప్పండి.
అందరికి చెప్పండి.
మళ్ళీ చెప్పండి.
కనపడినప్పుడల్లా చెప్పండి.
విసుగెత్తినా చెప్పండి!
వినేవాళ్ళకి విసుగెత్తినా చెప్పండి.
నోరు నొప్పి పుట్టేదాకా చెప్పండి!
చెవి తూట్లు పడేదాకా చెప్పండి.
రోజూ కనీసం ఒక్కరికైనా చెప్పండి!
కనీసం ఈ సారైనా గాడిదలకి, గాడిదకొడుకులకి, కుక్కలకి, నక్కలకి, పురుగులకి, పుట్రలకి ..
వోటు వెయ్యద్దని చెప్పండి.
ఇష్టం లేక పోతే NOTA బటన్ని నొక్క మని చెప్పండి!

గెస్ట్‌కాలం – ఈ రీడింగ్

ఈ రీడింగ్ – ఈజీ రీడింగ్
ఈ వ్యాసం నిన్న సాక్షి దినపత్రిక,  ఫామిలీ లో మొదలైన గెస్ట్‌కాలం లో వచ్చింది.  పుస్తకాలతో మొదలుపెడితో బాగుంటుందని అని వారనుకుని నన్ను వ్రాయమని కోరారు.  ఆ సందర్భంగా వ్రాసిని వ్యాసం ఇది.  అన్నట్టు ఈ గెస్ట్‌కాలం ప్రతి బుధవారం వస్తుంది.  ఆయా రంగాలలో నిష్ణాతుఁలు వారనికొకరు మీకు అందిస్తుంటారు.  ఇక వ్యాసం ఇది.  స్థలాభావం వల్ల వ్యాసం కొంత “సంపాదకుల కోత” కి గురైంది.  పూర్తి పాఠం తరువాత ఎప్పుడైనా వీలున్నప్పుడు ఇక్కడే పోస్ట్ చేస్తాను.

సూచన: బొమ్మ మీద క్లిక్ చెయ్యండి.  సులభంగా చదువుకోవచ్చు

e reading easy reading

కొత్త వంతెన

“కొత్త వంతెన”

నిన్న సాయంత్రం “కొత్తవంతెన” పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది.  “ఆంధ్రజ్యోతి” దిన పత్రిక సంపాదకుడు.  కె.శ్రీనివాస్, ఈ వ్యాసాలను తొలుత “ప్రజాతంత్ర” పత్రికలో దాదాపు ఒక దశాబ్దం క్రితం ప్రచురించారు.  వాటన్నింటిని ఇప్పుడు మళ్ళీ ఒక సంకలనం కింద “అనేక పబ్లికేషన్స్” ప్రచురించింది.

ఘంటా చక్రపాణి నిర్వహించిన ఈ సభలో “కొత్తవంతెన‌” అచ్చు పుస్తకాన్ని టిజాక్ అధ్యక్షులు కోదండరామ్ ఆవిష్కరించగా,  “కినిగె‌” ఈబుక్ ని ఆచార్యులు జి హరగోపాల్ ఆవిష్కరించారు. రచయిత కె శ్రీనివాస్ కోరిక మేరకు “గొంతు బాగొలె”దంటునే “జై తెలంగాణ” పాటని పాడి ప్రముఖ గాయకుడు అందెశ్రీ సభికులను అలరించారు.

"కొత్త వంతెన‌" - కె శ్రీనివాస్ వ్యాస సంకలనం ఆవిష్కరణ సభ
“కొత్త వంతెన‌” – కె శ్రీనివాస్ వ్యాస సంకలనం ఆవిష్కరణ సభ

వేదికని అలంకరించినవారిలో షాజహాన, జూపాక సుభద్ర, “నమస్తే తెలంగాణ” సంపాదకుడు అల్లం నారాయణ ఉన్నారు.

విరసం సభ్యులు వరవరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సభలో మరో విశేషం ఏమిటంటే, రచయిత శ్రీనివాస్ తండ్రి శ్రీ సింగరాచార్యులు పాల్గొని ప్రసంగించడం.

ఆ మాత్రం తెలీదూ?

అరే ఎప్పుడొచ్చావు?  బాగులు గీగులు గట్రా?  ఏం తెచ్చావేమిటి?
..
మొన్నొచ్చాను.  సరే చూసెళ్దామని..
ఇది బాగుందే..తీసుకెళ్ళనా?

bananas
                               Bananas

అరే..ఒక రెండు రోజుల ముందు అడిగిఉంటే బాగుండేది..ఎవరికో ప్రామిస్ చేసాను..ఐనా నాకు తెలుసు..మన స్నేహనికి ఇదీ అడ్డం రాదని.  ఏమంటావ్?
..
నీ దగ్గిరతే ఏం
నా దగ్గిరైతే ఏం..ఒకటేలే..ఐనా పిల్లది చదువుకుంటుందని..
..
ఐనా ఏరా?  ఇంటికి వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రాకుడదని తెలియదా?
కనీసం ఒక అరడజను అరటి పళ్ళన్నా తెచ్చిఉండచ్చు కదరా?  నాకీ తిప్పుడు తప్పేది!